ఒక రాయి మూడు గాయాలు! అప్పుడు బాబాయి, ఇప్పుడు ఎవరు?
posted on Apr 15, 2024 @ 11:54AM
ఒక రాయితో ఇద్దరి కళ్లకు, ఒకరి కాలికి గాయం అయింది. ‘ఒక రాయి జగన్రెడ్డి కంటి పైన తగిలి, పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు కంటి దగ్గర కూడా తగిలింది. అక్కడ నుంచి కిందకు వెళ్లి జగన్ కాలినీ గాయపర్చింది. సీఎం కార్యాలయం విడుదల చేసిన ఫొటోల్లో ఆయన కంటిపైన, కాలికి కూడా బ్యాండేజీలు కనిపిస్తున్నాయి. రాష్ట్రం మొత్తం ప్రజలు దీని గురించి చర్చిస్తున్నారు. జగన్పై దాడి జరిగిన ఐదు నిమిషా ల్లో వలంటీర్లు ఇంటింటికి తిరిగి జగన్పై హత్యాయత్నం జరిగిందని ప్రచారం చేశారు.
సీఎం సతీమణి భారతి సాధారణంగా బయట కనిపించరు. కాని ఈ దాడి ఘటనకు కొద్ది గంటల ముందు తాడేపల్లి వద్ద రోడ్డు మీదకు వచ్చి బస్సు యాత్రలో ఉన్న జగన్కు చేయి ఊపారు. ఆ వెంటనే ఈ సంఘటన జరగడం... ఇదంతా ముందస్తు ప్రణాళిక అని అనుమానాలు కలగడానికి ఆస్కారం ఇస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ డ్రామాలో జగన్ మీడియా తన వంతు పాత్ర పోషించింది. ఒక చిన్న రాయితో జగన్ పై ఏకంగా హత్యాయత్నం జరిగిందని పెద్ద శీర్షిక, ఫొటోలు పెట్టి వండి వార్చింది. ప్రజల్లో సానుభూతి పుట్టించడం కోసం ఐ ప్యాక్ సహకారంతో తాడేపల్లి ప్యాలెస్ ఈ నాటకాన్ని రచించిందని ప్రతిపక్షం విమర్శిస్తోంది. అప్పుడు కోడి కత్తి తరువాత బాబాయి హత్య జరిగింది. ఇప్పుడు గులకరాయి దాడి తరువాత గొడ్డలి వేటు మరెవరిపై పడుతుందోనని టీడీపీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ‘వైఎస్ షర్మిల, వైఎస్ సునీత, వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డికి ప్రమాదం పొంచి ఉంది. వారిపై దాడి చేయించి దానిని చంద్రబాబుపై నెట్టే అవకాశం ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
సి.ఎం. జగన్పై జరిగిన రాయి దాడికి బాధ్యత ఎవరిది? ఇదే చర్చ ఏపీలో జరుగుతోంది. ఎందుకంటే నిరంతర నిఘా, ప్రత్యేక బృందంతో భద్రత… అయినా, సీఎం జగన్ పై దాడి ఎలా జరిగింది. రాష్ట్రంలో అత్యున్నత ప్రోటోకాల్ ఉండే సీఎం వస్తున్నారంటే అన్ని విభాగాలు అలర్ట్ గా ఉంటాయి. అలాంటిది సీఎం పర్యటన సందర్భంగా విద్యుత్ లేకపోవటం, దాడి జరిగాక పోలీసులు దుండగులను పట్టుకునేందుకు వేగంగా స్పందించకపోవటం పలు అనుమానాలకు తావిస్తోంది. పైగా విద్యుత్ సరఫరా లేని సమయంలో చిమ్మ చీకట్లలో సీఎంను బస్సుపైకి ఎలా అనుమతిచ్చారని సెక్యూరిటీ విభాగంలో అనుభవం ఉన్న వారు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రాళ్ల దాడి జరిగిన వేళలో.. అక్కడ కరెంట్ లేకపోవటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రోడ్ షో చేస్తున్న వేళలో విద్యుత్ సరఫరాను ఎందుకు ఆపేశారు? అన్నది ప్రాథమిక ప్రశ్నగా మారింది. జగన్ భద్రతను పర్యవేక్షించే విభాగం.. ఈ రూట్ లో రోడ్ షో చేయటానికి ఎలా అనుమతించారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. రోడ్ షో రూట్ మ్యాప్ ను సిద్ధం చేసిన వైసీపీ నేతల అత్యుత్సాహమే దాడికి కారణంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా వీవీఐపీలు వెళ్లే మార్గాన్ని పోలీసులు ముందుగానే పరిశీలిస్తారు. ఆ మాటకు వస్తే.. ముఖ్యమంత్రి ఎక్కడైనా పాల్గొంటున్నా.. రోడ్ షో చేస్తున్నా.. ముందు రోజునే ట్రయల్ రన్ నిర్వహిస్తారు. దానికి రెండు రోజుల ముందు అడ్వాన్స్ డ్ సెక్యూరిటీ లైజాన్ నిర్వహిస్తారు. అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదన్న తర్వాతే రూట్ మ్యాప్ ఖరారు చేస్తారు. ఒకవేళ ఏమైనా లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే.. వాటిని సరి చేస్తుంటారు. తాజాగా దాడి జరిగిన ప్రాంతాన్నిపరిశీలిస్తే.. రోడ్ షో జరిగిన సింగ్ నగర్ డాబా కొట్ల రోడ్ లో 33 కేవీ లైన్లు న్నాయి. అలాంటి దారిలో రోడ్ చేసేటప్పుడు.. అది బస్సు మీద నిలబడి వెళ్లటం ప్రమాదకరం. దీంతో ముందస్తుచర్యల్లో భాగంగానే అక్కడ విద్యుత్ సరఫరాను నిలివేసినట్లుగా తెలుస్తోంది. చిమ్మచీకటిగా ఉన్న వేళ.. దుండగులు రాళ్ల దాడికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఈ వాదన ఇలా ఉంటే.. వైసీపీ ఎమ్మెల్సీ రుహుల్లా ఆఫీసు ఘటనాస్థలానికి దగ్గర్లో ఉండటం.. ఆ ప్రాంతంలో ఆయనకు విపరీతమైన పట్టు ఉండడటంతో.. తన సత్తా చాటేందుకు వీలుగా 33 కేవీ లైన్ ఉన్నప్పటికీ రోడ్ షోను ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. భద్రతా పరమైన చర్యలకు భిన్నంగా చీకట్లో సీఎం చేత రోడ్ షో ఎలా చేయిస్తారని ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయన్న అంశం చర్చకు వచ్చినప్పుడు.. అసలు ఆ రూట్లోనే రోడ్ షో చేయకూడదని.. అందుకు రూట్ మ్యాప్ ను ఖరారు చేయకూడదన్నది నిపుణుల మాటగా చెబుతున్నారు. సీఎం భద్రత ప్రశ్నార్థకంగా ఉండేలా రూట్ మ్యాప్ ను నేతలు ఖరారు చేస్తే.. పోలీసు అధికారులు.. నిఘా వర్గాలు ఎందుకు అనుమతించాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ వైఫల్యానికి.. ఈ ఘటనకు ఏ విభాగం బాధ్యత వహిస్తుందన్నది ఇప్పుడు చర్చగా మారింది.