అసెంబ్లీ ఏమన్నా స్పీకర్ తమ్మినేని జాగీరా?

దేశ మొదటి లోక్‌సభ స్పీకర్‌గా వ్యహరించిన జి.వి మౌలాంకర్, నీలం సంజీవరెడ్డి నుండి జి.ఎంసీ భాలయోగి వరకు, రాష్ట్రంలోనూ అనేక మంది స్పీకర్లుగా వ్యవహరించి ఆ స్థానానికీ ఉన్న ఔన్నత్యాన్ని, ప్రతిష్టను, గౌరవాన్ని కాపాడి ఇప్పటికీ ప్రశంసలు అందుకొంటున్న మహనీయులు వున్నారు. ప్రతిపక్షాల హక్కులు కాపాడే  పరిరక్షకునిగా మౌలాంకర్‌ని ప్రతిపక్షాలు అభివర్ణించాయి ఆంటే ఎంత సమన్వయంతో,భాధ్యతతో సభను హుందాగా నడిపారో అర్ధం అవుతుంది. రాష్ట్రంలోనూ అనేక మంది స్పీకర్లుగా భాధ్యతలు నిర్వహించారు, ఎవ్వరూ కూడా ఈ విధంగా ప్రతిపక్ష సభ్యులుపై అహంకారంతో, ఏక పక్షంగా, తీవ్ర పదజాలంతో దురుసుగా ప్రవర్తించలేదు. ప్రభుత్వం అభివృద్దికి దోహద పడేలా పార్లమెంటరీ విలువలు, సత్ సాంప్రదాయాలు వ్యవస్థీకృతం అయ్యేందుకు సభాపతులు భాధ్యతగా వ్యవహరించాలి అని కేంద్ర చట్ట సభ అధ్యక్షుడుగా పని చేసిన సర్ అబ్దుల్ రహీమ్ కొన్నేళ్ళ క్రితమే ఉద్భోదించారు. 

కానీ గతంలో సభాపతులుగా ఉన్నవారు ఎవ్వరూ ఇంత నేలబారుగా వ్యవహరించలేదే? స్పీకర్‌గా తమ్మినేని వ్యక్తిగా ఏదైనా మాట్లాడవచ్చు.కానీ రాజ్యాంగ బద్ద పదవిలో వుండి స్పీకర్‌గా ఏది పడితే అది మాట్లాడటం దారుణం. కౌల్ అండ్  షగ్దర్ పార్లమెంటరీ వ్యవస్థలో నిష్ణాతులు, వారి ఆలోచన ప్రకారం స్పీకర్ స్థానానికి వుండే ఔన్నత్యాన్ని, గౌరవాన్ని కాపాడాలి. స్పీకర్ ఇండిపెండెంట్, ఇంపార్షియల్, పోలిటికల్లీ న్యూట్రల్, రాజకీయ వివాదాలకు దూరంగా వుండాలి. గతంలో స్పీకర్లుగా వ్యహరించిన వారు ఈ విధంగా మాట్లాడి ఎరుగరు ఎంతో హు౦దాగా వ్యవహరించారు. కనీసం సభా మర్యాద పాటించకపోవడమే కాకుండా నాలుగున్నరేళ్లుగా ప్రతిపక్షం తెలుగుదేశంపై కాలకూట విషం చిమ్ముతున్నారు. స్పీకర్‌ స్థానంలో ఉన్నవారు అంతకుముందు ఏదో ఒక రాజకీయ పార్టీతో సంబంధం ఉన్నవారు కావొచ్చు. అది కొత్తా కాదు. కానీ స్పీకర్‌ స్థానాన్ని స్వీకరించిన తరవాత నిష్పక్షపాతంగా వ్యవహరించే సంస్కారాన్ని అలవరచుకోకుండా  వికృతంగా విపక్షంపై విషం కక్కుతున్నారు. స్పీకర్ పదవి కోతికి కొబ్బరి చిప్ప దొరికిన చందంగా స్పీకర్ తమ్మినేని వ్యవహరిస్తున్నారు. పంది ఎంత బలిసినా నంది కాదన్న సామెత వుంది. అట్లాగే అల్పులకు ఎటువంటి పదవి దక్కినా ఆ పదవికి గౌరవం దక్కనివ్వరు.


                   స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఏకపక్షంగా, భాధ్యత లేకుండా అసెంబ్లీ తన జాగీరు అన్నట్లు వ్యవహరిస్తూ ప్రతిపక్షంపై విషం కక్కడాన్ని భరించలేక శాసనసభను పూర్తిగా బహిష్కరించింది ప్రతిపక్షం తెలుగుదేశం. వర్షాకాలం సమావేశాల్లో రెండో రోజు కూడా టీడీపీ సభ్యుల డిమాండ్ పట్టించుకోకుండా స్పీకర్‌ ఏకపక్షంగా సస్పెండ్‌ చేశారు. కనీసం  టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానం చాలా స్పష్టంగా ఉన్నా ప్రధాన ప్రతిపక్షం ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని ఒక్క అక్షరం పొల్లు పోకుండా చదవాల్సి వున్నా స్పీకర్‌ దాన్ని చూడకుండా పక్కన పెట్టి వైసీపీ కార్యకర్తలా వ్యవహరించారు. 

