ఐఎస్ బీ ద్విదశాబ్ది ఉత్సవాలకు చంద్రబాబుకు ఆహ్వానం
posted on Nov 8, 2022 @ 10:14AM
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐఎస్ బి), హైదరాబాద్ ద్విదశాబ్ది ఉత్సవాలకు మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడుకు ఆహ్వానం అందింది. ఐఎస్బీ నుంచి ఉన్నత స్థాయి బృందం చంద్రబాబు నివాసానికి వచ్చి మరీ ఆహ్వానం అందించారు. ఐఎస్ బీ ద్విదశాబ్ది ఉత్సవాలకు చంద్రబాబుకు ఆహ్వానం నిజంగా పెద్ద విశేషమే. ఎందుకంటే ఐఎస్ బీ హైదరాబాద్ లో స్థాపించిన క్రెడిట్ ను ఇంత కాలం ఆయనకు ఇవ్వకుండా రాజకీయం అడ్డుపడిందని పరిశీలకులు పలు విశ్లేషణలు చేశారు.
అయితే ఇప్పుడు రాజకీయం మారిందా అంటే పరిస్థితిని బట్టి మారిందనే అనుకోవాల్సి వస్తోంది. రాజకీయ పరిస్థితుల కారణంగా చంద్రబాబును ఐఎస్ బీ విషయంలో ఇగ్నోర్ చేసినా హైదరాబాద్ కు ఐఎస్ బీ రావడం వెనుక ఆయన కృషి దార్శనికత మాత్రం ఎవరూ కాదనలేరు. అది చరిత్ర. మహా మహా నగరాలను కాదని ఐఎస్ బీ హైదరాబాద్ లోనే ఏర్పాటు కావడానికి వెనుక ఎం జరిగిందో ఒక సారి అవలోకనం చేసుకుంటే... అప్పటికే ఐటీ హడ్ గా అమెరికా తరువాత అంతటి గుర్తింపు పొందిన బెంగళూరు (కర్నాటక)ను, భారత వాణిజ్య రాజధాని ముంబై అప్పటి బొంబై ( మహారాష్ట్ర)లను కాదని ఐఎస్ బీని హైదరాబాద్ ( అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజధాని)కు తీసుకువచ్చిన చంద్రబాబు సమర్థత కళ్లకు కడుతుంది.
రాజకీయాల కంటే రాష్ట్ర ప్రగతి, పురోగతికే ప్రాధాన్యత ఇచ్చి, వర్తమానంతో పాటు భవిష్యత్ తరాల బాగును దృష్టిలో ఉంచుకుని చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలు, అనుసరించిన విధానాలే.. ఆయనకు ఒక ప్రత్యేక నేతగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆసియాలో ఒక బిజినెస్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రపంచంలోని 500 కంపెనీలు ఉమ్మడి భాగస్వామ్యంతో ముందుకు వచ్చిన తరుణంలో నాడు అంటే 1988లో ఇండియన్ బిజినెస్ స్కూల్ ను తమ రాష్ట్రంలో ప్రారంభించాలంటే తమ రాష్ట్రంలో ప్రారంభించాలంటూ అప్పటికే ఐటీ హబ్ గా ప్రపంచ వ్యాప్త గుర్తింపు పొందిన కర్నాటక సహా పలు రాష్ట్రాలు పోటీ పడ్డాయి. తొలుత బిజినెస్ స్కూల్ ఏర్పాటు కోసం పరిశీలించినది కూడా బెంగళూరునే.. ఏపీలో ఐఎస్ బీ అనే ఉద్దేశమే బిజినెస్ స్కూల్ ఏర్పాటు కోసం అనువైన నగరం కోసం అన్వేషించేందుకు వచ్చిన ప్రతినిథి బృందానికి లేదు.
అయితే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పాలనలో పారదర్శకతకు, మెరుగైన ప్రజాసేవకు ఐటీని వినియోగించుకుంటున్న తీరు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీతో సుపరిపానల అందిస్తున్నవిధానంపై దేశంలోనే కాదు, ప్రపంచంలోని పారిశ్రామిక వేత్తలు సైతం గుర్తించారు. అయినా కూడా అప్పటికి ఐఎస్ బీ ప్రమోటర్లు బిజినెస్ స్కూల్ ను బెంగళూరులో ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతోనే ఉన్నారు. అప్పుడప్పుడే హైదరాబాద్ బెంగళూరుకు పోటీగా ఐటీ హబ్ గా ఎదుగుతున్న దశ. దక్షిణాదిన ప్రతిష్టాత్మక ఇండియన్ బిజినెస్ స్కూల్ ఏర్పాటుకు ప్రమోటర్లు ముందుకు వస్తున్నారన్న సంగతి తెలిసిన వెంటనే చంద్రబాబు స్వయంగా వారిని సంప్రదించారు.
ఒక ముఖ్యమంత్రిగా ప్రమోటర్లతో సంప్రదింపులకు ఆయన వెనుకాడలేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన సీఎంగా కంటే ఒక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గానే ఎక్కువ కష్టపడ్డారు. ఆ చొరవతోనే ఆయన ఇండియన్ బిజినెస్ స్కూల్ ప్రమోటర్లతో స్వయంగా మాట్లాడారు. హైదరాబాద్ ఆలోచనే లేదు..మా తొలి ప్రాధాన్యత బెంగళూరే అంటూ వారు కుండబద్దలు కొట్టినట్టు ముఖం మీదే చెప్పినా ఆయన నిరుత్సాహ పడలేదు. ఆ బృందాన్ని హైదరాబాద్ కు ఆహ్వానించారు.
