పూలు చల్లి..మద్యం ప్రియులకు ఘన స్వాగతం!
posted on May 5, 2020 @ 11:50AM
మందుబాబులు వెల్ కం.. స్వాగతం.. సుస్వాగతం... అంటూ ఓ వ్యక్తి చేసిన హల్చల్ వీడియో వైరల్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో మద్యం ప్రియులకు అనూహ్యరీతిలో స్వాగతం లభించింది. మద్యం కోసం క్యూలైన్లలో నిల్చున్న మందు బాబులపై ఓ వ్యక్తి పూలవర్షం కురిపించాడు. మంగళవారం ఉదయం చందర్నగర్లోని ఓ మద్యం షాపు వద్ద కిలోమీటర్ల మేర జనాలు బారులు తీరారు. అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి కవర్లో నుంచి పూలు తీసి మందుబాబులపై చల్లాడు. ఈ సందర్భంగా ఆ వ్యక్తి మాట్లాడుతూ.. మన దేశానికి ఆర్థిక వనరులు మీరే.. ప్రభుత్వం వద్ద నగదు లేదని పేర్కొన్నాడు. ఎర్రటి ఎండను సైతం లెక్కచేయకుండా మందుబాబులు మద్యం షాపుల వద్ద బారులు తీరి.. తమ దాహాన్ని తీర్చుకుంటున్నారు.
దాదాపు 40 రోజుల తర్వాత మద్యం షాపులు తెరుచుకున్నాయి. దీంతో మద్యం ప్రియులు ఫుల్ ఖుష్ అయిపోతున్నారు. మండుతున్న ఎండలను సైతం లెక్క చేయకుండా..క్యూలో నిలుస్తున్నారు. ఢిల్లీ ప్రభుత్వం కరోనా సెస్ విధించింది. కరోనా ఫీ పేరిట ఏకంగా 70 శాతం సుంకం విధించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మంగళవారం నుంచి మద్యం ధరలు మరింత పెరగనున్నాయి.