కోడి క‌త్తి డ్రామా.. సంబంధం లేని రెస్టారెంట్ యాజ‌మాన్యంపై జ‌గ‌న్ బ్యాచ్ వేదింపులు

కోడి క‌త్తి డ్రామా ఘ‌ట‌న‌ తెలుగు రాష్ట్రాల్లోనే కాక.. దేశ‌వ్యాప్తంగా ఏపీ రాజ‌కీయాల‌పై అవ‌గాహ‌న ఉన్న ప్ర‌తిఒక్క‌రికి సుప‌రిచిత‌మే. జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి 2019 ఎన్నిక‌ల్లో సీఎం కావ‌డానికి ప్ర‌ధాన కార‌ణాల్లో ఈ ఘ‌ట‌న  కూడా ఒక‌టి. కోడి క‌త్తి డ్రామా, బాబాయ్ వివేకానంద రెడ్డి హ‌త్య ఘ‌ట‌న‌ల‌తో జ‌గ‌న్ కు ప్ర‌జ‌ల్లో సానుభూతి పెరిగి వైసీపీ భారీ మెజార్టీతో అధికారంలోకి వ‌చ్చింది. సీఎంగా జ‌గ‌న్ బాధ్య‌త‌లు చేప‌ట్టిన నాటి నుంచి ఏపీ ప్ర‌జ‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ వ‌చ్చారు. కేవ‌లం క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌తోనే ఐదేళ్లు వైసీపీ ప్ర‌భుత్వ పాల‌న సాగింది. విప‌క్ష పార్టీల నేత‌ల‌పై అక్ర‌మ కేసులు బ‌నాయించ‌డం.. వారిని జైల్లో పెట్టి పోలీసుల‌తో కొట్టించ‌డం ఇలా ప్ర‌భుత్వ ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న‌పై గ‌ళ‌మెత్తిన ప్ర‌తి ఒక్క‌రిని జ‌గ‌న్ టార్గెట్ చేసి చిత్ర‌హింస‌ల‌కు గురిచేశారు. జ‌గ‌న్ క‌క్ష‌పూరిత రాజ‌కీయాల‌ను త‌ట్టుకోలేక ప‌లువురు ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న ఘ‌ట‌న‌లు కూడా ఉన్నాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో వేధింపుల‌కు గురైన వారిలో విశాఖ ఎయిర్ పోర్టు లాంజ్‌లో రెస్టారెంట్ ఓన‌ర్ కూడా ఒక‌రు. స‌రిగ్గా 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల ముందు జ‌గ‌న్‌పై కోడిక‌త్తితో శ్రీ‌నివాస్ అనే వ్య‌క్తి దాడి చేశారు. శ్రీ‌నివాస్ ప‌ని చేస్తున్నది.. విశాఖ ఎయిర్ పోర్టు లాంజ్ లో ఉన్న రెస్టారెంట్ లోనే. ఈ ఘ‌ట‌న‌లో అభ‌శుభం తెలియ‌ని రెస్టారెంట్ ఓన‌ర్ ని జ‌గ‌న్, ఆయ‌న బ్యాచ్‌ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత అనేక ఇబ్బందుల‌కు గురి చేశారు. తాజాగా జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో వారికి ఎదురైన ఇబ్బందుల‌ను గుర్తుచేసుకుంటూ రెస్టారెంట్ ఓన‌ర్ స‌తీమ‌ణి ఓ వీడియోను విడుద‌ల చేశారు. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఆ వీడియో వైర‌ల్ గా మారింది. ఈ వీడియోను చూసిన ప్ర‌జ‌లు.. అయ్య‌బాబోయ్‌.. జ‌గ‌న్, ఆయ‌న బ్యాచ్ వారిని ఇంత‌గా ఇబ్బందుల‌కు గురి చేశారా అని ఆశ్య‌ర్య పోతున్నారు. 

జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో 2018 అక్టోబర్ 25న వైఎస్ జగన్ మీద విశాఖపట్నం ఎయిర్ పోర్టులో కోడి కత్తితో శ్రీనివాస్ అను వ్యక్తి దాడి చేశాడు. ఆ దాడిలో జగన్ ఎడమ భూజానికి గాయమైంది. జ‌గ‌న్ విజయనగరంలో పాదయాత్ర ముగించుకుని హైదరాబాద్ వెళ్లేందుకు విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు జగన్ చేరుకున్న  సమయంలో విమానాశ్రయంలో ప్యూజ‌న్ ఫుడ్స్ రెస్టారెంట్‌లో పని చేస్తున్న జనుపెల్ల శ్రీనువాసరావు సెల్ఫీ తీసుకుంటానని వైఎస్‌ జగన్‌ వద్దకు వచ్చారు. అతను వస్తూనే జగన్‌పై కత్తితో దాడి చేశారు. ఆ దాడి ఘ‌ట‌న‌కు ఎయిర్ పోర్టులో రెస్టారెంట్ యాజ‌మాన్యానికీ ఎలాంటి సంబంధం లేదు. కేవ‌లం జ‌గ‌న్ పై ప్ర‌జ‌ల్లో సానుభూతి పెంచేందుకు మాత్ర‌మే తాను ఈ దాడికి పాల్ప‌డ్డాన‌ని నిందితుడు శ్రీ‌నివాసరావు బ‌హిరంగంగానే చెప్పారు. అయితే, జ‌గ‌న్ ప్ర‌భుత్వం మాత్రం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత రెస్టారెంట్ యాజ‌మాని తొట్టెంపూడి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ కుటుంబంపై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తూ వ‌చ్చింది.

 బిజినెస్ చేయ‌డం చేత‌కాక నాశ‌నం అయింది అంటే దానికి ఆ యాజ‌మానే బాధ్యుడు అవుతాడు. కానీ, ప‌ని గ‌ట్టుకొని ప్ర‌భుత్వ‌మే జ‌రుగుతున్న బిజినెస్ ను క్లోజ్ చేసి పైశాచిక ఆనందం పొందిన‌ప్పుడు దానికి ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థ‌కాని ప‌రిస్థితుల్లోకి వెళ్లిపోతారు. అదే ప‌రిస్థితి విశాఖ విమానాశ్ర‌యంలో ఫ్యూజ‌న్ ఫుడ్స్ రెస్టారెంట్ ఓన‌ర్ హ‌ర్ష‌వ‌ర్ద‌న్ కు ఏపీ ప్ర‌భుత్వం నుంచి ఎదురైంది. లేని పోని ఆరోప‌ణ‌లు చేసి హ‌ర్ష‌వ‌ర్ద‌న్ కుటుంబంతోపాటు అందులో ప‌నిచేసే ఎంతో మందిని జ‌గ‌న్ ప్ర‌భుత్వం రోడ్డుపాలు చేసింది. జ‌గ‌న్ ప్ర‌భుత్వం హ‌ర్ష‌వ‌ర్ద‌న్ కుటుంబంపై క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించ‌డానికి .. కోడిక‌త్తి ఘ‌ట‌న కంటే ఆయ‌న తెలుగుదేశం సానుభూతి ప‌రుడుగా ఉండ‌ట‌మే ప్ర‌ధాన కార‌ణం. తెలుగుదేశం ఆవిర్భావం నుంచీ   ఎన్టీఆర్, చంద్ర‌బాబు అంటే హ‌ర్ష‌వ‌ర్ద‌న్ కు ఇష్టం.  దీనిని జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి జీర్ణించుకోలేక పోయారు. కోడిక‌త్తి దాడి ఘ‌ట‌న‌లో హ‌ర్ష‌వ‌ర్ద‌న్ కు ఎలాంటి సంబంధం లేద‌ని జాతీయ ద‌ర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తేల్చింది. నిందితుడు శ్రీ‌నివాస్‌రావు కోడిక‌త్తి దాడి ఘ‌ట‌న‌కు కొద్ది నెల‌ల ముందునుంచే రెస్టారెంట్ లో స‌ర్వ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. పైగా జ‌గ‌న్ అంటే నిందితుడికి అభిమానం. కానీ, అభంశుభం తెలియ‌ని రెస్టారెంట్ యాజ‌మాన్యంపై జ‌గ‌న్ ప్ర‌భుత్వం కేవ‌లం తెలుగుదేశం సానుభూతి ప‌రుడు అనే కార‌ణంతో క‌క్ష‌పూరితంగా వ్య‌వ‌హ‌రించింది. 

సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న వీడియోలో  హ‌ర్ష‌వ‌ర్ద‌న్ స‌తీమ‌ణి తొట్టెంపూడి శ్రీ‌ధేవి సొంత పేప‌ర్ ఉంద‌ని త‌మ‌పై జ‌గ‌న్ మీడియా ఇష్ట‌మొచ్చిన‌ట్లు త‌ప్పుడు ప్ర‌చారం చేసింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. చిన్న‌బాబు చిరుతిండ్లు అని సాక్షి మీడియాలో పెద్ద‌పెద్ద హెడ్డింగ్‌లు పెట్టి లోకేశ్ మా రెస్టారెంట్లో చిరుతిండ్లు తింటే ఆ బిల్లులు మేము అప్ప‌ట్లో తెలుగుదేశం ప్ర‌భుత్వానికి స‌బ్మిట్ చేశామ‌ని త‌ప్పుడు ప్ర‌చారం చేశార‌ని   ఆవేద‌న వ్య‌క్తం చేశారు. నిజంగా చెప్పాలంటే మా రెస్టారెంట్ లో ఫుడ్ తిన్న‌ది లోకేశ్ కాదు.. వైసీపీ మంత్రులు, నాయ‌కులేన‌ని ఆమె కుండబద్దలు కొట్టినట్లు ఆ వీడియోలో చెప్పారు. క‌లెక్ట‌రేట్ నుంచి మాకు రావాల్సిన బిల్లులు ఇప్ప‌టికీ ఇవ్వ‌కుండా ఆపేశార‌ని   చెప్పారు. హ‌ర్ష‌వ‌ర్ద‌న్ లిక్క‌ర్ డాన్‌, ఎవ‌రికో బినామీ అని జ‌గ‌న్ మీడియా త‌ప్పుడు ప్ర‌చారం చేసింది. నేను న‌మ్ముకున్న‌ బాబా సాక్షిగా  చెబుతున్నా అవన్నీ పచ్చి అబద్ధాలు అని ఆమె కన్నీటి పర్యంతమయ్యారు.    

ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్

  ఖమ్మంలో బీఆర్‌ఎస్‌కు భారీ షాక్ తగిలింది. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన పలువురు బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేరారు. వీరిలో ధనియాల రాథ, తోట ఉమారాణి, రుద్రగాని శ్రీదేవి ఉన్నారు. మరో ఐదుగురు కార్పొటర్లు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వంగా కలిశారు.  మరోవైపు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖమ్మం పర్యటన రోజే కాంగ్రెస్ పార్టీలో చేరటంతో  రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లను కేటీఆర్‌ సన్మానించారు.  

ఐ బొమ్మ రవి బెయిల్ పిటిషన్ల కొట్టివేత

ఐబొమ్మ రవి బెయిలు పిటిషన్లన నాంపల్లి కోర్టు కొట్టివేసింది. సినిమాల పైరసీ వ్యవహారంలో ఐబొమ్మ రవిపై ఐదు కేసులు నమోదైన సంగతి తెలిసిదే.  ఈ క్రమంలోనే ఈ కేసులలో ఐబొమ్మ రవిని పోలీసులు దఫాల వారీగా కస్టడీలోకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే. ఈ విచారణలో విస్తుపోయే అంశాలు వెలుగు చూశాయి.  పైరసీ, కాపీ రైట్ ఉల్లంఘనలు, అక్రమ ప్రసారాలు, ఆర్థిక లావాదేవీలకు సంబం ధించి పలు అంశాలు విచారణలో వెలుగు చూసిన నేపథ్యంలో ఐబోమ్మ రవికి బెయిలు మంజూరు చేయవద్దంటూ పోలీసులు కోర్టుకు తెలిపారు. కేసుల విచారణ కీలక దశలో ఉన్న నేపథ్యంలో అతడికి బెయిలు లభిస్తే, దర్యాప్తునకు ఆటంకం కలిగే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.  అంతేకాకుండా ఐ బొమ్మ రవి విదేశాల్లో పౌరసత్వం కలిగి ఉన్నాడని, ఇటువంటి సమయంలో రవికి బెయిల్ ఇస్తే దేశం దాటి పోయే అవకాశాలు  ఉన్నాయని, అదే జరిగితే  కేసు విచారణ   దెబ్బతింటుందని పోలీసులు పేర్కొన్నారు. రవి భారతదేశం లోనే అందుబాటులో ఉండేలా కస్టడీలో ఉంచడం అత్యవసరమని పోలీసుల తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు. ఇరు వర్గాల వాదనలు విన్న అనంతరం నాంపల్లి కోర్టు పోలీసుల వాదనలను పరిగణనలోనికి తీసుకున్న కోర్టు రవి పై నమోదైన ఐదు కేసులకు సంబంధించి దాఖలైన అన్ని బెయిల్ పిటీషన్లను  కొట్టి వేసింది.  

