తిరుమల మెట్ల మార్గంలో చిరుత

తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకు ఆ మార్గంలో వన్యప్రాణుల సంచారం భయాందోళనలకు గురి చేస్తున్నది. తరుచుగా అలిపిరి నడకమార్గం, మెట్ల మార్గంలో చిరుతల సంచారం కనిపిస్తుండటంతో భక్తులు భయాందోళనలకు గురౌతున్నారు. తాజాగా శుక్రవారం (అక్టోబర్ 31) ఉదయం తిరుమతి మెట్ల మార్గంలో 150వ మెట్టు వద్ద చిరుతను గమనించిన భక్తులు గట్టిగా కేకలు వేయడంతో ఆ చిరుత అక్కడ నుంచి అటవీ ప్రాంతంలోనికి పారిపోయింది. విషయాన్ని భక్తులు వెంటనే   తిరుమల తిరుపతి దేవస్థానం, అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. వారు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితి సమీక్షించారు.

 ఆందోళన అవసరం లేదనీ, మెట్ల మార్గంలో భక్తులు ఎవరూ ఒంటరిగా సంచరించవద్దనీ, ఆ మార్గంలో గుంపులు గుంపులుగా మాత్రమే వెళ్లాలనీ సూచించారు. చిరుత మళ్లీ కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలన్నారు.  ఏది ఏమైనా తరచుగా చిరుతలు సంచరిస్తుండటంతో భక్తులు తమ భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం, అటవీ శాఖ అధికారులు చిరుతల సంచారాన్ని అరికట్టడానికి పటిష్ఠ చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 

అనుమానాస్పద స్థితిలో ఐఏఎస్ జీకే కిషోర్ కుమార్ సతీమణి మృతి

  ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి జీకే కిషోర్ కుమార్ భార్య సత్య దీపిక అనుమానాస్పద స్థితిలో నిన్న అర్ధరాత్రి  మరణించారు. కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ఆమెకు గొంతు ఇన్ఫెక్షన్ కూడా రావడంతో ఆసుపత్రిలో చేరారు.  విజయవాడలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో సత్య దీపిక చికిత్స తీసుకుంటున్నారు. నిన్న అర్ధరాత్రి సమయంలో ఆమె కన్నుమూశారు. ఆ సమయంలో ఆమె భర్త  ఒక్కరే ఆమె పక్కన ఉన్నారు.   ఈమె ఆకస్మిక మృతి పట్ల ఆసుపత్రి యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వా సుపత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తరువాత ఆ నివేదిక ఆధారంగా దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇలా ఉండగా ఐఏఎస్ అధికార జీకే కిషోర్ కుమార్ ప్రస్తుతం ఏపీ మిషన్ ఫర్ క్లీన్ కృష్ణా, గోదావరి కెనాల్ ప్రాజెక్ట్ డైరెక్టర్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

సీఎం చంద్రబాబు పోలవరం పర్యటన.. ఎప్పుడంటే?

ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని పరిశీలించడానికీ, పర్యవేక్షిం చడానికీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ ప్రాజెక్టును సందర్శించనున్నారు.   . ఈ నెల 7 ఉదయం ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్‌ ద్వారా పోలవరం బయలుదేరనున్నారు. అక్కడ ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రత్యక్షంగా  పరిశీలించిన అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహిం చనున్నారు. ప్రాజెక్టు పనుల వేగం, నాణ్యత, గడువులపై  అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు.   చంద్రబాబు  పర్యటనతో ప్రాజెక్టు పనులకు మరింత వేగం పుంజుకోవడం ఖాయమని   అధికారులు అంటున్నారు. అనంతరం అదే రోజు మధ్యాహ్నం అక్కడ నుంచి బయలుదేరి  ఉండవల్లి నివాసానికి చేరుకోనున్నారు. అనంతరం సాయంత్రం   విజయవాడలోని సిద్దార్థ కాలేజీ గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో చంద్రబాబు పాల్గొంటారు. 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పోలవరం పనులు పరుగులు పెట్టాయి. అప్పట్లో ఆయన సోమవారం కు పోలవారం అని నామకరణం చేసి మరీ క్రమం తప్పకుండా ప్రాజెక్టు పనులను పరిశీలించేవారు. అయితే ఆ తరువాత 2019లో రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్ సీఎం అయిన తరువాత పోలవరం పనులు పడకేశాయి. మళ్లీ 2024లో రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి అధికారంలోకి వచ్చి చంద్రబాబు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాతనే పోలవరం పనులు వేగం పుంజుకున్నాయి.

