స్పీడ్ న్యూస్- 2

21.తనపై, తన కుటుంబ సభ్యులపై అసత్యాలను ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలపై టీడీపీ యువనేత నారా లోకేశ్ న్యాయపోరాటం చేస్తున్నారు.దీనికి సంబంధించి ఆయన శుక్రవారం మంగళగిరి అడిషనల్ మేజిస్ట్రేట్ కోర్టుకు వచ్చారు. 

22. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అనంతపురంలో ఏర్పాటు చేసిన కియా కార్ల ఫ్యాక్టరీ 1 మిలియన్ కార్లను తయారు చేసి కీలక మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా కియా యాజమాన్యానికి ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అభినందనలు తెలిపారు. 

23.తెలంగాణ మంత్రి హరీశ్ రావుతో బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ భేటీ అయ్యారు. రాజాసింగ్ పై బీజేపీ పార్టీ విధించిన సస్పెన్షన్ ఇంకా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ, పార్టీతో ఆయనకు సంబంధం లేకుండా పోయింది. 

24. మచిలీపట్నంలో  మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. రోడ్లపై మోకాళ్ల లోతు వరద చేరింది. ఆ వరదలో పాలప్యాకెట్లు కొట్టుకు రావడంతో మొదట ఆశ్చర్య పోయిన జనం.. తేరుకుని వాటిని ఏరుకునేందుకు ఎగబడ్డారు.

25.బోనాల పండుగ సందర్భంగా హైదరాబాద్ లో వైన్ షాపులు రెండు రోజుల పాటు మూతపడనున్నాయి.  సీపీ ఆదేశాల ప్రకారం ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి మరుసటి రోజు సాయంత్రం ఆరు గంటల వరకు మూతపడనున్నాయి.  


26.  విశాఖ నోట్ల మార్పిడి వ్యవహారంలో సస్పెండ్ అయిన రిజర్వు సీఐ స్వర్ణలతను పోలీసులు  కస్టడీలోకి తీసుకున్నారు. ఆమెతోపాటు ఆరోపణలు ఎదుర్కొంటున్న హోంగార్డు, రిజర్వు కానిస్టేబుల్‌ను కూడా కస్టడీకి తీసుకుని విచారించారు. 

27.మన ప్రధాని నరేంద్రమోదీ ఫ్రాన్స్ అత్యున్నత పురస్కారాన్ని అందుకున్నారు. ఫ్రాన్స్ దేశాధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ చేతుల మీదుగా ‘గ్రాండ్ క్రాస్ ఆఫ్ ద లెజియన్ ఆఫ్ ఆనర్’ను అందుకున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం  మోదీ గురువారం పారిస్ చేరుకున్న సంగతి విదితమే. 

28. ఏవీయిన్ ఇన్‌ఫ్లుయెంజా వైరస్‌లు సాధారణంగా పక్షులను టార్గెట్ చేస్తాయి. అయితే, ఇటీవల కాలంలో క్షీరదాల్లోనూ బర్డ్ ఫ్లూ కేసులు వెలుగు చూస్తున్నాయి.  ఈ వైరస్‌లో మార్పులు జరిగి మనుషుల్లో వ్యాపించే సామర్థ్యం సంతరించుకోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. 

29. ఆగ్నేయ ఐరోపా దేశమైన  కొసావో ప్రధాని అల్బిన్ కుర్తీ మాట్లాడుతుండగా ప్రతిపక్ష సభ్యుడు లేచొచ్చి వాటర్ బాటిల్‌తో ఆయన ముఖంపై నీళ్లు చల్లారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కుర్తీ విధానాలు పాశ్చాత్య మిత్రులతో సంబంధాలు దెబ్బతీసేలా ఉన్నాయని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. 

30.వెస్టిండీస్‌తో రోసోలోని విండ్‌సోర్ పార్కులో జరిగిన తొలి టెస్టులో టీమిండియా యువ బ్యాటర్ యశస్వి జైస్వాల్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. 215 బంతుల్లో సెంచరీ సాధించిన యశస్వి అరంగేట్ర టెస్టులోనే సెంచరీ సాధించిన 17వ భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు.

