జగన్ పసుపు చీర వ్యాఖ్యలు.. చెడుగుడాడేసిన చెల్లెళ్లు
posted on Apr 26, 2024 @ 9:38AM
అమాయకమైన ముఖం పెట్టి అబద్ధాలను అలవోకగా చెప్పడంలో సీఎం జగన్ మోహన్ రెడ్డికి మించిన రాజకీయ నేత మరొకరు ఉండరంటే అతిశయోక్తి కాదు. ప్రతిపక్ష పార్టీల నేతలపైన.. సొంత చెల్లెళ్లపైనకూడా ఎలాంటి సంకోచం లేకుండా అధారాలు లేని అభాండాలను, అసత్య వ్యాఖ్యలను అలవోకగా చేస్తూ ప్రజలను నమ్మించడంలో జగన్ దిట్ట. తాజాగా వివేకానంద రెడ్డి హత్యకేసు విషయంలోనూ జగన్ మోహన్ రెడ్డి అదే చేస్తున్నారు. గత ఎన్నికల సమయంలో హత్యకు గురైన వివేకా కేసులో కీలక ముద్దాయిగా వైఎస్ అవినాశ్ రెడ్డి ఉన్నారు. సీబీఐ సైతం వివేకా హత్యకేసులో అవినాశ్ ప్రమేయం ఉందని తేల్చింది. అంతేకాదు.. కస్టడీలోకి తీసుకొనే ప్రయత్నం కూడా చేసింది. కానీ తన అధికారాన్ని ఉపయోగించుకుని జగన్ అవినాశ్ అరెస్టు కాకుండా అడ్డుపడిన విషయం తెలిసిందే.
ఒకవేళ ఆనాడు అవినాశ్ అరెస్ట్ అయ్యిఉంటే.. వివేకా హత్యకేసులో జగన్, భారతీరెడ్డిల ప్రమేయంకూడా వెలుగులోకి వచ్చేది. వివేకా హత్య కేసులో ప్రమేయం ఉన్న అవినాశ్ రెడ్డికి జగన్ అండగా నిలవడంపై ఆయన చెల్లెళ్లు వైఎస్ షర్మిల రెడ్డి, సునీతా రెడ్డిలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికల సమయంలో జగన్ వర్సెస్ షర్మిల, సునీతల వ్యవహారం ఏపీ రాజకీయాల్లో హాట్టాపిక్ గా మారింది. కొద్ది రోజులుగా వివేకా హత్యకేసు విషయంపై చెల్లెళ్ల వ్యాఖ్యలకు పెద్దగా స్పందించని జగన్. పులివెందుల సభలో ఎదురుదాడి చేశారు. వివేకా హత్యకేసులో అవినాశ్ ప్రమేయం లేదంటూ .. ఆయన ఓ చిన్నపిల్లోడు అని జగన్ చెప్పడం అందరినీ విస్మయపరిచింది. అంతేకాదు.. పసుపు చీర కట్టుకుంటే చంద్రబాబు మద్దతుదారులే అన్నట్లుగా జగన్ మాట్లాడటం చూస్తుంటే ఆయనలో ఓటమి భయం స్పష్టంగా కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డికి, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ చిన్న ఘటన జరిగినా, ఎవరు ప్రశ్నించినా దాని వెనుక తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నాడని ప్రజలను నమ్మించే ప్రయత్నం చేయడం జగన్కు అలవాటుగా మారింది. చంద్రబాబు పేరు ఎత్తకుండా జగన్ నిద్రపోయిన రోజు లేదనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. ఇటీవల బస్సు యాత్రలో గుర్తుతెలియని వ్యక్తులు జగన్పై రాయిదాడికి పాల్పడ్డారు. ఆ రాయి ఎటుపోయిందో దొరకలేదు కానీ, జగన్ కు కంటిపై భాగంలో గాయమైంది. రాయి వేయించింది కూడా చంద్రబాబే అన్నట్లుగా వైసీపీ నేతలు ప్రచారం చేశారు. హత్యాయత్నం అంటూ బిల్డప్ ఇచ్చారు. అయితే చివరికి ఆ బిల్డప్ నవ్వుల పాలైంది. జగన్ ప్రతిష్టను పలుచన చేసింది. దీంతో వివేకా హత్యకేసులో అవినాశ్ను వెనుకేసుకొస్తున్న జగన్ రెడ్డిని గట్టిగా నిలదీస్తున్న తన చెల్లెళ్లు షర్మిల, సునీతలపై జగన్ ఎదురుదాడికి, దిగజారుడు విమర్శలకు, వ్యాఖ్యలకు తెగబడ్డారు. వారు సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని జగన్.. వారి వెనక ఉందికూడా చంద్రబాబే అని పులివెందుల సభలో మాట్లాడటం ప్రజలను ఆశ్చర్యానికి గురిచేసింది. పసుపుపచ్చ చీర కట్టుకొని, చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్ట్ లు చదువుతున్నారంటూ తన చెల్లెళ్లపై అడ్డగోలుగా జగన్ నోరుపారేసుకున్నారు. ప్రతిపక్షాలపై అంటే రాజకీయంగా విమర్శలు చేశారని అనుచోవచ్చు.. కానీ, వివేకా హత్యకేసులో న్యాయంకోసం పోరాడుతున్న చెల్లెళ్లపైనా జగన్ ఇష్టానుసారంగా మాట్లాడటం పట్ల కడప జిల్లా ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. పులివెందుల సభలో జగన్ వ్యాఖ్యలపై చెల్లెళ్లు షర్మిల, సునీతలు స్పందించారు.. అన్నమాట్లాడిన ప్రతిమాటను గుర్తుచేస్తూ.. దానికి సమాధానం చెబుతూ జగన్ ను చెడుగుడు ఆడేశారు.
