నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి రాజీనామా

నెల్లూరు మేయర్ పొట్లూరి స్రవంతి పై అవిశ్వాస తీర్మానం పెట్టి గద్దె దించి, ఆ స్థానంలో డిప్యూటీ మేయర్ రూఫ్ కుమార్ యాదవ్ ను మేయర్ చేయాలన్న  అధికార పార్టీ పెద్దల కోరిక నెరవేరింది. అయితే అవిశ్వాస తీర్మానం ద్వారా మేయర్ ను గద్దె దించాలన్న ఆకాంక్ష మాత్రం నెరవేరలేదు. ఎందుకంటే.. గురువారం (డిసెంబర్ 18) మేయర్ పై అవిశ్వాస   తీర్మానం పెట్టేందుకు  వ్యూహాలు రచించి, క్యాంపు రాజకీయాలు చేపట్టిన అధికార పార్టీ నేతలకు మేయర్ స్రవంతి తన రాజీనామా ద్వారా షాక్ ఇచ్చారు.  అవిశ్వాస తీర్మానానికి ముందే తన పదవికి రాజీనామా చేసిన మేయర్  తన రాజీనామా లేఖనం జిల్లా కలెక్టర్ కు వాట్సప్ ద్వారా పంపారు.  దీంతో మేయర్ పై అవిశ్వాస తీర్మానం అటకెక్కింది.  
ఇలా ఉంటే.. గంట గంటకు మారుతున్న నెల్లూరు కార్పొరేషన్ రాజకీయం    మేయర్ స్రవంతి పై గురువారం (డిసెంబర్ 18) అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు రంగం సిద్ధమైన నేపథ్యంలో కార్పొరేటర్లు పార్టీలు మారుతూ రాజకీయాన్ని రసవత్తరంగా మార్చారు. అధికార పార్టీకి మద్దతుగా ఉన్న కార్పొరేటర్లలో ఐదుగురిని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాజీ సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేర్చారు. దీంతో అప్రమత్తమైన తెలుగుదేశం   వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ.. వైసీపీకి ఉన్న కార్పొరేటర్ లను ఒక్కొక్కరిని పార్టీలోకి చేర్చుకోవడం మొదలుపెట్టింది. ఈ క్రమంలో సిటీ నియోజకవర్గంలో మైనార్టీ కార్పొరేటర్ కరిముల్లా మంత్రి నారాయణ సమక్షంలో తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకున్నారు. అది జరిగిన మూడు గంటల్లోనే.. వైసీపీ నగర అధ్యక్షుడు, 37వ డివిజన్ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ఆ పార్టీకి షాక్ ఇచ్చి.. సైకిల్ ఎక్కారు.  

దీంతో 54 స్థానాలు కలిగిన నెల్లూరు కార్పొరేషన్ లో.. 41 మంది కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉన్నారు. అవిశ్వాసం నెగ్గి మెజారిటీ టిడిపికి ఉండగా.. వైసీపీకి 11 మంది సభ్యులు ఉన్నట్లు ఆ పార్టీ చెబుతోంది. అధికార పార్టీకి మద్దతుగా ఉన్న కార్పొరేటర్లను కాపాడుకునేందుకు క్యాంపు రాజకీయాలకు మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీకారం చుట్టారు. శ్రీకాళహస్తి తో పాటు తిరుమల, గోవా పాండిచ్చేరి వంటి ప్రాంతాలలో క్యాంపులు ఏర్పాటు చేశారు. వైసీపీలో ఉన్న 11 మందీ కూడా  తెలుగుదేశంకే మద్దతు ఇస్తున్నారు, ఇస్తారు అంటూ అధికార పార్టీ ప్రచారం చేసుకుంటున్న వేళ నెల్లూరు నగర మేయర్ స్రవంతి తన పదవికి రాజీనామా చేశారు.  
2021 నవంబర్ 24న మేయర్ గా  ప్రమాణ స్వీకారం చేసిన స్రవంతి.. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తప్పడుగులు వేశారనే చర్చ పొలిటికల్ సర్కిల్లో జరుగుతుంది.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీకి  రాజీనామా చేసి.. తెలుగుదేశం గూటికి చేరేందుకు మేయర్ స్రవంతి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.   దీంతో ఆమె రెండు పార్టీలకూ దూరం పాటిస్తూ వచ్చారు.  ఈ క్రమంలో నవంబర్ 24న ఆమెపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు 40 మంది కార్పొరేటర్లు సంతకాలు చేశారు. 25వ తేదీన వారందరూ జిల్లా కలెక్టర్ ను కలిసి నోటీసు అందజేశారు. అదే రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. తమ పార్టీకి మేయర్ కి సంబంధం లేదని.. ఆమె ఎప్పుడో వైసీపీకి రాజీనామా చేశారని వెల్లడించారు. దీంతో మేయర్ స్రవంతికి మద్దతు ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకు రాలేదు.