భోగాపురం క్రెడిట్ వార్.. లైన్ లోకి విజయసాయి?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం విషయంలో వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్య జరుగుతున్న క్రెడిట్ వార్ లోకి వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపీ విజయసాయి ఎంటరయ్యారు. అయితే ఆయన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తి చేసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఆ క్రెడిట్ లో తనకూ కొంత భాగం ఉందని మాత్రమే చెప్పారు. అలా చెప్పడంలో ఆయన వైసీపీనీ, ఆ పార్టీ అధినేత జగన్ ను పూర్తిగా విస్మరించారు. భోగాపురం విమానాశ్రయంలో ఫస్ట్ టెస్ట్ ఫ్లయిట్ ను స్వాగతిస్తూ సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్ లో పోస్టు చేశారు. ఈ విమానాశ్రయం కోసం పార్లమెంటులో తాను పలుమార్లు గట్టిగా గళమెత్తానని చెప్పుకున్నారు.  ఇప్పుడూ విమానాశ్రయం దాదాపుగా పూర్తై.. త్వరలో ఆపరేషన్స్ ప్రారంభం కావడానికి రెడీ అవుతుండటం తనకు చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే తప్ప ఈ విమానాశ్రయం విషయంలో జరుగుతున్న రాజకీయ రచ్చ గురించి ఒక్కటంటే ఒక్క మాట మాట్లాడలేదు. అలాగే ఈ విమానాశ్రయానికి రెండో సారి శంకుస్థాపన చేసిన జగన్ ఊసెత్తలేదు. విజయసాయి ఈ వైఖరి పట్ల వైసీపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.  పలువురు వైసీపీ మద్దతుదారులు విజయసాయిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పార్టీకి క్రెడిట్ దక్కకుండా అడ్డుపడుతున్నారంటూ సోషల్ మీడియా వేదికగా దుమ్మెత్తిపోశారు.  సరే అది పక్కన పెడితే.. ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ పరిస్థితి తాను తీసుకున్న గోతిలో తానే పడ్డ చందంగా అయ్యిందని పరిశీలకులు అంటున్నారు. వైసీపీ ఎంపీగా నాడు సభలో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం కోసం గళమెత్తిన విజయసాయి.. ఇప్పుడు పార్టీ ప్రస్తావన కూడా లేకుండా తాను వ్యక్తిగత స్థాయిలోనే భోగాపురం కోసం మాట్లాడానన్నట్లుగా సోషల్ మీడియాలో పేర్కొనడం.. వైసీపీ విమర్శకులకు కొత్త శక్తిని ఇచ్చినట్లైంది. ఈ నేపథ్యంలోనే  నాడు విపక్ష నేతగా భోగాపురం వద్దంటూ జగన్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ.. విమానాశ్రయాన్ని అడ్డుకోవడానికి చేయగలిగినంతా చేసి ఇప్పుడు తగుదునమ్మా అని క్రెడిట్ కోసం పాకులాడుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు.  