పసుపుపచ్చ చీర కట్టుకున్నవారంతా చంద్రబాబు మనుషులే అని జగన్ వ్యాఖ్యలు చేయడం పట్ల వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ఆగ్రహం చేశారు. నేను పసుపుపచ్చ చీర కట్టుకున్నానట, చంద్రబాబు స్క్రిప్ట్ నేను చదువుతున్నానట. పసుపు కలర్ ఏమైనా చంద్రబాబుకి పేటెంట్ రైటా ? కలర్ కొన్నారా..? గతంలో సాక్షి ఛానెల్కి పసుపు రంగు ఉండేది కాదా..? జగన్ రెడ్డి ఈ విషయాన్ని ఎలా మరిచిపోయాడు అంటూ షర్మిల ప్రశ్నించారు. పసుపు మనం వంటల్లో కూడా వేస్తాం.. అలాని వైసీపీ శ్రేణులు పసుపు వాడొద్దని జగన్ చెప్పగలరా? పసుపు మంగళకరమైన రంగు అని స్వయంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పారు. వైఎస్సార్ స్వయంగా సాక్షికి పసుపు రంగు పెట్టించారని షర్మిల గుర్తు చేశారు. అయినా, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నవ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగునా అంటూ షర్మిల నిలదీశారు. చంద్రబాబు రాసిచ్చిన స్ర్కిప్ట్ ను చెల్లెళ్లు చదువుతున్నారని జగన్ అనడంపై షర్మిల మండిపడ్డారు. సభలో ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను మక్కీకి మక్కీ చదివే జగన్ మోహన్ రెడ్డి.. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ ఎవరూ తనను చూడటం లేదని అనుకుంటుందట.. అలా ఉంది జగన్ తీరు అంటూ షర్మిల ఫైర్ అయ్యారు.
పులివెందుల సభలో జగన్ వ్యాఖ్యలపై వివేకానందరెడ్డి కుమార్తె సునీతరెడ్డికూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల రాయిదాడి ఘటనలో జగన్కు కంటి పైభాగంలో చిన్న గాయమైన విషయం తెలిసిందే. గాయమై వారం రోజులు అవుతున్నా జగన్ కట్టుమాత్రం తీయడం లేదు. ఎన్నికల ప్రచారం పూర్తయ్యే వరకూ జగన్ ఆ కట్టును అలానే ఉంచుతారా అనే డౌట్ ను ఏపీ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంపై సునీతారెడ్డి మాట్లాడారు.. జగన్ కు బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది. వైద్యులు సరైన సలహా ఇవ్వలేదనుకుంటా.. జగన్ త్వరగా బ్యాండేజ్ తీయాలని ఒక డాక్టర్ గా సలహా ఇస్తున్నట్లు సునీతా రెడ్డి సూచించారు. జగన్ పులివెందుల సభలో షర్మిలను, నన్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేయడం, ఐదేళ్లుగా నా తండ్రి హత్యపై పోరాడుతుంటే రాజకీయాలు అంటగట్టడం నాకు బాధేసింది. సీఎంను ప్రాధేయపడుతున్నా.. ఇప్పటికైనా నా పోరాటానికి సహాయం చేయండి అంటూ జగన్ రెడ్డిని సునీతా కోరారు. మొత్తానికి ఎన్నికల వేళ అవినాశ్ రెడ్డిపై షర్మిల, సునీత రెడ్డిలు చేస్తున్న వ్యాఖ్యల్లో నిజం ఉందని ప్రజలు నమ్ముతున్నారని భావించిన జగన్.. పులివెందుల సభ వేదికగా వారిపై ఎదురుదాడి చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వివేకా హత్యకేసులో అవినాశ్ రెడ్డి ప్రమేయం ఉందని సీబీఐ చెబుతున్నా జగన్ మాత్రం ఆయన్ను వెనుకేసుకొని రావడాన్ని కడప ప్రజలు సైతం జీర్ణించుకోలేక పోతున్నారు.