ఒక్క ఒప్పందం రద్దు.. పాక్ ఖేల్ ఖతం.. దుకాణం బందేనా?
posted on Apr 25, 2025 @ 11:31AM
ఏమిటీ సింధూ జలాల ఒప్పందం?
ఈ ఒప్పందం రద్దుతో పాకిస్తాన్ లో ఏర్పడనున్న సంక్షోభాల తీవ్రత ఎంత?
ఇప్పటికే క్రికెట్ సంక్షోభంతో విలవిల ఇక ఆహార, ఆర్ధిక, సామాజిక, రాజకీయంగానూ అవస్థలేనా?
కొన్ని శతాబ్దాల కిందట అంటే, ఐస్ ఏజ్ కాలం నాటి సంగతి. అప్పట్లో ఖండాలు ఒక్కోసారి విడిపోయి.. సముద్ర జలాలపై ప్రయాణిస్తూ.. వివిధ రకాల ప్రాంతాల్లో సెటిలయ్యేవని అంటుంది మన పురాతన భౌగోళిక చరిత్ర. అలా ఒక ఆఫ్రికా ఖండం నీటిపై ప్రయాణిస్తూ వచ్చి ఏషియా ఖండాన్ని ఢీ కొట్టిందనీ.. అలా మనకు హిమాలయా పర్వతాలు ఏర్పడ్డాయని అంటారు. ఎప్పుడయితే ఇక్కడ మంచు శిఖరాలు ఏర్పడ్డాయో.. అప్పటి వరకూ ఎడారిలాంటి ఈ ప్రాంతంలోకి బిందువులు సింధువులుగా మారి.. ఒక ప్రవాహం ఏర్పడిందనీ.. తద్వారా ఇక్కడొక నాగరికత ఏర్పడిందనీ.. దాన్నే సింధూ నాగరికత అంటారనీ చెబుతుంది మన నైసర్గిక భౌగోళిక చరిత్ర.
ఎప్పుడైతే ఇక్కడ జల ప్రవాహం ఏర్పడిందో దాన్ని ఆశించి.. ఆఫ్ఘన్, ఇరాన్ వంటి ప్రాంతాల నుంచి కొందరు జీవనాన్ని వెతుక్కుంటూ వచ్చారనీ.. వారే తర్వాతి కాలంలో ఆర్యులుగా అవతరించారనీ అంటారు. ఇక, ఆఫ్రికా ఖండంతో పాటు వచ్చిన వారు దక్షిణాదిన ద్రవిడులుగా స్థిరపడ్డారనీ చెబుతుంటారు. ఇది బేసిక్ ఆర్య ద్రవిడ థియరీ అయితే.. ఈ థియరీలో మేజర్ పార్ట్ సింధూ జలాలదే. ఈ జలాలను వెతుక్కుంటూ వచ్చిన వారే ఆర్యులుగా చెబుతుందీ ఆర్య ద్రవిడ సిద్ధాంతం.
ఇదిలా ఉంటే కాలక్రమేణా ఉత్తర దక్షిణ భారతాలు కలసి ఒక దేశంగా ఏర్పడ్డం.. ఒకప్పట్లో అఖండ భారతంగా ఉన్న ఈ దేశం తర్వాతి రోజుల్లో పాక్, బంగ్లాతో పాటు శ్రీలంక, నేపాల్ అంటూ విడిపోయిందని అంటుంది మన సుదీర్ఘ కాల చరిత్ర.
1947 నాటి నుంచి మనం భారత్- పాకిస్థాన్ లు గా విడివడ్డాం. 1960ల కాలంలో నాటి భారత ప్రధాని నెహ్రూ, నాటి పాక్ అధ్యక్షుడు అయూబ్ ఖాన్ చేసుకున్న ఒప్పందాల్లో భాగంగా వచ్చిందే సింధూ నదీ జలాల ఒప్పందం. ఇప్పటి వరకూ మొత్తం మూడు సార్లు అంటే, 1965- 1971- 1999 భారత్ పాక్ మధ్య యుద్ధాలు జరిగినా.. ఈ జల ఒప్పందాలు మాత్రం చెక్కు చెదరలేదు. మధ్యలో.. భారత్ పాక్ కి వచ్చిన జలవివాదం ఎలాంటిదంటే.. ఇది ప్రపంచ బ్యాంకు వరకూ వెళ్లింది. కిషన్ గంగ పై ఒక జల విద్యుత్ ప్రాజెక్టు నిర్మించింది భారత్. కిషన్ గంగ, రాట్లే ప్రాజెక్టులు నిర్మించిన భారత్ పై పాక్ ఆరోపణలు గుప్పించింది. అంతే తప్ప.. ఈ సింధూ జలాల ఒప్పందం మీద ఇంత వరకూ మనకూ పాకిస్థాన్ కి ఎలాంటి గొడవా రాలేదు. ఈ ఒప్పందం రద్దు అప్పుడప్పుడూ తెరపైకి వచ్చినా అవన్నీ తామరాకు మీద నీటిబొట్టులాంటిదే అయ్యింది.
