ఆ వార్తలు పుకార్లే: అంబటి
posted on Feb 23, 2012 @ 9:48AM
గుంటూరు: ఎక్సైజ్ శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ తమ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలను వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు బుధవారం ఖండించారు. మంత్రి మోపిదేవి జగన్ వర్గీయుడని, ఆ కారణంగానే ఎసిబి రిమాండ్ రిపోర్టులో మంత్రి పేరు చేర్చారనేవి కేవలం పుకార్లేనని అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, ఆయన సోదరుడికి మద్యం ముడుపులు అందలేదనే ఉద్దేశ్యంతోనే మోపిదేవి ఇతర ఎక్సైజ్ శాఖ అధికారులను టార్గెట్ చేసి ఎసిబి దాడులు నిర్వహింపచేస్తున్నారని ఆరోపించారు. రిమాండ్ రిపోర్టులో నేతలను తొలగించి అధికారులను బలిచేస్తున్నారన్నారు. మోపిదేవికి ముడుపులు ఇచ్చినట్టు రమణ ఖరాఖండిగా చెబుతున్నప్పటికీ ఆయనను తొలగించే ధైర్యం సిఎం చేయడం లేదని ఇది సిగ్గుచేటన్నారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ జిల్లా విజయనగరంలో దాడులు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు. సమాచార హక్కు కమిషనర్ల నియామకంలో సిఎం రాజకీయాలు ప్రదర్శించడం వల్లనే గవర్నర్ ఫైల్ తిప్పి పంపారన్నారు.