ఇటు చిరంజీవి అటు ఆళ్ల మధ్యలో జగన్!
posted on Aug 30, 2022 @ 3:32PM
వచ్చే ఎన్నికల్లో తప్పకుండా నేనే పోటీచేస్తానని ప్రచారం చేసుకుంటున్న పెద్దోడిని కాదని బుజ్జగించి పక్కంటి వాళ్లబ్బాయిని ఒకే అనిపించారు. సాయంత్రానికల్లా పోటీలో ఫలానావారి అబ్బాయిపోటీ చేస్తు న్నాడని తెలుసుకుని పెద్దోడు పట్టుపట్టాడు. ఈ ఇంటాయన తలపట్టుకున్నాడు. ఒకడు మొండికేసాడు, రెండోవాడిని తెచ్చిపెట్టుకుని ఆశలు కల్పించిన పెద్దాయన భగవాన్ ఈ దుస్థితి పగవాడికి కూడా రాకూడదనుకున్నాడు.
చిత్రమేమంటే సరిగ్గా ఇలాంటి సీన్ ఇపుడు వైసీపీలో ఈస్ట్ మన్ కలర్ లో కనిపిస్తోంది. మంగళగిరి ఎన్నికల విషయంలో వైసీపీ పెద్ద సమస్యనే ఎదుర్కొంటోంది. మంగళగిరిలో తెలుగు దేశం నుంచి నారా లోకేష్ పోటీచేయడం కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఆయనను దీటుగా ఢీకొని గెలిచే అభ్యర్థిని రంగంలోనికి దించాలని వైసీపీ అధినేత జగన్ భావించారు. అనేక వ్యూహాలు, చదరంగపుటెత్తుల తర్వాత గాలం వేసి మరీ గంజి చిరంజీవిని తెలుగుదేవం పార్టీ నుంచి వైసీపీలోకి లాక్కున్నారు. చిరంజీవిని తమ అభ్యర్ధిగా నిలబెడితే సత్ఫలితం వస్తుందని జగన్ విశ్వసిస్తున్నారు. మంగళగిరిలో బీసీ ఓటర్లు అత్యధికంగా ఉన్నారు కనుక బీసీ అభ్యర్ధికే అవకాశాలుంటాయనీ, అందుకే గంజి చిరంజీవి లోకేష్ కు దీటైన అభ్యర్థి అవుతారనీ జగన్ భావించారు. అందుకే అక్కడ సిట్టింగ్ గా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ని బుజ్జగించి ఒప్పించి మరీ చిరంజీవిని పార్టీలోకి లాక్కున్నారు.
ఇంత వరకూ బానే ఉంది కానీ , అయితే ఎంత బీసీలకు చెందినవాడయినప్పటికీ చిరంజీవి ఇదే మంగళగిరిలో 2014లో టీడీపీ అభ్యర్ధిగా పోటీచేసి పరాజయం పాలయ్యారు. తెలుగుదేశం వేవ్ లోనే గెలవలేక చతికిల బడ్డారు. అప్పుడే జనం తిరస్కరించిన అభ్యర్థిని ఇపుడు నిలబెట్టడం వల్ల పార్టీ ఏమాత్రం ప్రయో జనం పొందుతుందన్న అనుమానాలు తలెత్తాయి. అయితే ప్రస్తుతం బీసీ ఓటర్ల ప్రాధాన్యతను లెక్కలోకి తీసుకుంటే ఆళ్ల కంటే చిరంజీవి బెటర్ అని జగన్ నమ్మారు. అందుకే గాలం వేసి మరీ తెలుగుదేశం నుంచి వైసీపీలోకి గంజి చిరంజీవిని తెచ్చుకున్నారు. అంతే కాదు ఆయనకు కించిత్ ఇబ్బందీ లేకుండా చూసుకుంటామని అనేక హామీలు ఇచ్చారు. అంటే పోటీలో నిలబడటం వరకే చిరంజీవి వంతు, ఖర్చు తదితర వ్యవహారాలన్నీవైసీపీయే చూసుకుంటుందన్న భరోసా ఇచ్చిన తర్వాతనే చిరంజీవి చిర్నవ్వుతో వైసీపీ పంచన చేరారన్నది ప్రచారంలో ఉంది.
మంగళగిరి సీటు, అందునా నారా లోకేష్ను ఓడించడం.. ఈ రెండు వైసీపీకి అత్యంత ప్రాధాన్య అంశా లుగా మారాయి. మంగళగిరిలో బీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. లోకేష్ తన చిరకాల శతృవు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు సుపుత్రుడు. కనుక లోకేష్ పై విజయం సాధించడం ఒక్క టే జగన్ లక్ష్యంగానూ మారిందనాలి. కానీ టీడీపీ మాత్రం మంగళగిరిలో విజయఢంకా మోగించేది నారావారి అబ్బాయే అన్న ధీమాతో ఉంది. ఇటీవలి కాలంలో రాష్ట్ర రాజకీయ వాతావరణంలో వచ్చిన మార్పులు, ప్రజలు వైసీపీ మీద పెంచుకున్న ఆగ్రహం తప్పకుండా లోకేష్కు ప్లస్ గా మారను న్నా యి. పథకాలు, హామీలు అన్నీ నీరుగారాయి, ఏకంగా జగన్ మాటను కూడా ప్రజలు తిరస్కరిస్తు న్నారు, ప్రశ్నిస్తున్నారు. తాజాగా ఉపాధ్యాయుల సమస్య ఆయనకు తలభారంగానే మారింది. ఆచి తూచి అడుగులు వేయాల్సిన సమయంలో దూకుడుగా, అనాలోచితంగా తీసుకున్న నిర్ణయాలు ఇపుడు మరింత ఇబ్బందికరంగా మారాయి.