బెజవాడ దుర్గమ్మ సన్నిధిలో మారిషస్ అధ్యక్షుడు

బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న  కనకదుర్గ అమ్మవారిని  మారిషష్ దేశాధ్యక్షులు ధర్మబీర్ గోఖూల్ దంపతులు ఈ ఉదయం దర్శించుకున్నారు.  ధర్మబీర్ గోఖూల్ దంపతులకు దేవాలయ అర్చకులు, వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనం అనంతరం వేద పండితులు   ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్, ఆలయ ఈవో వీకే శీనానాయక్, దుర్గ గుడి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ పాల్గొన్నారు. దర్శనం అనంతరం మారిషష్ దేశాధ్యక్షుల దంపతులకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు అందజేశారు. కాగా, ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి-గుంటూరు వేదికగా జరుగుతోన్న 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు మారిషస్ అధ్యక్షుడు ధర్మబీర్ గోఖూల్ ముఖ్య అతిథిగా విచ్చేసిన విషయం విదితమే.   

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలుగు దంపతులు దుర్మరణం

అమెరికా లో  జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన దంపతులు దుర్మరణం పాలయ్యారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన పాలకొల్లు వాసులు కొటికల పూడి కృష్ణ కిషోర్, ఆశ దంపతులు గత దశాబ్ద కాలంగా అమెరికాలో నివసిస్తున్నారు. కృష్ణ కిషోర్ అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్నారు. వారికి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరంతా కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఆ కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో కృష్ణకిషోర్, ఆశ దంపతులు అక్కడికక్కడే మరణించగా, వారి పిల్లలు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవలే భారత్ కు వచ్చి, తిరిగి అమెరికాకు వెళ్లిన వీరు.. అక్కడ రోడ్డు ప్రమాదానికి గురి కావడం వారి స్వగ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.  

అసోంలో కంపించిన భూమి.. త్రిపుర, మేఘాలయలో కూడా

అస్సాంలో  సోమవారం (జవవరి 5) తెల్లవారు జామున భూమి కంపించింది. రిక్కర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.1గా నమోదైంది. అస్సాంలోని మోరిగావ్ ప్రాంతంలో భూమికి 50 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు.  ఈ భూకంప ప్రభావంతో త్రిపురలో కూడా పలు ప్రాంతాలలో భూ ప్రకంపనలు సంభవించాయి. అయితే ఈ భూకంప తీవ్రత అసోంతో పోలిస్తే త్రిపురలో చాలా స్వల్పంగా ఉంది. త్రిపురలో భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.9గా నమోదైంది. ఇక పోతే మేఘాలయలోని పలు ప్రాంతాలలో కూడా భూమి స్వల్పంగా కంపించింది. ఆలా ఉండగా ఈ భూకంపం కారణంగా ఎక్కడా ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం లేదు.  

ఉగ్రవాదంపై అమెరికా అపేక్ష.. ఉపేక్ష ఎందుకు?

