బ్రాహ్మణ కులం మధ్య కేసీఆర్ కొత్త చిచ్చు
posted on Apr 17, 2011 @ 9:32AM
హైదరాబాద్: కేసీఆర్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రాంతానికి చెందిన బ్రాహ్మణులకు ఆర్భాటాలు ఎక్కువనీ, తెలంగాణా ప్రాంతానికి చెందిన బ్రాహ్మణులు నిష్టగా పూజలు చేస్తారని బ్రాహ్మణ కులం మధ్య కొత్త చిచ్చు పెట్టారు. దేవాలయాలపై ప్రభుత్వం పెత్తనం పెరిగిందనీ, తెలంగాణా వచ్చిన వెంటనే ఆ ఆధిపత్యానికి తెరదించి బ్రాహ్మణులకు అధిక ప్రాధాన్యతను కల్పిస్తామని వెల్లడించారు. వేద పాఠశాలలను ఏర్పాటు చేస్తామన్నారు. కేసీఆర్ వ్యాఖ్యలపై బ్రాహ్మణ యువజన సంఘానికి చెందిన ద్రోణంరాజు రవికుమార్ మండిపడ్డారు. ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు... దేశంలో ఉన్న బ్రాహ్మణులందరూ ఒకే ధర్మాన్ని పాటిస్తారన్నారు. అంతేతప్ప ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదన్నారు. ఏ ప్రాంత బ్రాహ్మణులైనా సర్వేజన సుఖినోభవంతు అంటారు తప్ప వారివారి ప్రాంత సుఖినోభవంతు అనరని చెప్పారు. రాజకీయ ప్రాధాన్యతను పెంచుకునేందుకు కొంతమంది నాయకులు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. కేసీఆర్ వ్యాఖ్యలపై ఇతర బ్రాహ్మణ వర్గాలు నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. రాజకీయ నాయకుల వల్లనే వైషమ్యాలు పెరుగుతున్నాయని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.