బిజెపికే మందకృష్ణ జై
posted on Nov 20, 2023 @ 5:02PM
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు పలికింది. తెలంగాణలో బీజేపీవిజయం కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ... మాదిగ సామాజిక వర్గానికి, ఎస్సీలలోని ఇతర వర్గాలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మాదిగ సంస్థలకు మంద కృష్ణ లేఖలు రాశారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ మనల్ని మోసం చేసిందని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కానీ... ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న ఈ పదేళ్లు కానీ ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలపలేదని మండిపడ్డారు. మనకు అనుకూలంగా వచ్చిన పలు నివేదికలను కాంగ్రెస్ విస్మరించిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ హాయంలో పార్లమెంట్ లో ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించలేదని మంద కృష్ణ ఆరోపించారు. గత దశాబ్ద కాలంగా ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కేంద్రానికి ఎటువంటి లేఖ రాయలేదని, పార్లమెంటులో వర్గీకరణ మీద మాట్లాడలేదని ఆయన విమర్శించారు.
మరోవైపు ముఖ్యమంత్రి కేసీఆర్ మాదిగలకు వెన్నుపోటు పొడిచారన్నారు. కనీసం ఆయన మంత్రివర్గంలో కూడా మాదిగలకు అవకాశం ఇవ్వలేదని ఆరోపించారు. తెలంగాణలో ఎస్సీలు ఎక్కువ అని, అందులోనూ మాదిగలు ఎక్కువ అని, కానీ తమకు ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. అందుకే నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మన మద్దతు బీజేపీకేనని మంద కృష్ణ మాదిగ రాసిన లేఖలో పేర్కొన్నారు. తెలంగాణలో ఎస్సీలు 17 శాతం ఉంటారు. అందులో 60 శాతం మాదిగలు ఉంటారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల ప్రధాని మోదీ నిజాంకాలేజ్ గ్రౌండ్ లో ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు ఎమోషనల్ అయ్యారు. మోదీని పట్టుకుని ఏడ్చేశారు.