ప్రధాని మోడీకి నెటిజన్ల సెగ! రిజైన్ చేయాలంటూ ట్వీట్లు
posted on Apr 20, 2021 @ 9:35AM
దేశంలో కరోనా మహమ్మారి విరుచుకుపడుతోంది. రోజురోజుకు రికార్డ్ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. మరణాలు కూడా ప్రమాదకరంగా ఉంటున్నాయి. దేశంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర సర్కార్ తీరుపై జనాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీకి తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ప్రధాని నరేంద్రమోడీపై నెటిజన్లు మండిపడుతున్నారు. కరోనాను అదుపు చేయడంలో దారుణంగా విఫలమయ్యారని, ఇందుకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. #ResignModi హాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్లో ట్రెండింగ్లో ఉంది.
కొవిడ్ కట్టడిపై కేంద్ర ప్రభుత్వ తీరును నిరసిస్తూ ట్విట్టర్ను హోరెత్తిస్తున్నారు నెటిజన్లు. ప్రధాని మోడీకి ఎన్నికలపై ఉన్న శ్రద్ధ ప్రజారోగ్యంపై లేదని ఆరోపిస్తున్నారు. సకెండ్ వేవ్ ఉదృతంగా ఉన్నా ఎన్నికల ర్యాలీల్లో పాల్గొనడంపై మండిపడుతున్నారు. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో కరోనా మృతదేహాలను రహస్యంగా కాల్చివేస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ దాదాపు మూడు లక్షల ట్వీట్లు వచ్చాయి. దేశంలో కరోనా పెరుగుదలకు మోడీనే కారణమని ఆరోపిస్తూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఆర్జేడీ నేత తేజ్ప్రతాప్ యాదవ్ సహా మరికొందరు నేతలు రాజీనామాకు డిమాండ్ చేస్తూ ట్వీట్లు చేశారు.
సోషల్ మీడియాలో విపరీతమైన ఆదరణ కలిగిన మోడీకి ట్విట్టర్లో ఈ స్థాయిలో నిరసన సెగ తగలడం ఇదే తొలిసారి. గతేడాది ఆగస్టులోనూ మోడీపై సోషల్ మీడియా మండిపడింది. ఆయన ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో జేఈఈ, నీట్ గురించి మాట్లాకపోవడంపై సోషల్ మీడియా విరుచుకుపడింది.మోడీ ప్రసంగ వీడియోకు డిస్లైక్లతో తమ నిరసన తెలిపారు. ఆ వీడియోకు 74వేల లైక్లు వస్తే ఏకంగా 5 లక్షల మంది డిస్లైక్ చేశారు.
ఉద్యోగాలు కావాలంటూ నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది. ‘మోడీ రోజ్గార్ దో’, ‘మోడీ ఉద్యోగమివ్వు’ వంటి ట్వీట్లు చేస్తున్నారు. ఫిబ్రవరి మొదటి వారంలో ఒక్క రోజులోనే ఇలాంటి ట్వీట్లు ఏకంగా 50 లక్షలు రావడం గమనార్హం. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానంటూ ఇచ్చిన హామీ ఏమైందని గొంతెత్తుతున్నారు.