గంజాయి డాన్‌ నీతుబాయి ఇంటిపై పోలీసుల దాడి

 

నానక్ రాంగూడలో నివాసం ఉంటున్న నీతుబాయి గంజాయి వ్యాపారం చేయడంలో కింగ్... ఇప్పటికే ఈ లేడీ డాన్ ను పోలీసులు పట్టుకొని జైల్లో పెట్టారు. అయినా కూడా వీరి ప్రవర్తనలో మార్పు రావడం లేదు.. మళ్లీ గంజాయి వ్యాపారాన్ని యదేచ్ఛగా కొనసాగిస్తున్నారు... అంతే కాదండోయ్ ఈ లేడీ డాన్ కుటుంబ సభ్యులు గంజాయితో పాటు మద్యం కూడా విక్రయాలు చేస్తూ... డబ్బులు సంపాదిస్తున్నారు.

అయితే పోలీసులు గంజాయి విక్రయాలు చేసే ప్రాంతాలపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే నానక్‌ రాంగూడలో ఉన్న లేడీ డాన్ నీతూ బాయ్ ఇంట్లో గంజాయి విక్రయాలు జరుపుతున్నట్లుగా విశ్వసనీయ సమాచారం రావడంతో ఎస్టీఎఫ్‌ బీ-టీమ్‌ పోలీసులు వెళ్ళి ప్రత్యేక దాడులు నిర్వహించారు. టీమ్‌ లీడర్‌ ప్రదీప్‌రావు, సీఐ బిక్షారెడ్డి, ఎస్సై బాలరాజు సిబ్బందితో కలిసి నీతు బాయి ఇంటిపై ఆకస్మిక సోదాలు చేశారు. 

ఈ దాడుల్లో 786 గ్రాముల గంజాయి, 110 బీరు బాటిల్స్, బ్రీజర్‌, ఒక బైక్‌, అలాగే గంజాయి విక్రయాల ద్వారా వచ్చిన రూ. 60,890 నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో గోవింద్, దుర్గెష్, నీతుబాయి కుమారుడు దుర్గ ప్రసాద్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

వీరు ఒరిస్సా నుండి గంజాయిని వివిధ పద్ధతుల్లో హైదరాబాదుకు తీసుకువచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు నిందితులు విచారణలో ఒప్పుకున్నారని టీమ్‌ లీడర్‌ ప్రదీప్‌రావు తెలిపారు. పట్టుబడిన నిందితులు, స్వాధీనం చేసిన గంజాయి, మద్యం, నగదును షేర్లింగంపల్లి ఎక్సైజ్‌ స్టేషన్‌ అధికారులకు అప్పగించి నట్లు పోలీసులు వెల్లడించారు.

భారత్-రష్యా మధ్య కీలక ఒప్పందాలు

  రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్ పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య పలు కీలక ఒప్పందాలు కుదిరాయి. వైద్య ఆరోగ్య రంగాల్లో ఆహార భద్రత,లేబర్‌ మైగ్రేషన్‌ మొబిలిటీ, పోర్టులు, నౌకాయానంపై ఒప్పందాలపై సంతకాలు చేశాయి. ఈ ఒప్పందాలు ప్రధాని మోదీ, పుతిన్ సమక్షంలో నిర్వహించారు. వీటితో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కానున్నాయి.శుక్రవారం ఉదయం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో పుతిన్, మోదీ భేటీ అయ్యారు.  రెండు రోజుల పర్యటన కోసం గురువారమే భారత్‌కు చేరుకున్న పుతిన్‌కు ప్రధాని మోదీ ఆత్మీయ ఆలింగనంతో ఘనస్వాగతం పలికారు. భారత పర్యటనకు విచ్చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు శుక్రవారం ఢిల్లీలో ఘన స్వాగతం లభించింది. పర్యటనలో భాగంగా ఆయన రాజ్‌ఘాట్‌ను సందర్శించి జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులర్పించారు.  గాంధీ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ఆయన శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పుతిన్ వెంట కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ ఉన్నారు. అనంతరం పుతిన్ అక్కడి సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు. అంతకుముందు రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో పుతిన్‌కు సంప్రదాయబద్ధంగా గౌరవ వందనంతో స్వాగతం పలికారు. ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన్ను సాదరంగా ఆహ్వానించారు. 