ఈనెల 18న అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన కౌన్సిల్ మీటింగ్ నిర్ణయించినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఈ క్రమంలో తమకు పూర్తిగా మద్దతు ఉందని సైలెంట్ గా ఉన్న తెలుగుదేశం పార్టీకి ఐదుగురు కార్పొరేటర్లు తెలుగుదేశంకి రాజీనామా చేసి వైసీపీలో చేరడం గట్టి షాక్ ఇచ్చింది.  దీనిపై మంత్రి పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. వైసీపీలో ఉండే కార్పొరేటర్లను ఒక్కొక్కరిగా లాగేయడం మొదలుపెట్టారు. దీంతో వైసిపి షాక్ కు గురైంది. సిటీ నియోజకవర్గంలో ఉండే ముగ్గురు కార్పొరేటర్లను లాగేసేందుకు అధికార పార్టీ స్కెచ్ వేసిన సమయంలోనే  తాను మేయర్  పదవికి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు స్రవంతి.  

గ్రేటర్ విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ సాకారం కానుందా?

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం దేశంలోనే వేగంగా అభివృద్ది చెందుతున్న రాష్ట్రంగా వార్తలలో ఉన్న సంగతి తెలిసిందే. పెట్టుబడులు, పరిశ్రమలకు కేంద్రంగా మారుతోంది. ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ తరుణంలోనే  దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఓ ప్రతిపాదన తెరపైకి వచ్చింది. విజయవాడ కార్పొరేషన్ ను విస్తరించి గ్రేటర్ విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ గా చేయాలన్నదే ఆ ప్రతిపాదన. ఇందుకు విజయవాడ నగరానికి ఆనుకుని ఉన్న 74 గ్రామాలను   విలీనం చేసి.. గ్రేటర్ విజయవాడ కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలన్నదే ఆ ప్రతిపాదన. అమరావతికి ఆనుకుని ఉన్న నగరం విస్తరణ అత్యంత ముఖ్యమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. తాజాగా ఆ ప్రతిపాదనలో ఒక కదలిక వచ్చింది. విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, ఎమ్మెల్యే గద్దె రామ్మెహన్ లు ముఖ్యమంత్రి చంద్రబాబుతో గురువారం (డిసెంబర్ 25) భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వారు ఆయనకు గ్రేటర్ విజయవాడ మునిసిపల్ కార్పొరేషన్ ప్రతిపాదనను వివరించారు.శరవేగంగా అభివృద్ధి చెందుతున్న అమరావతికి తోడుగా, ఇప్పటికే అభివృద్ధి చెందిన విజయవాడను విస్తరించాలని విజ్ణప్తి చేశారు. ఈ ప్రతిపాదనపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.  వాస్తవానికి చాలా కాలంగా  గ్రేటర్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు అంశం పెండింగ్ లో ఉంది. ఆ అంశాన్నే ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్లి సత్వరమే విజయవాడ గ్రేటర్ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు తసుకోవాలని కోరారు. తక్షణమే దాని ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లాల మధ్య   ఆ ప్రతిపాదనలపై సీఎం చంద్రబాబు సానుకూలంగా స్పందించారని కేశినేని చిన్ని తెలిపారు. జీవీఎంసీపై ప్రభుత్వం త్వరలోనే సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశముందని చిన్ని అన్నారు.

బంగ్లాదేశ్ లో మరో హిందూ యువకుడి హత్య

బంగ్లాదేశ్ లో హిందువులే లక్ష్యంగా దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్‌లో మరో హిందూ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు.  ఆ దేశంలో దీపూ చంద్ర దాస్ దారుణ హత్య మరవకముందే, రాజ్‌బర్ జిల్లాల్లో మరో హిందూ యువకుడిని గ్రామస్థులు కొట్టి చంపిన ఘటన వెలుగు చూసింది. బుధవారం (డిసెంబర్ 24 రాత్రి ఈ దారుణం జరిగింది.   రాజ్‌బర్ జిల్లాలోని పంగ్షా సర్కిల్‌లో   29 ఏళ్ల అమృత్ మొండల్ అలియాస్ సామ్రాట్‌పై బుధవారం రాత్రి గ్రామస్థులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే  అమృత్ మొండల్  ఆసుపత్రికి తరలించారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ అతడు మరణించాడు.  అమృత్ మండల్ సామ్రాట్ బహిన్ అనే సంస్థను నిర్వహిస్తున్నాడు. అయితే అతడు ఆ సంస్థ పేరిట సొమ్ములు వసూలు చేస్తూ, దౌర్జన్యాలకూ, హింసాకాండకూ పాల్పడుతున్నాడన్న అభియోగాలు ఉన్నాయి. అతడిపై   హత్యా నేరం సహా రెండు కేసులు ఉన్నాయి. అదలా ఉంచితే  గత కొంత కాలంగా అజ్ణాతంలో ఉన్న అమృత్ మొండల్ ఇటీవలే గ్రామానికి తిరిగి వచ్చాడు. ఈ నేపథ్యంలోనే అతడిపై దాడి జరిగింది.  ఇదలా ఉండగా హిందువులు లక్ష్యంగా బంగ్లాదేశ్ లో దాడులు కొనసాగుతున్నాయి. గత ఐదు రోజుల వ్యవధిలో బంగ్లాదేశ్ లో హిందువులకు కుటుంబాలు లక్ష్యంగా ఏడు దాడులు జరిగాయి. ఏడు గృహాలు దగ్ధమయ్యాయి. 

