తిరుపతిలో కుల రాజకీయాలు షురూ
posted on Mar 10, 2014 @ 10:33AM
తిరుపతిలో కుల రాజకీయాలు మొదలైపోయాయి. ముందునుంచే చిత్తూరు ప్రాంతంలో కులాల ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది. వివిధ సామాజిక వర్గాలకు చెందినవాళ్లు తమ ఆధిపత్యం చూపించుకోడానికి ప్రయత్నిస్తుంటారు. తాజాగా ఓ పార్టీలో ఉన్న ఓ కులం వాళ్లంతా కలిసి సమావేశం పెట్టుకున్నారు. దానికి ఇతర పార్టీలలో ఉన్న సాటి కులస్థులను కూడా పిలిచారు. పిలవడం అయితే పిలిచారు గానీ, వాళ్లను వేదికమీదకు కూడా పిలవకుండా, పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా తమ పార్టీ వాళ్లనే అందలం ఎక్కించారు. దాంతో మమ్మల్ని పిలవడం ఎందుకు, ఇలా అవమానించడం ఎందుకంటూ మిగతా పార్టీల వాళ్లు మండిపడుతున్నారు. మరోవైపు బీసీ సంఘాలు కూడా ఈ కులసమావేశం విషయం తెలిసి అగ్గి మీద గుగ్గిలం అయ్యాయి. తిరుపతిలోని బీసీలలో యాదవ సామాజికవర్గం బలంగా ఉంటుంది. కుల సమావేశాలు ఏర్పాటుచేసి, తమవాళ్లనే గెలిపించుకోవాలని చెప్పడం ఏంటని వీళ్లు కూడా ఇప్పుడు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట. బీసీలను కాదని వాళ్లెలా గెలుస్తారో చూస్తామని కత్తులు నూరుతున్నారు.