పుష్ప సినిమా తరహాలో భారీగా నగదు రవాణా

  సికింద్రాబాద్‌లో ఓ ముఠా సినిమా ‘పుష్ప’ స్టైల్లో పథకం రచించి హవాలా డబ్బు రవాణా చేయడానికి ప్రయత్నాలు చేశారు. కానీ పోలీసులు ఇచ్చిన ట్విస్ట్ తో షాక్ అయ్యారు. ఈరోజు శుక్రవారం తెల్లవారుజామున అనుమానాస్పదంగా వెళ్లుతున్న కారును ఆపడానికి ప్రయత్నించగా, డ్రైవర్ వేగం పెంచి... కారుతో సహా ముందుకు దూసుకుపోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు సుమారు 15 కిలోమీటర్ల వరకు కారును చేజ్ చేసి.. చివరకు వారిని అదుపులోకి తీసుకున్నారు.  అనంతరం పోలీసులు కారు మొత్తం తనిఖీలు చేశారు.  మొదట్లో పెద్దగా ఏమీ కనిపించలేదు. దీంతో పోలీసులకు అనుమానం వచ్చి పూర్తిగా తనిఖీ చేస్తే అసలు విషయం బయటపడింది. కారు డిక్కీ, టైర్ల లోపల, బనెట్ కింద, సీట్లలో వేరువేరు రహస్య గుహలు ఏర్పాటు చేసి, అందులో భారీ మొత్తంలో డబ్బును దాచి పెట్టిన విధానాన్ని చూసి పోలీసులు ఖంగుతిన్నారు.  అనంతరం పోలీసులు వాహనాన్ని పూర్తిగా ఓపెన్ చేయించి తనిఖీ చేయగా, వివిధ బండిల్స్‌గా దాచిన మొత్తం ₹4 కోట్ల హవాలా నగదు బయటపడింది. డబ్బు మూలం, గమ్యం, ముఠా నెట్‌వర్క్ వివరాల కోసం పోలీసులు నిందితులను ప్రశ్నిస్తున్నారు. సినిమా రీతిలో డబ్బు రవాణా – పోలీసుల పరుగుపరుగుల చేజ్ – చివరకు భారీ నగదు స్వాధీనం… సికింద్రాబాద్‌లో ఈ ఘటన పెద్ద కలకలం రేపుతోంది.  

విమానాల రద్దు సమస్యకు చెక్.. ఆ నిబంధనను ఉపసంహరణ

ఇటీవలి కాలంలో  ఇండిగో విమానాలు వరుసగా రద్దు  కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విమానయాన కార్యకలాపాలు నిలకడగా కొనసాగేందుకు పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకున్నది. పలు విమానయాన సంస్థల విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకున్న డీజీసీఏ   పైలట్ల విధులపై విధించిన ఇటీవల విధించిన ఆంక్షలను సడలించింది.  ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. మునుపటి మార్గదర్శకాల్లో పైలట్లకు తప్పనిసరిగా  వారపు విశ్రాంతికి బదులుగా సెలవు మంజూరు చేయరాదు అన్న కండీషన్ ను ప్రత్యేకంగా ప్రస్తావించింది.  అయితే ప్రస్తుతం కొనసాగుతున్న  ఆ నిబంధనను సమీక్షించి  ఉపసంహరించింది. ఈ నిర్ణయంతో ఇండిగో సహా పలు విమానయాన సంస్థలకు ఉపశమనం లభించే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. పైలట్ల వారాంత విశ్రాంతి నిబంధన సడలించడం వల్ల డ్యూటీ రోస్టర్లను సులభంగా నిర్వహించుకోవచ్చని, దీంతో విమాన రద్దుల సంఖ్య గణనీయంగా తగ్గుతుందని అధికారులు అంటున్నారు.  మరోవైపు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి వివిధ రాష్ట్రాలకు వెళ్ళాల్సిన 84 ఇండిగో విమానాలు  క్యా న్సెల్ అయ్యాయి. వివిధ రాష్ట్రాల నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు రావాల్సిన 71 ఇండిగో విమానాలు రద్దయ్యాయి.ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం...శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు రావాల్సిన, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి వెళ్లాల్సిన మొత్తం 155 ఇండిగో విమానాలు రద్దు అవ్వడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

విమానానికి బాంబు బెదరింపు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో టెన్షన్ టెన్షన్

శంషాబాద్ విమానాశ్రయంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక వైపు పెద్ద సంఖ్యలో ఇండిగో విమా నాలు రద్దు అవుతుండటంతో ప్రయాణీకులు ఆందోళనకు దిగుతున్నారు. దీంతోనే విమానాశ్రయంలో నిన్న రాత్రి నుంచీ ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇక ఈ రోజు ఉదయం దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఇకే 526 విమానానికి బాంబు బెదరింపు మెయిల్ రావడంతో అప్రమత్తమైన అధికారులు వెంటనే విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానంలోనే కాకుండా, టెర్మినల్ లో కూడా తనిఖీలు నిర్వహించారు.  విమానాల రద్దుతో తీవ్ర అసహనంతో ఉన్న ప్రయాణీకులు ఈ తనిఖీల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలే ఓ వైపు విమానాల రద్దుపై ప్రయాణీకులు నిరసనలు, నినాదాలతో ఎయిర్ పోర్టు మార్మోగుతోంది. మరో వైపు  బోర్డింగ్ పాస్ గేట్ వద్ద బైఠాయించి పలువురు నిరసనకు దిగారు. మొత్తంగా విమానాశ్రయం అంతా కిటకిటలాడుతోంది. ప్రయాణీకులకు కూర్చునే స్థలలం కూడా లేక నానా ఇబ్బందులూ పడుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు ఉన్న కుటుంబాల అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే  ఈ సమయంలో టెర్మినల్ అంతటా ప్రయాణికులు భారీగా కిటకిటలాడు తున్నారు. కుర్చీలు లేకపోవడంతో పలువురు నేలపై కూర్చొని ఇబ్బందులు పడుతున్నారు. చిన్నపిల్లలు ఉన్న కుటుంబాలు తీవ్ర అసౌకర్యానికి గురవు తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భిగానే భద్రతా తనిఖీల వ్యవహారంలో  కొందరు ప్రయాణీకులు సిఐఎస్ఎఫ్ సిబ్బందితో వాగ్వాదానికి దిగారు.  ఇలా ఉండగా ఈ రోజు ఇప్పటి వరకూ   హైదరాబాదు నుంచి బయలుదేరాల్సిన 71 విమానాలు, రావాల్సిన 61 విమానాలు రద్దయినట్లు సమాచారం. దీంతో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వందలాది మంది ప్రయా ణికులు ఎయిర్‌పోర్ట్‌లో ఇరుక్కుపోయి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు ఎమిరేట్స్ విమానంలో ఉన్న ప్రయా ణికులందరినీ భద్రతా ప్రమాణాల ప్రకారం ప్రత్యేక ప్రాంతాలకు తరలించగా, విమానం మొత్తాన్ని బాంబ్ స్క్వాడ్ సూక్ష్మంగా పరిశీలించింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో  అదనపు సిబ్బందిని మోహరించారు. 

ముంబై విమానాశ్రయంలో గంజాయి పట్టివేత

ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా విదేశీ గంజాయి పట్టుబడింది. వివిధ విమానాల ద్వారా బ్యాంకాక్‌ నుండి  ముంబైకి చేరుకున్న స్మగ్లర్ల నుంచి   26 కోట్లు విలువ చేసే 26 కిలోల గంజాయిని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా మొత్తం 9 మందిని అరెస్టు చేశారు. వేరువేరు విమానాల ద్వారా బ్యాంకాక్ నుంచి ముంబై చేరుకున్న వీరు.. లగేజ్ బ్యాగులు, డ్రైఫ్రూట్స్ ప్యాకెట్లు, వ్యక్తిగత వస్తువులలో దాచి అక్రమంగా తీసుకువచ్చిన విదేశీ గంజాయి అధికారుల తనిఖీల్లో బయటపడింది.  దీంతో  ఈ 9 మందినీ అదుపులోనికి తీసుకుని కేసులు నమోదు చేశారు. వారి స్మగ్లింగ్ నెట్ వర్క్ పై దర్యాప్తు చేస్తున్నారు.  

