క్వారంటైన్లో పవన్ కల్యాణ్!
posted on Apr 11, 2021 @ 1:46PM
తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికల ప్రచారం తారా స్థాయిలో జరుగుతోంది. గురువారంతో ప్రచార గడువు ముగియనుంది. అయినా జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఎక్కడా కనిపించడం లేదు. ఒకరోజు రోడ్ షా నిర్వహించిన పవన్.. మళ్లీ ప్రచారానికి రావడం లేదు. అటు వకీల్ సాబ్ సినిమా విడుదలై.. విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. కలెక్షన్లలో కొత్త రికార్డులు స్పష్టిస్తుందని చెబుతున్నారు. వకీల్ సాబ్ సినిమా బెనిఫిట్ షోలను జగన్ సర్కార్ రద్దు చేయడం వివాదాస్పదమైంది. దీనిపై బీజేపీ నేతలు సీరియస్ స్పందించారు. చివరకి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా వకీల్ సాబ్ కు మద్దతుగా జగన్ సర్కార్ తీరును ఎండగట్టారు. ఇంత జరుగుతున్నా జనసేనాని మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.
అయితే జనసేన అధినేత పవన్ కల్యాణ్ హైదరాబాద్లోని తన నివాసంలో హోం క్వారంటైన్లో ఉంటున్నారని తెలుస్తోంది. పవన్ కల్యాణ్ వ్యక్తిగత సిబ్బందిలో కొందరికి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారట. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ముఖ్యమైన కార్యనిర్వాహకులు, భద్రతా సిబ్బంది, వ్యక్తిగత సిబ్బందిలోని ఎక్కువమంది కరోనా బారినపడ్డారు. ముందు జాగ్రత్త చర్యగా వైద్యుల సూచనతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. గత వారం రోజులుగా ఆయన సిబ్బందిలో ఒక్కొక్కరూ కరోనా బారినపడుతూ వస్తున్నారు. వీరంతా ఆయనకు చాలా సమీపంగా విధులు నిర్వహిస్తారు. దీంతో ముందు జాగ్రత్త చర్యగా, కరోనా విస్తృతి నివారణలో భాగంగా ఆయన హోం క్వారంటైన్లోకి వెళ్లారు అని జనసేన తెలిపింది.
ప్రస్తుతం వర్చువల్ పద్ధతిలోనే జనసేన పార్టీ కార్యకలాపాలను పవన్ కల్యాణ్ పర్యవేక్షిస్తున్నారు.ఆయన కరోనా పరీక్షలు చేయించుకుని నెగటివ్ అని తేలితే మళ్లీ ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది.
సోమవారం బీజేపీ-జనసేన సంయుక్తంగా విజయ యాత్రను ప్రారంభించనున్నాయి. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నెల్లూరు జిల్లా నాయుడుపేటలో బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ బహిరంగ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జనసేనాధిపతి పవన్ కల్యాణ్, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి మురళీధరన్ హాజరు కాబోతున్నట్లు ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ట్విట్టర్ ద్వారా ప్రకటించారు.ఈ సభకు పవన్ కల్యాణ్ హాజరు కావడంపై అనుమానాలు నెలకొన్నాయి. పవన్ కల్యాణ్ క్వారంటైన్లోకి వెళ్లిన నేపథ్యంలో ఆయన ఈ బహిరంగ సభకు హాజరయ్యే అవకాశం లేదని జనసేన వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 14 రోజుల క్వారంటైన్ పూర్తి అయ్యాకే పవన్ కల్యాణ్ బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీజేపీ-జనసేన బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది.