కాంగ్రెస్‌, ‘దేశం‘ కు షాకివ్వబోతున్న ఆ ఎనిమిది మంది ఎం.ఎల్‌.ఎ.లు ఎవరు ?

ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్‌ బ్లాక్‌ అవుతుందో వాడే...... పండుగాడు అనే డైలాగ్‌ మహేష్‌ బాబుతో పోకిరి  సినిమాలో పూరీజగన్నాద్‌ చెప్పించినా ప్రస్తుత రాజకీయాలలోకి ఇదే స్టయిల్‌ మెయింటిన్‌ చేస్తున్నారు వైసిపి అధ్యక్షులు వైయస్‌ జగన్‌.

తనకంటూ వ్యక్తిగత ఇమేజ్‌ లేదు. తండ్రినుండి వచ్చిన ప్రజాకర్షక పధకాలను వారసత్వ ఓట్లగా మార్చుకోవడమే తప్ప. తనేం పెద్ద వక్తకాదు. రాజకీయ అనుభవశాలి అంతకన్నాకాదు. తన బలం కన్నా ప్రత్యర్థుల బలహీనతలే ఆయన ఆయుధంగా వాడుకుంటున్నారు. మొన్నజరిగిన ఉప ఎన్నికల్లో 18 సీట్లలో 15 సీట్లు గెలుచుకొని, తెలంగాణాలో నువ్వానేనా అనే పోటీనిచ్చిన జగన్‌ పార్టీ, అత్యధిక మెజారీటీతో పార్లమెంటు స్ధానాన్ని సంపాదించుకొని 10 జనపథ్‌ రోడ్డులోని దేశానికి కాబోయే ప్రిన్స్‌కి నిద్రలేకుండా చేశారు. ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్‌ నుండి ఎవ్వరు వెళ్లినా బిజీగా ఉన్నామంటూ నెలలు తరబడి తిప్పే రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ, చిదంబరం, మొదలైన వాళ్లంతా ఇప్పుడు ఎవ్వరు ఎప్పుడెళ్లినా, ఒక్కరుగా అయినా సరే, గుంపుగా అయినా సరే రండి రండి అంటూ ఆహ్వానం పలుకుతున్నారు. ఆరోడ్డులో ఎవరైనా ఎపి నుండి వచ్చినట్లనిపించినా  పలకరిస్తున్నారు. అలా అయిపోయింది వారి పరిస్థితి. మంతనాలు, రిపోర్టులు, సర్వేలతో  కుస్తీ పడుతున్నారు.

ఇదే గాలి 2014 లో కూడా వీస్తే పరిస్ధితి ఏంటా అని నిద్రలేకుండా గడిపే పరిస్థితి డిల్లీ పెద్దలకు పట్టింది. రాష్ట్రంలో ప్రధాన పతిపక్షమైన  తెలుగుదేశం పార్టీని  కూడా కోలుకోలేని దెబ్బ తీసాడు జగన్‌ . అసలే మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్కటికూడా అసెంబ్లీ స్థానాలను గెలుచుకోలేకపోయామన్న బాధలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. గోరు చుట్టుపై రోకటి పోటులాగా  ఆపరేషన్‌ ఆకర్ష పేరుతో  తెలుగుదేశం పార్టీ లోని నాయకుల్నందర్నీ వైసిపి పార్టీలోకి లాగే ప్రక్రియ కొనసాగిస్తున్నారు జగన్‌. తెలుగుదేశం పార్టీలో అంతర్గత పోరు, కుటుంబపోరుతో సతమతమవుతున్న చంద్రబాబునాయుడికి  ఈ వ్యవహారం మూలిగే నక్కపై తాటికాయపడినట్లు అయ్యింది. తెలుగుదేశం పార్టీకి సెంటుమెంటు స్ధానమైన గుడివాడ నియోజకవర్గం సిట్టింగ్‌ ఎమ్మెల్యే కొడాలి నాని పార్టీ ఫిరాయించడంతో తెలుగుదేశంలో గగ్గోలు మొదలైంది. పార్టీ నిర్లక్ష్యంచేస్తుందని, తను జూనియర్‌ యన్టీఆర్‌ ద్వారా  తెలుగుదేశం పార్టీలోకి వచ్చినందువల్లే  చంద్రబాబునాయుడు ప్రక్కన పెడుతున్నారని, యస్‌,సి., బిసిల ఓట్లు వైసిపికి ఉన్నాయి కాబట్టి వైసిపి లోకెళుతున్నానని నాని ఎన్ని మాటలు చెప్పినా ఒక్కటి మాత్రం నిజం గెలుపుగుర్రాన్ని ఎవరు ఒదులుకుంటారు. ప్రస్తుతానికి ప్రజాకర్షక పార్టీ వైసిపి అని మొన్నటి ఎన్నికల్లో తేలిపోయింది. దాంతో నాయకులంతా ఆ పార్టీలోకి వెళ్ళడానికి క్యూ కడుతున్నారు.