31.ఇస్రో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు చంద్రయాన్-3 లో హైదరాబాదీ కంపెనీలకు కూడా భాగస్వామ్యం ఉంది. ఈ మిషన్ లో భాగంగా రోవర్, ల్యాండర్, ప్రొపల్షన్ లను జీఎస్ఎల్వీ మార్క్ 3 రాకెట్ తీసుకెళుతోంది. 

32.రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఇద్దరు మహిళలకు టీడీపీ అధినేత చంద్రబాబు తన కాన్వాయ్ లోని డాక్టర్ తో చికిత్స చేయించారు. ఉండవల్లిలోని తన నివాసం నుంచి మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్తున్న చంద్రబాబు ప్రమాదానికి గురైన మహిళలను గమనించి  చికిత్స చేయించారు.

33.ప్రముఖ నటుడు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య రెండో పెళ్లి అంశం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల ఓ హీరోతో ఆమె సన్నిహితంగా కనిపించడంతో రెండో పెళ్లి అంశం తెరపైకి వచ్చింది.

34.హాలీవుడ్ సినీ కళాకారులు, ప్రముఖ నటులు సమ్మె బాట పట్టారు. దాదాపు 1.6 లక్షల మంది సినీ కళాకారులు సభ్యులుగా ఉన్న స్క్రీన్ యాక్టర్స్ గిల్డ్ నేతృత్వంలో ఈ సమ్మె జరుగుతోంది.

35.నటిగా తాను క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొన్నానని ప్రముఖ నటి, గాయని సుచిత్రా కృష్ణమూర్తి అన్నారు. గతంలో ఓ దర్శకుడు తనతో ఇబ్బందికరంగా ప్రవర్తించాడని, దీంతో తాను ఏడ్చేశానని చెప్పారు. 

36.వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల కొడుకు రాజారెడ్డి ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు.  రాజారెడ్డిని సినిమాల్లో లాంచ్ చేసే పనుల్లో షర్మిల ఉన్నారనే వార్త వైరల్ అవుతోంది. రాజారెడ్డి నటించబోయే చిత్రానికి పూరి జగన్నాథ్  చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నారని సమాచారం. 

37. మన దేశంలో విజయవంతమైన తక్షణ చెల్లింపుల విధానం యూపీఐ సేవలను ఫ్రాన్స్‌ లో కూడా వినియోగించుకునే అవకాశం లభించనుంది. ఇకపై భారతీయ కరెన్సీలో తమ మొబైల్ అప్లికేషన్‌ ద్వారా ఫ్రాన్స్‌ లో చెల్లింపులు జరపడానికి ఇరు దేశాల మధ్య అంగీకారం కుదిరింది.

38.జపాన్‌ పై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రశంసలు కురిపించారు.  రంగారెడ్డి జిల్లా చందన్ వెల్లిలో డైఫకు ఇంట్రా లాజిస్టిక్స్, నికోమక్ తైకిష కంపెనీలకు మంత్రి ఈ రోజు శంకుస్థాపన చేశారు. అణుబాంబు దాడిని ఎదుర్కొని కూడా జపాన్‌ సత్తా చాటిందన్నారు. 

39.దోశలో సాంబర్ లేదని ఆరోపిస్తూ ఓ లాయర్ వినియోగదారుల కోర్టులో కేసు వేసి  మూల్యం చెల్లించుకునేలా చేశారు. బీహార్‌కు చెందిన మనీష్ పాఠక్ అనే న్యాయవాది తనను రెస్టారెంట్ మోసం చేసిందని కేసు వేసి 3, 500 రూపాయల జరిమానా చెల్లించే విధంగా న్యాయపోరాటం చేశారు. 

40. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 341 డిమాండ్లను పరిష్కరించినట్లు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో  స్పష్టం చేశారు. సచివాలయంలో ఉద్యోగ సంఘాల నేతలతో సీఎస్ సహా వివిధ శాఖ అధికారులు భేటీ అయ్యారు.