శంషాబాద్ విమానా శ్రయంలో అయ్యప్పల ఆందోళన

హైదరాబాద్‌ శంషాబాద్‌ అంతర్జాతీయ విమానా శ్రయంలో  ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. హైదరాబాద్‌ నుంచి కొచ్చికి వెళ్లాల్సిన ఇండిగో విమానం 12 గంటలకు పైగా ఆలస్యం కావడంతో ఆ విమానంలో ప్రయాణించాల్సిన ఉన్న అయ్యప్ప భక్తులు తీవ్ర అసహనానికి గురయ్యారు.  గురువారం (డిసెంబర్ 4)  సాయంత్రం బయలు దేరాల్సిన ఈ విమానం శుక్రవారం (డిసెంబర్ 5) ఉదయానికి కూడా బయలుదేరకపోవడంతో వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  విమానం జాప్యంపై ఎన్నిసార్లు అడిగినా సరైన సమాధానం రాకపోవడంతో అయ్యప్ప స్వాములు ఎయిర్ పోర్టులో ఆందోళనకు దిగారు.    ఈ క్రమంలోనే స్వాములు  బోర్డింగ్ గేటు ముందు  బైఠాయించి నిరసన తెలియజేశారు.  తమ ప్రయాణానికి వెంటనే ప్రత్యామ్నాయ   ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.  గంటల తరబడి వేచిచూడాల్సి రావడం, సరైన సమాచారం ఇవ్వకపోవడం, అలాగే భోజనం–వసతి వంటి సౌకర్యాలు కూడా కల్పించకపోవడంపై అయ్యప్పస్వాములు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

కిడ్నీ రాకెట్ కేసు.. ఏ2 డాక్టర్ పార్థసారథి లొంగుబాటు

మదనపల్లి కిడ్నీ రాకెట్ కేసులో  కీలక పరిణామం చోటు  చేసుకుంది. ఈ కేసులో ఏ2గా ఉన్న డాక్టర్ పార్థసారథి రెడ్డి గురువారం మదనపల్లె కోర్టులో లొంగిపోయారు. బెంగళూరుకు చెందిన డాక్టర్ పార్థసారథి రెడ్డి కోసం గత కొంత కాలంగా పోలీసులు తీవ్రంగా గాలిస్తున్న సంగతి తలిసిందే. కాగా లొంగిపోయిన డాక్టర్ పార్థసారథి రెడ్డికి న్యామూర్తి 15 రోజుల రిమాండ్ విధించారు.    కిడ్నీ విక్రయం కోసం గత నెల 9న విశాఖకు చెందిన యమున  అనే యువతికి ఆపరేషన్ చేస్తుండగా ఆమె మరణించడంతో ఈ కిడ్నీ రాకెట్ వెలుగులోకి వచ్చింది.    విశాఖ జిల్లా ఆనందపురం మండలం బొడ్డపాలేనికి చెందిన సూరిబాబు భార్య యమున   కిడ్నీని గోవాకు చెందిన రంజన్‌నాయక్‌కు ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారు.  విశాఖపట్నం వాసులు పద్మ, సత్య మధ్యవర్తులుగా వ్యవహరించారు. ఇందుకు యమునకు రూ.8 లక్షలు ఇచ్చేలా ఒప్పందం కుదిర్చారు. ఈ క్రమంలో యమునకు శస్త్రచికిత్స చేస్తుండగా ఆమె మరణించారు. వెంటనే ఆమె   మృతదేహాన్ని అంబులెన్స్‌లో రహస్య ప్రాంతానికి తరలించారు. యమున భర్త ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది.   ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే  A1 డాక్టర్ ఆంజనేయులు, మరో 8 మందిని పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే.  మదనపల్లె ఎస్బిఐ కాలనీ కేంద్రంగా సాగిన గ్లోబల్ ఆసుపత్రి కిడ్నీ రాకెట్ కేసులో ఏ 2 నిందితుడు, బెంగుళూరు కి చెందిన డాక్టర్ పార్థసారధి రెడ్డి ఇప్పుడు పోలీసులకు లొంగిపోయారు. దీంతో ఈ కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకున్నట్లైంది.  