అదేంటో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు కూడా ఇంతే. తెలుగుదేశం నుండే ఎక్కువ వలసలు జరిగాయి. తెలుగుదేశం పార్టీలో ఇక్కడితో నాయకులు జంప్‌లు ఆగిపోవని అధిష్టానానికి తెలుసు. అందుకే అంత రభస. కృష్ణాజిల్లాలో ఇంకా ఇద్దరు ముగ్గురు ఎమ్మేల్యేలు పార్టీ వీడటానికి సిద్దంగా ఉన్నారనే విషయమే నాయకులను కలవర పరుస్తోంది. గుంటూరు, ప్రకాశం జిల్లాలో కూడా పరిస్థితి ఇందుకు విరుద్దంగా ఏమీ లేదని నాయకులకు ఉప్పందుతుండటంతో తెలుగుదేశం నాయకులకు కంటికి నిద్ర కరువయ్యింది. ఈ మూడు జిల్లాల నుంచి కనీసం ఎనిమిది మంది కాంగ్రెస్‌, తెలుగుదేశం పార్టీలకు చెందిన శాసన సభ్యులు జగన్‌ పంచన చేరడానికి గ్రీన్‌ సిగ్నల్‌ కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిసింది దాంతో చంద్రబాబుని పరామర్శించడానికి బాలకృష్ట పని కట్టుకొని వచ్చి పరిస్థితిని పరీక్షించవలసి వచ్చింది. అసలే రెండుకళ్ల సిద్దాంతంతో తెలంగాణకు దూరం అయిన చంద్రబాబుకు ఆంద్రలో కూడా ఓట్లు పడని పరిస్థితిలోకి నెట్టివేయబడ్డారు.

కాంగ్రెస్‌ పరిస్థితి అంతే. ఏదో అధికారంలో ఉన్నారు కాబట్టి నాయకులు సైలెంట్‌గా ఉన్నారు. రాబోయే ఎన్నికలకు ఎలాగా అని ముందుచూపున్న వారంతా వాళ్ల పిల్లల్ని వైసిపికి పంపుతున్నారు. దానికి తార్కాణం తెలుగుదేశం పార్టీ నాయకురాలు నన్నపనేని రాజకుమారి కుమార్తె  వైసిపిలో చేరారు. రాజమండ్రి కి చెందిన మంత్రి పినిపే విశ్వరూప్‌ తనయుడిది అదేతీరు. కాంగ్రెస్‌ నాయకుడు దివంగత జనార్దన్‌రెడ్డి (పిజెఆర్‌) కుమార్తె విజయకూడా చెంచల్‌గూడ జైలులో జగన్‌ ను కలిసారు. ఇప్పుడు అధికార కాంగ్రెస్‌ పార్టీలో అంతగా వలసలు లేక పోయినా వచ్చే ఎన్నికలనాటికి తీవ్రత హెచ్చయ్యే ప్రమాదం లేకపోలేదు. మునిగిపోయే ఓటి పడవల్లో ఉండటానికి ఎవరూ ఇష్టపడటం లేదు. ఒక్కడంటే ఒక్కడు అదీ చెంచల్‌గూడ జైల్లో నుంచి మహా మహానాయకుల్ని మట్టికరిపిస్తున్నారు.
 

సుబ్రతో రాయ్ అరెస్ట్ ...