ఒక పక్కన వాయిదా తీర్మానం స్పీకర్‌  తిరస్కరిస్తున్నారు. మరోపక్క చర్చకు సిద్ధమని ప్రజలను మభ్యపెడుతున్నారు. గతంలో శాసనసభలో చర్చలు ఎలా జరిగాయో ఒక్కసారి గుర్తు చేసుకోవాలి ఈ దొంగ సర్టిపికెట్ల స్పీకర్. నాలుగున్నరేళ్ల నుంచి చట్టసభల్లో చంద్రబాబునాయుడిపైకి వైసీపీ సభ్యులను ఉసిగొల్పి తిట్టించడం తప్ప ఏనాడు ఈ స్పీకర్ సభలో   ప్రజాసమస్యలపై చర్చించించి ఎరుగడు. రాజ్యాంగబద్ధ పదవిలో వుండి అందరినీ సమానంగా చూడాల్సిన  స్పీకర్‌ ఏకపక్షంగా వ్యవహరిస్తూ  అధికారపక్షానికి కొమ్ముకాస్తున్నారు. ఏదైనా అంశంపై ప్రతిపక్షం పట్టుబడితే తీవ్ర స్వరంతో నీచంగా మాట్లాడిన మాటలు వున్నాయి. ఇటువంటి వ్యక్తి స్పీకర్ స్థానానికి అర్హుడేనా ?నాలుగున్నరేళ్లలో ఎప్పుడూ ఏ అంశంపైనా ప్రతిపక్షానికి అవకాశమివ్వలేదు. సభలో ప్రతిపక్ష పార్టీ.. సమస్యలపై  మాట్లాడకుండా మైకులు కట్‌ చేస్తూ  ప్రజా సమస్యలపై చర్చకు వచ్చే అవకాశం ఇవ్వకుండా అధికారపక్షానికి అండగా నిలుస్తున్నారు. జగన్ రెడ్డి  అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లు అయినా గత  ప్రభుత్వం చేసిన పనులపైనా, చంద్రబాబునాయుడిపై దుమ్మెత్తి పోయడమే పనిగా పెట్టుకున్నారీ వైసీపీ సభ్యులు. 

ప్రతిపక్షం వాస్తవాలు చెప్పడానికి ప్రయత్నిస్తే మైక్ కట్ చేస్తున్నారు. శాసనసభను వైసీపీ కార్యాలయంగా మార్చారు. తాను వైసీపీ కార్యకర్త అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్ష సభ్యులను యూజ్‌లెస్‌ ఫెలోస్‌ అనడం, అధికార పార్టీ సభ్యులను మన సభ్యులు అని మాట్లాడటం, ప్రతిపక్ష సభ్యులు తనవాళ్లు కాదంటూ మాట్లాడటం అంటే స్పీకర్‌ స్థానానికి  విలువను ఎంత దిగజార్చారో అర్ధమవుతోంది. 

వైసీపీ సభ్యులు  ప్రతిపక్ష సభ్యులను కుక్కలతో పోల్చి మాట్లాడుతున్నా స్పీకర్ వారిని మందలించలేదు. అధికార మదంతో కన్ను, మిన్ను కానకుండా మాట్లాడుతూ రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇస్తున్నారు. సొంత మీడియాను  సభలోకి అనుమతించి ప్రతిపక్ష సభ్యులు మాట్లాడేది మాత్రమే చూపిస్తూ, అధికారపక్ష సభ్యులు వ్యవహరిస్తున్న తీరు, వారు వాడుతున్న భాష  ప్రజలకు తెలియకుండా స్పీకర్‌ కట్టడి చేస్తున్నారు. కావునా పంది ఎంత బలిసినా నంది కాదన్న సామెత వుంది. అట్లాగే అల్పులకు ఎటువంటి పదవి దక్కినా ఆ పదవికి గౌరవం దక్కదు. ఆ స్పీకర్ స్థానానికే మాయని మచ్చ తెచ్చారు.

 నాలుగున్నరేళ్లుగా వైసిపి ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలు మొక్కుబడి తంతుగా నిర్వహిస్తున్నది. ఆరు నెలలకు ఒక సారి అసెంబ్లీ నిర్వహించాలి కాబట్టి బడ్జెట్ పద్దులు, వివిద బిల్లులు ఆమోదించు కొనేందుకు మాత్రమే అసెంబ్లీ నిర్వహిస్తున్నారు తప్ప ప్రజాసమస్యలు చర్చించి పరిష్కారం చూపేందుకు అసెంబ్లీ నిర్వహించడం లేదు. నాలుగున్నరేళ్ల లో 50 రోజులు మాత్రమే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించారు. విలువలకు పట్టంకట్టి రాష్ట్రాల శాసనసభలకు మార్గదర్శకంగా నిలవాల్సిన అత్యున్నత అసెంబ్లీ పనితీరు జగన్ అండ్ కో ఆధ్వర్యంలో ఏ స్థాయికి దిగజారిందో అర్ధం చేసుకోవడానికి ఈ గణాంకాలే నిదర్శనం. కనీసం ఏడాదికి సగటున 30 రోజులైనా సమావేశం కాని శాసన వ్యవస్థపై అలుముకొన్న చీకట్లకు అద్దం పడుతుంది. రాష్ట్రాల చట్టసభలు ఏడాదికి కనీసం 45 నుండి 50 రోజులు సమావేశం కావాలని జాతీయ రాజ్యాంగ సమీక్షా సంఘం ఏనాడో సూచింది. కానీ అసెంబ్లీ సమావేశాలను సైతం ప్రహసనంగా మార్చిందీ వైసిపి ప్రభుత్వం. 

