త్రివేదీ బడ్జెట్..చార్జీల బాదుడు?

న్యూఢిల్లీ: ఈరోజు ప్రవేశపెట్టబోయే రైల్వే బడ్జెట్‌పై సర్వతా ఉత్కంఠ నెలకొంది. రైల్వేశాఖ మంత్రి దినేశ్ త్రివేదీ బుధవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన వెంటనే పార్లమెంటులో రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. ఉత్తరప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోయాయి. మధ్యంతరం వస్తే తప్ప సమీప భవిష్యత్తులో ఎన్నికలు కూడా లేవు. దీనికితోడు ఇప్పటికే కష్టాల్లో ఉన్న రైల్వేలకు ఆదాయార్జనే ధ్యేయంగా పార్లమెంటరీ కమిటీలు, ప్రణాళికా సంఘం, రైల్వే యూనియన్లు కూడా అన్ని క్లాసుల చార్జీలను పెంచాలని సిఫారసు చేశాయి. మాజీ అణు శాస్త్రవేత్త అనిల్ కకోద్కర్ కమిటీ కూడా భద్రత రుసుము పేరిట రూ.5000 కోట్లు వసూలు చేయాలని సిఫారసు చేయడంతోపాటు ప్రయాణికుల టికెట్ల చార్జీలను పెంచాలని కూడా సిఫార్సు చేసింది.

ఈ నేపథ్యంలో ఈసారి ప్రత్యక్షంగా, పరోక్షంగా వడ్డించేందుకూ రైల్వే మంత్రి త్రివేదీ సిద్ధమయ్యారు. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు.. ఈసారి ప్రయాణికుల టికెట్ల చార్జీలను పెంచనున్నారు. ఏసీ బోగీల్లో ప్రయాణిస్తున్న వారిపై భారం మోపాలని రైల్వే శాఖ నిర్ణయించింది. బడ్జెట్లో ఏసీ టికెట్ల చార్జీలను 20 శాతం వరకు పెంచనున్నట్లు సమాచారం. ఏసీ స్లీపర్ క్లాస్ 10 శాతం, చైర్‌కార్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ విభాగాల్లో 15-20 శాతం, ఫస్ట్‌క్లాస్ ఏసీ విభాగంలో 25 శాతం చార్జీలు పెరిగే అవకాశం ఉందని తెలిసింది. బడ్జెట్‌కు ముందే 19 - 30 శాతం వరకు సరుకు, రవాణా ఛార్జీలు పెరిగాయి. రవాణా ఛార్జీల పెంపుతో రూ. 12 నుంచి 30కి పెరిగిన బస్తా సిమెంటు రేటు పెరిగింది. స్టీల్‌, ఎరువుల ధరలు పెరిగే ప్రమాదం ఉంది. రవాణా ఛార్జీల పెంపుతో రూ 20 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా.
ఈ మేరకు కార్యాచరణ ప్రణాళికను కూడా త్రివేదీ ప్రకటించే అవకాశం ఉంది. 

కొత్త రైల్వే లైన్లను నిర్మించకుండా ఉన్న లైన్లలోనే రైళ్లను పెంచితే.. రద్దీ విపరీతంగా పెరిగిపోతుందని, తద్వారా మళ్లీ ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, కాబట్టి కొత్త రైల్వే మార్గాలు నిర్మించటం అనివార్యమైందని వివరిస్తున్నారు. కానీ, ఇందుకు రైల్వే శాఖ వద్ద నిధులు లేవని, స్థిరాస్తులను అమ్ముకునేందుకు రైల్వేలకు అవకాశం లేదని, ఈ నేపథ్యంలో చార్జీలను పెంచడం ఒక్కటే మార్గమని స్పష్టం చేస్తున్నారు. అయితే, సాధారణ, మధ్యతరగతి ప్రయాణికులపై భారం పడకుండా ఏసీల్లో ప్రయాణించే ఎగువ తరగతిపైనే భారం వేసే అవకాశముందని విశ్వసనీయంగా తెలిపారు.

