చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్ కు ఏడాది జైలు
posted on Feb 14, 2024 @ 12:47PM
తన కొడుకు ఇచ్చిన అప్పు చెల్లించాలని ఓ తండ్రి కోర్టునాశ్రయించాడు. కొడుకు చనిపోవడంతో తండ్రికి బండ్ల గణేష్ ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యింది. చెక్ బౌన్స్ కేసులో ఆ తండ్రికి అన్యాయం జరగడంతో కోర్టునాశ్రయించి గెలుపొందారు. .
సినీ నిర్మాత, క్యారెక్టర్ ఆర్టిస్టు బండ్ల గణేశ్ కు ఏడాది జైలు శిక్ష విధిస్తూ ఒంగోలు కోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. ఓ చెక్ బౌన్స్ కేసులో ఈమేరకు తీర్పిచ్చిన కోర్టు.. ఫిర్యాదుదారు నుంచి తీసుకున్న అప్పు రూ.95 లక్షలు వెంటనే తిరిగి చెల్లించాలని, కోర్టు ఖర్చులు కూడా ఇవ్వాలని ఆదేశించింది. 2019లో మద్దిరాలపాడుకు చెందిన జానకీరామయ్య అనే వ్యక్తి వద్ద బండ్ల గణేశ్ రూ.95 లక్షలు అప్పు తీసుకున్నాడు. జానకీరామయ్య చనిపోగా ఆయన తండ్రికి బండ్ల గణేశ్ రూ.95 లక్షలకు చెక్ ఇచ్చాడు.
ఈ చెక్ బౌన్స్ కావడంతో జానకీరామయ్య తండ్రి ఒంగోలు కోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన కోర్టు తాజాగా తీర్పు వెల్లడిస్తూ.. జానకీరామయ్య దగ్గర తీసుకున్న అప్పుతో పాటు కోర్టు ఖర్చులు కూడా వెంటనే తిరిగి చెల్లించాలని ఆదేశించింది. చెక్ బౌన్స్ కావడంతో ఏడాది జైలు శిక్ష విధించింది. గతంలో ఎర్రమంజిల్ కోర్టు కూడా బండ్ల గణేశ్ కు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. టెంపర్ సినిమాకు కథ అందించిన వక్కంతం వంశీ దాఖలు చేసిన ఈ కేసులో జైలు శిక్షతో పాటురూ. 15,86,550 జరిమానా విధించింది.
బండ్ల గణేష్ ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు. రానున్న లోకసభ ఎన్నికల నేపథ్యంలో అతను మల్కాజ్ గిరి లోకసభ స్థానాన్ని ఆశిస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.