రేవంత్ రెడ్డిని కల్సిన హైద్రాబాద్ మేయర్ గద్వాల విజయ లక్ష్మి
posted on Feb 3, 2024 @ 2:23PM
బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన నేపథ్యంలో ఆ పార్టీకి చెందిన నేతలు ఒక్కొక్కరూ ముఖ్యమంత్రిని కలుస్తున్నారు. తాజాగా బిఆర్ఎస్ అగ్రనేత కెకె కుమార్తె గద్వాల విజయలక్ష్మి శనివారం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని శనివారం జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కలిశారు. జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. గద్వాల విజయలక్ష్మి 11 ఫిబ్రవరి 2021న జీహెచ్ఎంసీ మేయర్గా బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్కు ఆమె ఐదో మహిళా మేయర్ కాగా... తెలంగాణ వచ్చాక తొలి మహిళా మేయర్. ఆమె బీఆర్ఎస్ పార్టీకి చెందిన అగ్రనేత కుమార్తె కావడంతో మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ పెద్ద పీట వేశారు. అమెరికన్ సిటిజన్షిప్ కలిగిన విజయలక్ష్మి... అక్కడి నుంచి వచ్చి రాజకీయాల్లో చేరారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన కెసీఆర్ ఇటీవల పార్టీ ముఖ్యులకు దిశా నిర్దేశం చేశారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కూడా కలుసుకోకూడదని హుకుం జారీ చేసిన గంటల వ్యవధిలో కెకె కుమార్తె రేవంత్ రెడ్డిని కలవడం చర్చనీయాంశమైంది.
రేవంత్ రెడ్డి ప్రజల ముఖ్యమంత్రి అంటూ కాంగ్రెస్ ఫర్ తెలంగాణ అనే ఎక్స్ హ్యాండిల్ ఓ ఫొటోను ట్వీట్ చేసింది. హెలికాప్టర్లో కూర్చున్న రేవంత్ రెడ్డి పది రూపాయల రియల్ ఫ్రూట్ తాగుతూ ఉన్నారు. ఈ ఫొటోను క్లిక్ మనిపించి షేర్ చేశారు. "పదవి అనేది హోదా కాదు.. బాధ్యత అని రేవంత్ రెడ్డిని చూస్తే అర్థం అవుతుంది" అని ట్వీట్లో పేర్కొన్నారు.