మౌలిక సదుపాయాల విస్తరణే ఈసారి రైల్వే శాఖ ధ్యేయం. ఈ మేరకు డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డీఎఫ్‌సీ) ఏర్పాటుకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉంది. లక్ష కోట్ల రూపాయల అంచనాతో ఈ ప్రాజెక్టును ప్రారంభించాలని కకోద్కర్ కమిటీ సిఫారసు చేసింది. వివిధ రాష్ట్రాల గుండా 3300 కిలోమీటర్ల మేర నిర్మించనున్న ఈ కారిడార్ ప్రాజెక్టును 2017నాటికి పూర్తి చేయాలని నిశ్చయించారు. దీనికి అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలంటూ కేంద్ర ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇటీవల ప్రధాని మన్మోహన్ కూడా సూచించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే రోడ్డు రవాణాను పెద్దఎత్తున రైల్వేలకు మళ్లించాలనేది ఆ శాఖ యోచన. ఇక వెయిటింగ్ బాధ లేకుండా కన్‌ఫర్మ్‌డ్ బెర్త్‌ను రిజర్వేషన్ చేసుకోవడానికి వీలుగా సరికొత్త పథకాన్నీ ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. ఈ మేరకు రైల్వే బడ్జెట్‌కు మంత్రి త్రివేదీ మంగళవారం తుది మెరుగులు దిద్దారు.

బడ్జెట్‌లో ఢిల్లీ-జైపూర్-జోధ్‌పూర్ కారిడార్‌లో బులెట్ ట్రైన్‌ను ప్రవేశపెట్టే ప్రతిపాదన ఉండవచ్చని తెలుస్తోంది. ప్రతిపాదిత పుణె-అహ్మదాబాద్ హైస్పీడ్ కారిడార్‌కు దీన్ని అనుసంధానం చేస్తారు. ఇంతకు ముందు రైల్వే బడ్జెట్‌లలాగా ఈ సారి రైల్వే బడ్జెట్‌లో కొత్త రైళ్లను పెద్దగా ప్రకటించే అవకాశాలు కనిపించడం లేదు. అలాగే రైళ్లలో, స్టేషన్లలో కేటరింగ్ సదుపాయాల మెరుగుదల లాంటి ప్రయాణికుల సదుపాయాలకు సంబంధించి త్రివేది కొన్ని ప్రతిపాదనలు చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఇప్పుడున్న టాయిలెట్ సదుపాయాలను మెరుగుపరచడానికి ‘గ్రీన్ టాయిలెట్ల’ ఉత్పత్తికి సంబంధించి కూడా మంత్రి ప్రకటన చేసే అవకాశం ఉంది. రైలు ప్రమాదాలను నిరోధించడానికి సిగ్నలింగ్, టెలీ కమ్యూనికేషన్ వ్యవస్థ ఆధునీకరణ పథకాలను కూడా త్రివేది బడ్జెట్‌లో ప్రతిపాదించే అవకాశం ఉంది. అలాగే ఇప్పుడున్న రైలు బోగీల స్థానంలో ఆధునిక ఎల్‌హెచ్‌బి కోచ్‌లను ప్రవేశపెట్టడానికి కూడా బడ్జెట్‌లో ప్రాధాన్యత ఇవ్వవచ్చని తెలుస్తోంది.


కాగా, బడ్జెట్‌లోకొత్తగా రెండు రైల్వే కోచ్ ఫ్యాక్టరీలను ప్రకటించనున్నారు. వీటిలో ఒకటి కర్నాటకలోని కోలార్‌లో, మరోటి గుజరాత్‌లోని కచ్‌లో ఏర్పాటు చేస్తారు.  కాగా, తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ రాజీనామా తర్వాత అదే పార్టీకి చెందిన త్రివేదీ రైల్వే శాఖ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆయన ప్రవేశపెట్టనున్న తొలి బడ్జెట్ కూడా ఇదే. ఈ నేపథ్యంలో ఈ రైలు కూడా పశ్చిమ బెంగాల్ దిశగానే దూసుకుపోతుందా? లేక ఇతర రాష్ట్రాల్లోనూ ఆగుతుందా అన్నది మరికొద్ది గంటల్లో తేలిపోనుంది!!

సుబ్రతో రాయ్ అరెస్ట్ ...

  సుబ్రతో రాయ్ అరెస్ట్ ... సహారా సంస్థ అధినేత సుబ్రతో రాయ్ ను నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి సహారా సంస్థ సేకరించిన డబ్బుల విషయంలో కోర్టు సుబ్రతో రాయ్ కు గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చింది. సహారా నుంచి స్పందన లేకపోవడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ధిక్కార కేసులో ఇంతకుముందు వాదనలు విన్న అనంతరం సుప్రీం కోర్టు తమ ముందు హాజారు కావాలని సుబ్రతా రాయ్‌ని ఆదేశించింది. అయితే సుబ్రతా రాయ్ కోర్టు ఎదుట హాజరుకాకపోవడంతో ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. సుబ్రతా రాయ్‌ని అరెస్ట్ చేసి తమ ముందు మార్చి 4లోగా హాజరుపర్చాలని సుప్రీం కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, తన తల్లి (95)కి ఆరోగ్యం బాగోలేదని, అందువల్ల తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని ఇంతకుముందు సుబ్రతా రాయ్ కోర్టును కోరారు. అయితే కోర్టు అతని వినతిని తిరస్కరించింది. సుబ్రతో రాయ్ ను శుక్రవారం లక్నోలో అరెస్ట్ చేశారని సుబ్రతో రాయ్ సీనియర్ అడ్వకేట్ రామ్ జట్మలాని సుప్రీం కోర్టుకు తెలిపారు.