ఆంధ్రప్రదేశ్‌లో ఏడాదికి పట్టుమని పది రోజులు కూడా నడవ లేదని పీఆర్ఎస్, ఓఆర్‌జి అధ్యయనం వెల్లడించింది. సభా సమయం తగ్గించడమే కాదు, చర్చలు లేకుండానే చట్టాలు రూపొందించడం ఆర్డినెన్సులతో పరిపాలించడం మరింత ప్రమాదకరం. శాసనసభను అగౌరవ పరిచే విధంగా అడ్డదారిలో ఆర్డినేన్సు తెచ్చి బడ్జెట్ ఆమోదించుకొన్నారు ఆ మధ్య. ఏడాదిపాటు రాష్ట్రానికి దిశా,నిర్ధేశం చేసే బడ్జెట్ సమావేశాలను ఒక తంతుగా ముగించారు. కోట్లాది ప్రజలకు సంబంధించిన కీలక బిల్లులుపై కూడా ఎటువంటి చర్చలేకుండా మందబలంతో ఆమోదించుకొని అసెంబ్లీని ఉత్సవ విగ్రహంగా మార్చిన ఘనత జగన్ ప్రభుత్వానిదే. అన్ని వ్యవస్థలను ధ్వంసం చేసినట్లే ప్రజాస్వామ్య వ్యవస్థ అయిన అసెంబ్లీని నిర్వీర్యం చేశారు. జరిగే కొద్దీ రోజులు అసెంబ్లీ సమావేశాల్లోనూ అబద్దాలు, సస్పెన్షన్లు తప్ప ప్రజలకు ఒరిగింది ఏముంది?

           అయిదు కోట్ల ప్రజల మనోభీష్టాలను ప్రతిబింబించే రాజ్యాంగ దేవాలయాన్ని తన రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకొనే వేధికగా మార్చారు. శాసనసభను కేవలం చట్టాలు చేసే సభగానే, బడ్జెట్ పద్దులను ఆమోదించుకొనే సభగానే పరిగణిస్తుంది తప్ప సగటు జీవి ఈతి భాధలపై అసెంబ్లీలో చర్చ జరగాలని ఇప్పటి వరకు నిర్వహించిన సమావేశాల ద్వారా రుజువైంది? ప్రజా సమస్యలు చర్చించి పరిష్కారం చూపడానికి, ప్రజల అవసరాలు తెలియ చెప్పడానికి ఒక అవకాశంగా ఉండాల్సిన శాసనసభను అమీ, తుమీ తేల్చుకొనే బరిలా మార్చారు. అసెంబ్లీ  నిర్వహణను సైతం ఏకపక్షంగా మార్చిన తీరు దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. ప్రజా సమస్యలను చట్టసభల్లో ప్రస్తావించడం, పరిష్కరించడం ప్రజా ప్రతినిధుల ప్రాథమిక కర్తవ్యం. ప్రజాసమస్యలు ప్రస్తావించడానికి ప్రయత్నించిన ప్రతిపక్ష సభ్యులను  చట్టసభల నుండి బయటకు నెట్టి, ప్రజా ప్రతినిధుల హక్కులను, చట్టబద్దంగా వారు చేయాల్సిన విధులను అడ్డుకొంటున్నారు.  

అనేక  అంశాలను ప్రస్తావనకు తేకుండా చట్టసభల్లో తనకున్న మంద బలంతో అడ్డుపడుతున్నారు. జగన్ ప్రభుత్వం ప్రతిపక్షమంటేనే లెక్కలేని విధంగా వ్యవహరిస్తోంది. ప్రతిపక్షం లేవనెత్తే ఏ అంశాన్ని కూడా జగన్  ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలు లేవు. ప్రజా సమస్యలు కూడా చర్చకు రాకుండా జగన్  ప్రభుత్వం వ్యవహరిస్తున్న ఈ తీరు ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరం. ఒక వ్యూహం ప్రకారం మంద బలంతో ప్రజాస్వామ్యంపై చేస్తున్న దాడిగా ప్రజలు పరిగణించాలి.

ప్రస్తుతం రాష్ట్రంలో అన్నివర్గాల ప్రజలు సమస్యలతో హాహాకారాలు చేస్తున్నారు. అన్నిరంగాలు నేలమట్టం అయ్యాయి. వ్యవసాయ సంక్షోభం, రైతు ఆత్మహత్యలు,  రైతాంగం కష్టాలు ఆకాశాన్ని అంటిన నిత్యావసరాల ధరలు, పన్నులు భారం, యువతను చుట్టుముట్టిన నిరుద్యోగం, ఎయిడెడ్ విద్యా సంస్థలు మూసివేత,  ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, బీసి, ఎస్సీ, ఎస్టీ,  ముస్లిం మైనారిటి సబ్ కాంపోనెంట్ నిధుల మళ్లింపు, విద్యుత్తు చార్జీల పెంపు, తీవ్ర ఆర్ధిక సంక్షోభం వంటి అనేక అంశాలన్నింటిపై సమగ్ర చర్చ జరగాల్సి వుంది. కానీ ప్రభుత్వం సమస్యలు వదిలేసి చంద్రబాబుని అక్రమంగా అరెస్టు చేసి సంబరాలు చేసుకొంటున్నది అసెంబ్లీలో. ఏనాడూ ప్రజా సమస్యలపై చర్చ అసెంబ్లీలో జరిగిన ధాఖలాలు లేవు. సభలో సమస్యలు  వదిలేసి స్కోత్కర్షాలు విపిస్తున్నారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ముఖ్యమంత్రికి భజన చేస్తున్నారు. అంతే తప్ప సమస్యలపై చర్చించేందుకు ముందుకు రావడంలేదు. ఎమ్మెల్యేలను, మంత్రులను ప్రతిపక్షంపైకి సియం జగన్ ఉసి గొల్పితున్నారు. అన్నీ వ్యవస్థలను తమ గుప్పెట్లో పెట్టుకొన్నట్లే అసెంబ్లీలో కూడా  తమ పరిపాలనను, తప్పులను ఎవరు ప్రశ్నించరాదనే ఉద్దేశ్యంతో వ్యవహరిస్తున్నారు. చట్ట సభలంటే జగన్మోహన్ రెడ్డికి ఏనాడూ గౌరవం లేదు, ప్రజాస్వామ్యం, రాజ్యాoగంపై అసలే నమ్మకం లేదు. అసెంబ్లీ కూడా జగన్ తన జాగీర్‌గా,స్పీకర్ తమ్మినేని కూడా అసెంబ్లీ తన జాగీరుగా భావిస్తున్నారు. సభలో సమస్యలపై చర్చించకుండా సమస్యలపై చర్చలకు ససేమిరా అనడం, పట్టుపట్టిన ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్ చేసి సభా కార్యక్రమాలు జరుపుకోవడం జగన్ మార్క్ నిరంకుశత్వానికి నిదర్శనం. సభాసమయం తగ్గించడమే కాదు, సభలో ప్రజా సమస్యలు లేవనెత్తిన ప్రతిపక్షాన్ని బయటకు నెట్టడం, చర్చలు లేకుండానే చట్టాలు రూపొందించడం,  ఆర్డినెన్సులతో పరిపాలించడం జగన్ మార్క్ నిరంకుశ  రాజకీయానికి నిదర్శనమని చెప్పాలి.    
                                       
