బాహుబలి రాకెట్ ప్రయోగం సక్సెస్ కావాలి.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్
posted on Dec 22, 2025 @ 10:15AM
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో మరో చారిత్రక ప్రయోగానికి రెడీ అయిపోయింది. ఎల్వీఎం 3 బాహుబలి రాకెట్ ద్వారా బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని ఈ నెల 24 ప్రయోగించనుంది. ఇది సెల్యులార్ కవరేజ్ లేని ప్రాంతాలకు సేవలు అందించడమే లక్ష్యంగా చేపట్టిన భారీ మిషన్. 4జీ, 5జీ సిగ్నల్ను నేరుగా సాధారణ స్మార్ట్ఫోన్లకు అందించడానికి ఉద్దేశించిన ప్రయోం. ఈ నెల 24 ఉదయం 8:54 నిమిషాలకు ఎల్వీఎం 3 శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి అంతరిక్షానికి దూసుకెళ్లనుంది.
ఎల్వీఎం 3 సిరీస్ లో ఇది తొమ్మిదది. ఈ ఏడాది ఇస్రో చేపట్టిన అయిదో ప్రయోగం ఇది. అమెరికాకు చెందిన ఏఎస్టీ స్పేస్మొబైల్ అభివృద్ధి చేసిన బ్లూబర్డ్ బ్లాక్ 2, ఉపగ్రహ టెలికమ్యూనికేషన్స్లో ఓ వ్యూహాత్మక ప్రయోగంగా భావిస్తున్నారు. బ్లూబర్డ్ బ్లాక్ శాటిలైట్ బరువు 6,100 కిలోలు. ఈ బాహుబలి రాకెట్ ఎత్తు 43.5 మీటర్లు. 640 టన్నుల బరువు. ఈ ప్రయోగం విజయవంతమైతే కమ్యూనికేషన్ల ముఖచిత్రం మారిపోతుందంటున్నారు. ఇలా ఉండగా ఈ బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్ తిరుమల శ్రీవారి ఆలయంలో బ్లూబర్డ్ 2 ఉపగ్రహానికి పూజలు చేశారు.