శిల్ప కళా వేదికలో పద్మ విజేతలకు రేపు సన్మానం
posted on Feb 3, 2024 @ 11:23AM
పద్మ పురస్కారాలకు ఎంపికైన విజేతలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సన్మానించనుంది. రేపు శిల్పకళా వేదికలో ఆదివారం ( ఫిబ్రవరి 4) సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. పద్మవిభూషణ్ కు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు చిరంజీవిని మంత్రి జూపల్లి కృష్ణారావు సీఎం రేవంత్ రెడ్డి తరపున ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి రావాలంటూ వెంకయ్యనాయుడును జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో, చిరంజీవిని అన్నపూర్ణ స్టూడియోస్లో మంత్రి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. శాలువా కప్పి, పుష్ప గుచ్ఛాలు అందించి అభినందనలు తెలియజేశారు.
వెంకయ్య నాయుడు, చిరంజీవితో పాటూ పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన బుర్రవీణ వాద్యకారుడు దాసరి కొండప్ప, యక్షగాన కళాకారుడు గడ్డం సమ్మయ్య, సాహితీవేత్తలు కూరెళ్ల విఠలాచార్య, కేతావత్ సోమ్లాల్, శిల్పకారుడు సత్తి ఆనందాచారిని రేపు రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సత్కరించనుంది. పద్మశ్రీ విజేతలను రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆహ్వానించాలని మంత్రి జూపల్లి సాంస్కృతిక శాఖ అధికారులను ఆదేశించారు.
రిపబ్లిక్ డే సందర్బంగా కేంద్ర ప్రభుత్వం వీరిరువురికి పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే.