జగన్ నాయకుడో? దద్దమ్మో వైసీపీ శ్రేణులు తేల్చుకోవాలి
posted on Sep 11, 2020 @ 4:44PM
వైసీపీ నేత, ఏపీ మంత్రి కొడాలి నాని ప్రతిపక్ష టీడీపీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల 'పెద్ద బిచ్చగాడు, అడ్డ గాడిద, ఉమక్క, నాలంటోడైతే లారీతో తొక్కిస్తాడు' అంటూ మాజీ సీఎం చంద్రబాబు మరియు మాజీ మంత్రులపై నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నాని వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా TNSF మాజీ అధ్యక్షుడు బ్రహ్మం తీవ్రస్థాయిలో విరుచుకుపడుతూ.. మంత్రి ఉపయోగించిన భాషతోనే సమాధానం చెప్పారు. దీంతో బ్రహ్మంపై అక్రమకేసులు పెట్టి వేదిస్తున్నారు అంటూ టీడీపీ నేత నారా లోకేష్ అధికార పార్టీపై ట్విట్టర్ వేదికగా విరుచుకుపడ్డారు. జగన్ నాయకుడో? దద్దమ్మో వైసీపీ శ్రేణులు తేల్చుకోవాలి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
రాష్ట్ర ప్రజలకు సేవ చెయ్యాల్సిన ఒక మంత్రితో ప్రతిపక్ష నాయకుడ్ని బూతులు తిట్టించి ఆనంద పడిన రోజు జగన్ రెడ్డి గారికి చట్టాలు, మర్యాద, సాంప్రదాయాలు గుర్తురాలేదా? అని లోకేష్ ప్రశ్నించారు. రాజారెడ్డి రాజ్యాంగంలో బూతులు తిట్టిన వైకాపా నాయకుల పై చర్యలు ఉండవు అని రాసుకున్నారా? అని నిలదీశారు.
మేము కూడా తిట్టగలం కానీ మా పార్టీ సంస్కృతి అది కాదు అని చెప్పినందుకు బ్రహ్మంపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తారా? అని మండిపడ్డారు. బ్రహ్మంకి పార్టీ అండగా ఉంటుందని అన్నారు. మా కార్యకర్త విమర్శకి సమాధానం చెప్పే దమ్ములేక కేసులు పెట్టే జగన్ నాయకుడో? దద్దమ్మో వైకాపా శ్రేణులు తేల్చుకోవాలి అని లోకేష్ వ్యాఖ్యానించారు.