41. పబ్ జీ గేమ్ ద్వారా పరిచయమైన వ్యక్తిని ప్రేమించి.. అతనినే పెళ్లి చేసుకోవడానికి సరిహద్దు దాటి భారత్ వచ్చిన పాక్ జాతీయురాలు సీమా గులాం హైదర్ ను తిరిగి తమ దేశానికి పంపించాలని ముంబై పోలీసులకు  బెదిరింపు కాల్ వచ్చింది. ఇది ఫేక్ బెదిరింపుగా పోలీసులు అనుమానిస్తున్నారు. 

42.తన నియోజకవర్గంలో హాస్పిటల్ అభివృద్ధి కోసమే హరీశ్ రావును కలిశానని  గోషామహల్ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టత నిచ్చారు.  తాను బీజేపీలోనే ఉంటానని తనపై విధించిన సస్పెన్షన్ ను బీజేపీ ఎత్తివేయకపోతే రాజకీయ సన్యాసం చేస్తానన్నారు. 

43.జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు.పవన్ కళ్యాణ్ ‘మల్టీఫుల్ పర్సనాలిటీ డిజార్డర్ వ్యాధితో " బాధపడుతున్నారని అన్నారు. 

44. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అనుచరుల పేరిట తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ శుక్రవారం తెలిపారు.  తనకు బెదిరింపులు వస్తున్నాయంటూ సైబర్ క్రైమ్ పోలీస్ అధికారులకు శ్రవణ్ ట్వీట్ చేశారు. .

45. క్రికెట్ కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్ అంబటి రాయుడు రాజకీయ రంగప్రవేశానికి వేదికను సిద్ధం చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. తాజాగా గుంటూరు జిల్లా ముట్లూరులో పర్యటించిన రాయుడు స్థానిక సెయింట్ జేవియర్స్ ఉన్నత పాఠశాలకు రూ.5 లక్షల సాయం అందించారు.

46.వైసీపీకి, ఆ పార్టీ విశాఖ జిల్లా అధ్యక్ష పదవికి పంచకర్ల రమేశ్ బాబు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలో వైసీపీ కీలక నేత, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి స్పందిస్తూ... ముఖ్యమంత్రి జగన్ ను కలిసే అవకాశం తనకు రాలేదని పంచకర్ల అనడం అబద్ధమని .రాజీనామా తొందరపాటు చర్య అని చెప్పారు.

47.తెలంగాణ విద్యావ్యవస్థపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బొత్స తెలంగాణను కించపరిచేలా మాట్లాడారని, తక్షణమే తన వ్యాఖ్యలను  వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

48. భారత అంతరిక్ష పరిశోధన రంగాన్ని మరో మెట్టు ఎక్కించే చంద్రయాన్-3 నింగిలోకి దూసుకెళ్లింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి చంద్రయాన్-3 పరికరాలను మోసుకుంటూ ఎల్వీఎమ్3-ఎం4 రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ పైకి లేచింది.

49. హైదరాబాద్ లోని  దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జిపై గురువారం విషాదం చోటుచేసుకుంది. బ్రిడ్జి పైనుంచి చెరువులో దూకి పదిహేడేళ్ల బాలిక పాయల్ ఆత్మహత్యకు పాల్పడింది. తన ప్రేమను ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదనే కారణంతోనే ఆ బాలిక బలవన్మరణానికి పాల్పడినట్లు సమాచారం.పాయల్ మృతదేహాన్ని వెలికి తీసేందుకు ఎన్ డీఆర్ఎఫ్ టీమ్ తో గాలింపు చర్యలు చేపట్టారు.

50.హైదరాబాద్ కేబీఆర్ పార్క్ వద్ద ఓ మహిళా నిర్మాతకు చేదు అనుభవం ఎదురైంది. ఆమె జాగింగ్ చేస్తోన్న సమయంలో ఓ వ్యక్తి ఫోన్ తో వీడియోలు తీస్తూ, అశ్లీల హావభావాలతో వేధించాడు. అతని వేధింపులను భరించలేని సదరు మహిళా నిర్మాత బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

