కొత్త సచివాలయం సరే.. రెగ్యులర్ గా వస్తారా..?
posted on May 1, 2023 @ 10:22AM
కోరుకున్న విధంగా తాను నిర్మించుకున్నందున కొత్త సచివాలయం నుంచి తెలంగాణ సీఎం ఇకపైన పాలన మొత్తం ఈ భవనం నుంచి అందిస్తారా? లేక మూణ్ణాళ్ళ ముచ్చటకే పరిమితం చేస్తారా? అనే చర్చ మొదలైంది. అధికారులు, సిబ్బంది మధ్య భిన్నమైన రీతిలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం మొత్తం సచివాలయానికి తరలిరావడంతో సీఎం కూడా కచ్చితంగా వస్తారని అధికారులు బలంగా నమ్ముతున్నారు.
సీఎం వెంట నిత్యం ఉండే సెక్రటరీలంతా సెక్రటేరియట్ కు వస్తే ముఖ్యమంత్రి ఒక్కరూ మాత్రమే ప్రగతి భవన్ నుంచి వ్యవహారాన్ని నడిపించడం ఆచరణ సాధ్యం కాదనే వాదనను తెరపైకి తెచ్చారు. కోరుకున్న రీతిలో సచివాలయ భవనం నిర్మాణమైనందున పూర్తి సంతృప్తితో ఉన్నారని, రెగ్యులర్ గా రావడానికే అవకాశాలున్నాయని వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి.
వెల్ఫేర్ స్కీమ్లు, సీఎం కోరుకున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు రివ్యూను సచివాలయంలోనే సోమవారం నిర్వహిస్తున్నారని, ఇకపైన ఇలాంటివి కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయని సచివాలయ సిబ్బంది అంటున్నారు. జిల్లా స్థాయిలో పథకాలు అమలవుతున్నాయో లేదో తరచూ కలెక్టర్లతోనే డైరెక్టుగా మాట్లాడి రిపోర్టులు తెప్పించుకుంటారని, సచివాలయానికి వచ్చిన తర్వాత పాలనలో ప్రత్యేక తేడా కనిపిస్తుందనే అభిప్రాయాన్ని ఐఏఎస్, ఐపీఎస్ స్థాయిలో కలిగించేందుకు సీఎం తరచూ సెక్రటేరియట్ కు రావడానికే మొగ్గు చూపుతున్నారని మరో అధికారి వ్యాఖ్యానించారు. కానీ, ఎన్జీవో ర్యాంక్ సిబ్బందిలో మాత్రం మరో రకమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ కొత్త సచివాలయం మోజు మూణ్ణాళ్ళ ముచ్చటగానే మిగిలిపోతుందని, వారానికి రెండు మూడు రోజులకు పరిమితం చేసి ఎన్నికల వేడి మొదలుకాగానే ప్రగతి భవన్ కే పరిమితమవుతారని అంటున్నారు. సచివాలయానికి వచ్చే అలవాటే లేని కేసీఆర్ కొత్త సచివాలయానికి వచ్చే అవకాశాలు తక్కువేనని విపక్షాలు అంటున్నాయి.
ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే సచివాలయం అని గతంలో అధికార పార్టీ నేతలు చెప్పిన అంశాన్ని పలువురు గుర్తుచేశారు. రెగ్యులర్ గా సెక్రటేరియట్ కు సీఎం వస్తే సిబ్బందిలో స్పష్టమైన తేడా కనిపిస్తుందని, ఆఫీసర్ల స్థాయిలో తీసుకునే నిర్ణయాల్లో వేగం పెరుగుతుందనీ, పెండింగ్ ఫైళ్ళను ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం, అన్ని వివరాలను సమగ్రంగా రూపొందించడంలో.. అన్ని దశల్లోనూ ఒక భయం, క్రమశిక్షణ అలవడుతుందంటున్నారు. ముఖ్యమంత్రి హాజరుకాకపోతే అధికారుల్లోనూ అలసత్వం, నిర్లక్ష్యం ఉంటుందని, ఆ ప్రభావం రొటీన్ కార్యకలాపాలపై కనిపిస్తుందని గుర్తుచేశారు. ఎవరికెన్ని సందేహాలున్నా సీఎం ఇకపైన రెగ్యులర్ గా సచివాలయానికి హాజరౌతారా లేదా అన్న విషయంపై రానున్న రోజులలో క్లారిటీ వస్తుందన్నారు.