నార్కో టెర్రరిజం అంటూ ఒక దేశాధ్యక్షుడినే అత్యంత అమానవీయంగా ఆ దేశంపై మెరుపుదాడి నిర్వహించి మరీ అరెస్టు చేసిన అమెరికా ప్రపంచ దేశాలలో మారణహోమం సృష్టించిన టెర్రరిస్టుల విషయంలో ఎందుకు అపరిమితమైన ఆపేక్ష చూపుతుంది. ప్రపంచంలో ఏం జరిగినా అందుకు కర్తా, కర్మా, క్రియా తానేనన్నట్లుగా అమెరికా ఎందుకు అనవసర ఆడంబరం, అనవసర పెద్దరికాన్ని ప్రదర్శిస్తుంది? ఈ ప్రశ్నలకు అమెరికా రెండో ప్రపంచ యుద్ధం కాలం నుంచీ ఇలా తయారైందన్న బదులు వస్తుంది.  అమెరికా తొలుత ఇలా ఉండేది కాదు. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో బ్రిటన్ అమెరికాను తమతో పాటు పాల్గొనాల్సిందిగా కోరింది. అయితే అందుకు అమెరికా నిరాకరించడమే కాదు.. కనీసం బ్రిటన్ కు మిత్రదేశంగా ఉండటానికి కూడా ముందుకు రాలేదు.  అయితే కానీ ఎప్పుడైతే పెర్ల్ హార్బర్ ఘటన జరిగిందో ఆనాటి నుంచి అమెరికా ఆయుధాల తయారీపై దృష్టి సారించింది. అప్పటి వరకూ వస్తు ఉత్పత్తిపైనే దృష్టి  కేంద్రీకరించిన అమెరికా రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ కి తగిన బుద్ధి చెప్పాలన్న ఆలోచన కొద్దదీ.. ఆయుధాల తయీరీవైపు మళ్లింది. అణుబాంబు తయారు చేసి ఆ యుద్ధానికి బెస్ట్ ఫినిషర్ గా నిలిచింది. అక్కడి నుంచీ తమ దేశ భద్రతకు ఆయుధ తయారీని  ఒక ప్రామాణికంగా పెట్టుకుంది. దానికి తోడు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో ఉత్తత్తి చేసిన ఆయుధాల నిల్వ భారీగా ఉండటంతో.. ప్రపంచంలో ఏ చిన్న సమస్య తలెత్తినా అక్కడికి తగుదునమ్మా అంటూ వెళ్లి,  ఆ దేశ సమస్యల్లో వేలు పెట్టి.. తన ఆయుధాల విక్రయానికి ఆ సమస్యలను అలంబనగా చేసుకోవడం మొదలు పెట్టింది. అందులో భాగమే వియత్నాం, గల్ఫ్, సిరియాయుద్ధాలు. ఆ మాటకొస్తే భారత్- పాక్, రష్యా- ఉక్రెయిన్,  చైనా- తైవాన్ ఇలా ఏ రెండు దేశాల మధ్య చిన్న ఘర్షణ ఏర్పడ్డా తనదైన శైలిలో.. జోక్యంొ చేసుకుంటూ తనకు తానే ప్రపంచ దేశాలకు పెద్దన్న అన్నట్లుగా వ్యవహరిస్తోంది.    అమెరికా  వ్యవహారశైలి ఎలాంటిదో ఒక దళారి పశ్చాత్తాపం వంటి పుస్తకాలు చదివితే మనకు ఇట్టే తెలిసిపోతుంది. అంతగా ప్రపంచ రాజకీయాలను శాసించడం ప్రారంభించింది అమెరికా. ఇక ఇంధనం కారణంగా ప్రపంచాన్ని తన గుప్పెట్లో పెట్టుకోవడం అనే ఒకానొక వ్యసనం కూడా అమెరికాకు పట్టుకుంది.  