నిమ్మగడ్డ దెబ్బకు 'ఏపీ సర్కార్' అబ్బా!
posted on Apr 6, 2020 @ 6:37PM
వార్డు వాలంటీర్ల సాయంతో, స్థానిక సంస్థలకు పోటీ చేస్తున్న పాలక వై ఎస్ ఆర్ సి పీ అభ్యర్థులు ప్రజలకు ఆర్ధిక సహాయం అందచేయటం పై ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సంఘం సీరియస్ అయింది. ఈ విషయమై ఫిర్యాదులు వస్తున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎం. రమేష్ కుమార్ అన్నారు. ఈ విషయం పై బిజిపి అధ్యక్షుడు, సిపిఐ కార్యదర్శి వాటిని ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువచ్చారని, 13 జిల్లాల జిల్లా ఎన్నికల పరిశీలకులు / జిల్లా కలెక్టర్లు లకు సోమవారం లేఖ రాశామని ఆయన తెలిపారు.
ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్ క్షుణ్ణంగా పరిశీలించిందన్నారు. కరోనా పరిస్థితి సమయంలో ప్రజలకు ప్రయోజనాల చేకూర్చే పంపిణీ కొత్త పథకం ఎన్నికల ఉల్లంఘన కింద రాదని, ప్రస్తుతం ఎన్నికల కోడ్ వాడుకలో లేదని తెలిపారు. ఏది ఏమయినప్పటికీ, ఈ సంధి కాలంలో ఎన్నికల ప్రచారంపై నిషేధం కొనసాగుతుందని తెలియ చేస్తున్నామన్నారు. పోటీ చేసే అభ్యర్థులు వారి స్వయ ప్రయోజనం కోసం ప్రచారం చెయ్యడం, ఓటర్లు ను ప్రభావితం చెయ్యడం ఎన్నికల ప్రక్రియ ఉల్లంఘనగా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. కాబట్టి, అటువంటి సంఘటన పై క్షేత్రస్థాయిలో దృష్టి సారించి, నిజానిజాలను విచారించి, ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకుని రావాలన్నారు. సంబంధిత అధికారులందరూ పర్యవేక్షణ ద్వారా అటువంటి సంఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎన్. రమేష్ కుమార్ లేఖలో పేర్కొన్నారు.