అట్లాగే ఈ మధ్య బ్లాక్ క్యాట్ కమాండోస్ ను తొలగిస్తే చంద్రబాబు ఫినిష్ అయిపోతారన్నారు స్పీకర్ తమ్మినేని. కానీ తెలుగుదేశాన్ని, చంద్రబాబుని ఫినిష్ చేస్తామని సవాళ్ళు రువ్విన వారు ఇప్పుడు ఎక్కడ వున్నారో ఆన్న విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. అధికార మదంతో కన్ను, మిన్ను కానకుండా తల్లి పాలు తాగి రొమ్ము గుద్దిన విధంగా మాట్లాడం చూసిన ప్రజలు ఛీ కొడుతున్నారు. రాజ్యాంగ పదవికి దహన సంస్కారం చేస్తున్నారు. రాజ్యాంగ బద్ద పదవికి రాజీనామా చేసి రాజకీయాలు మాట్లాడాలి.. గత ఎన్నికల్లో వివేకానందరెడ్డి హత్యను రాజకీయం చేసి లబ్ది పొందారు. ఇప్పుడు చంద్రబాబును అడ్డు తొలగించుకొని అధికారంలోకి రావాలని చూస్తున్నారు. చంద్రబాబుపై స్పీకర్ చేసిన పైత్యపు విమర్శలు ఆయన యజమాని జగన్మోహన్ రెడ్డి ఆనందపడటానికి పనికి వస్తాయి తప్ప ప్రజలకు పనికి రావు.  ప్రజాస్వామ్య ఉద్యమం ద్వారా ప్రజలను చైతన్యపరిచి అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి ప్రతి పక్షం తెలుగుదేశం పార్టీ రాజీలేని పోరాటం చేస్తుంది. మంచికి - చెడుకు, ధర్మానికి- అధర్మానికి, న్యాయానికి- అన్యాయానికి మధ్య జరిగిన ప్రతియుద్ధంలో ధర్మం, న్యాయానిదే పైచెయ్యి అయిన విషయం తెలుసుకొండి. అహంకారులకు, గర్వపోతులకు ప్రజల చేతిలో శృంగభంగం తప్పదు. ప్రజల చేతిలో ఓటమి శిక్షకు జగన్ ముఠా అంతా  సిద్ధంగా ఉండాలి. వ్యక్తిత్వం లేని కురచ బుద్దులు వున్న వారు రాజ్యాంగ బద్ద పదవిలో వుంటే ఈ విధంగానే మాట్లాడుతారు. నేను తెలుగుదేశం జెండా కప్పుకొనే చస్తానని ప్రగల్భాలు పలికిన తమ్మినేని... నారా చంద్రబాబు ఫినిష్ కావాలని మాట్లాడటం ఆయన అహంభావానికి నిదర్శం. కావునా అధికారం వుందని విర్రవీగ కండి, అన్నీ రోజులు మీవి కావు.రోజులు దగ్గర పడుతున్నాయి. ప్రజలు తిరుగుబాటుతో ప్రపంచ చరిత్రలో ఎందరో నియంతలు కాలగర్భంలో కలిసిన విషయాన్ని గుర్తు తెచ్చుకొండి. అధికార మదంతో కన్ను, మిన్ను కానకుండా మాట్లాడుతూ రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇవ్వడం మంచిది కాదు. సీనియర్ నాయకుడిగా ఇటువంటి దిగజారుడు మాటలు మాట్లాడటం సిగ్గు చేటు. దీనినే వినాశకాలే, విపరీత బుద్ది అంటారు.


నీరుకొండ ప్రసాద్ 
సీనియర్ జర్నలిస్ట్

ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలేంటంటే?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమైంది. వెలగపూడిలోని సచివాలయంలో జరుగుతున్న ఈ కేబినెట్  భేటీలో రాష్ట్ర అభివృద్ధి,  పాలనాపరమైన కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.  ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా   కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే  కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.  అమరావతిని గ్లోబల్ క్వాంటమ్ హబ్‌గా మార్చే లక్ష్యంతో.. రూ.103.96 కోట్ల వ్యయంతో రెండెకరాల విస్తీర్ణంలో అత్యాధునిక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ చర్చించి ఆమోదముద్ర వేయనుంది.  అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణలో పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టడంపై సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.  ఇకపోతే..  రాజధాని అమరావతి అభివృద్ధి పనుల వేగవంతంపై కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో  సంక్షేమ పథకాల అమలు తీరుపై కూడా సమీక్ష జరిగే అవకాశం ఉంది.   ఇంకా వర్షాకాలంలో రాజధాని పరిసర ప్రాంతాలను వరద ముంపు నుంచి కాపాడేలా ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే  అఖిల భారత సేవా అధికారుల నివాస భవనాలకు అదనపు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు  109 కోట్ల రూపాయల కేటాయింపునకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.   అమరావతి పరిధిలోని శాఖమూరు లో 23 ఎకరాలలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల  నిర్మాణానికీ, అలాగే తాళ్లూరులో  6 ఎకరాలో  హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా కేబినెట్ పచ్చ జెండా ఊపే అవకాశం ఉంది. ఎల్పీఎస్ జోన్-8 పరిధిలో లేఅవుట్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం  నిధుల కేటాయింపుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక రాజధాని పరిధిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకూ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.  