అఖండ2 సినిమా టికెట్@ రూ.5లక్షలు.. కొన్నదెవరో తెలుసా?

ఉభయ తెలుగు రాష్ట్రాలలోనూ అఖండ-2 సినిమా మానియా జోరుగా ఉంది. నందమూరి బాలకృష్ణ నటించిన ఈ సినిమా అఖండ తాండవం చూడటం కోసం అభిమానులు ఉర్రూతలూగిపోతున్నారు. అయితే.. ఈ రోజు విడుదల కావలసిన ఈ సినిమా అనివార్య కారణాలతో వాయిదా పడింది.  అది పక్కన పెడితే బాలకృష్ణ నటించిన ఈ సినిమా టికెట్ ఐదు లక్షల రూపాయలకు ఒక ఎమ్మెల్యే కొనుగోలు చేయడం తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారింది.  అలా కొనుగోలు చేసింది మరెవరో  కాదు..  ఎమ్మెల్యే జగన్ మోహన్.  ఈ సందర్భంగా ఆయన ఓ అభిమానిగా ఈ సినిమా  విజయం సాధించాలని కోరుకుంటున్నట్లు చిత్తూరుఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ చెప్పారు.   బాలకృష్ణ అభిమానుల కోరిక మేరకు నగరంలో బాలకృష్ణ పేరుతో బస్సు షెల్టర్ నిర్మాణం, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.  

కోహ్లీ మానియాతో ఊగిపోతున్న విశాఖ

విశాఖపట్నం మొత్తం కోహ్లీ మానియాతో ఊగిపోతున్నది. విశాఖ వేదికగా  దక్షిణాఫ్రికాతో శనివారం (డిసెంబర్ 6) జరగనున్న మూడో వన్డే సందర్భంగా ఈ పరిస్థితి నెలకొంది. నిన్న మొన్నటి వరకూ విశాఖ వాసులు ఈ వన్డేపై పెద్దగా ఆసక్తి చూపలేదు. అయితే ఎప్పుడైతే కోహ్లీ రాంచీ, రాయ్ పూర్ లలో జరిగిన తొలి వన్డేలలోనూ శతకాలు బాది.. తాను మళ్లీ పూర్వపు కోహ్లీ మాదిరిగా పరుగుల వేట ఆరంభించానని చాటోడో ఒక్కసారిగా సీన్ మారిపోయింది.   విశాఖ వన్డే మ్యాచ్ వీక్షించాలన్న ఆసక్తి ఒక్క విశాఖ వాసుల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా వివరీతంగా పెరిగిపోయింది. ఇటువంటి స్పందన నభూతో అని ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మ్యాచ్ కోసం  తొలి దశ టికెట్ల అమ్మకాలు గత నెల 28న  ప్రారంభమయ్యాయి. అయితే అప్పుడు టికెట్ల కోసం పెద్దగా ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో ఆఫ్ లైన్ లో కౌంటర్లు ఏర్పాటు చేయక తప్పదేమోనని ఆంధ్రాక్రికెట్ అసోసియేషన్ భావించింది. అయితే ఎప్పుడైతే రాంచీ, రాయ్ పూర్ లలో కోహ్లీ సెంచరీ చేశాడో.. పరిస్థితి పూర్తిగా మారిపోయింది.  రెండో, మూడో దశ టికెట్లు నిమిషాల వ్యవధిలో అయిపోయాయి. కోహ్లీ ఫామ్ లో ఉండటం, విశాఖ మైదానంలో కోహ్లీకి అద్భుత ట్రాక్ రికార్డు ఉండటమే ఇందుకు కారణమని అంటున్నారు. విశాఖలో కోహ్లీ ఇప్పటి వరకూ ఏడు మ్యాచ్ లు ఆడాడు. ఈ ఏడు మ్యాచ్ లలో మూడు సెంచరీలు ఉన్నాయి. ఇవి కాకుండా రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.  ఈ నేపథ్యంలో టికెట్ల ధరలు ఎక్కువ అని ఆలోచించకుండా అభిమానులు ఏమాత్రం వెనక్కు తగ్గకుండా కొనేశారు. అంతేనా గురువారం భారత జట్టు విశాఖ చేరుకుంది. ఈ జట్టు రాకకోసం అభిమానులు పెద్ద సంఖ్యలో విశాఖ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్దకు చేరుకుని గంటల తరబడి వేచి చూశారు.   

