పట్టాలెక్కుతున్న బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ ! భూసేకరణకు మహా సర్కార్ లైన్ క్లియర్
posted on Dec 28, 2020 @ 10:58AM
ప్రధాని నరేంద్ర మోడీ డ్రీం ప్రాజెక్ట్ బుల్లెట్ ట్రైన్ నిర్మాణ పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. దేశంలో మొదటగా ముంబై-అహ్మదాబాద్ల మధ్య 508కిలోమీటర్ల పొడవునా బుల్లెట్ ప్రాజెక్టు కోసం రైల్వే లైన్ నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్ట్ 2023నాటికల్లా పూర్తి చేయాల్సి ఉంది. అయితే మహారాష్ట్రలోని పల్ఘర్ వంటి కొన్ని ప్రాంతాలలో ప్రజలు మరియు రాజకీయ పార్టీల వ్యతిరేకత కారణంగా భూసేకరణ సమస్యగా మారింది. మహారాష్ట్రలోని మహా-వికాస్ అఘాడి కూటమి ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తోంది. దీంతో ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. గుజరాత్లో మాత్రం ప్రాజెక్టులు ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. దీంతో బుల్లెట్ ప్రాజెక్ట్ను తొలిఫేజ్ కింద అహ్మదాబాద్ నుంచి వాపి వరకు కారిడార్ నిర్మాణ పనులు చేపట్టేందుకు రైల్వే మంత్రిత్వ శాఖ కసరత్తు చేస్తోంది. భూసేకరణ సమస్యతో నిలిచిపోయిన ప్రాజెక్టు పనులను దశల వారీగా ప్రారంభిస్తున్నట్లు రైల్వే బోర్డు చైర్మన్ వినోద్ కుమార్ యాదవ్ తెలిపారు.
భూసేకరణకు ఇంతకాలం సహకరించని మహారాష్ట్ర సర్కార్ కూడా క్రమంగా దిగొస్తున్నట్లు కనిపిస్తోంది. రాబోయే నాలుగు నెలల్లోనే 80% భూసేకరణ పనులు పూర్తిచేసేలా మహారాష్ట్ర ప్రభుత్వం.., కేంద్రానికి హామీ ఇచ్చినట్లు వీకే యాదవ్ తెలిపారు. ఆ సమస్య తీరగానే మహారాష్ట్రలోనూ బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు పనులు ప్రారంభిస్తామని ఆయన చెప్పారు. సుమారు లక్షా ఎనిమిదివేల కోట్ల రూపాయల బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు జపాన్ ప్రభుత్వ సాంకేతిక, ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. దేశంలోనే తొలి అత్యంత భారీ బుల్లెట్ రైలు మార్గం నిర్మాణం కోసం జాతీయ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ ఎల్ అండ్ టీ మధ్య కీలక ఒప్పందం కుదుర్చుకొని దేశంలోనే అతిపెద్ద సివిల్ కాంట్రాక్ట్గా ఇది రికార్డ్ సృష్టించింది.