టీడీపీ నేత అప్పలనాయుడు కుటుంబాన్ని పరామర్శించిన లోకేష్

  ఇటీవల అనారోగ్యంతో మరణించిన టీడీపీ నేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాగవంశం అధ్యక్షులు గాడు అప్పలనాయుడు కుటుంబాన్ని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పరామర్శించారు. ఈ మేరకు విశాఖపట్నం జిల్లా భీమునిపట్నంలోని వారి నివాసానికి మంత్రి వెళ్లారు. ఈ సందర్భంగా గాడు అప్పలనాయుడు చిత్రపటం వద్ద పూలు ఉంచి నివాళులు అర్పించారు. అనంతరం గాడు అప్పలనాయుడు సతీమణి, జీవీఎంసీ రెండో వార్డు కార్పోరేటర్, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అయిన  గాడు చిన్ని కుమారి లక్ష్మితో పాటు ఇతర కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. భవిష్యత్ లో కుటుంబానికి అన్ని విధాల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.   

క.వి.త అంటే?

క.  క‌ల్వ‌కుంట్ల కుటుంబానికి చెందిన క‌విత‌.. ప్రొఫైల్  చూస్తే ఆమె త‌న‌కు తాను చెప్పే మాట‌.. కేసీఆర్, ప్రొ. జ‌య‌శంక‌ర్ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వ‌చ్చి.. అటు పిమ్మ‌ట జాగృతి అనే  క సంస్థ ఏర్పాటు చేశాన‌నీ, అప్ప‌టి వ‌ర‌కూ అనాథ‌గా ఉన్న బ‌తుక‌మ్మ‌ను త‌న నెత్తికి ఎత్తుకుని దేశ విదేశాల్లో ఫేమ‌స్ చేశాన‌ని అంటారు క‌విత‌.  ఇక ఉద్య‌మ కాలంలో ఆమె జాగృతి పేరిట బాగా పాపుల‌ర్ అయ్యారు. ఏది ఏమైనా క‌ల్వ‌కుంట్ల క‌విత‌గా స్థిర‌ప‌డ్డారు. ఉద్య‌మ య‌త్నం ఫ‌లించి.. తండ్రి ముఖ్య‌మంత్రిగా ఉండటంతో.. తాను కూడా ఎంపీగా ప్ర‌మోట్ అయ్యారు. ప్ర‌మోష‌న్ ల‌భించిన త‌ర్వాత క‌విత‌.. ఐదేళ్ల పాటు ఢిల్లీలో చ‌క్రం తిప్పారు. క‌విత ఎడ్యుకేటెడ్ కావ‌డం,  హిందీ కూడా బాగానే మాట్లాడ‌గ‌ల‌గ‌డంతో జాతీయ స్థాయి ప్ర‌తినిథిగా ఉండేవారు. అయితే క‌విత రెండో సారి ఎంపీగా గెల‌వ‌లేక పోయారు. దీంతో ఆమెను ఎమ్మెల్సీని చేసింది పార్టీ. త‌న సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంపీ క‌విత నుంచి ఎమ్మెల్సీ క‌విత‌గా మారారు. ఇంత‌లో పార్టీ 2023 ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ ఓడిపోవ‌డం.. కాంగ్రెస్ ఇక్క‌డ అధికారంలోకి రావ‌డంతో.. అతి ప్ర‌ధాన‌మైన ఘ‌ట్టం ముగిసిన‌ట్ట‌య్యింది ఆమె రాజ‌కీయ జీవితంలో. దీంతో త‌న అసంతృప్తిని వెళ్ల‌గ‌క్కుతూ తండ్రికి లేఖ రాశారు క‌విత. ఇది బ‌య‌ట ప‌డ్డంతో మొత్తం గేమ్ ఛేంజ‌ర్ గా మారిపోయింది. ఈ వివాదం త‌ర్వాత పార్టీకి, ప‌ద‌వుల‌కు రాజీనామా ఇచ్చి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. త‌న త‌ట్టా బుట్టా స‌ర్దేసుకుని.. ఇక‌పై తాను బీఆర్ఎస్ క‌విత కాదు.. జాగృతి క‌విత అంటూ స్వ‌యం ప్ర‌క‌ట‌న‌లు చేశారు. వి.   