శ్రీవారి ఆలయంలో కన్నుల పండువగా కార్తీక దీపోత్సవం

  తిరుమల శ్రీవారి అలయంలో గురువారం సాయంత్రం కార్తీక పౌర్ణమి దీపోత్సవం టీటీడీ ఘనంగా నిర్వహించింది. కార్తీక పున్నమినాడు సాయంత్రం శ్రీవారికి సాయంకాల కైంకర్యాదులు నివేదనలు పూర్తి అయిన తరువాత ఈ దీపోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఇందులో భాగంగా సాయంత్రం 5 నుండి రాత్రి 8.30 గంటల వరకు అత్యంత ఘనంగా జరిగిన ఈ కార్తీక పర్వ దీపోత్సవంలో మొదట శ్రీ యోగనరసింహస్వామి ఆలయం ప్రక్కనవున్న పరిమళంఅర దగ్గర కొత్త మూకుళ్లతో దీపాలను వెలిగించారు. తదుపరి వీటిని ఛత్రచామర, మంగళవాయిద్యాలతో ఊరేగింపుగా విమాన ప్రదక్షిణం చేస్తూ, ఆనంద నిలయంలో శ్రీవారికి హారతి ఇచ్చారు.  ఆతర్వాత గర్భాలయంలో అఖండం, కులశేఖర పడి, రాములవారి మేడ, ద్వార పాలకులు, గరుడాళ్వారు, వరదరాజస్వామి సన్నిధి, వకుళమాత, బంగారు బావి, కల్యాణ మండపం, సభ అర, తాళ్లపాక అర, భాష్యకారుల సన్నిధి, యోగ నరసింహస్వామి, విష్వక్సేనులు, చందనం అర, పరిమళం అర, వెండి వాకిలి, ధ్వజ స్తంభం, బలిపీఠం, క్షేత్ర పాలకుల సన్నిధి, తిరుమలరాయ మండపం, పూల బావి, రంగ నాయక మండపం, మహా ద్వారం, బేడి ఆంజనేయస్వామి, శ్రీవరాహస్వామి ఆలయం, స్వామి పుష్కరిణి వద్ద సుమారుగా వెయ్యి నేతి జ్యోతులను మంగళ వాయిద్యల న‌డుమ‌ వేద మంత్రోచ్ఛారణలతో ఏర్పాటు చేశారు. శ్రీవారి ఆలయంలో కార్తీకదీపోత్సవ శోభను తిలకించి భక్తులు తన్మయత్వంతో పులకించారు. కార్తీక దీపోత్సవం కారణంగా టీటీడీ పౌర్ణమి గరుడ సేవ, సహస్ర దీపాలంకార సేవలను రద్దు చేసింది. ఈ కార్తీకదీపోత్సవంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి,  టీటీడీ ఈవో  అనిల్ కుమార్ సింఘాల్, బోర్డు సభ్యులు  పనబాక లక్ష్మి,  జానకి దేవి,  భాను ప్రకాష్ రెడ్డి,  నరేష్, అదనపు ఈవో  సి.హెచ్.వెంకయ్య చౌదరి, సీవీఎస్వో మురళీకృష్ణ, డిప్యూటీ ఈఓ  లోకనాథం, ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.