అమరవతిలో హైకోర్టు శాశ్వత భవన నిర్మాణానికి శంకుస్థాపన

ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. కొనసాగుతున్న నిర్మాణాలకు తోడు కొత్త నిర్మాణాలకూ శంకుస్థాపనలు జరుగుతున్నాయి. తాజాగా ఏపీ హైకోర్టు శాశ్వత భవన నిర్మాణ పనులకు మంత్రి నారాయణ గురువారం (డిసెంబర్ 25)శంకు స్థాపన చేశారు. ఈ ఐకానిక్ భవన నిర్మాణాన్ని 2027 నాటికి పూర్తి చేస్తామని ఈ సందర్భంగా చెప్పారు అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఈ హైకోర్టు భవనాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పిన ఆయన  రెండు బేస్‌మెంట్ అంతస్తులు, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు మరో 7 అంతస్తులతో ఈ నిర్మాణం ఉంటుందన్నారు. 52 కోర్టు హాళ్లు ఉంటాయన్నారు. ఇందు కోసం 45 వేల టన్నుల ఇనుము వినియోగిస్తున్నట్లు వివరించారు. హైకోర్టు శాశ్వత నిర్మాణ పనుల ప్రారంభాన్ని ఒక చారిత్రక ఘట్టంగా మంత్రి నారాయణ అభివర్ణించారు.  ప్రపంచ ప్రఖ్యాత ఆర్కిటెక్చర్ సంస్థ  నార్మన్ ఫోస్టర్స్ అండ్ పార్టనర్స్ రూపొందించిన అద్భుతమైన డిజైన్‌తో ఈ హైకోర్టు భవనం రూపుదిద్దుకుంటోంది. 21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మితమయ్యే ఈ హైకోర్టు శాశ్వత భవనానికి రాఫ్ట్ ఫౌండేషన్ పద్ధతిని అనుసరిస్తున్నారు. రాఫ్ట్ ఫౌండేషన్ అంటే.. భవనం మొత్తం బరువును నేల అంతటా సమానంగా పంపిణీ చేయడానికి ఒక పెద్ద కాంక్రీట్ స్లాబ్‌ను పునాదిగా వేస్తారు. దీనినే  రాఫ్ట్   ఫౌండేషన్ అంటారు. నేల స్వభావం మెత్తగా ఉన్నప్పుడు లేదా భవనం బరువు భారీగా ఉన్నప్పుడు ఈ పద్ధతిని ఉపయోగిస్తారు. ఇది భవనానికి  పటుత్వాన్ని ఇస్తుంది.   

భీమవరం డీఎస్పీ జయసూర్యపై బదలీ వేటు

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం భీమవరం డీఎస్పీ జయసూర్యపై ఎట్టకేలకు బదలీ వేటు పడింది. ఆయన స్థానంలో   రఘువీర్ విష్ణు నియమితులయ్యారు. బదలీ వేటు పడిన జయసూర్యకు డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేయాలనిఆదేశాలు జారీ చేశారు. ఆయనకు ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.  జయసూర్య  పనితీరుపై పలు విమర్శలు, ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆయన తీరుపై ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు రెండు నెలల కందటే డీఎస్పీ జయసూర్య అవినీతి, అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలని పవన్ కల్యాణ్ ఉన్నతాధికారులను ఆదేశించారు.  అయితే అప్పట్లో జయసూర్యకు మద్దతుగా ఆయన సమర్ధుడైన అధికారి  అంటూ ఉండి ఎమ్మెల్యే, అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్   రఘురామ కృష్ణరాజు కితాబివ్వడం సంచలనం సృష్టించింది. పవన్ కల్యాణ్ ఆదేశించినా, ప్రభుత్వం విచారణ జరుగుతోందని ప్రకటించినా గత రెండు నెలలుగా డీఎస్పీ జయసూర్యపై ఎటువంటి చర్యా లేదు.  ఇప్పుడు హఠాత్తుగా ఆయనపై బదలీ వేటు పడింది. అయితే జయసూర్యపై చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరించిందని పరిశీలకులు అంటున్నారు. జయసూర్యపై అవినీతి ఆరోపణలు అంతర్గ విచారణలో నిరూపితం కాకపోవడం వల్లనే రెండు నెలల తరువాత బదలీ వేటు వేశారనీ, ఒక వేళ ఆరోపణలు నిరూపితమై ఉంటే సస్పెండ్ చేసి ఉండేవారనీ అంటున్నారు.  

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు.. సిట్ స్పీడ్ మామూలుగా లేదుగా?

రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు విచారణలో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసు విచారణ  గురువారం (డిసెంబర్ 25)  అత్యంత కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్‌రావు 14 రోజుల కస్టోడియల్ విచారణ గురువారం (డిసెంబర్ 25)తో ముగిసింది. ఈ నేపథ్యంలో సిట్ దూకుడు పెంచింది.  ప్రభాకరరావు కస్టడీ గడువు ముగుస్తున్న రోజే కేసులోని కీలక నిందితులందరినీ ఒకేసారి విచారించేందుకు సిట్ అధికారులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు పిలిచారు. మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్‌రావు, అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, భుజంగరావు, మీడియా సంస్థ అధినేత శ్రవణ్‌రావుతో పాటు మరికొందరిని కూడా సిట్ విచారణకు పిలిచింది. ప్రభాకరరావు కస్టడీ గడువు ముగిసే చివరి రోజున సిట్ ఒకే సారి వీరందరినీ విచారించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  అందరినీ కలిపి ఒకేసారి ప్రశ్నించి కీలక అంశాలపై సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. 14 రోజుల కస్టోడియల్ విచారణలో  ప్రభాకరణావు చాలా వరకూ ప్రశ్నలన్నిటికీ నో అనే సమాధానాలే ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇంటెలిజెన్స్ చీఫ్‌లుగా పనిచేసిన నవీన్‌చంద్‌, అనిల్‌ పేర్లను ప్రస్తావించినప్పటికీ, ఆరు వేల ఫోన్‌ నంబర్లు ఉన్న పెన్‌డ్రైవ్‌ విషయంపై   ప్రభాకర్‌రావు మౌనం వహించినట్టు సిట్ వర్గాలు వెల్లడించాయి. అలాగే, మావోయిస్టుల అంశంపైనే మాజీ మంత్రి హరీష్‌రావు తనతో మాట్లాడినట్టు చెప్పిన ప్రభాకర్‌రావు, తనకు అప్పటి సీఎం  కేసీఆర్ రీ-ఎంప్లాయిమెంట్‌ను ఎలా ఇచ్చారన్న విషయంపై మాత్రం స్పందించలేదని సమాచారం. ఇలా ఉండగా, రెండు రోజుల క్రితమే ప్రణీత్‌రావు, ప్రభాకర్‌రావులను కలిపి సిట్ విచారించింది. ప్రణీత్‌రావును దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించిన అధికారులు, ఇవాళ ఆయన మినహా మిగిలిన నిందితులందరినీ విచారించారు. అలాగే ప్రభాకర్‌రావు పెద్ద కుమారుడు నిశాంత్‌రావును సైతం  నాలుగు గంటల పాటు విచారించిన సిట్, ఆయన ఆర్థిక లావాదేవీలపై వాంగ్మూలం నమోదు చేసింది. ఈ కేసుకు అనుబంధంగా ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపైనా సిట్ దృష్టి సారించింది. దక్కన్ కిచెన్ యజమాని నందకుమార్‌ను విచారణకు పిలిచి, ఫామ్‌హౌస్‌లో జరిగిన ఎమ్మెల్యేల కొనుగోలు ఘటన ఎలా వెలుగులోకి వచ్చిందనే అంశాలపై సుదీర్ఘంగా ప్రశ్నించింది. తన ఫామ్‌హౌస్‌లో జరిగిన ఘటనకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు ఎలా బయటకు వచ్చాయన్న విషయంపై తనను సిట్ ప్రశ్నించిందని నందకుమార్ వెల్లడించారు. అప్పుడే తన ఫోన్ ట్యాపింగ్‌కు గురైందన్న అనుమానం వచ్చినట్టు ఆయన తన వాంగ్మూలంలో పేర్కొన్నారు. తన వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ సిట్‌కు సమర్పించినట్టు   తెలిపారు.  మరోవైపు, ఇంటెలిజెన్స్ చీఫ్ విజయకుమార్ హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌ను మరోసారి కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో, కస్టోడియల్ ఎంక్వైరీలో వచ్చిన అంశాలపై ఉన్నతాధికారులు చర్చించినట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి పూర్తి నివేదికను శుక్రవారం (డిసెంబర్ 26)  సుప్రీంకోర్టుకు సమర్పించేందుకు సిట్ సన్నాహాలు చేస్తోంది. రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులకు నోటీసుల అంశంపైనా కీలక చర్చ జరుగుతోంది. అదేవిధంగా, బంజారాహిల్స్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో ఉన్నతాధికారులను విచా రిస్తున్న సిట్, మాజీ చీఫ్ సెక్రటరీ సోమేశ్‌కుమార్, మాజీ డీజీపీ స్థాయి అధికారులను కూడా ప్రశ్నిస్తున్నట్టు సమాచారం. ఇవాళ్టితో ప్రభాకర్‌రావు కస్టడీ ముగియనున్న నేపథ్యంలో, ఈ కేసు ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న ఆసక్తి రాజకీయ, అధికార వర్గాల్లో నెలకొంది.

