ఆనంద‌య్యా.. ఆ మందు మ‌హ‌త్యం ఏంట‌య్యా? స‌ర్కారు సైతం ఆస‌క్తి..

క‌రోనాకు ఆయుర్వేద మందు. ఆనంద‌య్య‌. కృష్ణ‌ప‌ట్నం. ఈ మూడు పేర్లు ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా మారుమోగుతున్నాయి. ఇన్నేళ్లూ సోదిలో కూడా లేని నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నం గ్రామం.. స‌డెన్‌గా క‌రోనా నివార‌ణ కేంద్రంగా మారింది. ఏ జాత‌ర‌కో, తీర్థ‌యాత్ర‌కో వ‌చ్చిన‌ట్టు.. జ‌నం తండోప‌తండాలుగా త‌ర‌లివ‌స్తున్నారు. ఆనంద‌య్య ఉచితంగా ఇచ్చే క‌రోనా మందు కోసం ఆశ‌గా, అత్రుత‌గా.. కిలోమీట‌ర్ల మేర క్యూ లైన్ల‌లో నిలుచుంటున్నారు. 

ఆయుర్వేద‌మో, హ‌స్త‌వాసో, న‌మ్మ‌క‌మో.. కార‌ణం ఏదైనా కానీ.. ఆనంద‌య్య మందు ఇప్పుడు క‌రోనా బాధితుల పాలిట అప‌ర‌ సంజీవ‌నిగా మారుతోంది. క‌రోనా ముదిరి.. కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్న వ్య‌క్తి కంట్లో ఆనంద‌య్య మందును వేశారు. అంతే. అంత‌లోనే అద్భుతం జ‌రిగిపోయింది. పావు గంట‌లోనే ఆ క‌రోనా రోగి కోలుకున్నాడు. ప్రాణాపాయం నుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. ఇలాంటి మెరాకిల్స్ కృష్ణ‌ప‌ట్నంలో చాలానే క‌నిపిస్తున్నాయి. ఆక్సిజ‌న్ లెవెల్ 83 ఉన్న ఓ బాధితుడికి ఆనంద‌య్య మందు ఇస్తే గంట‌లోనే ఆక్సిజ‌న్ స్థాయి 95కి పెర‌గ‌టం జిల్లా అధికారులే స్వ‌యంగా చూశారు. కృష్ణ‌ప‌ట్నం గ్రామ‌స్తులంద‌రూ ఆనంద‌య్య మందు తీసుకోగా.. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆ గ్రామంలో ఒక్క క‌రోనా కేసు కూడా న‌మోదు కాక‌పోవ‌డం విశేష‌మే. అందుకే, ఆ మందుకు అంత క్రేజ్‌. అందులోనూ ఉచితంగా ఇస్తుండ‌టంతో మ‌రింత డిమాండ్‌. ప్ర‌పంచాన్ని వ‌ణికిస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారికి.. కృష్ణ‌ప‌ట్నం అనే మారుమూల గ్రామంలో మందు ఉంద‌ని తెలిసి.. ఏపీలోని వివిధ జిల్లాల‌తో పాటు అనేక రాష్ట్రాల నుంచి ప్ర‌జ‌లు భారీగా త‌ర‌లివ‌స్తున్నారు. 

విష‌యం ఉన్న చోట వివాద‌మూ ఉంటుంది. ఆనంద‌య్య ఇస్తున్న మందుకు శాస్త్రీయ‌త లేదంటూ లోకాయుక్త‌కు ఫిర్యాదు అందింది. లోకాయుక్త ఆదేశాల‌తో అధికారులు మందు పంపిణీ నిలిపివేశారు. క‌లెక్ట‌ర్ ఆధ్వ‌ర్యంలో విచార‌ణ క‌మిటీ ప‌రిశీల‌న జ‌రిపి.. ప్రాథ‌మిక నివేదిక సైతం అంద‌జేసింది. అంతా ఓకే అన్న‌ట్టుగానే ఉంది ఆ రిపోర్ట్‌. మ‌రింత ప‌రిశోధ‌న కోసం ఆయుశ్ శాఖ‌కు నివేదించింది. ఆనంద‌య్య‌ మందుపై ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవ‌ని తేల్చ‌డంతో.. శుక్రవారం మళ్లీ మందు పంపిణీ కార్య‌క్ర‌మం మొద‌లైంది. స్థానిక ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి స్వ‌యంగా ఆనంద‌య్య మందు పంపిణీని ప్రారంభించారు. 

ఆనంద‌య్య మందు కోసం వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా జ‌నం త‌ర‌లిరావ‌డంతో కృష్ణ‌ప‌ట్నం రోడ్ల‌న్నీ కిక్కిరిసిపోయాయి. పంపిణీ కేంద్రం ద‌గ్గ‌ర తోపులాట జరిగింది. పోలీసులు లాఠీ ఛార్జ్ చేయాల్సి వ‌చ్చింది. ఒక్కసారిగా వేల మంది రావడంతో గందరగోళం నెలకొంది. 3 కిలోమీట‌ర్ల మేర క్యూ లైన్లు క‌నిపించాయి. పోలీసులు అతిక‌ష్టం మీద ప్ర‌జ‌ల‌ను కంట్రోల్ చేస్తున్నారు. అంద‌రికీ స‌రిప‌డా మందు సిద్ధం కాక‌పోవ‌డంతో పంపిణీని నిలిపివేశారు. ప్ర‌భుత్వ ఉత్త‌ర్వుల మేర త‌దుప‌రి చ‌ర్య‌లు ఉంటాయ‌ని ప్ర‌క‌టించారు.

