గాంధీ-నెహ్రూ కుటుంబ సభ్యుల ఆస్తులపై విచారణ
posted on Jul 27, 2020 @ 12:34PM
హర్యానాలోని గాంధీ-నెహ్రూ కుటుంబీకుల ఆస్తులపై సమగ్ర విచారణ చేపట్టాలని మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గాంధీ-నెహ్రూ కుటుంబానికి చెందిన ఆస్తులపై దర్యాప్తు చేయాలంటూ పట్టణాభివృద్ధి శాఖను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేష్మీ ఆనంద్ అరోరా కోరారు.
2004 నుంచి 2014 మధ్య భూపేంద్ర సింగ్ హుడా నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుతీరిన సమయంలో గాంధీ కుటుంబం సమీకరించిన ఆస్తులపై హర్యానా ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. గాంధీ కుటుంబానికి చెందిన అసోసియేటెడ్ జర్నల్స్కు అప్పటి హర్యానా కాంగ్రెస్ సర్కార్ కారుచౌకగా కట్టబెట్టిన ప్లాట్ను ఇప్పటికే ఈడీ అటాచ్ చేసింది. 2005లో హర్యానా సీఎం భూపేంద్ర సింగ్ హుడా అసోసియేటెడ్ జర్నల్స్కు 23 ఏళ్ల నాటి రేట్ల ఆధారంగా ఈప్లాట్ను గాంధీ కుటుంబ సభ్యులకు అప్పగించారని ఈడీ ఆరోపిస్తోంది.
కాగా, గత నెలలో కేంద్ర హోంశాఖ కూడా ఇదే పని చేసింది. గాంధీ కుటుంబం, రాజీవ్ గాంధీ ఫౌండేషన్, రాజీవ్ ఛారిటబుల్ ట్రస్ట్, ఇందిరా గాంధీ మొమోరియల్ ట్రస్టు ఆస్తులపై విచారణ జరపాలంటూ ఓ కమిటీని నియమించింది. అయితే, తాము నిబంధనల ప్రకారమే వ్యవహరించామని, బీజేపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని మాజీ సీఎం భూపేంద్ర సింగ్ హుడా గత కాంగ్రెస్ ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణలను తోసిపుచ్చారు.