మదనపల్లి జంట హత్యల కేసులో మరో షాకింగ్!
posted on Feb 25, 2021 @ 10:26AM
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా సంచలనం స్పష్టించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాలో మదనపల్లె జంట హత్యల కేసులో కొత్త విషయాలు వెలుగుచూస్తున్నాయి. తండ్రి పురుషోత్తమ నాయుడు,తల్లి పద్మజ కలిసి కుమార్తెలు అలేఖ్య, సాయి దివ్యలను అత్యంత క్రూరంగా చంపినట్లు ఇప్పటివరకు భావిస్తున్నారు. అయితే తాజాగాఈ జంట హత్యల కేసులో కొత్త ట్విస్ట్ బయటికొచ్చింది. చిన్నకుమార్తె సాయి దివ్యను పద్మజ చంపలేదని డాక్టర్ల విచారణలో వెల్లడయింది. పెద్ద కుమార్తె అలేఖ్యే ఆ దారుణానికి ఒడిగట్టిందని తేలింది. అలేఖ్యే తన సోదరి సాయి దివ్యను హతమార్చిందనీ, ఆ తర్వాత తనను కూడా చంపితే ఇద్దరం బతికొస్తామని చెప్పడంతోనే, అలేఖ్యను పద్మజ చంపిందని చెబుతున్నారు.
ప్రస్తుతం విశాఖపట్టణంలోని మానసిక ఆసుపత్రిలో సైకియాట్రిక్ నిపుణుల ఆబ్సర్వేషన్ లో పద్మజ, పురుషోత్తమనాయుడు దంపతులు ఉన్నారు. ప్రతీరోజూ నిపుణులు వీళ్లతో మాట్లాడుతున్నారు. వారిని మాటల్లో పెట్టి అసలు ఆనాడు ఏం జరిగిందన్న వివరాలను రాబడుతున్నారు. ఈ క్రమంలోనే వారిద్దరి నుంచి రాబట్టిన వివరాలతో డాక్టర్లు ఓ దారుణ నిజాన్ని బయటపెట్టారు. పురుషోత్తం నాయుడు చెప్పిన వివరాల ప్రకారమే.. ఆ రోజు తన సోదరి సాయి దివ్యను అలేఖ్యే చంపిందని ఆయన అంగీకరించారని తెలుస్తోంది. పద్మజ, పురుషోత్తమనాయుడు దంపతులతో వేరు వేరుగా మాట్లాడుతున్నాము. వారు ఈ ఘటనతో పూర్తిగా షాక్ లో ఉండిపోయారు. పద్మజ కోలుకుంటోంది కానీ, పురుషోత్తమనాయుడు ఇంకా ఆ పరిస్థితి నుంచి బయటపడలేదు. వారితో మాట్లాడుతూ, ఆనాడు అసలేం జరిగిందన్న వివరాలను రాబడుతున్నాం.‘ అని విశాఖ మానసిక ఆసుపత్రి వైద్యులు చెబుతున్నారు.
తాను పూర్వజన్మలో అర్జునుడినని అలేఖ్య తనతో చెప్పేదని పురుషోత్తం వైద్యులకు చెప్పినట్టు సమాచారం. కలియుగం అంతమై త్వరలోనే సత్యయుగం వస్తుందని, కరోనా ఇందుకు చక్కని ఉదాహరణ అని అలేఖ్య చెప్పేదని, తాను చదివిన ఆధ్యాత్మిక పుస్తకాల్లోనూ ఇలాంటి విషయాలే ఉండడంతో ఆమె మాటలు నమ్మామని పురుషోత్తం చెప్పినట్టు సమాచారం. ఆధ్యాత్మిక పిచ్చిలో పెద్దకూతురు అలేఖ్య , తల్లి పద్మజలు కిరాతకంగా వ్యవహరించారని తెలుస్తోంది.