ఆనంద‌య్య మందుపై సీఎం జగన్‌ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆ మందు పంపిణీ చేయాలా? వద్దా? అనే అంశంపై ఉన్నతాధికారులతో చర్చించారు. ఆయుర్వేద మందు శాస్త్రీయత, పనిచేసే విధానంపై అధ్యయనం చేయించాలని సీఎం ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ విభాగాల అధికారులతో పరీక్షలు చేయించాలని వైద్యఆరోగ్యశాఖ ఉన్నతాధికారులకు సూచించారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి ఐసీఎంఆర్‌ బృందాన్ని పంపాలని.. ఆయుర్వేద వైద్యంపై శాస్త్రీయ నిర్ధారణ చేయించాలని సీఎం జ‌గ‌న్‌ స్పష్టం చేశారు.   

అయితే, ఇత‌ర ప్రాంతాల నుంచి క‌రోనా పేషెంట్లు త‌మ గ్రామంలోకి వ‌స్తుండ‌టం వ‌ల్ల త‌మ‌కు ప్ర‌మాదంగా మారే అవ‌కాశం ఉందంటూ స్థానికులు ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. అంబులెన్సుల్లో వ‌చ్చే వారిని గ్రామ స‌రిహ‌ద్దుల్లోనే అడ్డుకోవ‌డంతో ఉద్రిక్త‌త నెల‌కొంది. మ‌రోవైపు.. ఆనంద‌య్య మందును గ్రామంలో కాకుండా ఆ స‌మీపంలోనే ఖాళీగా ఉన్న ప్ర‌భుత్వం స్థ‌లంలో పంపిణీ చేయాల‌ని గ్రామ‌స్తులు సూచిస్తున్నారు. 

ఎవ‌రీ ఆనంద‌య్య‌? ఏమిటా మందు?
నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం, కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య‌ డిగ్రీ వరకు చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మికత ఎక్కువ. భగవాన్ శ్రీ వెంకటయ్య స్వామి శిష్యుడు, గురవయ్య స్వామి దగ్గర శిష్యరికం కూడా చేశారు. ఆ సమయంలో ఆయుర్వేద మందులపై పట్టు సాధించారు. ఆయుర్వేదంలో తనకున్న అనుభవం.. ఇత‌ర ఆయుర్వేద నిపుణుల సలహాలతో.. కరోనాను కట్టడి చేసే మందు తయారు చేసి ముందుగా కృష్ణపట్నం గ్రామ ప్రజలకు అందించారు. ఈ ఏడాది శ్రీరామనవమి నుంచి ఆనందయ్య కరోనాకు మందు పంపిణీ చేస్తున్నాడు. దీని కోసం మొదట్లో పదుల సంఖ్యలో జనం వచ్చేవారు. ఇప్పుడది రోజుకు 4-5వేలకు చేరింది. శుక్ర‌వారం ఆ సంఖ్య మ‌రింత పెరిగింది. 

ఐదు రకాలుగా ఆనంద‌య్య‌ మందు..

1.ఊపిరితిత్తుల కోసం:- ఈ మందు పాజిటివ్‌ ఉన్న వారు, లేనివారు వాడవచ్చు. దీన్ని వాడితే ఊపిరితిత్తులు శుభ్రమై శక్తి పుంజుకుంటాయి. తెల్లజిల్లేడు, మారేడు ఇగురు, నేరేడు ఇగురు, వేప ఇగురు, దేవర్‌దంగి (ఆడ, మగ) ఐదు వంతులు, నల్లజీలకర్ర, పట్టా, పసుపు, తోక మిరియాలు, పచ్చకర్పూరం, ఫిరంగి చెక్క, అన్నింటినీ కలిపి పొడిచేసి తేనెలో నాలుగు గంటలపాటు ఉడికించాలి. పాజిటివ్‌ రోగులకు దీన్ని రోజుకు రెండు సార్లు చొప్పున మూడు రోజులు ఇవ్వాలి. కరోనా సోకని వారు ఒక్క రోజు వాడితే చాలు. 

2.పాజిటివ్‌ రోగులకోసం:- పుప్పింట ఆకు, మిరియాలు, నల్లజీలకర్ర, పట్టా, పసుపు, పిప్పిల్ల చెక్క, జాజికాయ, తేనె మిక్సీలో వేసి పొడిచేయాలి. దాన్ని తేనెలో 4 గంటల పాటు ఉడికించాలి. దీన్ని కరోనా రోగులకు భోజనంతోపాటు ఒకసారి చొప్పున రెండు రోజులు వాడాలి. 

