బెంగాల్ లో బీజేపీ చీఫ్ నడ్డా కాన్వాయ్ పై రాళ్ల దాడి
posted on Dec 10, 2020 @ 4:30PM
పశ్చిమ బెంగాల్ లో టీఎంసీ, బీజేపీ మధ్య సాగుతున్న వార్ మరింత ముదురుతోంది. బెంగాల్ పర్యటనలో ఉన్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్పై రాళ్ల దాడి జరిగింది. కోల్కతాలో డైమండ్ హార్బర్కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. జేపీ నడ్డా కాన్వాయ్లోనే వెళ్తున్న బీజేపీ కార్యదర్శి కైలాశ్ విజయవర్గీయ, బెంగాల్ బీజేపీ చీఫ్ దిలీప్ ఘోష్ సహా ఇతర నేతల కార్లపైనా రాళ్లు పడ్డాయి. కారు అద్దం పగిలి లోపల పడ్డ రాయిని చూపిస్తున్న ఓ వీడియోను కైలాశ్ విజయవర్గీయ ట్వీట్ చేశారు.
వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకోసం పార్టీ కార్యకర్తల సన్నాహక సమావేశమవడానికి జేపీ నడ్డా బెంగాల్ వెళ్లారు. డైమండ్ హార్బర్కు వెళ్తుండగా ఇరుకైన దారిలో కొందరు గుమిగూడి నడ్డా కాన్వాయ్ను అడ్డగించే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నాలను పోలీసులు నిలువరించినా రాళ్లను అడ్డుకోలేకపోయారు. దాడి జరగ్గానే పోలీసులు ప్రత్యేకంగా ఎస్కార్ట్ చేసి బీజేపీ నేతలు ఆ ప్రాంతం నుంచి బయటకు తీసుకెళ్లారు. టీఎంసీ గూండాలే నడ్డా కారుపైకి రాళ్లు విసిరారని దిలీప్ ఘోష్ ఆరోపించారు. బుధవారం జరిగిన నడ్డా పర్యటనలోనూ భద్రతాపరమైన లోపాలు కనిపించాయని, టీఎంసీ సర్కారు సరైన సెక్యూరిటీ కల్పించడం లేదని ఆరోపిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు బెంగాల్ బీజేపీ నేతలు లేఖ రాశారు. అయితే దారిపొడవునా ప్రతి అంగుళం భద్రతా కల్పించడం అసాధ్యమని, అప్పటికప్పుడు ప్రజలు తిరుగుబాటు ధోరణిలో దాడి చేసి ఉండొచ్చని భావిస్తున్నట్టు టీఎంసీ నేత మదన్ మిత్రా స్పందించారు.