అసలే అవమానపు తలనొప్పులతో ఇబ్బందిపడుతున్న జగన్ కు సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల మరో శిరోభారం పెట్టాడు. అసలు లోకేష్ మీద పోటీ చేయడానికి, గెలవడానికి మంగళగిరిలో తనను మించినవాడు లేడని తానే ఈ సారి పోటీలో నిలుస్తానని తెరమీదకి మొదటి కృష్ణుడిలా రంగప్రవేశం చేసేశారు. తనపై గతంలో ఓడిపోయిన చిరంజీవికి పార్టీ టిక్కెట్ ఇవ్వడమేమిటి, తనను తెర వెనక్కి వెళ్లమని, ప్రచారం చేయమని అడగడమేమిటని ఆగ్రహిస్తున్నారు. చిరంజీవి కేవలం టీడీపీ నుంచి వచ్చేడన్న ప్రాధాన్యత తప్ప మంగళగిరిలో ఆయనకేమీ ఫాలోయింగ్ లేదన్నది ఆళ్ల వాదన. చిరంజీవిని పార్టీవారు ఎంతో సత్కరించి ఆయనకు టికె ట్ ఇస్తామంటున్న సమయంలో కూడా ఆళ్ల మీడియాతో అబ్బే అదేమీ లేదు, మంగళగిరిలో పోటీ చేసేది తానే అని చెబుతున్నారు.
ఏది వాస్తవం, ఎవరిది భ్రమా అనేది ఇపుడు జగన్ తేల్చాల్సి ఉంది. మంగళగిరి లాంటి హాట్ సీట్ విషయంలో వైసీపీలో ఇంత గందరగోళం నెలకొని ఉండటమే ఆ పార్టీ బలహీనతకు దర్పణం పడుతోందని పరిశీలకులు అంటున్నారు. ఎంత మంది పార్టీలోకి వచ్చి చేరినా తానే మంగళగిరిలో పోటీ చేస్తానని లోకేష్ను ఓడించే సత్తా తనకే ఉం దని ఆళ్ల చెప్పుకుంటున్నారు. ఈ పరిణామంతో గంజి చిరంజీవికి షాక్ ఖిన్నుడయ్యారు. రెడ్డి సామాజికవర్గం ఆడిన పొలి టికల్ గేమ్లో తాను పావునయ్యాయన్న ఫీలింగ్కు వచ్చారు. అయితే తాను ఇక దూకేశానని.. తనను జగన్ మోసం చేయరని ఒక దింపుడు కళ్లెం ఆశతో ఉన్నారు. కానీ మంగళగిరిలో గంజి చిరంజీవి నాయకత్వాన్ని వైసీసీ అంగీక రించడం లేదు. ముఖ్యంగా గతంలో తనను ఓడించిన ఆళ్ల ఇపుడు తెరమీదకి రావడం నేపథ్యంలో చిరంజీ వికి తన రాజకీయ భవిష్యత్ పై బెంగపట్టుకునే ఉంటుందని పరిశీలకలు అంటున్నారు.
అయితే ఇవన్నీ కేవలం ఊహాగానాలే అని కొట్టి పారేసినా, తాను పోటీ చేస్తున్నానని ఆళ్ల ప్రకటించుకో వడాన్ని జగన్ అడ్డుకోలేదు. ఆళ్ల ప్రకటనను ఖండించనూ లేదు. అయినా ఇంత వరకూ వచ్చేసిన తరువాత ఆళ్ల తానే పోటీ చేస్తానంటూ ప్రకటించడం సీఎం జగన్కు కూడా ఇబ్బందికరంగానే మారిందనాలి. బుజ్జగించి, బామాలి ఇప్పుడు కాదురా నాన్నా.. అని గడ్డం పట్టుకుని చెప్పినపుడు ఒకే అనేసి ఇపుడు ఎవరో గిల్లినట్టు మంగళగిరిలో పోటీ చేస్తే తానే చేయాలంటూ ప్రకటనలు చేయడం వైసీపీ నాయకులకు మింగుడు పడటం లేదు. ఇక ఇంటి అల్లుళ్ల పోరు తీర్చినట్టు జగన్ ఇపుడు చిరంజీవిని, ఆళ్లను కూర్చోబెట్టి బుజ్జగించడమే మిగిలింది. అయితే అంత కంటే ముందు మంగళగిరి వైసీపీలో విభేదాలు బట్టబయలై పార్టీ నియోజకవర్గంలో పలుచన అయ్యిందనడంలో సందేహం లేదు. అందుకు తంటా లు పడాల్సింది, లాలిపాటలు పాడాల్సింది కూడా జగన్ మాత్రమే. తెచ్చుకున్నవాడి కంటే ఉన్నవాడు తెచ్చిన తంటా అంతా యింతా కాదు.