3.పాజిటివ్‌ రోగులకోసం:- నేల ఉసిరి, గుంటగరగరాకు, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, పిప్పిల్ల చెక్క, జాజికాయ, తేనె కలిపి పొడి చేసి 4 గంటల పాటు తేనెలో ఉడికించాలి. పాజిటివ్‌ రోగులకు పైన తెలిపిన రెండు మందులను ఇచ్చిన నాలుగు గంటల తరువాత ఒకసారి చొప్పున రెండు రోజులు ఇవ్వాలి. 

4. పాజిటివ్‌ రోగులకోసం:- పెద్దపల్లేరు కాయ, మిరియాలు, నల్ల జీలకర్ర, పట్టా, పసుపు, పిప్పిల్ల చెక్క, జాజికాయ, తేనె అన్నీ కలిపి పొడిచేసిన మిశ్రమాన్ని తేనెలో 4 గంటు ఉడికించాలి. రోజుకు ఒకసారి చొప్పున రెండు రోజులు వాడాలి. 

5. పాజిటివ్‌ రోగులకోసం:- ఒక కేజీ తేనె, 100 గ్రాముల తోక మిరియాలు, చారెడు ముళ్ల వంకాయ గుజ్జు. తయారీ విధానం. తేనె వేడి చేసి అందులో తోక మిరియాలు, ముళ్ల వంకాయ గుజ్జు వేయాలి. ఈ ద్రావణాన్ని ఆక్సిజన్‌ స్థాయిని బట్టి ఒక్కో కంటిలో ఒక్కో డ్రాప్‌ చొప్పున వేయాలి. 

అయితే, పైన చెప్పిన ఐదు మందుల త‌యారీపై ఎలాంటి వివాదం లేకున్నా.. ఐదో ర‌కం మందును కంటిలో వేయ‌డంపై మాత్రం అభ్యంత‌రాలు ఉన్నాయి. కంట్లో వేయడం వ‌ల్ల దీర్ఘ‌కాలంలో స‌మ‌స్య‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని వైద్యులు అంటున్నారు. మ‌రోవైపు.. ఇవి అస‌లు ఆయుర్వేద మందులే కాద‌నేది మ‌రో వాద‌న‌. ఆయుర్వేద ప్ర‌మాణాల ప్ర‌కారం ఈ మందుల త‌యారీ, మోతాదు లేద‌ని ఆయుర్వేద నిపుణులు త‌ప్పుబ‌డుతున్నారు. వ‌న‌మూలిక‌లు, ఔష‌ద వ‌న‌రులు వాడినంత మాత్ర‌న అది ఆయుర్వేద మందు కాద‌ని.. అంత‌లా కావాల‌నుకుంటే ఏ నాటు మంద‌నో, ప‌స‌రు వైద్య‌మ‌నో పేరు పెట్టుకోమంటూ ఎద్దేవా చేస్తున్న‌వాళ్లూ లేక‌పోలేదు. ఎవ‌రి వాద‌న ఎలా ఉన్నా.. అది ఆయుర్వేదం అయినా, కాక‌పోయినా..  ఆనంద‌య్య మందులో మాత్రం ఏదో మ‌హ‌త్తు ఉండే ఉంటుంది. అందుకు త‌గ్గ‌ట్టు మందు తీసుకున్న వారి అనుభ‌వాలూ ఉన్నాయి. న‌మ్మ‌క‌మే దివ్యౌష‌దం అంటారుగా. అలానే అనుకున్నా.. ఆనంద‌య్య మందు క‌రోనా నుంచి కాపాడుతుంద‌నే న‌మ్మ‌క‌మే అంత‌మందిని కృష్ణ‌ప‌ట్నం వ‌చ్చేలా చేస్తోంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా ఇస్తున్న‌.. ఎంతో ఫ‌లితాన్ని అందిస్తున్న.. ఆనంద‌య్య మందుకు అంత పాపులారిటీ రావ‌డం ఆశ్చ‌ర్య‌మేమీ కాక‌పోవ‌చ్చు. 

దుబారా.. బాధ్యులెవరు? వ్యవస్థ లోపాలపై వాస్తవ వేదిక లో ప్రశ్నల పిడుగులు!