సినిమాలకు తమిళ హీరో విజయ్ గుడ్ బై.. రాజకీయాలకే పూర్తి సమయం

రాజకీయ నాయకుడిగా మారిన తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పారు. ఆయన తమిళ వెట్రి కళగం అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీ సభలో తొక్కిసలాట జరిగి 40 మందికి పైగా మరణించిన సంఘటనతో ఆయన తొలి అడుగులు ఒకింత తడబడ్డాయి.  దాని నుంచి తేరుకుని ముందుకు సాగడానికి ఒకింత సమయం తీసుకున్న విజయ్ ఇప్పుడ పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగానే  సినిమాల‌కు గుడ్ బై చెప్పారు విజ‌య్.  ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం. వచ్చే ఏడాది త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ ఎన్నికలకు విజయ్ సర్వసన్నద్ధం అవుతున్నారు.  ఏ పార్టీలతోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే ఎన్నికల సమరంలోకి అడుగుపెట్టనున్నట్లు  ఆయన ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే రాజకీయవర్గాలలో విజయ్  టీవీకే పార్టీకి ఉన్న విజయావకాశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలోనే సీఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో టీవీకే విజయం కంటే ఎన్డీయే కూటమికి భారీ నష్టం కలిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తేలింది.  టీవీకే పోటీ వల్ల బీజేపీ, అన్నాడీఎంకే  కూటమి ఓట్లు భారీగా చీలుతాయని పేర్కొంది. అంటే విజయ్ పార్టీ పోటీ వల్ల లాభపడేది అధికార డీఎంకే అన్నది సీఓటర్ సర్వే సారాశంం.   ఇక సైద్ధాంతికంగా బీజేపీతో, రాజ‌కీయంగా డీఎంకేతోనే త‌మ  పోటీ అని విజయ్ ప్రకటించిన నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. విజయ్ స్వయంగా మధురై ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.  విజయ్ ది చెన్నై. అయితే ఆయ‌న మ‌ధురైని త‌న సొంత  నియోజ‌క‌వ‌ర్గం చేసుకోవాల‌ని భావిస్తున్నారు. స్టార్ హీరో కావడంతో విజయ్ కు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. సామాన్య జనంలోనూ మంచి పాపులారిటీ ఉంది. దీంతో మధురైలో ఆయన స్థానికేతరుడు అన్న సమస్య తలెత్తే అవకాశం ఉండదన్నది పరిశీలకులు అంచనా.    ఇక పోతే విజ‌య్ పార్టీకి సంబంధించినంత వరకూ ఆ పార్టీలో విజయ్ వినా పెద్దగా  ఫెమిలియ‌ర్ ఫేస్ మరొకటి లేదు. ఒక వేళ విజ‌య్ పార్టీలోకి రావడానికి డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్ వంటి  పార్టీలు ఆసక్తి చూపుతున్నా.. వారికి రెడ్ కార్పెట్ పరిచి పార్టీలోని ఆహ్వానించడానికి విజయ్ పెద్దగా సుముఖత చూపడం లేదు.  ఆయ‌న వారిని ఏమంత‌గా  తీసుకోవ‌డం లేదు.  ఏపీ నుంచి న‌గ‌రి మాజీ ఎమ్మెల్యే రోజా సైతం త‌న భ‌ర్త ఇన్ ఫ్లూయెన్స్ వాడి విజ‌య్ ఏర్పాటు చేసిన టీవీకేలో చేరాల‌ని ప్రయత్నించినా, ఆమెకు అక్కడ నుంచి పెద్దగా సానుకూలత వ్యక్తం కాలేదని అంటున్నారు. దీంతో పార్టీలో పెద్దగా పాపులర్ అండ్ ఫేమస్ నేతలు లేకపోవడం విజయ్ టీవీకే పార్టీకి ఒకింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.   ఒక తమిళ రాజకీయాలలో ప్రస్తుత పరిస్థితిని ఒక సారి గమనిస్తే.. రాష్ట్రంలో  బీజేపీకి ఉన్న పట్టు అంతంత మాత్రమే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పొత్తులో భాగంగా ఒకటి రెండు స్థానాలు దక్కితే అదే చాలనుకునే పరిస్థితిలో  బీజేపీ ఉంది.  దీంతో ప్రధాన పోటీ  డీఎంకే- టీవీకే మ‌ధ్యే ఉంటుందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.    ఇక విజ‌య్ టీవీకే పార్టీ నుంచి అత్యధికంగా ఆయన అభిమాన సంఘాల నాయకులకే టికెట్ లు లభించే అవకాశం కనిపిస్తోంది. అంటే టీవీకే తరఫున పోటీ చేసే అభ్యర్థులలో అత్యథికులు ఆ పార్టీ నేత విజయ్ తో కలిసి రాజకీయాలకు కొత్తవారే అవుతారు. ఇది పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. మొత్తం మీద  డీఎంకే,  టీవీకే మ‌ధ్య  ముఖాముఖీ అన్నట్లుగా జరగనున్న   త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉందనడంలో సందేహం లేదు.  

అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేసీఆర్.. హీట్ మామూలుగా ఉండదుగా?

తెలంగాణ ఆవిర్భావం తరువాత వరుసగా రెండు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్.. 2023 అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత ప్రతిపక్ష నాయకుడి పాత్రకు పరిమి తమయ్యారు. అయితే ఆ పాత్రలో ఆయన ఎంత మాత్రం క్రియాశీలంగా లేరు. ఓటమి తరువాత ఆయన పూర్తిగా ఇన్ యాక్టివ్ అయిపోయారు. పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ప్రతిపక్ష నేతగా ఆయన అసెంబ్లీకి కూడా హాజరు కాకుండా రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారా అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన  ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.   అయితే పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత, ఆయన అనివార్యంగా రాజకీయాలలో క్రీయాశీలం కావలసిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ ఉనికిని కాపాడుకోవడానికీ, పార్టీని బలోపేతం చేయడానికి కేసీఆర్ స్వయంగా నడుంబిగించకుంటే లాభం లేదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో కూడా బలోపేతం అవుతోంది. దీంతో తన పొలిటికల్ అజ్ణాత వాసానికి ఫుల్ స్టాప్ పెట్టి జనంలోకి రావడానికి సిద్ధమైపోయారు. తాజాగా ఇటీవల ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో జరిపిన సమావేశంలో ఇక నుంచీ తాను పొలిటికల్ గా క్రియాశీలమౌతాననీ,  అదే సమయంలో అసెంబ్లీలో పార్టీ తరఫున బలమైన గొంతు వినిపించాల్సిన అవసరాన్ని గట్టిగా చెప్పారు. ఈ మాటలే ఆయన ఈ సారి అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరు అవుతారని తేటతెల్లం చేసింది. అయినా ఎక్కడో ఏదో అనుమానం.  గతంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో కూడా ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనీ, అధికార పక్షాన్ని తన ప్రశ్నల పరంపరతో ఉక్కిరిబిక్కిర చేస్తారనీ బీఆర్ఎస్ వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలను సభ సాక్షిగా ఎండగడతారనీ బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా నమ్మాయి. అయితే  అయితే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. గొంతు విప్పలేదు. ఫామ్ హౌస్ గడప దాటలేదు. మరి ఇప్పుడైనా అసెంబ్లీకి వస్తారా? అన్న అనుమానాలు పరిశీలకుల నుంచే కాదు, పార్టీ శ్రేణులనుంచి కూడా వ్యక్తం అయ్యాయి. అయితే ఆ అనుమానాలన్నిటినీ పటాపంచలు చేస్తూ కేసీఆర్ ఈ సారి అసెంబ్లీ హాజరౌతున్నారు. సోమవారం (డిసెంబర్ 29) ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు.  ఇక ఇప్పుడు ఆయన అసెంబ్లీలో గొంతు విప్పి రేవంత్ సర్కార్ ను ఇరుకున పెడతారా? స్పీకర్ ఆయనకు కోరినంత సమయం మైక్ ఇస్తారా? లేకుంటే? అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేసీఆర్  తలపడితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరు పై చేయి సాధిస్తారు అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది. మొత్తం మీద కేసీఆర్ హాజరుతో ఈ శీతాకాల సమావేశాలు రోహిణీ కార్తెను మించిన హీట్ తో సాగుతాయనడంలో ఎలాంటి సందేహాలు లేవంటున్నారు. 

కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామ్ తో చంద్రబాబు భేటీ.. ఎక్కడంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు ఆమెతో భేటీ అయ్యారు. ఇరువురి మధ్యా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ  అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.   రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి   సహకారం, బడ్జెట్ లో ప్రాధాన్యత వంటి అంశాలను చంద్రబాబు ఆమెతో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం చంద్రబాబు కృష్ణా జిల్లా  పెద్దఅవుటపల్లిలోని మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు నివాసానికి వెళ్లారు ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కంభంపాటి తల్లి వెంకటనరసమ్మ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కంభంపాటి రామ్మోహనరావు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు.   వెంకటనరసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

దేశం శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధికి కారణం ఇందిరా, రాజీవ్‌లే : టీపీసీసీ చీఫ్

  శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా గాంధీ, పటేల్ చిత్రపటాలకు పూలమాల సమర్పించి టీపీసీసీ చీఫ్ నివాళులు అర్పించారు. ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని ప్రగతి పథంలో నడిపింది పీవీ నరసింహారావు అని గుర్తు చేశారు. పేద ప్రజలకు ఉపయోగపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని తీసుకొస్తే మోదీ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.  మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ మహారథి జాతి నిర్మాణ సారథి. ప్రజాస్వామ్య ఆకాంక్షల వారధి. పేదల ఆకలి తీర్చిన పెన్నిధి. 140 కోట్ల భారతీయుల ప్రతినిధి. 141 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం.  కార్యకర్తల చెమట చుక్కలే సిరా చుక్కలై రాసిన చరిత్ర కాంగ్రెస్. కార్యకర్తలకు, నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు.

ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు కాంగ్రెస్ నిరసనలు

  జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రను గ్రామీణ ప్రజలకు తెలియజేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చిందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేపు (28న) గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ శ్రేణులు మహాత్మాగాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టాయని ఆయన తెలిపారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మహాత్మా ఉపాధి హామీ పథక అమలు బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం పక్కకు తప్పుకోవాలని చూస్తోందని, పేదలు, గ్రామీణ కూలీలకు భరోసాగా ఉన్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే గాంధీ పేరును తొలగించే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. దీనికి నిరసనగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 28న రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాల వద్ద, గాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసనలు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి, పనికి ఇచ్చే గౌరవాన్ని ప్రజలకు వివరంగా తెలియజేయాలని సూచించారు.రేపు జరగబోయే నిరసన కార్యక్రమాలను పెద్దఎత్తున విజయవంతం చేయడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.

రేపో మాపో రేవంత్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ?

తెలంగాణ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ముహూర్తం ఖరారైందా? రేపో మాపో రేవంత్ కెబినెట్ పునర్వ్యవస్థీకరణ చేయనున్నారా? అన్న చర్చ తెలంగాణ రాజకీయాలలో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం రేవంత్ హస్తిన పర్యటకు బయలుదేరనున్నారు. శనివారం (డిసెంబర్ 28) హస్తినలో జరిగే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆ తరువాత ఆయన కాంగ్రెస్ పెద్దలతో భేటీ అవుతారు. ఈ భేటీ ప్రధాన అజెండా మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణే అంటున్నారు. ప్రస్తుతం రేవంత్ కేబినెట్ లో రెండు ఖాళీలు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ రెండు బెర్తులకు తీవ్ర పోటీ ఉంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, ఆది శ్రీనివాస్, బాలూనాయక్ ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరిలో గత ఏడాది కాలంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డిలు బహిరంగంగానే తమకు మంత్రిపదవి ఖాయమన్న ప్రకటనలు చేస్తున్నారు. కొండొకచో.. ఎలాంటి దాపరికం లేకుండా తమ అసంతృప్తినీ వ్యక్తం చేస్తున్నారు. ఇక బీసీ కోటాలో ఆది శ్రీనివాస్, ఎస్టీ కోటాలో బాలూ నాయక్ లూ రేసులో ఉన్నారు. ఈ నేపథ్యంలో రేవంత్ కేవలం కేబినెట్ విస్తరణ కాకుండా పునర్వ్యవస్థీకరణకు అనుమతి ఇవ్వాలని హైకమాండ్ ను కోరనున్నారు. ఇందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. మార్పులు, చేర్పులతో కేబినెట్ ను పున్వ్యవస్థీకరించి కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.   

జగన్ విపక్ష నేత కావడం కల్ల.. రఘురామకృష్ణం రాజు

తనపై మూడు కేసులున్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డెప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు స్పందించారు. తనదైన శైలిలో ఆ ప్రచారాన్ని తిప్పి కొట్టారు. ఆరోపణలు చేస్తున్న వారికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు. ఆ కేసులకు సంబంధించి తాను నిర్దోషిగా బయటకు వస్తానన్న ధీమా వ్యక్తం చేశారు. పశ్చిమగోదావరి జిల్లా పెదఅమిరంలో తన కార్యాలయంలో    మీడియాతో మాట్లాడిన ఆయన తనపై ఆరోపణలు వస్తున్న కేసులో ఎలాంటి ఛార్జిషీటు దాఖలు చేయలేదన్నారు.   తనను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేయడంపై రఘురామకృష్ణం రాజు మండిపడ్డారు. రాజ్యాంగ పదవిలో ఉన్నందున మౌనంగా ఉన్నానన్న ఆయన..  11 కేసులున్న వ్యక్తి ముఖ్యమంత్రిగా చేయలేదా? అని ప్రశ్నించారు.    తనపై పదే పదే ఆరోపణలు చేస్తున్న కొందరు వ్యక్తుల గురించి తాను మాట్లాడనని, అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. తన కేసుపై తాను పోరాటం చేస్తానని, ఇందులో ఎవరి మద్దతు అవసరం లేదన్నారు.   తాను ఏ తప్పూ చేయలేలదన్న ఆయన  తనకు పార్టీకి మధ్య గ్యాప్ క్రియేట్ చేసే ప్రయత్నం  జరుగుతోందని ఆరోపించారు.  అలాగే ఏపీ మాజీ సీఎం తీరుపైనా తీవ్ర విమర్శలు చేశారు.  ఆయన తన తీరు మార్చుకోకుండా ఎప్పటికీ కనీసం ప్రతిపక్ష నేత కూడా కాలేరని అన్నారు.జగన్ తన ప్రవర్తన మార్చుకుంటే.. వచ్చే ఎన్నికలలోనైనా ప్రతిపక్ష హోదాకు అవసరమైనన్ని స్థానాలలో గెలుపొంది ప్రతిపక్ష నాయకుడు అవుతారని తాను భావించాననీ, కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఆ అవకాశం లేదనిపిస్తోందన్నా. 2020 నుంచే జగన్ తనపై బురద జల్లుతున్నారనీ, తనను హత్య చేయాలని కూడా చూశారన్న రఘురామకృష్ణం రాజు అయినా తాను భయపడకుండా పోరాడానన్నారు.   

