సిరిసిల్ల కేటీఆర్ క్యాంప్ కార్యాలయం వద్ద హైటెన్షన్
posted on May 26, 2025 @ 2:39PM
సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసులో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫోటో ఉండాలని కాంగ్రెస్ నేతలు పట్టుబట్టారు. ఆఫీసులో ముఖ్యమంత్రి ఫొటో పెట్టేందుకు కాంగ్రెస్ నేతలు యత్నించారు. ప్రొటోకాల్ పాటించాలని డిమాండ్ చేశారు. వారిని బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. దీంతో హైటెన్షన్ నెలకొంది. దీంతో ఇరుపార్టీల నేతల మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.
సీఎం ఫోటో పెట్టేందుకు కాంగ్రెస్ నేతల ప్రయత్నంచటంతో సీఎం రేవంత్రెడ్డి ఫొటో కింద పడి పగిలిపోవడంతో కాంగ్రెస్ నాయకులు కోపోద్రిక్తులయ్యారు. పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు ఇక ఈ పోలీసుల లాఠీ ఛార్జిలో బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి సహా పలువురికి గాయాలు అయ్యాయి. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసుల వైఖరిపై బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు.. ఇరువర్గాల తోపులాటతో సిరిసిల్ల పట్టణ సీఐ కృష్ణ వేలికి గాయమైంది.