దీంతో ఆయా చిన్నా చితకా దేశాల వెంట పడడం.. వాటి సహజవనరులపై కన్నేయడం అమెరికాకు పరిపాటిగా మారింది. చివరికి గల్ఫ్ దేశాలపైనా అమెరికా ఆధిపత్యం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. వారి పెట్రో డాలర్లన్నీ తమ ట్రెజరీల్లో భద్రంగా ఉంచుకుని.. ఆపై వారిని తమ గుప్పెట్లో పెట్టుకుంది. అంతగా ఇతర దేశాల్లో కాళ్లు, వేళ్లు, తలా దేర్చేసి వాటిపై ఆధిపత్యం చెలాయించడం అమెరికాకు రివాజైపోయింది.  తమ మాట వినని దేశాల్లో కుల మత విద్వేషాలను రాజేసి మరీ వాటిని తన దారికి తెచ్చుకోవడానికి అమెరికా వెనుకాడదు. అనుకున్న ఫలితం సాధించడం అమెరికా తన అగ్ర నాయకత్వంలో ఒక భాగం చేసుకుంది. ఈ విషయంలో అమెరికాకు చైనా, రష్యా, భారత్ లు కూడా మినహాయింపు కాదు.  ఇవాళ వెనిజువెల విషయంలో నార్కో టెర్రరిజం పేరిట ఆ దేశ అధ్యక్షుడు మదురో ని అరెస్టు చేసిన అమెరికా.. పాక్ లో  ఉగ్రవాదం వెయ్యి తలలు వేస్తున్నా కిమ్మనడం లేదంటే.. ఏమనుకోవాలి.  స్వయానా అమెరికా కూడా పాక్ ప్రేరేపిత ఉగ్ర బాధిత దేశాల్లో ఒకటి. అయినా అమెరికా పాక్ ఒంటిపై ఈగ వాలకుండా కాపాడటమే కాకుండా, ఆ దేశం ఆర్థిక సమస్యల నుంచి బయటపడటానికి భారీ రుణాలతో ఆదుకుంటోంది. కానీ అదే అమెరికా వెనిజువేలా అధ్యక్షుడు మదురో పై 50 మిలియన్ డాలర్ల రివార్డ్ ఉందనీ, అందుకే అరెస్టు చేశామనీ చెప్పుకుంటోంది.  కానీ, హఫీజ్ సయీద్ వంటి వారిపైనా ఇలాంటి రివార్డ్ లే ఉన్నా వారి జోలికి ఎందుకు వెళ్లడం లేదు?    పాకిస్థాన్ కి అమెరికా ఇప్పిస్తున్న  వరల్డ్ బ్యాంక్, ఐఎంఎఫ్ లోన్ల నుంచి మసూద్ అజర్ వంటి టెర్రరిస్ట్ బాసులకు భారీగా నిధులు అందుతున్నా.. ఎందుకు చోద్యం చూస్తున్నట్టు? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అయితే పాక్ ఆర్మీని గాజాలో దింపేందుకే ఈ నజరాలు, సానుభూతి అని పరిశీలకులు అంటున్నారు. అదే నిజమన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది.  అమెరికా ధ్వంస రచన ఇంకెంత కాలం సాగుతుందో చూడాలంటున్నారు అంత ర్జాతీయ వ్యవహారాల నిపుణులు.