సమాజం పట్ల అక్కర, బాధ్యత ఉన్న ఇద్దరు వ్యక్తులు వర్తమాన రాజకీయాలలో భ్రష్ఠత్వంపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు. ఈ భ్రష్టత్వం అఖిల భారత సర్వీసు అధికారులకూ విస్తరించడాన్ని నిలదీశారు. తెలుగువన్  వాస్తవ వేదిక ద్వారా తెలుగువన్ ఎండీ కంఠంనేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ వ్యవస్థ లోపాలపై విమర్శల శస్త్రాలు గుప్పించారు.  రాజకీయ నాయకుల దుబారా ఖర్చులు, ఆడంబర ప్రయాణ వ్యయాలు రాజకీయాలలో నాయకుల ఆర్థిక అరాచకత్వం చూస్తుంటే, ఆర్థిక నిబంధనలన్నవి సామాన్యులకేనా, నేతలకు వర్తించవా అన్న ప్రశ్న తలెత్తుతున్నది. ఇదే విషయాన్ని ‘వాస్తవ వేదిక‘ ద్వారా తెలుగువన్ ఎండీ కంఠం నేని రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్రప్రసాద్  మరోసారి లేవనెత్తారు.   ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నారా లోకేష్  ప్రభుత్వ ఖర్చుతోనే చార్టర్డ్ విమానాల్లో తిరుగుతున్నారనీ, ప్రభుత్వం దగ్గర సొంత విమానం లేనందున గంటకు 6 నుండి 8 లక్షల రూపాయలు అద్దె చెల్లిస్తున్నారన్న ప్రచారం, అలాగే  విజయవాడ నుండి హైదరాబాద్‌కు వచ్చి వెళ్లే ట్రిప్పుకు 10 నుండి 15 లక్షల రూపాయలు ఖర్చు అవుతుందని, ఇది వ్యక్తిగత దుబారా అని  విమర్శించారు. లోకేష్ తన ప్రయాణ ఖర్చులకు సొంత డబ్బులు వినియోగిస్తున్నారన్న ఆర్టీఐ  వివరణ నమ్మశక్యంగా లేదని అభిప్రాయపడ్డారు.  ఆయన ముఖ్యమంత్రితో కలిసి ప్రయాణించడం వల్ల ఆ ఖర్చు ముఖ్యమంత్రి ఖాతాలోకి వెళ్తోందని పేర్కొన్నారు. అయితే ఇలా ప్రజాధనం దుబారాను నియంత్రించాల్సిన బ్యూరోకాట్లు, అఖిల భారత సర్వీసు అధికారులైన ఐఏఎస్ లు ఆ దిశగా ఎటువంటి ప్రయత్నం చేయకుండా కేవలం ప్రేక్షక పాత్ర వహిస్తూ.. ఏలిన వారు అంటే అధికారంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ.. ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేయడం అధికార దుర్వినియోగమే ఔతుందన్నారు.  ఐఏఎస్ అధికారులు  నిబంధనల్లో లొసుగులను ఆసరా చేసుకుని వాటని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. కొందరు అధికారులు ఎలక్షన్ బడ్జెట్‌తో కార్లు కొనుక్కుంటున్నారని, ఒక్కో అధికారికి మూడు నుండి ఐదు కార్లు ఉంటున్నాయనీ అన్నారు.  గతంలో కలెక్టర్లు సొంత పనులకు రిక్షాల్లో వెళ్లేవారని, కానీ ఇప్పటి అధికారులకు ఆ నిబద్ధత లేదని, వారు ఉద్యోగంలో చేరగానే విల్లాలు, అపార్ట్‌మెంట్ల గురించి ఆలోచిస్తున్నారని విమర్శించారు.  దుబారాకు, ఆ దుబారాకు అధికారులు పలుకుతున్న వత్తాసుకు నిలువెత్తు ఉదాహరణగా రుషికొండ ప్యాలెస్ ను చెప్పుకోవచ్చన్న వారు.. తొలుత రుషికొండ ప్యాలెస్ కు 200 కోట్ల రూపాయలు మంజూరైతే.. అది పూర్తయ్యే నాటికి మొత్తం వ్యయం 600 కోట్లకు చేరిదనీ,  అంత ఖర్చు చేసీ  సిఆర్జెడ్, ఎన్విరాన్మెంట్, అటవీ నిబంధనల ఉల్లంఘనా యథేచ్ఛగా జరిగిందనీ దీనిని అడ్డుకోవలసిన అధికారులు ఏం చేస్తున్నారనీ ప్రశ్నించారు.  అదే విధంగా జగన్ హయాంలో ప్రభుత్వ భవనాలకు వైసీపీ  రంగులు వేయడానికి, తీరా వేసిన తరువాత హైకోర్టు మొట్టికాయలు వేసి స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో ఆ రంగులను తొలగించడానికి దాదాపు ఐదువేల కోట్ల రూపాయల ప్రజాధనం వ్యయం చేశారనీ, ఇంకా చెప్పుకుంటూ పోతే..  గతంలో విజయవాడలోని ఒక స్టార్ హోటల్ నుండి ముఖ్యమంత్రి కుటుంబం కోసం రోజుకు లక్షన్నర రూపాయల వరకు భోజన బిల్లులు ఉండేవని, ఐదేళ్లలో ఇది సుమారు 400 కోట్లు అయి ఉండవచ్చనీ పేర్కొన్నారు.    ఇక ప్రజాస్వామ్య దేవాలయంగా చెప్పుకునే అసెంబ్లీలో అర్ధవంతమైన చర్చలు ఇసుమంతైనా జరగడం లేదనీ, కేవలం స్వోత్కర్ష, పరనిందకే అసెంబ్లీని నేతలు వేదికగా చేసుకుంటున్నారనీ సోదాహరణంగా వివరించారు. తెలుగుదేశం, వైసీపీలు ప్రజల ముందే కొట్టుకుంటున్నట్టు కనిపిస్తాయి కానీ, అంతర్లీనంగా అవి కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. ముఖ్యమంత్రి ఇంటి ఫెన్సింగ్‌కు 14 నుంచి 15 కోట్ల రూపాయలు ఖర్చు చేయడంపై ఎవరూ ప్రశ్నించడంలేదన్నారు. నేతల తప్పులను నిలదీయాల్సిన ప్రజా సంఘాలు, కమ్యూనిస్ట్ పార్టీలు నిర్వీర్యం అయిపోయాయి నామావశిష్టంగా మిగిలాయన్నారు.   మొత్తంగా వ్యవస్థలో  అలీబాబా   మారాడు తప్ప,  40 మంది దొంగలు (అధికారులు, కాంట్రాక్టర్లు, దోపిడీదారులు) అలాగే ఉన్నారనీ, నాయకులు మారినా వ్యవస్థలో దోపిడీ విధానం మారలేదనీ చెప్పారు. ఇక రాష్ట్ర ఉత్పాదకత పెరిగినా ఒకటో తేదీన జీతాలు ఇవ్వలేకపోవడానికి కారణం   దుబారా, అవినీతేనన్నారు.   ఈ చర్చకు కొనసాగింపు గురువారం (జనవరి 8) రాత్రి ఏడు గంటలకు  తెలుగువన్ ‘వాస్తవ వేదిక‘లో ఈ దిగువన ఉన్న లింక్ ద్వారా చూడండి.

