బెజవాడ మేయర్ అభ్యర్థిగా శ్వేత ! పంతం నెగ్గించుకున్న కేశినేని
posted on Mar 4, 2021 @ 7:10PM
విజయవాడ ఎంపీ కేశినేని నాని తన పవర్ ఏంటో చూపించారు. విజయవాడ కార్పొరేషన్ మేయర్ గా తాను అనుకున్నది సాధించారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ టీడీపీ మేయర్ అభ్యర్థిగా కేశినేని శ్వేత పేరును టీడీపీ ఖరారు చేసింది. కేశినేని శ్వేతను ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ సర్క్యులర్ జారీ చేశారు.
విజయవాడ మేయర్ పదవికి టీడీపీ నుంచి చాలా మంది పోటీపడ్డారు. అయితే ఇటీవల విజయవాడ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్న ఎంపీ కేశినేని నాని కుమార్తె కేశినేని శ్వేత వైపే పార్టీ అధిష్ఠానం మొగ్గుచూపింది. మేయర్ పదవి రేసులో శ్వేతకు నందిరెడ్డి గాయత్రి నుంచి చివరివరకు పోటీ ఎదురైంది. పలు అంశాలను పరిగణనలోకి తీసుకున్న పార్టీ... నాని కుమార్తె శ్వేత పేరును తమ మేయర్ అభ్యర్థిగా ప్రకటించింది.బెజవాడ మున్సిపల్ ఎన్నికల్లో శ్వేత 11వ డివిజన్ లో కార్పొరేటర్ గా బరిలో ఉన్నారు.
మేయర్ అభ్యర్థిగా ప్రకటించినందుకు శ్వేత టీడీపీ అధిష్టానికి కృతజ్ఞతలు తెలిపారు. విజయవాడ కార్పొరేషన్ను టీడీపీ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. విజయవాడపై వైసీపీ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని తప్పుబట్టారు. ప్రభుత్వం సహకరించకున్నా వరల్డ్ క్లాస్ సిటీగా మారుస్తానని కేశినేని శ్వేత ప్రకటించారు.
ఇటీవల విజయవాడ మేయర్ అభ్యర్థిగా శ్వేతను ఖరారు చేస్తారనే ప్రచారం జరిగింది. అయితే శ్వేత అభ్యర్థిత్వంపై మాజీ ఎమ్మెల్యే బొండ ఉమ అసంతృప్తి వ్యక్తం చేశారు. గతంలోను తూర్పు నియోజకవర్గం నుంచి అదే సామాజికవర్గానికి చెందిన వారికి మేయర్ అభ్యర్థిగా ప్రకటించారని, ఈ సారి సెంట్రల్ నియోజకవర్గం నుంచి వేరే సామాజికవర్గానికి మేయర్ పదవి ఇవ్వాలని ఉమ వాదించారు. దీంతో పాటుగా కార్పొరేటర్ అభ్యర్థుల ఎంపిక విషయంలో కూడా టీడీపీ నేతలు వర్గాలుగా విడిపోయారు. అభ్యర్థుల ఎంపికలో కేశినేని నాని, బుద్దా వెంకన్న, నాగుల్ మీరా మధ్య విభేదాలు వచ్చాయి. వీటన్నింటికీ చెక్ పెట్టేందుకు శ్వేతను మేయర్ అభ్యర్థిగా ఎంపిక చేరారని మరో వాదం వినిపిస్తోంది. అయితే విజయవాడ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు శ్వేతను మేయర్ అభ్యర్థిగా ప్రకటించామని టీడీపీ నేతలు చెబుతున్నారు.