వెనుజువెలా.. అసలేం జరుగుతోంది?

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా జోరుగా జరుగుతున్న హాట్ డిస్కషన్ ఏమిటంటే.. అసలు వెనిజువేలాలో ఏం జరుగుతోంది? ఈ నెల 3న అంటే శనివారం అమెరికన్ ఆర్మీ మెరుపుదాడి జరిపివెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్టు చేసి అమెరికాకు తరలించింది.  ఈ సందర్భంగా వెనిజువేలా  రాజధాని కకరాకస్ లో భారీ పేలుళ్లు జరిగాయి. విద్యుత్ గ్రిడ్ లు ధ్వంసమయ్యాయి. దేశ వ్యాప్తంగా విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫోన్ చార్జింగ్ కోసం జనం బారులు తీరారు.  అమెరికా అద్యక్షుడు ట్రంప్ దీన్ని అమెరికన్ సైనిక శక్తి అద్భుత ప్రదర్శ నగా అభివర్ణిస్తూ తన భుజాలను తానే చరుచుకున్నారు. ఇక వెనిజువేలాలో అధికార మార్పిడి ప్రక్రియ పూర్తయ్యే వరకూ ఆ దేశాన్ని అమెరికాయే నడిపిస్తుందని ప్రకటించారు.   అయితే మదురో బదులు తాత్కాలిక అధ్యక్షురాలిగా ఉపాధ్యక్షురాలు రోడ్రిగ్జ్ బాధ్యతలు చేపట్టే అవకాశాలున్నాయని అంటు న్నారు. నోబెల్ శాంతి బహుమతి గ్రహీత కొరినా మచాడో తర్వాతి అధ్యక్షురాలయ్యే  చాన్సుందన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. అయితే అదేమీ జరిగేలా కనిపించడం లేదు.. ఎందుకంటే   కొరినా మచాడో నునోబెల్ స్వీకారానికి కూడా అవకాశం దొరకని ఇబ్బందికర  పరిస్థితులను ఎదుర్కు న్నారు. ప్రస్తుతం మదురోను అమెరికా అరెస్టు చేయడం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. భారత్ అయితే వెనుజువెలా వెళ్లే వారు అత్యవసరమైతే తప్ప వెళ్ల వద్దని ట్రావెల్ కాషన్ జారీ చేసింది. అమెరికా స్పెషల్ ఫోర్సెస్ అయిన డెల్టా ఫోర్స్ .. ఆపరేషన్ ఆబ్సల్యూట్ రిజాల్వ్  పేరిట రాజధాని కరాక స్‌లో భారీ సైనిక దాడి చేసింది. ఈ దాడిలో మదురో నివాసంపై హెలికాప్టర్లతో దాడి చేసి, మదురో, ఆయన భార్య సిలియా ఫ్లోరెస్‌ను అదుపులోకి తీసుకుంది. మదురో దంపతులను ముందుగా యుఎ స్ఎస్ ఐవో జిమా యుద్ధ నౌకలోకి, ఆ తరువాత న్యూయార్క్‌లోని స్టూవర్ట్ ఎయిర్ నేషనల్ గార్డ్ బేస్‌కు చేర్చారు. ప్రస్తుతం మదురో బ్రూక్లిన్‌లోని మెట్రోపాలిటన్ డిటెన్షన్ సెంటర్‌లో ఉన్నారు. మదురోపై 2020 నుంచి అమెరికా జస్టిస్ డిపార్ట్‌మెంట్ ఇండిక్ట్‌మెంట్ ఆధారంగా.. నార్కో-టెర్రరిజం కుట్ర, కొకైన్ దిగుమతి కుట్ర, మెషిన్‌గన్స్ ఇతర డిస్ట్రక్టివ్ డివైసెస్ పొజెషన్ వంటి ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలోనే  మదురోపై  50 మిలియన్ రివార్డ్ ప్రకటించింది అమెరికా. ఇప్పుడు మదురోను మెరిపుదాడి చేసి మరీ అరెస్టు చేసింది.  అరెస్ట్ సమయంలో మదురో ఇంట్లో నిద్రిస్తున్నారని, అతడి నుంచి  ఎలాంటి  ప్రతిఘటన లేకుండానే బంధించారనీ తెలుస్తోంది. అయితే అరెస్టు తర్వాత   మదురో చేతులకు సంకెళ్లతో అమెరికా ఆఫీసర్ల మధ్య నడుస్తున్న దృశ్యాలు ప్రపంచ వ్యాప్తంగా తెగ వైరల్ అ య్యాయి. మదురో అరెస్టును  . చైనా, రష్యా వంటి దేశాలు తీవ్రంగా ఖండించాయిజ అయితే కొన్ని దేశాలు ఈ అరెస్టును స్వాగతించాయి. ఇలా ఉండగా మదురో అరెస్టు అంశంపై  ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి అత్యవసర సమావేశం నిర్వహించనుంది. 

పాక్ ఆర్మీ చీఫ్ ను ఎందుకు అరెస్టు చేయరు?!

వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అరెస్టు చేసినట్లుగా పాక్ ఆర్మీ చీఫ్ ను ఎందుకు అరెస్టు చేయరంటూ బలోచ్ అమెరికన్ కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ తారాచంద్ డోనాల్డ్ ట్రంప్ ను నిలదీశారు. వెనిజులాలో నియంతృత్వానికి వ్యతిరేకంగా నికోలస్ మదురోను అరెస్టు చేసిన అమెరికా అధ్యక్షుడు  పాక్ ఆర్మీ చీఫ్ విషయంలో ఎందుకు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నించారు. నికోలస్ మదురో వెనిజులా నేచురల్ రిసోర్సస్ ను  చైనాకు అప్పగించి దోపిడీకి సహకరిస్తున్నారంటున్న ట్రంప్.. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ కూడా బలోచిస్థాన్ లోని ఖనిజ సంపద, సముద్ర వనరులను చైనాకు తాకట్టు పెడుతున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని డాక్టర్ తారాచంద్ ప్రశ్నించారు.  పాక్ ఆర్మీ చీఫ్ మునీర్  డబుల్ ఏజెంట్ లా వ్యవహరిస్తూ, ఒకవైపు బలోచ్ వనరులను చైనాకు కట్టబెడుతూనే, మరోవైపు అమెరికాను తప్పుదారి పట్టిస్తున్నారని విమర్శించారు. . మదురోపై అమెరికా ఇటీవల  మెరుపు దాడి జరిపి అరెస్టు చేసినట్లుగానే  పాక్ ఆర్మీ చీఫ్‌ను కూడా బంధించాలని ఆయన డిమాండ్ చేశారు.  వనరుల దోపిడీకి తోడు పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ బలోచిస్థాన్‌లోనూ, సరిహద్దులకు ఆవల కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నారని డాక్టర్ తారాచంద్ ఆరోపించారు.   వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న బలోచ్ అమెరికన్ కాంగ్రెస్  బలోచిస్థాన్ స్వయం ప్రతిపత్తి కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే.బలోచ్ అమెరికన్ కాంగ్రెస్ అధ్యక్షుడు  డాక్టర్ తారా చంద్ గతంలో బలోచిస్థాన్ ప్రభుత్వంలో మంత్రిగా  కూడా పని చేశారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో ప్రవాసంలో ఉన్నారు.  అక్కడి నుంచే బలోచిస్థాన్ హక్కుల కోసం పోరాటం జరుపుతున్నారు. 

ఇండియాకు డోనాల్డ్ ట్రంప్ మరో హెచ్చరిక

అగ్రదేశాధినేత డొనాల్డ్ ట్రంప్ తన భారత వ్యతిరేకతను మరోసారి ప్రదర్శించారు. రష్యా నుంచిచమురు కొనుగోలు విషయంలో తన దారికి రాకపోతే భారత్ నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై టారిఫ్‌లు మరింత పెంచుతామని హెచ్చరించారు.    రష్యా చమురు విషయంలో భారత్  అమెరికాకు సహకరించకుంటే.. ఆ దేశంపై టారిఫ్ లు మరింత పెంచుతామని  ట్రంప్ ఓ బహిరంగ సభలో ప్రకటించినట్లు రాయిటర్స్ వార్తా సంస్థ పేర్కొంది. భారత్ - అమెరికా మధ్య వాణిజ్య   చర్చలతో రష్యా చమురు అంశాన్ని ఆయన ముడిపెట్టినట్లు తెలిపింది. ట్రంప్ ఈ ప్రకటనతో భారత్-రష్యా ఇంధన సంబంధాల చుట్టూ నెలకొన్న ఉద్రిక్తతలు మరో సారి తెరపైకి వచ్చినట్లైంది.  గతంలో కూడా రష్యా నుంచి చమురు కొనుగోలును నిలిపివేస్తామని ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే  ట్రంప్ ప్రకటనను  భారత్ అప్పట్లో నిర్ద్వంద్వంగా ఖండించింది. ఇప్పుడు మరోసారి ట్రంప్ ఇదే అంశాన్ని ప్రస్తావించి టారిఫ్ ల పెంపు అంటూ హెచ్చరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. 