విఫలమైన 'టి' కాంగ్రెస్

  విఫలమైన 'టి' కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా పట్టుబట్టి మరీ విభజనను సాధించింది. అయితే ఈ విజయాన్ని తెలంగాణా కాంగ్రెస్ నేతలు తమ నియోజకవర్గాలలో విస్తృత ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యారు. అయితే అటు ప్రెస్ మీట్ లు ఇటు రోడ్ షోలు నిర్వహిస్తూ సోనియా వల్లే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు తప్ప తమ తమ నియోజకవర్గాలలో పర్యటించలేదు. అలాగే జంపింగ్ జపాంగ్ లు కూడా ఎక్కువ అవుతుండటం కూడా కాంగ్రెస్ ను కలవరపెడుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం సీమాంధ్రలో ఎలాగూ గెలిచే అవకాశాలు లేకపోవడంతో తెలంగాణాలోనైనా కొన్ని సీట్లు రాబట్టుకోవాలని చూసింది. టి.ఆర్.ఎస్. అధ్యక్షుడు కెసిఆర్ మీద ఆశలు పెట్టుకుని విలీనానికి పట్టుబట్టింది. కానీ ఇప్పటికీ కెసిఆర్ ఎటూ తేల్చకుండా ఇంకా నాన్చుడుధోరణిలో ఉన్నారు. ఎలెక్షన్లు దగ్గరపడుతుండటంతో తాము అధికారంలోకి రావాలో, రాహుల్ గాంధీని పిఎం సీట్లో ఎలా కూర్చోపెట్టాలో తెలియక తలపట్టుకుంటుంది.

31న చంద్రబాబు పాదయాత్ర పునఃప్రారంభ౦

        చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు. వైద్యుల సూచన మేరకు చంద్రబాబు పాదయాత్రకు విరామం ప్రకటించారని వారు తెలిపారు. ఈ నెల 31 సాయంత్రం చంద్రబాబు యాత్రను పునఃప్రారంభిస్తారని వివరించారు. అలాగే ఇకపై పాదయాత్ర దూరం విషయంలోకూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తోంది. ఇకపై రోజువారీ దూరాన్ని కూడా తగ్గించనున్నారు. ఇప్పటి వరకూ బాబు పాదయాత్ర 117 రోజులు పూర్తీ చేసుకుంది.

కాంగ్రెస్ ఎంపీలు భేటి: రాజీనామాలతో నేడు సోనియాకు లేఖ

      తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు. నిన్న పార్లమెంటు సభ్యుడు వివేక్ ఇంట్లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఎం.పి.లు ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  స్పీకర్ ఫార్మట్‌లో ఈ రాజీనామాలను పార్టీ అధిష్ఠానానికి పంపించనున్నట్టు కోమటిరెడ్డి చెప్పారు. పదవులు తమకు ముఖ్యమం కాదని వారు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. తెలంగాణకోసం తాము ఎటువంటి త్యాగాలకైనా సిద్ధం అని వారు పేర్కొన్నారు. పదవులు చిత్తుకాగితంతో సమానమని ఎం.పి. మధుయాష్కి పేర్కొన్నారు.

