స్వాతంత్ర్య స్ఫూర్తి.. దేశానికి దీప్తి: మోడీ ప్రసంగం
posted on Aug 15, 2014 9:13AM
స్వాతంత్ర్య స్ఫూర్తితో దేశాన్ని ప్రగతిపథంలోకి కలసికట్టుగా తీసుకెళ్దామని ప్రధాని నరేంద్రమోడీ దేశ ప్రజలకు పిలుపు ఇచ్చారు. 68వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి మోడీ దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. ‘పార్టీకన్నా దేశమే మిన్న.. అందరం కలసి పనిచేద్దాం. అన్ని పార్టీలు కలసి దేశాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. నేతలు, పాలకులు దేశ నిర్మాతలు కాదు.. రైతులు, కార్మికులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలే దేశ నిర్మాతలని మోడీ అన్నారు. సంఖ్యాబలంతో కాకుండా ఏకాభిప్రాయంతోనే ముందుకు వెళ్ళాలని చెప్పారు. కలసి నడుద్దాం.. కలసి ఆలోచిద్దాం.. కలసి ముందుకు నడుద్దాం... ఐకమత్యంగా దేశాభివృద్ధికి పాటుపడదామని పిలుపు ఇచ్చారు. ప్రతిక్షణం దేశసేవలో ఎలా నిమగ్నమయ్యామన్నదే ముఖ్యం. దేశ హితం కోసం మనం నిరంతరం పనిచేయాలి. దేశాభివృద్ధి మన బాధ్యత మాత్రమే కాదు.. మన పూర్వికుల కల. మన పూర్వికుల కలను నిజం చేయాల్సిన బాధ్యత మన మీద వుంది. దేశానికి ఏం చేశామని ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం వుంది’’ అన్నారు. భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలలో నరేంద్రమోడీతోపాటు కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, వెంకయ్య నాయుడు, ప్రకాష్ జవదేకర్, నిర్మలా సీతారామన్, ఎల్.కె.అద్వానీ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.