అయితే ఇప్పుడు పహెల్గాం దాడి తర్వాత.. భారత్ ఈ జల ఒప్పందం నుంచి తప్పుకుంటే మొదట జరిగే పని.. జీలం, చినాబ్, రావి, బియాస్, సట్లేజ్ వంటి నదీ జలాలు పాక్ కి వెళ్లకుండా కట్టడి చేసే అవకాశముంది. వీటిపై భారత్ మరింత విస్తృతంగా ప్రాజెక్టులు కట్టే ఛాన్సుంది. ఎప్పుడైతే.. ఈ డ్యాముల నిర్మాణం జరుగుతుందో అప్పటి నుంచీ పాకిస్థాన్ కి జల సంక్షోభం సంభవించే ప్రమాదముంది. ఎప్పుడైతే ఈ నదీ జలాల ప్రవాహం కట్టడి చేయబడుతుందో అప్పటి నుంచీ ఆహార సంక్షోభం మొదలౌతుంది. ఎప్పుడైతే ఆహార సంక్షోభం వస్తుందో ఆ నాటి నుంచి పాక్ లో కరవు విలయ తాండవం చేస్తుంది. దీంతో పాకిస్థాన్ దాదాపు మటాష్ అయిపోతుంది. అంటే ఒక్క బొట్టు కూడా రక్తం చిందించకుండానే ఈ నిర్జల ఉత్పాతాన్ని సృష్టించవచ్చన్నమాట.
ఇది పాకిస్తాన్ తనకు తాను చేజేతులా చేసుకుంటున్న ఒకానొక దుశ్చర్య. పహెల్ గాం దుండగులు పాకిస్తాన్ సంబంధించిన వారేనంటూ ఇక్కడి నుంచి పాకిస్థాన్ దిశగా వెళ్లిన డిజిటల్ లింకులు చెబుతూనే ఉన్నాయి. దీని వెనక లష్కరే తోయిబాకి చెందిన రెసిస్టెంట్ గ్రూప్ ఉన్నా.. దీని మూలాలు పాక్ లోనే తేలుతున్నాయి. ప్రస్తుత పాక్ ఆర్మీ చీఫ్ అసీం మునీర్, గతంలో ఈ దేశపు గూడాచార సంస్థ ఐఎస్ఐకి చీఫ్ గా పని చేశారు. ఈ సమయంలోనే మునీర్ కి లష్కరే వంటి టెర్రరిస్టు గ్రూపులతో విపరీతమైన సంబంధాలు ఏర్పడ్డాయి. అతడే ఈ దుశ్చర్యకు కర్త-కర్మ- క్రియ అంటూ కేవలం భారత్ మాత్రమే కాదు అమెరికా సైతం విశ్వసిస్తోంది.
ఒక పక్క అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ భారత్ లో పర్యటిస్తుండగా జరిగిందీ ఉగ్ర దాడి. దీని వెనక పాక్ హస్తం ఉన్నట్టు గట్టిగా భావిస్తోన్న అమెరికా.. అంతే కాదు మునీర్ కీ లాడెన్ కీ పెద్ద తేడా లేదని యూఎస్ వాఖ్యానిస్తోందంటే.. ప్రపంచ స్థాయిలో పాక్ పరిస్థితి ఏమిటో అర్ధం చేసుకోవచ్చు.
ఇప్పుడు సింధూ జల ఒప్పందాల రద్దు ద్వారా పాకిస్థాన్ కి జరిగే నష్టం ఎలాంటిదో ఉదహరించడానికి.. ఇటీవలి ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణే అతి పెద్ద ఉదాహరణ. భారత్ ఈ టోర్నీలో ఆడటానికిగానూ పాకిస్థాన్ భూభాగంలో అడుగు పెట్టేది లేదని తెగేసి చెప్పింది. దానికి తోడు రోహిత్ సైన ఫైనల్ కి చేరడంతో.. పాకిస్థాన్ లో జరగాల్సిన ఫైనల్ కాస్తా దుబాయ్ లో జరిగింది. దీంతో అప్పటి వరకూ పాక్ ఈ టోర్నీ కోసం పెట్టిన ఖర్చు మొత్తం వృధా అయ్యి... భారీ నష్టం మిగిలింది.