ఉగాదికి కవిత కొత్త పార్టీ

  తెలంగాణలో మరో కొత్త పార్టీ రాబోతోంది. ఉగాదికి కల్వకుంట్ల కవిత తెలంగాణ జాగృతి పేరుతో పార్టీని ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఇప్పటికే జిల్లాల ఇన్‌ఛార్జ్‌లు, కార్యదర్శులతో కవిత సమావేశమయ్యారు. జనం బాట కార్యక్రమానికి సంబంధించిన రివ్యూ తెలుసుకున్నారు. పార్టీ పెడితే ప్రజల్లోకి బలంగా వెళ్లగలమా? లేదా? అన్న సలహాలు, సూచనలు కార్యకర్తలు, నాయకుల నుంచి అడిగి తెలుసుకుంటున్నారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నూతన పార్టీతోనే పోటీ చేయనున్నట్లు కవిత వెల్లడించిన సంగతి తెలిసిందే.  శాసనమండలిలో భావోద్వేగంతో మాట్లాడిన కవిత పలు సంచలన విషయాలు వెల్లడించారు. అయితే  కవిత తన జిల్లాల పర్యటనలను వాయిదా వేసుకున్నారు. వాస్తవంగా  ఇవాళ నుంచి సిరిసిల్ల జిల్లాలో పర్యటించాల్సి ఉంది. తన అన్న కేటీఆర్ ​ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో కవిత పర్యటన నేపథ్యంలో ఆసక్తి నెలకొంది.  జాగృతి సంస్థను రాజకీయ పార్టీగా ఏర్పాటు చేయాలని ఇప్పటికే పార్టీ నాయకులందరు డిమాండ్​ చేస్తున్నారు.   

కవిత కాంగ్రెస్‌లో చేరొచ్చు...కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

  ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌ రెడ్డి రంగారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్‌లో చేరే అవకాశాలు ఉన్నాయని మల్‌రెడ్డి హింట్ ఇచ్చారు. గతంలో దానం నాగేందర్, కడియం శ్రీహరి వంటి నేతలు కాంగ్రెస్‌లోకి వస్తారని అనుకున్నా.. అనుకున్నట్టుగానే వచ్చారని ఆయన తెలిపారు.  మంత్రి పదవిపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకే నష్టం అన్నారు. నిరాకరిస్తే నాకేం నష్టం లేదు. ఈ విషయంలో పార్టీ పెద్దలు ఆలోచించాలని తెలిపారు. రంగారెడ్డి జిల్లా పేరు మార్పు అనేది ఊహాగానమేనని రంగారెడ్డి జిల్లాలో ఎన్ని మున్సిపాలిటీలు అయినా చేసుకోవచ్చు. కానీ జిల్లా స్వరూపం పేరు మారొద్దున్నారు. ఫ్యూచర్ సిటీ పరిసరాల్లో ల్యాండ్ విలువ పెరిగి  భూములు ఎవరూ అమ్మడం లేదని ఆయన అన్నారు.  

తమిళనాట రచ్చ రేపుతున్న లాప్ ట్యాప్ రాజకీయం!

తమిళనాడులో రాజకీయ వెడి రోహిణీకార్తెను తలపిస్తున్నది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎలాగైనా అధికారాన్ని నిలబెట్టుకోవాలని అధికార డీఎంకే, బీజేపీతో పొత్తు ఉపయోగించుకుని రాష్ట్రంలో అధికారపగ్గాలు చేజిక్కించుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక రాజకీయ పార్టీ స్థాపించి సినీ రంగం నుంచి రాజకీయరంగంలోకి దూకిన హీరో విజయ్ తన టివీకే పార్టీ తరఫున ఒంటరిగా ఎన్నికల రణరంగంలోకి దిగనున్నారు. రాష్ట్రంలోని అన్ని స్థానాలలో పోటీ చేస్తానని ఇప్పటికే ప్రకటించిన విజయ్.. అధికారమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.  ఈ నేపథ్యంలో తమిళనాడ రాజకీయ వాతావరణం వేడెక్కింది.ప్రభుత్వ వ్యతిరేకతను సొమ్ము చేసుకోవాలని ప్రతిపక్ష అన్నాడీఎంకే భావిస్తుంటే.. ఇరు పార్టీల పాలననూ చూసిన తమిళులు.. తనకు ఒక చాన్స్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని విజయ్ అంటున్నారు.  కాగా ప్రభుత్వ వ్యతిరేకతను అధిగమించడానికి స్టాలిన్ సర్కార్ ఫీబీస్ కు తెరలేపింది. విద్యార్థులకు ల్యాప్ టాప్ ల పంపిణీ చేపట్టింది. దీంతో కంగుతిన్న అన్నాడీఎంకే ఎన్నికల తాయిలాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు స్టాలిన్ ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారంటూ విమర్శలకు తెరలేపింది. అయితే డీఎంకే మాత్రం ఇదేం కొత్త పథకం కాదనీ, దివంగత ముఖ్యమంత్రి జయలలిత విద్యార్థులకు లాప్ టాప్ ల పంపిణీ పథకాన్ని 2011లోనే ప్రారంభించారని చెబుతోంది.   2021లో అధికారంలోకి వచ్చిన డీఎంకే, గత పథకాలను కొనసాగిస్తామని ప్రకటించి, ఇప్పుడు ఏడాదికి 20 లక్షల మంది విద్యార్థులకు ల్యాప్‌టాప్‌లు అందించేందుకు ఏర్పాట్లు చేసింది. చెన్నైలో సీఎం ఎం.కె. స్టాలిన్ చేతుల మీదుగా తొలి విడతగా 10 లక్షల మందికి ట్యాప్ టాప్ ల పంపిణీ చేపట్టింది. దీంతో ఎన్నికల వేళ తమిళనాట ట్యాప్ లాప్ రాజకీయం రచ్చ రేపుతోందని పరిశీలకులు అంటున్నారు.  

కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడీ కన్నుమూత

కాంగ్రెస్  సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడీ  మంగళవారం (జనవరి 6) తెల్లవారు జామున తుది శ్వాస విడిచారు. ఆయన వయస్సు 81 ఏళ్లు. ఆయనకు భార్య, కుమారుడు, కోడలు, ఇద్దరు కుమార్తెలు, అల్లుళ్లు, మనవళ్లు ఉన్నారు. ఎరండవాణేలోని కల్మాడీ హౌస్‌లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచుతారు. ఆ తరువాత సాయంత్రం మూడున్నర గంటలకు పుణెలోని వైకుంఠ శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కల్మాడీ మృతి రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. పైలట్ అయిన సురేష్ కల్మాడీ  ఆ తర్వాత రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పుణె నుంచి పలుమార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించి, కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.  పుణె రాజకీయాల్లో అత్యంత శక్తిమంతమైన నేతగా, 'కింగ్‌మేకర్‌'గా ఆయన గుర్తింపు పొందారు.  భారత ఒలింపిక్ సంఘం   అధ్యక్షుడిగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఆయన నేతృత్వంలోనే 2010లో ఢిల్లీలో కామన్వెల్త్ క్రీడలు జరిగాయి.   

ఫోన్ ట్యాపింగ్ కేసు.. ముగిసిన నవీన్ రావు విచారణ.. వెలుగులోకి విస్తుపోయే వాస్తవాలు!

ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో కీలక మలుపు తిరుగుతోంది. ఈ కేసులో కీలక నిందితుడిగా సీట్ గుర్తించిన బీఆర్ఎస్ నాయకుడు నవీన్ రావును సిట్  సోమవారం (జనవరి 5)  విచారించింది. ఈ విచారణలో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన పూర్తి వివరాలపై సిట్ ఒక నిర్ణారణకు వచ్చిందని తెలుస్తోంది.  ఫోన్ ట్యాపింగ్ కోసం ప్రత్యేకంగా ఎక్విపిమెంట్ సేకరణ, కార్యాలయం ఏర్పాటు, మధ్యవర్తుల పాత్ర వంటి అంశాలు ఈ కేసులో కీలకంగా మారాయని అధికారులు చెబుతున్నారు. రాజకీయ నేతల పేర్లు కూడా విచారణలో వినిపించడంతో ఈ వ్యవహారం రాజకీయంగా కూడా సంచలనంగా మారింది.   నవీన్ రావును సిట్ అధికారులు సోమవారం (జనవరి 5) దాదాపు ఎనిమిది గంటలపాటు విచారించారు. ఈ విచారణలోఫోన్ ట్యాపింగ్‌కు సంబంధించిన ఆర్థిక, సాంకేతిక, నిర్వహణ తదితర అంశాలపై స్పష్టమైన ఆధారాలు వెల్లడైనట్లు సమాచారం.  ఫోన్ ట్యాపింగ్ ఎక్విపిమెంట్ కొనుగోలుకు అవసరమైన డబ్బును సమకూర్చింది నవీన్ రావే అని సిట్ విచారణలో తేలింది. అంతే కాకుండా, పాల్ రవి కుమార్ ద్వారా ట్యాపింగ్ ఎక్విపిమెంట్‌ను సమకూర్చినట్లు సిట్ నిర్ధారణకు వచ్చింది.  పోన్ ట్యాపింగ్ కు ఒక ప్రైవేటు వ్యవహారంగా కాకుండా అది వ్యవస్థీకృతంగా పని చేసిందని నవీన్ రావు విచారణలో బయటపడినట్లు తెలుస్తోంది.  ఈ క్రమంలోనే ఫోన్ ట్యాపింగ్ నిర్వహణ కోసం జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్రత్యేక కార్యాలయాన్ని నవీన్ రావు తీసుకున్నట్లు సిట్ అధికారులు గుర్తించారు. ఈ కార్యాలయం నుంచే ఫోన్ ట్యాపింగ్ కార్యకలా పాలు కొనసాగినట్లు అనుమానిస్తున్నారు. కార్యాలయ అద్దె, నిర్వహణ ఖర్చులు, పరికరాల అమరిక వంటి వివరాలపై కూడా అధికారులు లోతుగా ఆరా తీస్తున్నారు. ఈ కేసులో రాజకీయ కోణం మరింత బలపడిందని చెబుతున్నారు. బీఆర్‌ఎస్ నేతల తరఫున ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావులతో నవీన్ రావు మధ్యవర్తిగా వ్యవహరించినట్లు సిట్ విచారణలో తేలినట్లు సమాచారం. ఫోన్ ట్యాపింగ్ సమాచారం ఎవరి కోసం, ఏ ఉద్దేశంతో వినియోగిం చారన్న అంశంపై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో  నవీన్ రావు విచారణ ముగిసినా, ఈ కేసు ఇక్కడితో ఆగే అవకాశాలు లేవని సిట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఫోన్ ట్యాపింగ్ ద్వారా సేకరించిన డేటా ఎవరెవరికి చేరింది, దాన్ని ఎలా వినియోగించారు, ఈ వ్యవహారంలో ఇంకెంతమంది పాత్రధారులు ఉన్నారనే అంశాలపై మరింత లోతుగా విచారణ కొనసాగనుంది. ఇదిలా ఉండగా ఈ కేసులో రాబోయే రోజుల్లో మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. సుప్రీంలో హరీష్ కు భారీ ఊరట

ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీం కోర్టులో   ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో  పిటిషన్ దాఖలు చేసింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా వాదనలు వినిపించారు. అయితే గతంలోనే తన ఫోన్‌ను ట్యాప్ చేయించారంటూ మాజీ మంత్రి హరీష్ రావుపై రియల్ ఎస్టేట్ వ్యాపారి చక్రధర్ గౌడ్ పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై ఎఫ్‌ఐఆర్ కూడా నమోదు అయ్యింది. దీన్ని సవాల్ చేస్తూ హరీష్ రావు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించగా.. సరైన ఆధారాలు లేనందున ఆ కేసును కొట్టివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్   సుప్రీంలో సోమవారం విచారణకు వచ్చింది.  తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పులో జోక్యం చేసుకోబోమంటూ  జస్టిస్ బీవీ నాగరత్న ధర్మాసనం పిటిషన్ ను కొట్టివేసింది.  

జనసేన తెలంగాణ కమిటీలు రద్దు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలంగాణలో పార్టీ పటిష్ఠతపై దృష్టి సారించారు. తెలంగాణలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేసేందుకు తీసుకునే చర్యలలో భాగంగా ముందుగా రాష్ట్రంలోని జనసేన కమిటీలన్నిటినీ రద్దు చేయాలని నిర్ణయించారు. ఆ మేరకు జనసేనాని ఆదేశాల మేరకు తెలంగాణలోని జనసేన కమిటీలన్నిటినీ రద్దు చేస్తున్నట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి సోమవారం (జనవరి 5) అధికారికంగా ప్రకటించారు. రద్దు చేసిన కమిటీల స్థానంలో  నెల రోజుల పాటు ఉండేలా అడ్ హాక్ కమిటీలను నియమిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కమిటీలు రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పర్యటించి అందజేసే నివేదిక ఆధారంగా కొత్త కమిటీలను ప్రకటించనున్నట్లు పేర్కొన్నారు.  ఈ విధంగా రాష్ట్రంలో పార్టీని పునర్వ్యవస్థీకరించి కేడర్ మరింత చురుకుగా పని చేసేలా స్థానిక నాయకత్వానికి గుర్తింపు ఇవ్వనున్నట్లు తెలిపారు.