  సుబ్రతో రాయ్ అరెస్ట్ ... సహారా సంస్థ అధినేత సుబ్రతో రాయ్ ను నిబంధనలకు విరుద్ధంగా ఇన్వెస్టర్ల నుంచి సహారా సంస్థ సేకరించిన డబ్బుల విషయంలో కోర్టు సుబ్రతో రాయ్ కు గతంలో పలుమార్లు నోటీసులు ఇచ్చింది. సహారా నుంచి స్పందన లేకపోవడంతో నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. కోర్టు ధిక్కార కేసులో ఇంతకుముందు వాదనలు విన్న అనంతరం సుప్రీం కోర్టు తమ ముందు హాజారు కావాలని సుబ్రతా రాయ్‌ని ఆదేశించింది. అయితే సుబ్రతా రాయ్ కోర్టు ఎదుట హాజరుకాకపోవడంతో ఆయనకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్‌ను జారీ చేసింది. సుబ్రతా రాయ్‌ని అరెస్ట్ చేసి తమ ముందు మార్చి 4లోగా హాజరుపర్చాలని సుప్రీం కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, తన తల్లి (95)కి ఆరోగ్యం బాగోలేదని, అందువల్ల తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయించాలని ఇంతకుముందు సుబ్రతా రాయ్ కోర్టును కోరారు. అయితే కోర్టు అతని వినతిని తిరస్కరించింది. సుబ్రతో రాయ్ ను శుక్రవారం లక్నోలో అరెస్ట్ చేశారని సుబ్రతో రాయ్ సీనియర్ అడ్వకేట్ రామ్ జట్మలాని సుప్రీం కోర్టుకు తెలిపారు.

విఫలమైన 'టి' కాంగ్రెస్

  విఫలమైన 'టి' కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా పట్టుబట్టి మరీ విభజనను సాధించింది. అయితే ఈ విజయాన్ని తెలంగాణా కాంగ్రెస్ నేతలు తమ నియోజకవర్గాలలో విస్తృత ప్రచారం చేసుకోవడంలో విఫలమయ్యారు. అయితే అటు ప్రెస్ మీట్ లు ఇటు రోడ్ షోలు నిర్వహిస్తూ సోనియా వల్లే తెలంగాణా రాష్ట్రం ఏర్పడిందని చెప్పారు తప్ప తమ తమ నియోజకవర్గాలలో పర్యటించలేదు. అలాగే జంపింగ్ జపాంగ్ లు కూడా ఎక్కువ అవుతుండటం కూడా కాంగ్రెస్ ను కలవరపెడుతోంది. కాంగ్రెస్ అధిష్ఠానం సీమాంధ్రలో ఎలాగూ గెలిచే అవకాశాలు లేకపోవడంతో తెలంగాణాలోనైనా కొన్ని సీట్లు రాబట్టుకోవాలని చూసింది. టి.ఆర్.ఎస్. అధ్యక్షుడు కెసిఆర్ మీద ఆశలు పెట్టుకుని విలీనానికి పట్టుబట్టింది. కానీ ఇప్పటికీ కెసిఆర్ ఎటూ తేల్చకుండా ఇంకా నాన్చుడుధోరణిలో ఉన్నారు. ఎలెక్షన్లు దగ్గరపడుతుండటంతో తాము అధికారంలోకి రావాలో, రాహుల్ గాంధీని పిఎం సీట్లో ఎలా కూర్చోపెట్టాలో తెలియక తలపట్టుకుంటుంది.

31న చంద్రబాబు పాదయాత్ర పునఃప్రారంభ౦

        చంద్రబాబు పాదయాత్ర ఈ నెల 31న పునఃప్రారంభ౦ కానుంది. ఫిబ్రవరి నాల్గోతేదీ వరకు విజయవాడలో కోనసాగనుంది. ఆరోగ్య కారణాల రీత్యా చంద్రబాబు 29, 30లలో కూడా విశ్రాంతి తీసుకోనున్నారని తెలుగుదేశం నాయకులు ప్రకటించారు. వైద్యుల సూచన మేరకు చంద్రబాబు పాదయాత్రకు విరామం ప్రకటించారని వారు తెలిపారు. ఈ నెల 31 సాయంత్రం చంద్రబాబు యాత్రను పునఃప్రారంభిస్తారని వివరించారు. అలాగే ఇకపై పాదయాత్ర దూరం విషయంలోకూడా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తోంది. ఇకపై రోజువారీ దూరాన్ని కూడా తగ్గించనున్నారు. ఇప్పటి వరకూ బాబు పాదయాత్ర 117 రోజులు పూర్తీ చేసుకుంది.