తన హత్యకు కుట్ర.. దువ్వాడ శ్రీనివాస్ సంచలన ఆరోపణలు

వైసీపీ మాజీ నేత దువ్వాడ శ్రీనివాస్ మరో సారి తన మార్క్ రాజకీయ సంచలనం సృష్టించారు.  తన ప్రాణాలకు ముప్పు ఉందనీ, తనను హత్య చేయడానికి కుట్రపన్నారంటూ శుక్రవారం (డిసెంబర్ 27) అర్ధరాత్రి  నిమ్మాడ హైవేపై ఆయన  హల్‌చల్ చేశారు.  ఈ సందర్భంగా ఆయన వైసీపీపై విమర్శలు గుప్పించారు. ఇప్పటికే తనను వైసీపీ నుంచి బహిష్కరించారనీ, ఇప్పుడు భౌతికంగా లేకుండా చేయడానికి ప్రయత్నిస్తున్నారంటూ ఆరోపణలు గుప్పించారు.దీన్నంతా ఓ వీడియోగా తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ తరువాత కొద్ది సేపటికి దువ్వాడ మాధురి ఓ ఆడియో క్లిప్పింగ్ విడుదల చేశారు.  తన ఆరోపణలకు ఆధారాలు అన్నట్లుగా   దువ్వాడ వీడియో విడుదలైన కొద్దిసేపటికే.. దివ్వెల మాధురి ఒక ఆడియో క్లిప్పింగ్‌ను బయటపెట్టారు.   ఆ ఆడియో క్లిప్పింగ్ లోని  దువ్వాడ శ్రీనివాస్ అనుచరుడు   కింజారపు అప్పన్న, దివ్వెల మాధురిల సంభాషణ మేరకు.. రామస్వామి అనే వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్‌పై దాడికి ప్రణాళిక రూపొందించాడని కింజారపు అప్పన్న దివ్వెల మాధురితో చెబుతున్నారు.   దువ్వాడ శ్రీనివాస్ విడుదల చేసిన వీడియో, దివ్వెల మాధురి బయటపెట్టిన ఆడియో సామాజిక మాధ్యమంలో వైరల్ గా మారాయి.  సొంత పార్టీ నేతలే తనపై కుట్ర చేస్తున్నారని దువ్వాడ చేస్తున్న ఆరోపణలు వైసీపీలో అంతర్గత విభేదాలను మరోసారి బహిర్గతమయ్యాయి. ఇంతకీ తనను హత్య చేసేందుకు కుట్రపన్నుతున్నది వైసీపీ సీనియర్ నేత ధర్మాన కృష్ణదాస్ అని దువ్వాడ శ్రీనివాస్ ఆరోపిస్తున్నారు. తాను చావుకు భయపడనన్న దువ్వాడ.. తనపై దాడి చేయడానికి ఎవరోస్తారో రండి అంటూ సవాల్ విసిరారు. శ్రీకాకుళంలో తాను స్వతంత్రంగానే రాజకీయాలు చేస్తానన్న దువ్వాడ    తనను వైసీపీ నుంచి పూర్తిగా బయటకు పంపిస్తే శ్రీకాకుళం జిల్లాలో ఇండిపెండెంట్ గా నిలబడి తన సత్తా ఏంటో నిరూపిస్తానని సవాల్ విసిరారు. పార్టీలో జరుగుతున్న అవినీతిని ప్రశ్నించినందుకే తనను టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు. తనపై హత్యకు కుట్రపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. 

ఫిబ్రవరి రెండో వారంలో తెలంగాణ మునిసిపల్ ఎన్నికలు!?

  పంచాయతీ ఎన్నికల విజయంతో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఫుల్ జోష్ లో ఉంది. ఇదే జోష్ లో మునిసిపల్ ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది.  విద్యార్థుల పరీక్షల సీజన్ ప్రారంభం కాకముందే.. అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరి రెండో వారం నాటికే మునిసిపల్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని రేవంత్ సర్కార్ కృత నిశ్చయంతో ఉన్నట్లు కనిపిస్తోంది.  వచ్చే ఏడాది  మార్చిలో విద్యార్థులకు వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అందుకే ఆ పరీక్షలకు ఎటువంటి ఆటంకం లేకుండా, అంతకు ముందుగానే మునిసిపల్ ఎన్నికల ప్రక్రయను పూర్తి చేసే ఉద్దేశంతో ముందుకు సాగుతున్నది.  ఈ నేపథ్యంలోనే వచ్చే ఏడాది జనవరి  మూడో వారం నాటికి ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని  ఇప్పటికే రేవంత్ సర్కర్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు సూచించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అదలా ఉంటే రాష్ట్రంలోని  120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్ల పాలకవర్గాల గడువు 2025 జనవరితోనే గడువు ముగిసింది. అప్పటి నుంచీ ఇవన్నీ ప్రత్యేక అధికారల పాలనలో కొనసాగుతున్నాయి.  ఇక పోతే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్,  ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ల గడువు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ముగియనుంది. దీంతో వీటికి కూడా వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే ఎన్నికలు జరిపించాలని ప్రభుత్వం భావిస్తున్నది. అయితే.. పాలకవర్గాల గడువు వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు ఉన్న మహబూబ్‌నగర్, నల్గొండ  మున్సిపాలిటీల కు మాత్రం ఇప్పుడు అంటే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగే అవకాశాలు లేవు.  ఇలా ఉండగా   హైదరాబాద్ ఓఆర్‌ఆర్‌  పరిధిలోని 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను జీహెచ్‌ఎంసీలో విలీనం చేస్తూ   ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసివదే. అలాగే కొన్ని  నగర పంచాయతీలను మున్సిపాలిటీలుగా, మున్సిపాలిటీలను కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్ చేసింది. దీంతో జీహెచ్‌ఎంసీ సహా మొత్తం 8 కార్పొరేషన్లు, 125 మున్సిపాలిటీలలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.   వచ్చే ఏడాది జనవరి రెండో వారానికల్లా  ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది.ఇందుకు సబంధించిన కసరత్తు కూడా ప్రారంభమైంది. అలాగే ప్రభుత్వం ఎప్పుడు పచ్చ జెండా ఊపితే అప్పుడు మునిసిపల్ ఎన్నికల షెడ్యూల్, నోటిఫికేషన్ విడుదలకు రాష్ట్రఎన్నికల కమిషన్  సిద్ధంగా ఉంది.