మావోయిస్టు అగ్రనేత గణేష్ ఉయికే హతం

ఒడిశా రాష్ట్రంలో మావోయిస్టు ఉద్యమానికి మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది. నిషేధిత సీపీఐ (మావోయిస్టు) ఒడిశా రాష్ట్ర కమిటీ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్న అగ్ర మావోయిస్టు కమాండర్ గణేష్ ఉయికే అలియాస్ పాకా హనుమంతు భద్రతా బలగాలతో జరిగిన ఎన్ కౌంటర్ లో  హతమయ్యాడు. కంధమాల్, గంజాం జిల్లాల సరిహద్దులోని రాంపా అటవీ ప్రాంతంలో గురువారం (డిసెంబర్ 25)   ఒడిశా ప్రత్యేక ఆపరేషన్ గ్రూప్ , సీఆర్‌పీఎఫ్, బీఎస్‌ఎఫ్ దళాలు సంయుక్తంగా జరిపిన కూబింగ్ ఆపరేషన్  ఈ సందర్భంగా జరిగిన ఎదురు కాల్పుల్లో  గణేష్ ఉయికేతో పాటు మరో ఐదుగురు మావోయిస్టులు హతమయ్యారు. మృతుల్లో ఇద్దరు మహిళా నక్సల్స్ కూడా  ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఒక పోతే ఈ ఎన్ కౌంటర్ లో మరణించిన గణేష్ ఉయికే సీపీఐ  మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు. మోస్ట్ వాంటెడ్  మావోయిస్టుల్లో ఒకడిగా గుర్తింపు పొందారు. గణేష్ ఉయికేపై   . మొత్తం కోటి రూపపాయల రివార్డు ఉండగా, తెలంగాణ సర్కార్ ప్రత్యేకంగా పాతిక లక్షల రివార్డు  ప్రకటించింది. తెలంగాణలోని  నల్గొండ జిల్లా చందూర్ మండలం పుల్లెమ్ల గ్రామానికి చెందిన గణేష్ ఉయికే, బీఎస్సీ చదువుతున్న సమయంలో మావోయిస్టు ఉద్యమంలో చేరి, క్రమంగా వివిధ బాధ్యతలు నిర్వహిస్తూ అగ్రస్థాయి నేతగా ఎదిగారు. ప్రస్తుతం మావోయిస్టు సెంట్రల్ కమిటీలో మిగిలి ఉన్న కేవలం ముగ్గురు సభ్యుల్లో గణేష్ ఉయికే ఒకడిగా భద్రతా సంస్థలు గుర్తించాయి. మిగిలిన వారిని  ఛత్తీస్‌గఢ్‌లో మల్లారాజి రెడ్డి అలియాస్ సంగ్రామ్, జార్ఖండ్‌లో అనాల్డా అలియాస్ తూఫాన్‌ మాత్రమే. ఇదిలా ఉండగా, మావోయిస్టు పాలిట్‌బ్యూరో సభ్యుల్లో తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ, మాజీ ప్రధాన కార్యదర్శి ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి, మిషిర్ బేస్రా ఇంకా పరారీలో ఉన్నారు. మరోవైపు, పాలిట్‌బ్యూరో సభ్యులు వెనుగోపాల్ రావు అలియాస్ సోను, పుల్లూరి ప్రసాద్ రావు అలియాస్ చంద్రన్న ఇప్పటికే లొంగిపోయారు. గణేష్ ఉయికే హతంతో ఒడిశా, పరిసర రాష్ట్రాల్లో మావోయిస్టు కార్యకలాపాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని భద్రతా దళాలు చెబుతున్నాయి.ఇలా ఉండగా గణేష్ ఉయికే ఎన్ కౌంటర్ పై కేంద్రహోంమంత్రి అమిత్ షా స్పందించారు.  తాజా ఎన్కౌంటర్తో నక్సల్ రహిత రాష్ట్రంగా ఒడిశా అడుగులు వేస్తోందన్న ఆయన.. వచ్చే ఏడాది మార్చి 31లోగా దేశంలో  మావోయిజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని స్పష్టం చేశారు.   

ఆంధ్ర కురియన్, ఉక్కు కాకాని... మన మహనీయుడు వెంకటరత్నం

ప్రజాసేవే తన వృత్తి అని నమ్మి,  జీవితమంతా ప్రజలతోనే, వారి సేవలోనే గడిపిన ఆదర్శ నాయకుడు స్వర్గీయ కాకాని వెంకటరత్నం.  ఆయన మరణించి గురువారం (డిసెంబర్‌ 25) నాటికి సరిగ్గా  53 ఏళ్లు. అయినా ఆయన సేవలు నేటికీ ప్రతి పల్లెలోనూ, పట్టణంలోనూ జనంస్మరించుకుంటూనే ఉన్నారు.  దేశ సౌభాగ్యానికి పట్టుకొమ్మలైన గ్రామీణ రైతు, కూలీ బంధువుగా వారికి చేయూతనందించిన ప్రజల మనిషి కాకాని వెంకటరత్నం. ప్రజానాయకునిగా అంచెలంచెలుగా ఎదిగిన మహోన్నత వ్యక్తి కాకాని వెంకటరత్నం. ప్రజా పోరాటాలలో నిమగ్నుడైన ఆయనను ‘ఉక్కు కాకాని’ అని ప్రజలు ప్రేమగా పిలుచుకున్నారు. అసలు సిసలు ప్రజా నాయకుడైన  కాకాని వెంకటరత్నం చనిపోయి ఐదు దశాబ్దాలకు పైగా అయినా ప్రజలు ఆయనను గుర్తుపెట్టుకోవడమే కాక, ఆయన జ్ఞాపకార్థం కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో వ్యవసాయమంత్రిగా చేసిన కాలంలో ఆయన స్థాపించిన పాల సేకరణ కేంద్రాలు, శీతలీకరణ కేంద్రాలు, జిల్లా పాడి పరిశ్రమ కేంద్రాలు గ్రామీణ రైతాంగ ఆర్థిక స్వావలంబనకు ఎంతగానో దోహదపడ్డాయి. తద్వారా గ్రామీణ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించాయి. అందుకే కాకానిని చాలా మంది ‘ఆంధ్రా కురియన్‌’గా పిలుచుకుంటారు. కుల మతాలకి అతీతంగా ఆలోచించటం, కార్యక్రమాలు చేపట్టటం ఆయన నైజం. ముఖ్యంగా బీద కుటుంబాల నుంచి వచ్చిన వాళ్లంటే కాకానికి ప్రత్యేక అభిమానం. స్థానిక పనుల కోసం ప్రభుత్వం మీద ప్రజలు ఆధారపడకూడదనీ, స్థానికంగా ప్రజలు సహకరించుకుంటే ప్రజాస్వామ్యం బలపడుతుందని కాకాని ప్రచారం చేసేవారు. ఆయనది ఎలిమెంటరీ స్కూల్ చదువే, అయినా ఎన్నో వేల మంది పెద్ద చదువులకి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో కారకుడయ్యారు. ప్రతి గ్రామంలోనూ గ్రామస్తులే కొద్దో గొప్పో విద్యాలయాల అభివృద్ధికి తోడ్పడే విధంగా కృషి చేశారు. వ్యవసాయ శాఖ, పాడి పరిశ్రమ మంత్రిగా కాకాని ఆలోచనలు, తీసుకున్న నిర్ణయాలు అమోఘం. గ్రామాల్లో పేదరికాన్ని, ముఖ్యంగా ఒంటరి మహిళ ఆర్థిక స్థితిగతులు మారాలంటే, వాళ్ళ ఆదాయాన్ని పెంచే మార్గాల కోసం పాడి, గుడ్డు ముఖ్యమని గమనించి, ఎన్నో చర్యలు తీసుకున్నారు. పాడి పరిశ్రమలో మధ్యవర్తుల బెడద పోతేగాని బీదరికాన్ని నిర్మూలించలేమని నిర్ణయించుకున్నారు.  గ్రామాల్లో ఆయన సాధించిన విజయాలు చూసి జమీందార్లు, ఎంతోమంది భూ కామందులు కలిసి కాకానికి వ్యతిరేకంగా కుట్రలు పన్నారు, ఆయన శాసనసభ్యుడిగా ఎన్నిక కాకుండా ప్రయత్నించారు. అయినా కాకాని ప్రజానాయకుడుగా పేరొందారు. తమ సిద్ధాంతాలని వ్యతిరేకించే కాకాని వెంకటరత్నం, రైతు కూలీలకు   నాయకుడు అవ్వడం కమ్యూనిస్టులకి నచ్చలేదు. వాళ్ళ పార్టీ భవిష్యత్తు, మనుగడకే ఆయన ముప్పు అని భావించారు. కమ్యూనిస్టు పార్టీ కాకాని మీద కత్తి కట్టి, ఆయన్ని చంపే ప్రయత్నాలు కూడా చేసింది. అయితే వాళ్లెవరూ కాకాని లంచగొండి అని శంకించకపోగా, ఆయన కార్యదీక్ష, క్రమశిక్షణను మెచ్చుకున్న వాళ్లే. కాకాని వెంకటరత్నం రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా ఉంటూ కూడా 1972లో ‘జై ఆంధ్ర’ ఉద్యమానికి నాయకత్వం వహించి, ప్రత్యేక రాష్ట్రం వస్తే ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో, యువకులకు ఏ విధంగా అవకాశాలు వస్తాయో చెప్పి, ఉద్యమాన్ని ఉధృత స్థితికి తీసుకువెళ్లారు. ఉద్యమాన్ని అణగదొక్కే ప్రయత్నాల్ని, వ్యతిరేకిస్తూ గన్నవరం విమానాశ్రమంలో ముఖ్యమంత్రి పీవీ నరసింహారావు విమానం ఆగకుండా చేసినప్పుడు యువకుల మీద పోలీసులు జరిపిన కాల్పులను తట్టుకోలేక కాకాని చివరకు ప్రాణాలే విడిచారు. కాకాని ఆశించిన ప్రత్యేక రాష్ట్రం 40 సంవత్సరాల తర్వాత వచ్చింది. ప్రత్యేక రాష్ట్రం వచ్చి పది సంవత్సరాలయినా ఇంతవరకు ఆయన జ్ఞాపకార్థం ఏ అభివృద్ధి కార్యక్రమం చేపట్టలేదు. ఆయన స్ఫూర్తి, స్మారణ చిహ్నం ఏర్పాటు చేయలేదు. అంతకు ముందెప్పుడో పెట్టిన కాకాని విగ్రహాన్ని కూడా తొలగించారు. విజయవాడలో ఆ సర్కిల్‌ని కాకాని పేరుతో కాకుండా  బెంజ్‌ సర్కిల్‌  అనే పిలుస్తున్నారు. ఎట్టకేలకు కాకాని విగ్రహాన్ని బ్రిడ్జి కింద అతి కష్టం మీద మళ్లీ పెట్టారు, అదీ జిల్లా ప్రముఖుల పట్టుదల వల్ల.  కనీసం ఈ 54వ వర్ధంతికైనా కాకాని వెంకటరత్నం పేరును   అమరావతి అవుటర్‌ రింగ్ రోడ్డు కు   పెట్టి ఆ మహనీయుడ్ని గౌరవించాలని అందరూ  కోరుకుంటున్నారు.

