ఆ లేఖ ఎస్ఈసీ ఆఫీస్లో చేయలేదు! ఫోరెన్సిక్ నివేదిక
posted on May 5, 2020 @ 5:46PM
ఆంధ్రప్రదేశ్ మాజీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్కుమార్ లేఖకు సంబంధించి వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఇప్పటికే ఈ లేఖకు సంబంధించి సీఐడీ అధికారులు అనేక విషయాలను రాబట్టారు. తాజాగా ఆ లేఖ ఎస్ఈసీ ఆఫీస్లో తయారుకాలేదని నిర్దారణ అయింది. లాప్టాప్, డెస్క్టాప్లను పరిశీలించిన తరువాతే ఫోరెన్సిక్ నివేదికను అందించింది. నిమ్మగడ్డ పీఎస్ సాంబమూర్తి తప్పుడు సమాచారం ఇచ్చారని సీఐడీ చీఫ్ సునీల్కుమార్ అన్నారు. సాంబమూర్తి చెప్పినవి అన్ని అసత్యాలేనని అన్నారు.
ఇందుకు సంబంధించి సీఐడీ ఏడీజీ సునీల్ కుమార్ మాట్లాడుతూ.. రమేష్ కుమార్ పీఏ సాంబమూర్తి అన్ని అసత్యాలే చెప్పారని అన్నారు. ఆ లేఖను ముందుగానే తయారుచేశారని.. అది బయటి నుంచి వచ్చిందని తెలిపారు. మార్చి 18వ తేదీ ఉదయం పెన్డ్రైవ్లో ఆ లేఖ రమేష్ కుమార్ వద్దకు చేరిందన్నారు. లేఖ ఎక్కడి నుంచి వచ్చిందో త్వరలోనే తేలుస్తామని చెప్పారు.
రమేశ్ కుమార్ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రాసిన లేఖపై తొలి నుంచి అనుమానాలు నెలకొన్న సంగతి తెలిసిందే. రాజకీయ దురుద్దేశంతో ఈ లేఖను టీడీపీ కార్యాలయంలో తయారైందని, ఆ లేఖలో ఉన్నది పోర్జరీ సంతకాలు, నకిలీ డాక్యుమెంట్లనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీసీ ఎంపీ విజయసాయిరెడ్డి ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ను రమేష్ కుమార్ లేఖపై విచారణ చేపట్టాలని కోరారు. ఎన్నికల నోటిఫికేషన్ జారీ సందర్భంగా రమేశ్ కుమార్ చేసిన సంతకానికి, కేంద్ర హోంశాఖకు లేఖలో ఉన్న సంతకానికి అసలు పొంతన లేదని విజయసాయిరెడ్డి అన్నారు.