రాష్ట్ర ముఖ్యమంత్రిగా వారిని ఆయన తేనేటి విందుకు ఆహ్వానించారు. బిజినెస్ స్కూల్ ప్రమోటర్లు అప్పటి వరకూ పలు రాష్ట్రాలతో సంప్రదింపులు జరిపారు. కానీ ఏపీ నుంచి సంప్రదింపుల ప్రతిపాదన ముఖ్యమంత్రి నుంచే రావడం వారికి ఒకింత ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే అప్పటి వరకూ వారితో సంప్రదింపులకు వచ్చింది అధికారులే. అందుకు భిన్నంగా సీఎం స్వయంగా ఆహ్వానించడంతో వారు కాదనలేక కేవలం మొహమాటంతోనే హైదరాబాద్ వచ్చారు.
అలా వచ్చినంత మాత్రాన హైదరాబాద్ లో ఐఎస్ బీ ఏర్పాటు గ్యారంటీ అని భావించవద్దని వారు ముందుగానే చంద్రబాబుకు చెప్పారు. అందుకు సమ్మతించే చంద్రబాబు వారిని ఆహ్వానించారు. అలా వచ్చిన వారిని ప్రొటోకాల్ ను సైతం కాదని ఎదురేగి ఆహ్వానించారు. స్వయంగా బ్రేక్ ఫాస్ట్ సర్వ్ చేశారు. తన నివాసంలోనే ఐఎస్ బీ ఏర్పాటు చేస్తే తమ ప్రభుత్వం ఇచ్చే రాయతీలు, కల్పించే సౌకర్యాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు.
రాష్ట్రం ప్రగతి దారిలో దూసుకుపోతున్న తీరును కళ్లకు కట్టారు. ఐటీని స్మార్ట్ గవర్నెన్స్ కోసం వినియోగించుకుంటున్న తీరునూ సవివరంగా వారికి ఎరుకపరిచారు. చంద్రబాబు వ్యవహార శైలి, అభివృద్ధి కోసం ఆయన పడుతున్న తపన, ఆయన దార్శనికత ఆ బృందాన్ని మెస్మరైజ్ చేశాయి. చంద్రబాబు నివాసంలో తేనీటి విందు తరువాత కొన్ని రోజులకే హైదరాబాద్ లోనే బిజినస్ స్కూల్ ఏర్పాటు కార్యరూపం దాల్చింది. బెంగళూరును కాదని హైదరాబాద్ ను ఎంచుకోవడానికి కారణం ఐఎస్ బి బృందం మీడియా సమావేశంలో వివరిస్తూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అప్రోచ్, విజన్, అద్భుతం అని ప్రశంసించారు.
అయితే అంతటితో పని అయిపోలేదు. అభివృద్ధిని అడ్డుకునే శక్తులు, రాజకీయంగా చంద్రబాబును ఇబ్బందులు పెట్టాలన్న శక్తులు తమతమ ప్రయత్నాలను కొనసాగించాయి. ఐఎస్బికి హైదరాబాద్ గచ్చిబౌలిలో 260 ఎకరాల స్థలాన్ని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కేటాయించింది. స్టాంపు డ్యూటీ మినహాయింపుతో పాటు కొన్ని రాయితీలూ కల్పించింది. దీనిపై నాడు ఏపీలో విపక్షం అయిన కాంగ్రెస్ పలు విమర్శలు చేసింది. ఆరోపణలు గుప్పించింది. కొందరు నాయకులైతే కేసులు పెట్టారు. కానీ న్యాయస్థానం సదుద్దేశంతో ఏర్పాటు చేస్తున్న ఐఎస్ బికి రాయతీలు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి అధికార దుర్వినియోగానికీ పాల్పడలేదని విస్పష్టంగా తీర్పు చెప్పింది.
చంద్రబాబు ఐఎస్ బీని సాధించడం ద్వారా ఏపీకి గొప్ప మేలు చేకూరిందంటూ జాతీయ పత్రికలు అప్పట్లో సంపాదకీయాలు రాశాయి. ఆయన దార్శనికత దేశానికి అవసరమంటూ ప్రశంసలతో ముంచెత్తాయి. 1999లో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతుల మీదుగా ఐఎస్బి హైదరాబాద్ క్యాంపస్కు పునాదిరాయి పడింది. 2001లో నాటి ప్రధాని అటల్బిహారీ వాజ్పేయి చేతుల మీదుగా, సీఎం చంద్రబాబు సమక్షంలో ఐఎస్బి హైదరాబాద్ క్యాంపస్ ప్రారంభోత్సవ వేడుక ఘనంగా జరిగింది.
ఈ విషయాలన్నిటినీ మాజీ చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఇటీవల ఐఎస్బీలో జరిగిన ఓ కార్యక్రమంలో గుర్తు చేశారు. ఐఎస్బీ వృద్ధికి సహకరించిన అందరి ఫోటోలు ఉన్నా.. చంద్రబాబు ఫోటో లేకపోవడం వెలితిగా ఉందని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యల తరువాత ఐఎస్పీలో చంద్రబాబు చిత్రపటం పెట్టారో లేదో తెలియదు కానీ.. ఇప్పుడు ఐఎస్ బీ ద్విదశాబ్ది వేడుకలకు ఆహ్వానించారు. ఒక దార్శనికుడి ఘనత, ప్రతిభలను ఏవో సంకుచిత కారణాలతో కొద్ది కాలం మరుగున పెట్టగలరే తప్ప ఎల్లకాలం కాదని చంద్రబాబు విషయంలో మరోసారి రుజువైంది.