ఎన్టీఆర్ కే ఎక్కువ?
posted on Apr 15, 2011 @ 10:57AM
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి రాజకీయ వారసుడిగా సినీ హీరో, స్వర్గీయ ఎన్టీ రామారావు మనవడు జూనియర్ ఎన్టీఆర్కే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. తెలుగుదేశం పార్టీలో వారసత్వ పోరు సాగుతోందని, నారా లోకేష్కూ జూనియర్ ఎన్టీఆర్కూ మధ్య పోటీ జరుగుతోందని, ఇందులో భాగంగానే తెలుగుదేశం పార్టీలో సంక్షోభం నెలకొందని ప్రచారం జరిగిన నేపథ్యంలో పోల్ నిర్వహించారు. చంద్రబాబు రాజకీయ వారసుడు ఎవరు అనే ప్రశ్న వేసి జూనియర్ ఎన్టీఆర్, నారా లోకేష్, బాలకృష్ణ, హరికృష్ణ పేర్లు ఇవ్వడం జరిగింది. వీరిలో చంద్రబాబు రాజకీయ వారసుడు ఎవరో చెప్పాలని పాఠకులను అడిగింది. ఈ పోల్ సర్వేలో విచిత్రమైన ఫలితాలు వచ్చాయి. చంద్రబాబు రాజకీయ వారసుడిగా జూనియర్ ఎన్టీఆర్కు ఎక్కువ మార్కులు పడ్డాయి. చంద్రబాబు రాజకీయ వారసుడు ఎన్టీఆర్ అంటూ 51 శాతం మంది అభిప్రాయపడ్డారు. విచిత్రమేమిటంటే, నందమూరి బాలకృష్ణ మూడో స్థానంలో నిలిచారు. చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ రెండో స్థానంలో నిలువడం గమనార్హం. చంద్రబాబు రాజకీయ వారసుడిగా నారా లోకేష్ పేరును సూచిస్తూ 28 శాతం మంది ఓటేశారు. బాలకృష్ణకు 17.2 శాతం ఓట్లు వచ్చాయి. నందమూరి హరికృష్ణ నాలుగో స్థానంలో నిలిచారు. ఆయనకు కేవలం 3.8 శాతం ఓట్లే వచ్చాయి.