ఎన్టీఆర్ కు పాతికేళ్లుగా వారం వారం నివాళులు!

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావుకు ఓ అసోసియేషన్ గత పాతికేళ్లుగా ప్రతి గురువారం ఘనంగా నివాళులర్పిస్తోంది. ఈ అరుదైన  ఘనతను సొంతం చేసుకున్న అసోసియేషన్ పేరు పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్. తెలుగు జాతి గౌరవాన్ని ప్రపంచానికి చాటిన నందమూరి తారకరామారావు విగ్రహానికి ఈ సంస్థ గత పాతికేళ్లుగా క్రమం తప్పకుండా ప్రతి గురువారం ఉదయం ఎనిమిదిన్న గంటలకు నివాళులర్పించడాన్ని ఒక ఆనవాయితీగా పాటిస్తూ వస్తోంది.   ఈ క్రమంలో ఈ గురువారం (డిసెంబర్ 25)తో ఈ కార్యక్రమానికి 25 ఏళ్లు నిండాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని అసోసియేషన్ రజతోత్సవ వేడుకలను నిర్వహించింది.  ఎన్టీఆర్ అంటే నటన, రాజకీయాలు మాత్రమే కాదని.. తెలుగు వారి ఆత్మగౌరవానికి ప్రతీక అని పేర్కొంది. తెలుగు జాతి ఆత్మగౌరవ ప్రతీక అయిన శకపురుషుడు నందమూరి తారకరామారావుకు   గత పాతికేళ్లుగా ప్రతి గురువారం  గుంటూరులోని  బస్టాండ్ సెంటర్‌లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రతి గురువారం నివాళులు అర్పిస్తూ పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ అరుదైన ఘనతన సొంతం చేసుకుంది.  పరిస్థితులు ఎలా ఉన్నా గత పాతికేళ్లుగా ఒక్క గురువారం కూడా మిస్ కాకుండా ఈ కార్యక్రమం కొనసాగించామని అసోసియేషన్ ప్రతినిథులు తెలిపారు.  ఇక  ఈ నివాళుల కార్యక్రమం పాతికేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా  ఎన్టీఆర్ విగ్రహానికి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఎన్టీఆర్‌కు ఘనంగా నివాళి అర్పించారు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర, సినీ ప్రస్థానం, రాజకీయ సేవలను అభిమానులు ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఆయన తెలుగు జాతికి చేసిన సేవలను గుర్తుచేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు ఎన్టీఆర్ అభిమానులు మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ మా గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడని పేర్కొన్నారు. ఆయన ఆశయాలను తరతరాలకు తెలియజేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతు న్నామన్నారు. రాబోయే రోజుల్లో కూడా ఇదే విధంగా ప్రతి గురువారం ఎన్టీఆర్‌కు నివాళులు అర్పిస్తామని చెప్పారు.  గుంటూరులో ఎన్టీఆర్ అభిమాన సంఘానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1969లో గుంటూరు రైలుపేట ప్రాంతంలో ఎన్టీఆర్ అభిమాన సంఘం ఏర్పడింది. అప్పటి నుంచి ఎన్టీఆర్ సినిమాలు, రాజకీయ జీవితానికి అభిమానులు అండగా నిలుస్తూ వస్తున్నారు. ఆ అభిమాన సంఘానికి కొనసాగింపుగానే పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ ఏర్పడింది. సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటోంది. రజతోత్సవ వేడుకల సందర్భంగా  ఎన్టీఆర్ ఆశయాలను యువతకు చేరువ చేయడమే సంకల్పమని అసోసియేషన్ ప్రతినిథులు తెలిపారు.  భవిష్యత్తులోనూ ప్రతి గురువారం ఇదే విధంగా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పిస్తామన్నారు. అలాగే స్వచ్ఛంద కార్యక్రమాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంతో గుంటూరు బస్టాండ్ సెంటర్ ప్రాంతం అభిమానులతో కళకళలాడింది. ఎన్టీఆర్ నినాదాలు, పుష్పవర్షం, జై ఎన్టీఆర్ అంటూ మార్మోగిన నినాదాలతో అక్కడి వాతావరణం ఉత్సాహంగా మారింది. ఈ కార్యక్రమం చూసిన పలువురు ప్రయాణికులు కూడా ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.