నారీ నారీ నడుమ జగన్మోహనుడు

  తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది. ఇంట గెలవలేని జయప్రద, సమాజ్ వాది పార్టీ తరపున పోటీ చేసి తనకు బొత్తిగా పరిచయమేలేని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికయి రచ్చ గెలిచింది. అయితే, అక్కడ ఈ మద్యనే పరిస్థితులు వికటించడంతో, మళ్ళీ మూటా ముల్లె సర్దుకొని రాష్ట్రానికి వచ్చేయడానికి నిర్నయించుకొన్నట్లు గత కొంత కాలంగా ప్రకటిస్తూన్నాకూడా, మన రాజకీయ పార్టీల నుండి ఆమెకు కనీస స్పందన కరువయింది. ఇక ఇలాగయితే లాభం లేదనుకొన్నఆమె తానే స్వయంగా ఏదో ఒక పార్టీని ఎంచుకొని తన రాజకీయ జీవితంలో ‘మరో ప్రస్తానం’ మొదలుపెట్టాలని నిర్ణయించుకొంది.   తెలుగుదేశం పార్టీకి ఎన్ని సిగ్నల్స్ పంపినా స్పందించకపోవడంతో, ఇటీవలే పత్రికలవారితో మాట్లాడుతూ ఇక్కడా అక్కడ సైకిలు పార్టీలు తనవంటి సినిమా తారలను పులిహోరలో కరివేపాకులా వాడుకొని వదిలేసాయని అటువంటి పార్టీలకు తానూ దూరంగా ఉండాలనుకొంటున్నట్లు ప్రకటించేసి తెలుగుదేశం పార్టీతో డిల్లీ నుండే తెగతెంపులు చేసేసుకొంది.   అయితే, ఇక మిగిలినవి తల్లీ పిల్ల కాంగ్రెస్ పార్టీలు. తెలంగాణా సమస్యతో పుట్టెడు కష్టాల్లో ఉన్న తల్లి కాంగ్రెస్ ను నమ్ముకొంటే తనకీ అదేగతి పడుతుందని భావించిన ఆమె, రాష్ట్రంలో ప్రజాదారణ ఉన్న పార్టీలోనే తానూ జేరాలనుకొంటునట్లు ప్రకటించేసింది. అంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సంకేతం అందించినట్లే భావించవచ్చును. అక్కడ అయితే వయ్యారి గడుసు రోజమ్మ తనకు తోడుగా ఉంటుందని ఆమె భావించినా, ఒకే ఒరలో రెండు కత్తులు ఇముడుతాయలేదా అనేది ఆమె ఆలోచించినట్లు లేదు. ఆమె కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తే ఇక అప్పుడు 'నారీ నారీ నడుమ జగన్మోహనుడు' అని టైటిల్ వేసేసుకోవచ్చును. త్వరలో ఆమె చంచల్ గూడా జైలు నుండి తన రాజకీయ జీవితంలో మరో ప్రస్థానం జయప్రదంగా మొదలుపెట్టవచ్చునని సమాచారం.

జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా?: కేసిఆర్ ఫైర్

      జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు. చీము , నెత్తురు ఉన్న తెలంగాణ మంత్రులు , ఎమ్.పిలు , కిందిస్థాయి వరకు ఉన్న కాంగ్రెస్ వారంతా పార్టీని వదలాలని ” అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుకు మరిన్ని సంప్రతింపులు జరపాల్సి ఉందని  కేంద్ర మంత్రులు ఆజాద్, షిండేలు ప్రకటన చేయడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణపై చర్చలు ఒక నాటకం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నామనడం ఒక బూటకం అని అన్నారు. తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రులు ఆజాద్, షిండేలు ప్రకటించినా కేంద్రం అనుకుంటే తెలంగాణ ఇవ్వవచ్చని అన్నారు.

కోటి సంతకాల కధకి సంజాయిషీలు

    వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది. సాధారణంగా విమర్శలు ఎదుర్కొన్న ఏ రాజకీయపార్టీ అయినా తనను తానూ రక్షించుకొనే ప్రయత్నంలో వెంటనే ఆ విమర్శలను ఖండించడమో లేక తనను సమర్దించుకోవడమో లేక దానికి ప్రతి విమర్శలు చేసి ఎదుర్కోవడమో చేస్తుంది. అయితే, వైయస్సార్ కాంగ్రెస్ ఇదివరకు ఒకసారి కోటి సంతకాల సేకరణపై వచ్చిన విమర్శలకు స్పందించినప్పటికీ ఈ రోజు సాక్షి పత్రికలో వచ్చినట్లు సమర్ధంగా లేదు. పార్టీకి సరయిన దశ దిశానిర్దేశం చేసే నాయకుడు లేక పోవడం వల్లనే ఈ జాప్యం అని చెప్పక తప్పదు. ఎట్టకేలకు, ఆ పార్టీకి చెందిన లీగల్ సెల్ కన్వీనర్ ఈ విధంగా స్పందించారు.   “సీబీఐను అడ్డంపెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చేస్తున్న కక్షసాధింపు చర్యలకు నిరసనగా చేపట్టిన సంతకాల సేకరణ రాజ్యాంగ విరుద్ధం కాదు. ఈ విషయంపై టీడీపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు పూర్తిగా అర్థరహితమని ఆయన కొట్టిపారేశారు. తనకు జరిగే అన్యాయాన్ని, అక్రమాలను రాజ్యాంగ పదవిలో ఉన్న వారికి చెప్పుకునే హక్కు, అర్హత దేశంలోని ప్రతీ పౌరుడికి ఉన్నాయని.. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.”