భారత్ తో పెట్టుకుంటే అలా ఉంటుంది. ఇక సింధూ జలాలతో పాటు.. పాకిస్థాన్ లోని భారత దౌత్య అధికారుల ను సైతం తిరిగి రప్పిస్తున్నారు. ఇక్కడున్న పాక్ యాంబసీని కూడా పెట్టేబేడ సర్దుకోమంటున్నారు. అంతేనా దేశంలో ఉన్న పాకిస్తానీయులు, ఇతర పర్యాటకులను వారం లోగా దేశం వదిలి వెళ్లాల్సిందిగా ఆదేశించారు.
ఇకపై పాకిస్థాన్ కి గతంలో లా ఉండదు. పహెల్ గామ్ దాడిలో 26 మందిని పొట్టన పెట్టుకున్న పాపానికి తగిన ప్రాయశ్చిత్తం అనుభవించక తప్పదు. ఇప్పటికే ఆ దేశం ఎల్ఓసీ దగ్గర భద్రత అప్రమత్తం చేసింది. ఇక ఏ ముహుర్తాన భారత సైనికులు ఏ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారో అన్న భయంకరమైన భయాన్ని అనుభవిస్తోందీ పాపిష్టి దేశం. ఒక పక్క మన రక్షణ శాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఇంతకింత అనుభవిస్తారన్న హెచ్చరికలు జారీ చేసిన సమయాన.. ఎలాంటి భయానక పరిస్థితి ఎదుర్కోవల్సి వస్తుందో అన్న ఉత్కంఠ రాజ్యమేలుతోంది పాకిస్తాన్ లో.
ఒక రకంగా చెప్పాలంటే ఇది తాత్కాలికం. సిందూ జలాల ఒప్పందం కారణంగా పాకిస్థాన్ నానాటికీ తీసికట్టుగా మారిపోతుంది. ఇటు జాలాల ఒప్పందం మాత్రమే కాకుండా, అటు దౌత్య పరమైన సంబంధాలన్నిటినీ భారత్ పూర్తిగా తెంచుకుంటే పాకిస్థాన్ పరిస్థితి వచ్చే రోజుల్లో అగమ్య గోచర పరిస్థితి ఎదుర్కోవడం ఖాయం.
ఇప్పటికే అమెరికా నుంచి నిధుల నిలిపివేత వేధన అనుభవిస్తోన్న పాకిస్థాన్ కి మిగిలిన దిక్కల్లా చైనా మాత్రమే. అలాగని పహెల్ గామ్ వంటి దాడులతో రెచ్చిపోతున్న పాక్ కి అది బహిరంగ మద్దతు ప్రకటించలేదు. ఇప్పటికే అమెరికా నుంచి విపరీతమైన సుంకాల దాడి ఎదుర్కుంటున్న చైనా.. తన కాళ్ల మీద తాను నిలబడ్డానికే ఆపసోపాలు పడుతుంటే.. పాకిస్థాన్ కి ప్రత్యక్ష సాయం చేసే ఛాన్స్ లేదు.
ఎందుకంటే భారత్ కూడా పొమ్మన లేక పొగబెడితే.. వరల్డ్ బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ చైనా తాను చేసిన ప్రాడక్టులు తానే అమ్ముకోలేదు. పాకిస్తాన్ని ఆ దేశం దగ్గరకు చేర్చేదే.. అతి పెద్ద మార్కెట్ అయిన భారత్ ను నయానా భయానా ఒప్పించడానికి. ఇప్పుడు పాక్ విషయంలో భారత్ మరింత కఠినంగా వ్యవహరించడంతో చైనా కూడా హ్యాండ్సప్ అనాల్సిందే.
వీటిన్నిటి దృష్ట్యా చూస్తే పాకిస్థాన్ వచ్చే రోజుల్లో చూసే సామాజిక- రాజకీయ- ఆర్ధిక- ఆహార- సంక్షోభం అతి భయంకరమైనదిగా అంచనా వేయక తప్పదు. ఇప్పటికైనా పాకిస్తాన్ ఆర్మీకున్న అధికారాలను కత్తెరించి.. టెర్రరిస్టులను సమూలంగా ఏరి వేస్తే తప్ప... ఈ దేశానికి మరో మార్గాంతరం లేదు.