విజయవాడ కరోనా చికిత్స కేంద్రంలో అగ్ని ప్రమాదం పై స్పందించిన రమేష్ హాస్పిటల్స్
posted on Aug 10, 2020 @ 10:34AM
నిన్న విజయవాడ నగరంలోని కరోనా చికిత్సా కేంద్రంగా ఉపయోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుని 10 మంది మృత్యువాత పడిన సంగతి తెల్సిందే. విజయవాడలోని ప్రముఖ రమేష్ హాస్పిటల్స్ స్వర్ణ ప్యాలెస్ హోటల్ను లీజుకు తీసుకుని కరోనా చికిత్స కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు వార్తలు వచ్చిన సంగతి కూడా తెలిసిందే. తాజాగా దీనిపై రమేష్ ఆసుపత్రి యాజమాన్యం స్పందిస్తూ స్వర్ణప్యాలెస్ హోటల్ నిర్వహణతో తమకు ఏమాత్రం సంబంధం లేదని తెలిపింది.
రాష్ట్ర ప్రభుత్వ అనుమతితోనే అక్కడ కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నామని ఆ ప్రకటనలో తెలిపింది. ఎక్కువ మంది కరోనా బాధితులకు వైద్యం అందించాలన్న ఉద్దేశంతో స్వర్ణ ప్యాలెస్ హోటల్ను కరోనా చికిత్సా కేంద్రంగా మార్చామని తెలిపింది. అయితే హోటల్ నిర్వహణతో ఏమాత్రం సంబంధం లేకుండా కేవలం తాము రోగులకు వైద్య సేవలు అందించామని వివరించింది. కరోనా రోగులను చేర్చుకోవాలని తమకు భారీగా విజ్ఞప్తులు వస్తుండడంతో ఇప్పటికే అన్ని సౌకర్యాలున్న హోటల్లో ప్రభుత్వ అనుమతితో రోగులకు చికిత్స అందిస్తున్నామని తెలిపింది. అంతే కాకుండా ఇక్కడ చికిత్స తీసుకున్న కరోనా బాధితులు చక్కగా కోలుకుంటున్నారన్నారని కూడా వివరించింది.