ఏప్రిల్ 14 న లాక్ డౌన్ ఎత్తివేసే ఆలోచన లేదు: ప్రధాని
posted on Apr 8, 2020 @ 7:21PM
కరోనా విజృంభణ, లాక్డౌన్ విషయంపై ప్రధాని మోడీ బుధవారం అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో మోడీ మాట్లాడుతూ.. ఏప్రిల్ 14 తర్వాత లాక్డౌన్ ఎత్తేసే అవకాశాలు కనిపించడం లేదని అన్నారు. ప్రజల ప్రాణాలను కాపాడుకోవాలంటే లాక్డౌన్ ఒక్కటే సరైన పరిష్కారమని మోడీ తెలిపారు. కరోనా తర్వాత పరిస్థితులు మునుపటిలాగా సాధారణంగా ఉండవు. కరోనా కు ముందు, కరోనా కు తరువాత అనే విధంగా పరిస్థితి ఉంటుందని మోడీ అభిప్రాయపడ్డారు.
‘‘ప్రతిరోజూ అన్ని రాష్ట్రాల సీఎంలతో, నిపుణులతో చర్చిస్తూనే ఉన్నా. ఏ ఒక్కరూ కూడా లాక్డౌన్ ఎత్తివేయాలని అభిప్రాయపడలేదు. మరోసారి అన్ని రాష్ట్రాల సీఎంలతో మాట్లాడతా. ఒకే సారి లాక్డౌన్ ఎత్తేయడం సాధ్యం కాకపోవచ్చు. మున్ముందు మరిన్ని ఊహించని నిర్ణయాలు తీసుకోవచ్చు’’ అని ఫ్లోర్ లీడర్లతో మోడీ అన్నట్లు సమాచారం.
ఈ విపత్కర పరిస్థితుల్లో అందరూ సానుకూలంగా ఉంటేనే.. కరోనా మహమ్మారిపై విజయం సాధించగలమని మోడీ అన్నారు. ఈ కష్ట సమయంలో రాజకీయ పార్టీలన్నీ ఐకమత్యంగా వ్యవహరించడం అభినందనీయమన్నారు. అలాగే, వైరస్ కట్టడికి విశేష కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు.