బిర్యానీ పొట్లంలో ముక్కుపుడకలు.. నంద్యాలలో ఓటర్లకు గాలం
posted on Mar 10, 2021 @ 9:53AM
ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు చివరి నిమిషం వరకు ప్రయత్నిస్తున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా కొందరు అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారు. ఓటర్లకు గాలం వేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కర్నూల్ జిల్లా నంద్యాలలోని 12వ వార్డు నుంచి బరిలోకి దిగిన ఓ స్వతంత్ర అభ్యర్థి ఓటర్లకు ముక్కుపుడకలు పంపిణీ చేస్తూ దొరికిపోయాడు.
ఖండే శ్యామసుందర్లాల్ అనే వ్యక్తి స్వతంత్ర అభ్యర్థిగా 12వ వార్డు నుంచి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఓటర్లను ఆకర్షించి ఓట్లు పొందడానికి బిర్యానీ ప్యాకెట్లలో ముక్కుపుడకలు ఉంచి పంచుతూ దొరికిపోయాడు. కర్ణాటక నుంచి కొందరిని కిరాయికి పిలిపించుకున్న శ్యామసుందర్ నిన్న బిర్యానీ ప్యాకెట్లలో ముక్కుపుడకలు ఉంచి వారితో పంపిణీ చేయించాడు.
విషయం పోలీసులకు తెలియడంతో.. వారు రంగంలోకి దిగి బిర్యానీ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్న రాఘవేంద్రస్వామి, రవికరణ్, మోహన్లను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నాలుగు బైక్లు, రూ. 55 వేల నగదు, 23 బంగారు ముక్కుపుడకలు, బిర్యానీ పొట్లాలను స్వాధీనం చేసుకున్నారు. స్వతంత్ర అభ్యర్థి శ్యామసుందర్తోపాటు మరో ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.