ఫోన్‌ ట్యాపింగ్ కేసు.. నిదితులందరినీ ఒకేసారి విచారణ

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తులో  కీలక పరిణామాలు చోటుచేసుకు న్నాయి. ఈ కేసులో కీలక నిందితుడు ప్రభాకర్ రావు కస్టడీ విచారణ గురువారం (డిసెంబర్ 25)తో ముగిసింది. ఈ నేపథ్యంలో  సిట్ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ తరుణంలోనే ఈ కేసును విచారిస్తున్న ప్రత్యేక దర్యాప్తు బృందం  ఈ కేసుకు సంబంధించిన  నిందితులందరినీ జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి ఒకేసారి విచారించారు. ఈ కేసులో నిందితులైన ప్రణీత్‌రావు, భుజంగరావు, రాధాకిషన్‌ రావుతో పాటు తిరుపతన్న ను విచారణకు హాజరు కావాలని సిట్‌ అధికారులు ఆదేశించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఇంటెలిజెన్స్‌ అధికారి ప్రభాకర్‌రావు 14 రోజుల కస్టడీ గురువారం (డిసెంబర్ 24) ముగిసింది. ఈ  నేపథ్యంలో ఆయనను ఇతర నిందితులతో కలిపి   సిట్ విచారించింది.  కస్టడీ సమయంలో అడిగిన మెజార్టీ ప్రశ్నలకు ప్రభాక ర్‌రావు బదులు చెప్పలేదని సమాచారం. అయితే విచారణలో మాజీ ఇంటె లిజెన్స్‌ చీఫ్‌లు నవీన్‌చంద్‌, అనిల్‌ పేర్లను ఆయన  ప్రస్తావించి నట్లు తెలుస్తోంది. అలాగే సుమారు ఆరు వేల  ఫోన్‌ నంబర్లు ఉన్న పెన్‌డ్రైవ్‌ అంశంపై ప్రభాకర్‌రావు నోరు మెదపలేదని అధికారులు తెలిపారు. మాజీ మంత్రి హరీష్‌ రావు తనతో మావోయిస్టుల అంశంపైనే మాట్లాడినట్లు ప్రభాకర్‌రావు విచారణలో వివరణ ఇచ్చినట్లు సమాచారం. అయితే తనకు రీఎంప్లాయిమెంట్‌ ఎలా మంజూరయ్యిందన్న విషయంపై మాత్రం ప్రభాకర్‌రావు మౌనం పాటించినట్లు దర్యాప్తు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో దర్యాప్తు  కీలక దశకు చేరిందని, 14రోజుల కస్టడీ విచారణలో ప్రభాకర్ రావు ఏం చెప్పారు? ఎటువంటి విషయాలు బయటపడ్డాయన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, అడిషనల్ ఎస్పీ తిరుపతన్న, భుజంగారావులను విచారించిన సిట్ ఈ కేసుకు సంబంధించిన కీలక అంశాలపై సిట్  లోతుగా ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది.  ఇదే కేసులో ఓ ఛానల్ ఎండి శ్రవణ్ రావును కూడా సిట్ అధికారులు విచారించారు. దర్యాప్తు పరిధిని విస్తరిస్తూ, వివిధ కోణాల నుంచి సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. ఇక విచారణకు హాజరైన డీఎస్పీ ప్రణీత్ రావును సిట్ అధికారులు సుదీర్ఘంగా ప్రశ్నించారు. రెండు రోజుల క్రితమే ప్రణీత్ రావు, ప్రభాకర్ రావును కలిసి విచారించిన సిట్, తాజాగా గురువారం (డిసెంబర్ 24) ప్రణీత్ రావును సుమారు ఎనిమిది గంటల పాటు విచారించింది. ఈ విచారణలతో కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.  

ఒడిశాలో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోల మృతి

ఒడిశాలోభద్రతా బలగాలు–మావోయిస్టుల మధ్య జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు మావోలు మరణించారు. కంధమల్ జిల్లా బెల్ఘర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుమ్మా అడవుల్లో  మావోయిస్టుల సంచారంపై అందిన విశ్వసనీయ సమాచారం మేరకు  ఒడిశా స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌ఓజీ) బలగాలు  గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో  ఎదురుపడిన మావోయిస్టులు భద్రతా సిబ్బందిపై కాల్పులకు దిగడంతో ఎదురుకాల్పులు జరగాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. సంఘటనాస్థలి నుంచి మావోయిస్టుల మృతదేహాలతో పాటు ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. మృతులలో ఒకరిని  ఏసీఎం బారి అలియాస్ రాకేష్ రాయగడగా గుర్తించారు. మరో మృతుడు ప్లాటూన్ సభ్యుడు  అమృత్‌గా   గుర్తించారు. వీరిద్దరూ జిల్లాలో పలు నక్సల్ కార్యకలాపాల్లో కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. ప్రస్తుతం గుమ్మా అడవుల ప్రాంతంలో భద్రతా బలగాలు విస్తృతంగా కూంబింగ్ ఆపరేషన్ కొనసా గిస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తంగా వ్యవహరి స్తున్నారు.