నిజామాబాద్ లో నయా రూల్.. వ్యతిరేకత ఉన్న అభ్యర్థులకు నో టిక్కెట్
posted on Jan 5, 2020 @ 10:50AM
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కార్పొరేషన్ తో పాటు 6 మున్సిపాల్టీ లను క్లీన్ స్వీప్ చేయాలని టార్గెట్ గా టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా గెలుపుగుర్రాల కోసం ఆ పార్టీ అన్వేషిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసినట్లే మునిసిపాలిటీల్లోనూ గులాబీ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. నిజామాబాద్ కార్పొరేషన్, ఆర్మూర్ భీమ్ గల్ మున్సిపాల్టీల్లో టీఆర్ఎస్ కు బిజెపి గట్టి పోటి ఇస్తుండగా.. కామారెడ్డి ,బోధన్, ఎల్లారెడ్డిలో టీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ ముందంజలో పోటీ ఉంది. బాన్సువాడలో ప్రతిపక్షాల ప్రభావం అంతంత మాత్రంగా ఉంది. కొన్ని చోట్ల గట్టి పోటీ ఉండటంతో గెలుపు బాధ్యతలు భుజాన వేసుకున్నారు ఎమ్మెల్యేలు. డివిజన్ల వారీగా అభ్యర్థుల సర్వే జరిగినట్లు తెలుస్తోంది.
నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు బోధన్, ఆర్మూర్, కామారెడ్డి మున్సిపాలిటీలో సగానికిపైగా సిట్టింగుల్లో తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు పార్టీ సర్వేలో తేలింది. తీవ్ర వ్యతిరేకత ఉన్న నేతలను పక్కన పెట్టి టికెట్లు ఇవ్వాలని ఎమ్మెల్యేలు నిర్ణయించినట్లు సమాచారం. సిట్టింగులకు రిజర్వేషన్లు అనుకూలంగా రాకుండా ఎమ్మెల్యేలు జాగ్రత్తపడుతున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. దీంతో వారికి టికెట్ రాకుండా చెక్ పెట్టడమే కాకుండా వారు వేరే పార్టీ తరపున పోటీ చేయకుండా చేయవచ్చు అనే ఆలోచన చేస్తున్నారు. మిగతా మున్సిపాలిటీల పరిస్థితి ఎలా ఉన్నా నిజామాబాద్ కార్పొరేషన్లో మెజార్టీ సిట్టింగ్ లకు టికెట్ దక్కడం లేదని ఆ పార్టీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతో టికెట్ల టెన్షన్ సిట్టింగులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. నిజామాబాద్ కార్పొరేషన్ లో డివిజన్లు 60 కి పెరిగాయి. సమీప 9 గ్రామాల విలీనంతో చాలా డివిజన్ల సరిహద్దులు మారాయి. దీంతో రిజర్వేషన్లు సైతం పూర్తిగా మారే అవకాశముంది. ఇటు రిజర్వేషన్లు అనుకూలించగా అటు సర్వేలో అనుకూల ఫలితాలు రాకపోవడంతో సగం మంది సిట్టింగులు ఇప్పుడు ఆందోళనగా ఉన్నారు. అవసరమైతే పక్కపార్టీ లేకపోతే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నారు.