అంటే విడిపోవ‌డం. క‌ల్వ‌కుంట్ల కుటుంబం, బీఆర్ఎస్ పార్టీ నుంచి విడిపోవ‌డం. క‌విత జీవితంలో ఇది అత్యంత కీల‌క‌మైన మ‌లుపు. ఎప్పుడైతే ఆమె పార్టీ నుంచి బ‌య‌ట‌కొచ్చారో అప్ప‌టి నుంచీ కాంగ్రెస్ క‌న్నా మించి బీఆర్ఎస్ పై విమ‌ర్శ‌నాస్త్రాలు ఎక్కు పెట్టారు. మ‌రీ ముఖ్యంగా త‌న బావ హ‌రీష్ ని చెడుగుడు ఆడుకున్నారు.  పార్టీలో ట్ర‌బుల్ షూటర్ గా గుర్తింపు పొందిన హ‌రీష్ ని బ‌బుల్ షూటర్ అంటూ   అవ‌హేళ‌న చేశారు. హ‌రీష్ రాజ‌కీయ గిమ్మిక్కుల‌న్నిటినీ ఎండ‌గ‌ట్టారు. పార్టీకి అతి పెద్ద అడ్డంకి హ‌రీష్ రావ్ అంటూ తూర్పార బ‌ట్టారు. ఇక కాళేశ్వ‌రం అవినీతి మొత్తం హ‌రీష్ రావు పాప‌మే అంటూ దుయ్య‌బ‌ట్టారు. అంతేనా ఇటు సోద‌రుడు  కేటీఆర్, ఇంకో బావ సంతోష్ వంటి వారిని కూడా వ‌ద‌ల‌కుండా తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు. వీటితో పాటు.. బీఆర్ఎస్ లోని ఎంద‌రో ఎమ్మెల్యేలపై భూక‌బ్జా ఆరోప‌ణ‌లు చేసి వివాదాస్ప‌దం అయ్యారు. జాగృతి జ‌నం బాట అంటూ తెలంగాణ వ్యాప్తంగా యాత్ర‌లు చేసి.. బీఆర్ఎస్ లీడ‌ర్ల‌పై, మ‌రీ ముఖ్యంగా హ‌రీష్ పై   విమ‌ర్శ‌లు గుప్పించారు. ఒక స‌మ‌యంలో కాంగ్రెస్ లీడ‌ర్లు చేయాల్సిన ప‌ని క‌విత చేస్తున్నారా అన్న అనుమానం కలిగేలా ఆమె తీరు ఉంది.  కాంగ్రెస్ లీడ‌ర్లు కూడా క‌విత ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్ప‌మంటూ హ‌రీష్‌, కేటీఆర్ ల‌కు స‌వాల్ విసిరారంటే.. ఆమె విమర్శల ధాటి ఎంతగా ఉందో అర్ధమౌతుంది.  అయితే త‌న‌ది ఆస్తి కోసం పోరాటం కాద‌ని ఆత్మ‌గౌర‌వ‌ పోరాట‌మ‌నీ.. మండ‌లిలో క‌న్నీటి ప‌ర్యంత‌మై క‌విత‌..   ఎమోష‌న‌ల్ హైడ్రామాకు తెర‌లేపారు. త‌న ఎమ్మెల్సీ రాజీనామాను ఆమోదించ‌మ‌ని కోరారు. అన్న‌ట్టుగానే క‌విత రాజీనామా ఆమోదం పొందింది. త‌.    త‌న కాళ్ల‌పై తాను నిల‌బ‌డ్డానికి కొత్త‌గా పార్టీ పెడుతున్న‌ట్టు ప్ర‌క‌టించారు క‌విత‌. ఒక టైంలో గాంధీ భ‌వ‌న్ వైపు ఆమె అడుగులు ప‌డుతున్నాయ‌న్న మాట వినిపించినా.. 2028 ఎన్నిక‌ల్లో తన పార్టీ అయితే ఎన్నిక‌ల బ‌రిలో దిగ‌డం ఖాయమని చాటారు క‌విత‌. త‌న‌ది ఆత్మ‌గౌర‌వ పోరాట‌మంటోన్న క‌విత‌.. కాంగ్రెస్- బీజేపీ- బీఆర్ఎస్ వంటి హేమా హేమీల ముందు రాజ‌కీయంగా ఎంత మేర‌కు రాణించ‌గ‌ల‌రు? ఆమె చిర‌కాల వాంఛ సీఎం కావ‌డం  సాధ్య‌మ‌య్యే ప‌నేనా?  లేక  ష‌ర్మిళ‌లా ఆమె కూడా తేలిపోతారా? అన్న‌ది  క‌విత‌ త‌దుప‌రి కార్యాచ‌ర‌ణ‌పై ఆధార‌ప‌డి ఉంటుంది. ఆమె వెన‌క న‌డిచే నాయ‌క‌త్వాన్ని బ‌ట్టి  భవిష్య‌త్ రూపు దిద్ద‌కుంటుంది.

ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్

    ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పలువురు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరారు. వీరిలో ధనియాల రాథ, తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవి ఉన్నారు. మరో ఐదుగురు కార్పొటర్లు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వంగా కలిశారు.  మరోవైపు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటన రోజే కాంగ్రెస్ పార్టీలో చేరటంతో  రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లను కేటీఆర్‌ సన్మానించారు.  

ఐ బొమ్మ రవి బెయిల్ పిటిషన్ల కొట్టివేత

ఐబొమ్మ రవి బెయిలు పిటిషన్లన నాంపల్లి కోర్టు కొట్టివేసింది. సినిమాల పైరసీ వ్యవహారంలో ఐబొమ్మ రవిపై ఐదు కేసులు నమోదైన సంగతి తెలిసిదే.  ఈ క్రమంలోనే ఈ కేసులలో ఐబొమ్మ రవిని పోలీసులు దఫాల వారీగా కస్టడీలోకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే. ఈ విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి.  పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబం ధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు. కేసుల విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో అతడికి బెయిలు లభిస్తే, దర్యాప్తునకు ఆటంకం కలిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.  అంతేకాకుండా ఐ బొమ్మ రవి విదేశాల్లో పౌరసత్వం కలిగి ఉన్నాడని, ఇటువంటి సమయంలో రవికి బెయిల్ ఇస్తే దేశం దాటి పోయే అవకాశాలు  ఉన్నాయని, అదే జరిగితే  కేసు విచారణ   దెబ్బతింటుందని పోలీసులు పేర్కొన్నారు. రవి భారతదేశం లోనే అందుబాటులో ఉండేలా కస్టడీలో ఉంచడం అత్యవసరమని పోలీసుల తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం నాంపల్లి కోర్టు పోలీసుల వాదనలను పరిగణనలోనికి తీసుకున్న కోర్టు రవి పై నమోదైన ఐదు కేసులకు సంబంధించి దాఖలైన అన్ని బెయిల్ పిటీషన్లను  కొట్టి వేసింది.  

భోగాపురం క్రెడిట్ వార్.. లైన్ లోకి విజయసాయి?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య జరుగుతున్న క్రెడిట్ వార్ లోకి వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి ఎంటరయ్యారు. అయితే ఆయన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆ క్రెడిట్ లో తనకూ కొంత భాగం ఉందని మాత్రమే చెప్పారు. అలా చెప్పడంలో ఆయన వైసీపీనీ, ఆ పార్టీ అధినేత జగన్ ను పూర్తిగా విస్మరించారు. భోగాపురం విమానాశ్రయంలో ఫస్ట్ టెస్ట్ ఫ్లయిట్ ను స్వాగతిస్తూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు చేశారు. ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు.  ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు. విజయసాయి ఈ వైఖరి పట్ల వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.  పలువురు వైసీపీ మద్దతుదారులు విజయసాయిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీకి క్రెడిట్ దక్కకుండా అడ్డుపడుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు.  సరే అది పక్కన పెడితే.. ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ పరిస్థితి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డ చందంగా అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. వైసీపీ ఎంపీగా నాడు సభలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం గళమెత్తిన విజయసాయి.. ఇప్పుడు పార్టీ ప్రస్తావన కూడా లేకుండా తాను వ్యక్తిగత స్థాయిలోనే భోగాపురం కోసం మాట్లాడానన్నట్లుగా సోషల్ మీడియాలో పేర్కొనడం.. వైసీపీ విమర్శకులకు కొత్త శక్తిని ఇచ్చినట్లైంది. ఈ నేపథ్యంలోనే  నాడు విపక్ష నేతగా భోగాపురం వద్దంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. విమానాశ్రయాన్ని అడ్డుకోవడానికి చేయగలిగినంతా చేసి ఇప్పుడు తగుదునమ్మా అని క్రెడిట్ కోసం పాకులాడుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు.  