పేదలపై కక్షతోనే ఉపాధిహామీ పథకం నిర్వీర్యం.. మోడీ సర్కార్ పై రేవంత్ ధ్వజం

కేంద్రంలోని మోడీ సర్కార్ పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గాంధీ భవన్ లో గురువారం (జనవరి 8) జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో ప్రసంగించిన ఆయన 2024 సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ 400 స్థానాలలో విజయం సాధించి ఉంటే రాజ్యాంగాన్ని సమూలంగా మార్చేసి ఉండేదన్న ఆయన కాంగ్రెస్ ప్రజలను అప్రమత్తం చేయడం వల్లనే ఆ పార్టీకి పూర్తి మెజారిటీని జనం ఇవ్వలేదని అన్నారు. మెజారిటీ ఉందికదా అని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే అంగీకరించేది లేదన్నారు.   మోడీ సర్కార్ పేదల పట్ల కక్ష సాధింపుధోరణితో వ్యవహరిస్తోందనీ, అందుకే  మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగారుస్తోందనీ విమర్శించారు. నిబంధనల మార్పు పేరుతో ఆ పథకాన్ని శాశ్వతంగా నిలిపివేయడానికి కేంద్రంలోని మోడీ సర్కార్ కుట్రపన్ననుతోందని విమర్శించారు. అధికారం ఉందన్న అహంకారంతో చట్టసభలను వినియోగించి పేదలను అణిచివేస్తామంటే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసే కుట్రను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు.  

గోబెల్స్ ను మించి జగన్ అసత్య ప్రచారం!

క్రిస్మస్ సెలబ్రేషన్స్ ను పులివెందులలో జరుపుకున్న తరువాత బెంగళూరుకు వెళ్లిపోయిన జగన్ ఆ తరువాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ మీడియా సమావేశం అనే లాంఛనం పూర్తి చేసి తిరిగి బెంగళూరు వెళ్లిపోయారు. ఆంధ్రప్రదేశ్ లో అధికారం కోల్పోయిన తరువాత జగన్ రాష్ట్రానికి చుట్టపు చూపుగా మాత్రమే వస్తున్న సంగతి తెలిసిందే. అలా వచ్చిన ప్రతి సారీ మీడియా సమావేశం పెట్టి ఏదో ఒక అంశంపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ఆనవాయితీగా మార్చుకున్నారు. తాజాగా కూడా ఆయన అదే పని చేశారు. తాడేపల్లి ప్యాలెస్ లో గురువారం (జనవరి 8) మీడియా సమావేశంలో జగన్  సీమ లిఫ్ట్ పై ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబునాయుడు, తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.   సీమకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారనీ, తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి  సీమ లిఫ్ట్ పై చేసిన వ్యాఖ్యల ఆధారంగా చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు. అయితే వాస్తవానికి ఈ ప్రాజెక్టు పనులను ప్రారంభించి, నిలిపివేయడం జరిగింది  జగన్ హయాంలోనే. ప్రాజెక్టును ప్రారంభించిన ఆరు నెలలలోనూ ఆ  ప్రాజెక్టు చేపట్టిన ఆరునెలలలోగానే అప్పటి మంత్రి పెద్దిరెడ్డి కంపెనీకి భారీ చెల్లింపులు చేసి, పనులు నిలిపివేసింది జగన్ హయాంలోనే. అయితే ఆ తరువాత ఈ ప్రాజెక్టుకు అనుమతుల కోసం మూడేళ్ల పాటు ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా, ఇప్పుడా ప్రాజెక్టును నిలిపివేసింది చంద్రబాబే అని విమర్శలు గుప్పించడం పట్ల పరిశీలకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.   తన హయాంలో నిలిచిపోయిన సీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులకు చంద్రబాబును బాధ్యుడిని చేస్తున్న జగన్.. చంద్రబాబు ఆలోచనతో ఆంకురార్పణ జరిగి, ఆయన హయాంలోనే పూర్తి అయిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ మాత్రం తన ఖాతాలో వేసుకోవడానికి తహతహ లాడుతున్నారంటూ నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు.  జగన్ తన వైఫల్యాలను చంద్రబాబు ఖాతాలోనూ, చంద్రబాబు విజయాలను తన ఖాతాలోనూ వేసుకోవడానికి తాపత్రేయపడుతున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. క్రెడిట్ కోసం జగన్ అవాస్తవాలు వల్లెవేస్తూ గోబెల్స్ ను మించిపోతున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ఐప్యాక్ కార్యాలయంపై ఈడీ రెయిడ్స్.. మమత ఫైర్