భోగాపురం ఎయిర్ పోర్టుపై పొలిటికల్ వార్

   ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం సిద్ధమవుతోంది. నిర్మాణం తుదిదశకు చేరుకుంది. ఎయిర్ పోర్ట్ లో తొలి విమానం ల్యాండ్ అయింది. జూన్ నుంచి ఎయిర్ పోర్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో చాలా ఏళ్లుగా ఉత్తరాంధ్ర వాసుల కల సాకారమవుతోంది. విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి టెస్ట్ ట్రయల్ చేయడానికి భోగాపురం రన్ వే పై తొలి విమానం ల్యాండ్ అయింది. ఈ క్రమంలో భోగాపురంపై అటు రాజకీయంగానూ కాక రేగుతోంది. సోషల్ మీడియాలో దీనిపై చర్చ జరుగుతోంది.  భోగాపురం ఎయిర్ పోర్టు నిర్మాణంపై క్రెడిట్ తమదంటే తమదేనంటూ అటు వైసీపీ, ఇటు టీడీపీ క్లెయిమ్ చేసుకుంటున్నాయి. 2014-19 మధ్య టీడీపీ ప్ర‌భుత్వం భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు ఏ అనుమ‌తులూ లేకుండా శంకుస్థాప‌న చేసి వదిలేసిందని వైసీపీ ఆరోపిస్తోంది. కానీ వైఎస్ జ‌గ‌న్ అన్ని అనుమతులు వ‌చ్చాకే ఆ ఎయిర్‌పోర్ట్ ప‌నుల‌కు శంకుస్థాప‌న చేసారని వాదిస్తోంది.  2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రాగానే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన అనుమతుల కోసం నాటి ముఖ్యమంత్రి జగన్‌ ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేశారని ఆ పార్టీ చెబుతోంది.  మరోవైపు క్షేత్రస్థాయిలో రైతుల సమస్యలను పరిష్కరించేందుకు చొరవ తీసుకున్నారని వదిస్తోంది.పరిహారాన్ని భూమి పరిస్థితిని బట్టి ఎకరాకు రూ.28 లక్షల నుంచి రూ.36 లక్షల వరకూ ప్రకటించారని, డి.పట్టా భూములకూ జిరాయితీ భూమితో సమానంగా పరిహారాన్ని మంజూరు చేశారని వైసీపీ చెబుతోంది. దీంతో రైతులు చాలామంది పిటిషన్లను ఉపసంహరించుకున్నారని, మిగతావాటినీ సర్వోన్నత న్యాయస్థానం పరిష్కరించిందని వైసీపీ చెప్పుకుంటోంది.దానికి టీడీపీ గట్టిగానే కౌంటర్ ఇస్తోంది.  భోగాపురం ఎయిర్ పోర్ట్ చంద్రబాబు దూర దృష్టికి నిదర్శనం అని, వైసీపీ అధికారం లోకి రాక ముందే ఎయిర్ పోర్టుకు శంకుస్థాపన జరిగిందని వైసీపీని విమర్శిస్తుంది. అలాగే జగన్ భోగాపురం ఎయిర్ పోర్టును వ్యతిరేకించారని దెప్పి పొడుస్తుంది. దానికి తగ్గట్లే సోషల్ మీడియాలో భోగాపురం ఎయిర్ పోర్టుకి చంద్రబాబు శంకుస్థాపన చేసినప్పుడు జగన్ మాట్లాడిన మాటలు ట్రోల్ అవుతున్నాయి. అప్పట్లో జగన్ దీనిపై మాట్లాడుతూ ఎర్ర బస్సు రాని ఊరికి ఎయిర్ పోర్టు ఎందుకని విమర్శలు గుప్పించారు. మొత్తానికి ఈ క్రెడిట్ వార్లో వైసీపీ తీరు చర్చల్లో నలుగుతోంది. మరోవైపు  భోగాపురం పోయిర్ పోర్టులో తొలి విమానం ల్యాండింగ్‌పై  మాజీ సీఎం జగన్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. భోగాపురం ఎయిర్ పోర్టులో తొలి విమానం ల్యాండ్‌కావడం ఏపీ అభివృద్ధికి ఒక మైలురాయి అని తెలిపారు. #VisonVizag లక్ష్యాన్ని సాధించే దిశగా కీలక అడుగు పడిందని తెలిపారు. తమ పాలనలో వేగవంతమైన అనుమతులతో ఇది సాధ్యమైందని చెప్పారు. భూసేకరణ కోసం రూ.960 కోట్లు ఖర్చు చేయడంతో బలమైన పునాది వేశామన్నారు.