ఇంటి స్థలాల పేరిట వసూళ్లు.. వైసీపీ నేతపై కేసు నమోదు!
posted on Dec 26, 2020 @ 2:04PM
ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ శుక్రవారం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. అయితే, ఇళ్ల పట్టాల పంపిణీ పేరుతో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలకు తగ్గట్టే, ఇళ్ల స్థలాల పంపిణీకి సంబంధించి వసూళ్లకు పాల్పడిన ఓ వైసీపీ నేతపై పోలీసులు తాజాగా కేసు నమోదు చేశారు.
చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెం మండలం తగ్గువారిపల్లెకు చెందిన వైసీపీ నేత సురేంద్ర.. పార్వతమ్మ అనే మహిళకు ఇంటి స్థలం ఇప్పిస్తానని చెప్పి రూ. 30వేలకు ఒప్పందం చేసుకున్నాడు. ఒప్పందంలో భాగంగా ముందుగా ఆమె నుంచి రూ. 5 వేలు తీసుకున్నాడు. అయితే, ఇటీవల ప్రకటించిన అర్హుల జాబితాలో పార్వతమ్మ పేరు లేకపోవడంతో.. ఆమె సురేంద్రను నిలదీసింది. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అతనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
చిత్తూరు పార్లమెంట్ బీసీ సంక్షేమ సంఘం కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సురేంద్ర ఇంటి స్థలాల పేరిట ఇలా చాలామంది నుంచి డబ్బులు వసూలు చేసినట్టు ప్రచారం జరుగుతోంది. మరోవైపు, ఈ విషయం తెలసిన పార్టీ నాయకులు అతన్ని వైసీపీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెలుస్తోంది. అలాగే, వాలంటీర్గా పనిచేస్తున్న అతని కుమారుడిని కూడా ఆ జాబ్ నుంచి తొలగించారని సమాచారం.