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరగనున్నాయి. హ్యాట్రిక్ విజయాలతో వరుసగా మూడు సార్లు రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన తృణమూల్ కాంగ్రెస్ నాలుగోసారి విజయం సాధించి అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నది. అదే సమయంలో బీజేపీ కూడా రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టాలన్న పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలోనే పశ్చిమ బెంగాల్‌లో రాజకీయ వేడి రగులు కుం టోంది.  తాజాగా  రాష్ట్రంలోని ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) ప్రధాన కార్యాలయాంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం కలకలం రేపింది. కాగా ఈడీ దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి  మమతా బెనర్జీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.   కేంద్రం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుట్రపూరితంగా ఎన్నికల లబ్ధి కోసం దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.    కోల్‌కతాలోని సాల్ట్ లేక్‌లో ఉన్న ఐ-ప్యాక్ ప్రధాన కార్యాలయంతో పాటు, సంస్థ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలోనూ గురువారం (జనవరి 8) ఉదయంఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టారు.  కేంద్ర సాయుధ బలగాల   భద్రత నడుమ జరుగుతున్న దాడుల నేపథ్యంలో  మమతా బెనర్జీ, కోల్‌కతా పోలీస్ కమిషనర్ మనోజ్ కుమార్ వర్మతో కలిసి నేరుగా ప్రతీక్ జైన్ నివాసానికి చేరుకున్నారు. ఇంట్లోకి వెళ్లి ఈడీ అధికారులతో మాట్లాడి, కొద్దిసేపటి తర్వాత బయటకు వచ్చిన ఆమె, మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్రంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.    తృణమూల్ కాంగ్రెస్‌కు సంబంధించిన పత్రాలను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించారనీ, అయితే.. తాను వాటిని తిరిగి తీసుకువచ్చానని చెప్పిన మమతా బెనర్జీ,  హోంమంత్రి దేశాన్ని రక్షించలేరు, కానీ ఈడీ ద్వారా  తృణమూల్ ను ఇబ్బందులు పెట్టడానికి చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  అక్కడ నుంచి  సాల్ట్ లేక్‌లోని ఐ-ప్యాక్ కార్యాలయానికి కూడా  ఆమె వెళ్లారు.  2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అంటే 2020 నుంచి ఐ-ప్యాక్ సంస్థ తృణమూల్ కాంగ్రెస్‌కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తున్న విషయం తెలిసిందే. మమత చర్యలపై పశ్చిమ బెంగాల్ శాసనసభలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగబద్ధమైన సంస్థ విధుల్లో మమతా బెనర్జీ నేరుగా జోక్యం చేసుకుంటున్నారని విమర్శించారు.   గతంలో కోల్‌కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లినప్పుడు కూడా ఆమె ఇదే విధంగా అడ్డుకున్నారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఒక ప్రైవేట్ కార్పొరేట్ సంస్థ కార్యాలయంపై ఈడీ దాడి చేస్తే సీఎం మమతా బెనర్జీకి ఎందుకంత ఆందోళన అని ప్రశ్నించారు.    మొత్తం మీద పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల హీట్ పీక్ స్టేజికి చేరిందని ఈ పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. 

డేంజర్ జగన్నాథం.. దొంగలే దోస్తులు.. క్రిమినల్సే కావాల్సినోళ్లు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్ నేర చరిత్ర,  చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడేవారిని ప్రోత్సహిస్తారన్న గుర్తింపు ఉంది.  గత ఏడాది డిసెంబర్ లో జగన్ పుట్టిన రోజు సందర్భంగా  రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో జంతు బలి నిర్వహించి, ఆ రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు అభిషేకం చేసిన సంఘటనలను ఆయన ఖండించకపోవడం, పైగా ఆయన పార్టీ నేతలు దానికి మద్దతుగా మాట్లాడటంతోనే ఇది రుజువైంది.  కాగా ఆయన పుట్టిన రోజు సందర్భంగా బహిరంగంగా జంతువులను వధించినందుకు రాష్ట్ర వ్యాప్తంగా  పలువురు వైసీపీ కార్యకర్తలపై  జంతు హింస చట్టం కింద కేసులు నమోదైన సంగతి విదితమే.   ఇప్పుడు జగన్ తాజాగా  ఈ  కేసులు ఎదుర్కొంటున్న తన పార్టీ మద్దతుదారులకు పార్టీ లీగల్ సెల్ అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.   ఇలా జగన్ నుంచి హామీ పొందిన వారిలో అత్యధికులు గోపాలపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ చార్జ్ తానేటి వనిత మద్దతుదారులని తెలుస్తోంది.   అయితే ఆయన ఇలా హామీ ఇవ్వడం పెద్దగా ఆశ్చర్యం కలిగించదు.  ఎందుకంటే ఇప్పటికే చట్టాన్నిచేతుల్లోకి తీసుకునే పార్టీ మద్దతుదారులను జగన్ ప్రోత్సహించడం తెలిసిందే. గంజాయి కేసుల్లో ఇరుక్కుని అరెస్టైన వారిని పరామర్శించడం వంటి చర్యలతో ప్రజలలో ఇప్పటికే జగన్ ప్రతిష్ఠ, పార్టీ ప్రతిష్ఠ ప్రజలలో బాగా దిగజారింది. ఇప్పుడు తాజాగా జంతుబలుల వ్యవహారంలో కేసుల్లో ఇరుక్కున్న వారికి పార్టీ మద్దతు అంటూ ప్రకటించడం ఆయన ప్రతిష్టను మరింత దిగజారుస్తుందని అంటున్నారు. 

ఒకే విడతలో తెలంగాణ మునిసిపోల్స్!

తెలంగాణలో మునిసిపోల్స్ కు రాష్ట్ర ఎన్నికల సంఘం సమాయత్తమౌతోంది. రాష్ట్రంలో మునిసిపల్ ఎన్నికలను ఒకే విడతలో నిర్వహించాలని భావిస్తోంది. ఈ నెలలోనే నోటిఫికేషన్ విడుదల చేసే దిశగా అడుగులు వేస్తున్నది. ఇప్పటికే ఇప్పటికే ఓటర్ల ముసాయిదా జాబితా ప్రకటించిన ఎన్నికల సంఘం, ఈ నెల 12న తుదిజాబితా ప్రకటించనుందని తెలుస్తోంది.   ఈ నేపథ్యంలోనే బుధవారం (జనవరి 7) జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్  రాణికుముదిని వారికి దిశా నిర్దేశం చేశారు.  ఈ నెల 16న పోలింగ్‌ స్టేషన్ల వివరాలతోపాటు ఫొటోతో కూడిన ఓటర్ల తుది జాబితాను ఆయా వార్డుల్లోని పోలింగ్‌ స్టేషన్ల వారీగా ప్రచురించాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే జనాభా ప్రాతిపదికన వార్డులు, డివిజన్లు, ఆయా మున్సిపాల్టీలు, కార్పొరేషన్ల రిజర్వేషన్లను ఖరారు చేయనున్నట్లు తెలిపారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం మేరకు ఈ నెల 20న మునిసిపోల్స్ కు ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల అ య్యే అవకాశాలు ఉన్నాయి.  

దమ్ముంటే ఖమ్మంలో పోటీ చేయ్...కేటీఆర్‌కు పొంగులేటి సవాల్

  తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‍కు సవాల్ విసిరారు. ఆయనకు దమ్ముంటే ఖమ్మం జిల్లాలో వచ్చి పోటీ చేయాలని చాలెంజ్ విసిరారు. నిన్న ఖమ్మం వచ్చిన కేటీఆర్ ఏదేదో మాట్లాడారని ముందు తన ఇంట్లో వ్యవహారం చక్కబెట్టుకోవాలని పొంగులేటి హితవు పలికారు. కాంగ్రెస్ పార్టీ జోలికి వస్తే సత్తా చూపిస్తామని హెచ్చరించారు. కేటీఆర్ అక్రమాలపై ప్రభుత్వం చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన  ఆరు నెలలకే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు ప్రయత్నించారని మంత్రి సంచలన ఆరోపణలు చేశారు.  కేటీఆర్ మతి భ్రమించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై, గాంధీ కుటుంబంపై మాట్లాడుతున్నారని, సూర్యూడి పైకి ఉమ్మితే అది తిరిగి తన ముఖం మీదే పడుతుందనే విషయాన్ని కేటీఆర్ మర్చిపోతున్నారన్నారు. అవినీతి, అక్రమాలు, దోపిడీలకు పేటెంట్‍గా ఉన్న కల్వకుంట్ల ఫ్యామిలీ గాంధీ కుటుంబం గురించా మాట్లాడేది అని మండిపడ్డారు. జాతీయ నాయకుడిని విమర్శిస్తే తాను జాతీయ నాయకుడిని అవుతానని తాపత్రయపడటం తప్పులేదు కానీ ఆశకు కూడా హద్దు ఉండాలన్నారు. జూబ్లీహిల్స్, గ్రామపంచాయతీ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చారు. ఇప్పుడు రాబోయే మున్సిపల్ ఎన్నికలను సెమీ ఫైనల్స్ అంటున్నారు. దేనికి సెమి ఫైనల్? అని మంత్రి  పొంగులేటి ప్రశ్నించారు  

