బీజేపీకి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం కాదు! సొంత పార్టీపై బాంబు పేల్చిన సిబాల్
posted on Nov 16, 2020 @ 4:48PM
బీహార్ ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన కాంగ్రెస్ పార్టీలో మరో బాంబ్ పేల్చారు ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబాల్. కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తుపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీహార్ లో ఓటమి తర్వాత బీజేపీకి కాంగ్రెస్ ను ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజలు ఏమాత్రం భావించడం లేదని చెప్పారు. పార్టీ దగ్గరకు ప్రజలు వచ్చే పరిస్థితి లేదని... ప్రజల వద్దకే పార్టీ వెళ్లాలని సిబాల్ స్పష్టం చేశారు. యూపీలో జరిగిన ఉప ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో పార్టీకి 2 శాతం కంటే తక్కువ ఓట్లు పడటం పార్టీ దుస్థితిని సూచిస్తోందన్నారు. ఓ జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన పార్టీపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు కపిల్ సిబాల్.
పార్టీలోని అంతర్గ విభేదాలను పక్కన పెట్టేయాలని... పూర్తి స్థాయిలో పార్టీని పక్షాళన చేయాల్సిన అవసరం ఉందని సిబాల్ చెప్పారు. ఆరేళ్లుగా కాంగ్రెస్ పార్టీ ఆత్మ విమర్శ చేసుకోలేదని... ఇకపై చేసుకుంటుందన్న నమ్మకం కూడా లేదని కామెంట్ చేశారు. పార్టీకి ఉన్న సమస్య ఏమిటో అందరికీ తెలుసని, వాటికి సమాధానాలు, పరిష్కార మార్గాలు కూడా తెలుసని... అయితే వాటిని అధికారికంగా గుర్తించడానికి వారు ఇష్టపడటం లేదని సిబాల్ విమర్శిచారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే పార్టీ గ్రాఫ్ పడిపోతుందని తేల్చి చెప్పారు కపిల్ సిబాల్. పార్టీ ఇలాంటి దుస్థితికి రావడానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీనే కారణమని చెప్పారు. సీడబ్ల్యూసీని ప్రజాస్వామ్యయుతంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీడబ్ల్యూసీ సభ్యులను నామినేట్ చేసే సంస్కృతి పోవాలన్నారు సిబాల్.
పార్టీలో పరిస్థితి గురించి ఇదివరకు అధిష్ఠానానికి లేఖ రాస్తే... అది రాసిన సభ్యులతో కనీసం ఎవరూ మాట్లాడే ప్రయత్నం కూడా చేయలేదని కపిల్ సిబాల్ చెప్పారు. దీని వల్ల తన వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పడానికి ఒక వేదిక లేకుండా పోయిందన్నారు. దేశాన్ని పక్కదోవ పట్టిస్తున్న ప్రస్తుత ప్రభుత్వానికి కాంగ్రెస్ ప్రత్యామ్నాయం చూపిస్తుందని ఆశిస్తున్నానని చెప్పారు. తాను కాంగ్రెస్ వ్యక్తినని... భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ లోనే ఉంటానని స్పష్టం చేశారు కపిల్ సిబాల్. బీహార్ ఓటమితో దిగాలు పడిన కాంగ్రెస్ పార్టీ కేడర్.. కపిల్ సిబాల్ కామెంట్లతో మరింత కలవరపడుతోంది.