అమెరికా కంటే ఎక్కువ కేసులు భారత్ లోనే!!
posted on Jun 6, 2020 @ 4:58PM
కరోనా కేసులలో అగ్రరాజ్యం అమెరికా అగ్ర స్థానంలో ఉన్న సంగతి తెలిసిందే. అయితే, తాము ఎక్కువ పరీక్షలు చేసాం కాబట్టి, ఎక్కువ కేసులు వచ్చాయని.. ఒకవేళ భారత్, చైనా వంటి దేశాలలో కూడా తమలాగే ఎక్కువగా పరీక్షలు చేస్తే.. అక్కడ కూడా ఎక్కువ కేసులు బయటపడతాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.
మెయిన్ నగరంలో ఓ మెడికల్ ప్రోడక్ట్స్ కంపెనీని సందర్శించిన ట్రంప్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమెరికాలో ఇప్పటి వరకు 2 కోట్ల మందికి పరీక్షలు చేశామన్నారు. ఒక్కటి గుర్తు పెట్టుకోండి.. పరీక్షలు ఎక్కువ చేస్తే.. కేసులు పెరుగుతాయి. ఒక వేళ ఇండియా, చైనా వంటి ఇతర దేశాల్లో పరీక్షలు విస్తృతంగా చేస్తే.. అక్కడా ఎక్కువ సంఖ్యలో కేసులు బయటపడతాయి అని నేను హామీ ఇస్తున్నాను అన్నారు. జర్మనీ, దక్షిణ కొరియాతో పోలిస్తే.. అమెరికాలోనే ఎక్కువ పరీక్షలు చేసినట్లు ట్రంప్ తెలిపారు. జర్మనీలో ఇప్పటి వరకు కేవలం 40 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించారని, దక్షిణ కొరియాలో 30 లక్షల మందికి పరీక్షలు నిర్వహించారని తెలిపారు. అమెరికాలో పరీక్షల సంఖ్య ఎక్కువగా ఉందని ట్రంప్ చెప్పారు.