ప్రళయం రాబోతోంది.. జగన్ సర్కార్ కి మోత్కుపల్లి హెచ్చరిక
posted on Jul 28, 2020 @ 10:23AM
టీడీపీలో సుదీర్ఘకాలం పనిచేసి బీజేపీలో చేరిన తెలంగాణకు చెందిన సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు ఏపీలోని జగన్ సర్కార్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వంలో దళితులపై అమానుషమైన దాడులు జరుగుతున్నాయని, ఇది కచ్చితంగా వైసీపీ నేతలు చేస్తున్న అరాచకమని ప్రత్యక్షంగా తెలుస్తోందని అన్నారు.
దళిత డాక్టర్ ను వేధించారు, కనీసం రిగ్రెట్ లేదు, నడిరోడ్డు మీద గుండు గీశారు. ఆయనకు ఏం న్యాయం చేసింది ప్రభుత్వం? అని ప్రశ్నించారు. మరో దళిత డాక్టర్ అనితారాణిని దారుణంగా వేధించారని మండిపడ్డారు. ప్రభుత్వ పెద్దలే అందులో ఇన్వాల్వ్ అయ్యారని ఆరోపించారు. మాస్కు పెట్టుకోలేదని దళిత యువకుడిని దారుణంగా కొడితే ఆ యువకుడు దెబ్బలతో ఆస్పత్రి పాలై ప్రాణాలు వదిలాడని అన్నారు. దళిత ఆడపిల్లను గ్యాంగ్ రేపి చేసి ఆ అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. దళిత యువకుడు వరప్రసాద్ వైసీపీ నేతల ఇసుక అక్రమ తరలింపును ప్రశ్నిస్తే గుండుగీయించారని మండిపడ్డారు. ఈ సంఘటనలో పోలీసులు మీద చర్యలు తీసుకుంటారా? వైసీపీ నేతలను, స్థానిక ఎమ్మెల్యేని వదిలేస్తారా? ఎంత అన్యాయం ఇది అని జగన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా దళితులు మౌనంగా ఉన్నారంటే ప్రళయం రాబోతోందని అర్థం చేసుకోవాలని మోత్కుపల్లి హెచ్చరించారు.
జగన్ ను గెలిపించమని కోరానని గుర్తుచేసారు. దళితులు అయిన మాలమాదిగలు ముందుండి జగన్ కి ఓట్లేసి గెలిపించారు. కానీ జగన్ అలాంటి వారిని అణచివేస్తున్నారు. ఓట్లేసే దాకా ఒక ధోరణి, గెలిచాక ఇంకో ధోరణి అవలంభిస్తారా? అని ప్రశ్నించారు. వీటన్నింటి మీద విచారం వ్యక్తంచేసి, విచారణ జరిపించి బాధ్యులైన వారిని శిక్షిస్తేనే బాధితులకు న్యాయం జరిగినట్లు. లేకపోతే భవిష్యత్తులో జగన్ ఉపద్రవాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అని మోత్కుపల్లి హెచ్చరించారు.
కాగా, 2019 ఎన్నికలకు ముందు జగన్ ని గెలిపించాలని ఏపీ ప్రజలను మోత్కుపల్లి కోరిన సంగతి తెలిసిందే. టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేశారు. చంద్రబాబు దళితులకు అన్యాయం చేశారని, ఆయన ఓడిపోయి జగన్ గెలవాలని తిరుపతి వెళ్లి మరీ వెంకన్నకి మొక్కారు. మోత్కుపల్లి కోరుకున్నట్టుగానే ఏపీలో జగన్ సీఎం అయ్యారు. కానీ, ఇప్పుడు ఆయన పాలనలోనే దళితులపై దాడులు జరుగుతున్నాయని బాధపడుతున్నారు. ఒకప్పుడు జగన్ గెలవాలని బలంగా కోరుకున్న వ్యక్తే.. ఇప్పుడు జగన్ పాలనపై విమర్శలు చేయడం చర్చనీయాంశంగా మారింది.