కాకినాడ జిల్లాలో పవన్ పర్యటన.. పిఠాపురంలో సంక్రాంతి సంబరాలు

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. గురువారం (జనవరి 8) నుంచి మూడు రోజుల పాటు ఆయన జిల్లాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయ నున్నారు.  అలాగే  ప్రజాసమస్యలపై  అధికారులతో చర్చిస్తారు.  క్షేత్ర స్థాయిలో పరిశీలన కూడా చేస్తారు. ఆయన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో  శుక్రవారం జరగనున్న  సంక్రాంతి సంబరాల్లో  పవన్ కల్యాణ్ స్థానికులతో కలిసి పాల్గొంటారు.   అనంతరం  నియోజకవర్గంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను పవన్ కల్యాణ్ ప్రారంభిస్తారు. పిఠాపురం ముంపు ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, బాధితుల సమస్యలను నేరుగా తెలుసుకుంటారు.  ఈ పర్యటనలో భాగంగా పవన్ కల్యాణ్ జిల్లా పోలీసు అధికారులతో సమీక్ష, రంగరాయ మెడికల్ కాలేజీలో పలు శంకుస్థాపనల కార్యక్రమంలో  కూడా పాల్గొంటారు. 

కేంద్ర కేబినెట్ లోకి మరో తెలుగు మంత్రి.. ఎవరంటే?

కేంద్ర మంత్రివర్గ విస్తరణకు ప్రధాని మోడీ సమాయత్తమౌతున్నారన్న వార్తలు వినవస్తున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కావడం ప్రాథాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో చంద్రబాబు  అమరావతి చట్టబద్దత, పోలవరం, బడ్జెట్ కేటాయింపులు, ఉపాధి హామీ పథకంలో వెసలుబాటు వంటి  పలు అంశాలను ప్రస్తావించారు. వాటితో బాటుగా  కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో టీడీపీకి ఒక బెర్తు సైతం డిమాండ్ చేశారు.  ఇప్పటికే టీడీపీ నుంచి ఇద్దరు, బీజేపీ నుంచి ఒకరు చొప్పున ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్నారు. అయితే మరో పదవి కూడా వచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే ఈ బెర్త్ టీడీపీకి దక్కే ఛాన్సు లభిస్తుండటంతో.. ఆ అదృష్టవంతుడు ఎవరన్న కోణంలో  ఇప్పుడు రాజకీయవర్గాలలో చర్చ నడుస్తోంది. కొన్ని కొన్ని ఈక్వేషన్ల ప్రకారం  రెడ్డి సామాజిక వర్గానికి ఈ బెర్త్ కేటాయించాలన్న డిమాండ్  బలంగా వినిపిస్తోంది. అందులో భాగంగా  నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డితో పాటు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిలు రేసులో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. అదలా ఉంటే.. ప్రస్తుతం కేంద్ర కేబినెట్ లో  టీడీపీకి చెందిన వారు ఇద్దరు, బీజేపీ ఎంపీ ఒకరు ఉండగా, జనసేన మాకేం తక్కువ అంటూ కేంద్ర కేబినెట్ బెర్త్ కోసం డిమాండ్ చేస్తున్నదంటున్నారు.  జనసేన ఎంపీలిద్దరిలో  మచిలీపట్నం ఎంపీ బాలశౌరి సీనియర్ కాబట్టి ఆయనను కేంద్ర కేబినెట్ లోకి తీసుకోవాలని జనసేనాని పవన్ కళ్యాణ్‌  కోరుతున్నట్లు చెబుతున్నారు. చూడాలి మరి కేంద్ర కేబినెట్ బెర్త్ ఎవరికి లభిస్తుందో? 

జవాబుదారీతనం ఎవరికి ఉండాలి?

సమాజహితమే లక్ష్యంగా దశాబ్దాలుగా తమ రంగంలో కృషి చేస్తున్న తెలుగువన్, జమీన్ రైతు పత్రిక సంయుక్తంగా నిర్వహిస్తున్న ‘వాస్తవ వేదిక’.. నాయకులను ప్రశ్నిస్తూ, ప్రజలను మేల్కొలుపుతూ చరిత్రలో నిలిచిపోయే ప్రస్థానానికి నాంది పలికింది. తెలుగువన్ ఎండి రవిశంకర్, జమీన్ రైతు సంపాదకుడు డోలేంద్ర ప్రసాద్ లు తాజాగా వ్యవస్థల పతనం, అందుకు కారణాలపై తమ ఆవేదనను సూటిగా ఎలాంటి శషబిషలూ లేకుండా వ్యక్త పరిచారు.  జవాబుదారీ తనం ఎవరికి ఉండాలి? ప్రజలకా? పాలకులకా? అధికారులకా? ఎగ్జిక్యుటివ్ వ్యవస్థలు ఏం చేస్తున్నాయి? తమ మేధాశక్తిని ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు  ఎలా వాడుతున్నారు? పాలకుల తప్పులు కప్పడానికా; ప్రజల బాగు కోసమా? ప్రజాధనం దుర్వినియోగానికి బాధ్యులు ఎవరు?  ఇత్యాది సూటి ప్రశ్నలను సంధించారు. ప్రజా చైతన్యమే లక్ష్యంగా సాగుతున్నవాస్తవ వేదిక గురువారం (జనవరి 8) రాత్రి 7గంటలకు తెలుగువన్  యూట్యూబ్ చానల్ లో తప్పక వీక్షించండి.  https://youtu.be/T_mYTVE6Wgs