ఐదుగురు ఉద్యోగులపై శాఖాపరమైన చర్యలు! డాక్టర్ సుధాకర్ కేసులో హైకోర్టుకు సీబీఐ..
posted on Sep 30, 2021 @ 3:55PM
ఏపీలో తీవ్ర సంచలనం స్పష్టించిన విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం వైద్యుడు డాక్టర్ కె.సుధాకర్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసును విచారించిన సీబీఐ హైకోర్టుకు కీలక సమాచారం ఇచ్చింది. సంబంధిత కోర్టులో చార్జిషీట్ దాఖలు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరింది. సుధాకర్ పట్ల అధికారులు అనుచితంగా వ్యవహరించారన్న ఘటనపై దర్యాప్తు పూర్తి చేశామని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. ఈ ఘటనలో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఉందని.. వారిపై శాఖాపరమైన చర్యలకు సిఫారసు చేస్తామని సీబీఐ వివరించింది. సీబీఐ వెల్లడించిన వివరాలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు చార్జిషీట్ దాఖలుకు అనుమతి ఇచ్చింది. అధికారులపై ప్రభుత్వం చర్యలు తీసుకునే విషయాన్ని పరిశీలిస్తామంటూ విచారణను అక్టోబర్ 24కి వాయిదా వేసింది.
నర్సీపట్నం ప్రాంతీయ ఆస్పత్రిలో అనస్థీషియా డాక్టర్ సుధాకర్ కరోనా ఫస్ట్ వేవ్ సమయంలో ఆసుపత్రిలో గ్లౌజ్లు మాస్కులు ఇవ్వలేదని ప్రశ్నించారు. అయితే తాను ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే.. తనపై తప్పుడు కేసులు పెట్టి చిత్రహింసలకు గురిచేశారని ఆయన ఆరోపణలు చేశారు. అతని మానసిక పరిస్థితి బాగోలేదని కొద్ది రోజులు విశాఖలోని మానసిక ఆసుపత్రిలో చికిత్స అందించారు.ఆ సమయంలోనే సుధాకర్ ను కట్టేసి తీసుకెళుతున్న విజువల్స్ వైరల్ గా మారాయి. ఈ ఘటన అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది.
ఈ ఘటనలో డాక్టర్ సుధాకర్ పట్ అధికారులు అమానుషంగా ప్రవర్తించారని ఏపీ టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వంగలపూడి అనిత హైకోర్టుకు లేఖ రాశారు. ఈ లేఖతో పాటు ఓ వీడియోను కూడా పంపారు. దీనిని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ధర్మాసనం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దీంతో వారు దర్యాప్తు పూర్తి చేశామని కోర్టుకు తెలిపారు. అయితే డాక్టర్ సుధాకర్ మే నెలలో గుండెపోటుతో కన్నుమూశారు. డాక్టర్ సుధాకర్ మృతికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డే కారణమని, ఆయనను ప్రధమ ముద్దాయిగా చేర్చి చార్జ్ షీట్ ఓపెన్ చేయాలని టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్ చేశారు. అధికార పార్టీ వేధింపులు తట్టుకోలేకే డాక్టర్ సుధాకర్ మానసిక వేదనకు గురయ్యారన్నారు.