పబ్లిక్ గా మోడీ.. సీక్రెట్ గా రాహుల్
posted on Sep 23, 2015 @ 5:59PM
బీహార్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నేతలందరూ బిజీగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇద్దరు ముఖ్య నేతలు పర్యటనలకు వెళ్లడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అది కూడా ఇద్దరు ఒకే దేశానికి పర్యటనకు వెళ్లడం గమనార్హం. అయితే ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన గురించి వివరాలు తెలిసినా రాహుల్ గాంధీ పర్యటన గురించిన వివరాలు కాంగ్రెస్ పార్టీ గోప్యంగా ఉంచుతోందని అర్ధమవుతోంది.
ప్రధాని మోడీ ఐక్యరాజ్యసమితి జనరల్ సమావేశాల్లో పాల్గొనడానికి పదిరోజుల పాటు అమెరికా పర్యటనకు వెళ్లారు. అయితే రాహుల్ ఎందుకు పర్యటనకు వెళ్లారబ్బా అని అందరికి సందేహాలు వస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తమ ప్రతినిధులతో ప్రకటన చేయించింది. రాహుల్ కొలరాడాలో జరగనున్నసమావేశాల్లో పాల్గొనడానికి వెళ్లారని ప్రతినిధి సుర్జేవా చెప్పారు. అయితే అవి ఏసమావేశాలు.. అక్కడ రాహుల్ ఎన్నిరోజులు ఉంటారని మాత్రం చెప్పలేదు. అయితే గమ్మత్తైన విషయం ఏంటంటే ఆయం ఆ మాట చెప్పిన కొద్దిగంటలకే రాహుల్ గాంధీ తన వ్యక్తిగత పనిమీద విదేశాలకు వెళ్లారని త్వరలో తిరిగి వచ్చి బీహార్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని ఆయనే చెప్పడం గమనార్హం. మొత్తానికి రాహుల్ గాంధీ పర్యటనను కాంగ్రెస్ నేతలు బయటపెట్టడంలేదని అర్ధమవుతోంది.