ఉగాదికి కవిత కొత్త పార్టీ

  తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది. ఉగాదికి కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి పేరుతో పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాల ఇన్‌ఛార్జ్‌లు, కార్యదర్శులతో కవిత సమావేశమయ్యారు. జనం బాట కార్యక్రమానికి సంబంధించిన రివ్యూ తెలుసుకున్నారు. పార్టీ పెడితే ప్రజల్లోకి బలంగా వెళ్లగలమా? లేదా? అన్న సలహాలు, సూచనలు కార్యకర్తలు, నాయకుల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నూతన పార్టీతోనే పోటీ చేయనున్నట్లు కవిత వెల్లడించిన సంగతి తెలిసిందే.  శాసనమండలిలో భావోద్వేగంతో మాట్లాడిన కవిత పలు సంచలన విషయాలు వెల్లడించారు. అయితే  కవిత తన జిల్లాల పర్యటనలను వాయిదా వేసుకున్నారు. వాస్తవంగా  ఇవాళ నుంచి సిరిసిల్ల జిల్లాలో పర్యటించాల్సి ఉంది. తన అన్న కేటీఆర్ ​ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో కవిత పర్యటన నేపథ్యంలో ఆసక్తి నెలకొంది.  జాగృతి సంస్థను రాజకీయ పార్టీగా ఏర్పాటు చేయాలని ఇప్పటికే పార్టీ నాయకులందరు డిమాండ్​ చేస్తున్నారు.   

కవిత కాంగ్రెస్‌లో చేరొచ్చు...కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

  ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని మల్‌రెడ్డి హింట్ ఇచ్చారు. గతంలో దానం నాగేందర్, కడియం శ్రీహరి వంటి నేతలు కాంగ్రెస్‌లోకి వస్తారని అనుకున్నా.. అనుకున్నట్టుగానే వచ్చారని ఆయన తెలిపారు.  మంత్రి పదవిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకే నష్టం అన్నారు. నిరాకరిస్తే నాకేం నష్టం లేదు. ఈ విషయంలో పార్టీ పెద్దలు ఆలోచించాలని తెలిపారు. రంగారెడ్డి జిల్లా పేరు మార్పు అనేది ఊహాగానమేనని రంగారెడ్డి జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలు అయినా చేసుకోవచ్చు. కానీ జిల్లా స్వరూపం పేరు మారొద్దున్నారు. ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో ల్యాండ్ విలువ పెరిగి  భూములు ఎవరూ అమ్మడం లేదని ఆయన అన్నారు.  

తమిళనాట రచ్చ రేపుతున్న లాప్ ట్యాప్ రాజకీయం!

తమిళనాడులో రాజకీయ వెడి రోహిణీకార్తెను తలపిస్తున్నది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు. రాష్ట్రంలోని అన్ని స్థానాలలో పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన విజయ్.. అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.  ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయ వాతావరణం వేడెక్కింది.ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే భావిస్తుంటే.. ఇరు పార్టీల పాలననూ చూసిన తమిళులు.. తనకు ఒక చాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని విజయ్ అంటున్నారు.  కాగా ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి స్టాలిన్ సర్కార్ ఫీబీస్ కు తెరలేపింది. విద్యార్థులకు ల్యాప్ టాప్ ల పంపిణీ చేపట్టింది. దీంతో కంగుతిన్న అన్నాడీఎంకే ఎన్నికల తాయిలాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు స్టాలిన్ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారంటూ విమర్శలకు తెరలేపింది. అయితే డీఎంకే మాత్రం ఇదేం కొత్త పథకం కాదనీ, దివంగత ముఖ్యమంత్రి జయలలిత విద్యార్థులకు లాప్ టాప్ ల పంపిణీ పథకాన్ని 2011లోనే ప్రారంభించారని చెబుతోంది.   2021లో అధికారంలోకి వచ్చిన డీఎంకే, గత పథకాలను కొనసాగిస్తామని ప్రకటించి, ఇప్పుడు ఏడాదికి 20 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. చెన్నైలో సీఎం ఎం.కె. స్టాలిన్ చేతుల మీదుగా తొలి విడతగా 10 లక్షల మందికి లాప్ ట్యాప్ ల పంపిణీ చేపట్టింది. దీంతో ఎన్నికల వేళ తమిళనాట ట్యాప్ లాప్ రాజకీయం రచ్చ రేపుతోందని పరిశీలకులు అంటున్నారు.  

కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడీ కన్నుమూత

కాంగ్రెస్  సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడీ  మంగళవారం (జనవరి 6) తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 81 ఏళ్లు. ఆయనకు భార్య, కుమారుడు, కోడలు, ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లు, మనవళ్లు ఉన్నారు. ఎరండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కల్మాడీ మృతి రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పైలట్ అయిన సురేష్ కల్మాడీ  ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పుణె నుంచి పలుమార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించి, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.  పుణె రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన నేతగా, 'కింగ్‌మేకర్‌'గా ఆయన గుర్తింపు పొందారు.  భారత ఒలింపిక్ సంఘం   అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయన నేతృత్వంలోనే 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలు జరిగాయి.   

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ముగిసిన నవీన్ రావు విచారణ.. వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు!

ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడిగా సీట్ గుర్తించిన బీఆర్ఎస్ నాయకుడు నవీన్ రావును సిట్  సోమవారం (జనవరి 5)  విచారించింది. ఈ విచారణలో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలపై సిట్ ఒక నిర్ణారణకు వచ్చిందని తెలుస్తోంది.  ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా ఎక్విపిమెంట్ సేకరణ, కార్యాలయం ఏర్పాటు, మధ్యవర్తుల పాత్ర వంటి అంశాలు ఈ కేసులో కీలకంగా మారాయని అధికారులు చెబుతున్నారు. రాజకీయ నేతల పేర్లు కూడా విచారణలో వినిపించడంతో ఈ వ్యవహారం రాజకీయంగా కూడా సంచలనంగా మారింది.   నవీన్ రావును సిట్ అధికారులు సోమవారం (జనవరి 5) దాదాపు ఎనిమిది గంటలపాటు విచారించారు. ఈ విచారణలోఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన ఆర్థిక, సాంకేతిక, నిర్వహణ తదితర అంశాలపై స్పష్టమైన ఆధారాలు వెల్లడైనట్లు సమాచారం.  ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది.  పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ నిర్వహణ కోసం జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్రత్యేక కార్యాలయాన్ని నవీన్ రావు తీసుకున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ కార్యాలయం నుంచే ఫోన్ ట్యాపింగ్ కార్యకలా పాలు కొనసాగినట్లు అనుమానిస్తున్నారు. కార్యాలయ అద్దె, నిర్వహణ ఖర్చులు, పరికరాల అమరిక వంటి వివరాలపై కూడా అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ కేసులో రాజకీయ కోణం మరింత బలపడిందని చెబుతున్నారు. బీఆర్‌ఎస్ నేతల తరఫున ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావులతో నవీన్ రావు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు సిట్ విచారణలో తేలినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ సమాచారం ఎవరి కోసం, ఏ ఉద్దేశంతో వినియోగిం చారన్న అంశంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో  నవీన్ రావు విచారణ ముగిసినా, ఈ కేసు ఇక్కడితో ఆగే అవకాశాలు లేవని సిట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన డేటా ఎవరెవరికి చేరింది, దాన్ని ఎలా వినియోగించారు, ఈ వ్యవహారంలో ఇంకెంతమంది పాత్రధారులు ఉన్నారనే అంశాలపై మరింత లోతుగా విచారణ కొనసాగనుంది. ఇదిలా ఉండగా ఈ కేసులో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.