కాంగ్రెస్ ఎంపీలు భేటి: రాజీనామాలతో నేడు సోనియాకు లేఖ

      తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు కేకే నివాసంలో భేటి అయ్యారు. తెలంగాణపై పార్టీ అధిష్టానం వైఖరిని వ్యతిరేకిస్తూ పార్టీ సభ్యత్వానికి, పదవులకు కూడా రాజీనామా చేసి అధిష్టానం పై ఒత్తిడి పెంచేందుకు రంగం సిద్దం చేస్తున్నారు. రాజీనామా లేఖలను పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధి పంపించనున్నారు. భేటి అనంతరం లేఖలను మీడియాకు విడుదల చేయనున్నారు. నిన్న పార్లమెంటు సభ్యుడు వివేక్ ఇంట్లో జరిగిన సమావేశంలో తెలంగాణ ఎం.పి.లు ఈ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  స్పీకర్ ఫార్మట్‌లో ఈ రాజీనామాలను పార్టీ అధిష్ఠానానికి పంపించనున్నట్టు కోమటిరెడ్డి చెప్పారు. పదవులు తమకు ముఖ్యమం కాదని వారు ఈ సమావేశంలో అభిప్రాయపడ్డారు. తెలంగాణకోసం తాము ఎటువంటి త్యాగాలకైనా సిద్ధం అని వారు పేర్కొన్నారు. పదవులు చిత్తుకాగితంతో సమానమని ఎం.పి. మధుయాష్కి పేర్కొన్నారు.

నారీ నారీ నడుమ జగన్మోహనుడు

  తెలుగు సినీ ప్రియులను తన అందచందాలతో, అసమానమయిన నటనతో ఒక ఊపుఊపిన అందాల తార జయప్రద, ఆ తరువాత బాలీవుడ్ లోను ఒక వెలుగు వెలిగింది. తెలుగుదేశంపార్టీలో జేరి రాష్ట్ర రాజకీయాలలో పాల్గొన్నపటికీ, చంద్రబాబుతో పొసగక ఏకంగా డిల్లీ రైలెక్కి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో వాలిపోయింది. ఇంట గెలవలేని జయప్రద, సమాజ్ వాది పార్టీ తరపున పోటీ చేసి తనకు బొత్తిగా పరిచయమేలేని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికయి రచ్చ గెలిచింది. అయితే, అక్కడ ఈ మద్యనే పరిస్థితులు వికటించడంతో, మళ్ళీ మూటా ముల్లె సర్దుకొని రాష్ట్రానికి వచ్చేయడానికి నిర్నయించుకొన్నట్లు గత కొంత కాలంగా ప్రకటిస్తూన్నాకూడా, మన రాజకీయ పార్టీల నుండి ఆమెకు కనీస స్పందన కరువయింది. ఇక ఇలాగయితే లాభం లేదనుకొన్నఆమె తానే స్వయంగా ఏదో ఒక పార్టీని ఎంచుకొని తన రాజకీయ జీవితంలో ‘మరో ప్రస్తానం’ మొదలుపెట్టాలని నిర్ణయించుకొంది.   తెలుగుదేశం పార్టీకి ఎన్ని సిగ్నల్స్ పంపినా స్పందించకపోవడంతో, ఇటీవలే పత్రికలవారితో మాట్లాడుతూ ఇక్కడా అక్కడ సైకిలు పార్టీలు తనవంటి సినిమా తారలను పులిహోరలో కరివేపాకులా వాడుకొని వదిలేసాయని అటువంటి పార్టీలకు తానూ దూరంగా ఉండాలనుకొంటున్నట్లు ప్రకటించేసి తెలుగుదేశం పార్టీతో డిల్లీ నుండే తెగతెంపులు చేసేసుకొంది.   అయితే, ఇక మిగిలినవి తల్లీ పిల్ల కాంగ్రెస్ పార్టీలు. తెలంగాణా సమస్యతో పుట్టెడు కష్టాల్లో ఉన్న తల్లి కాంగ్రెస్ ను నమ్ముకొంటే తనకీ అదేగతి పడుతుందని భావించిన ఆమె, రాష్ట్రంలో ప్రజాదారణ ఉన్న పార్టీలోనే తానూ జేరాలనుకొంటునట్లు ప్రకటించేసింది. అంటే, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సంకేతం అందించినట్లే భావించవచ్చును. అక్కడ అయితే వయ్యారి గడుసు రోజమ్మ తనకు తోడుగా ఉంటుందని ఆమె భావించినా, ఒకే ఒరలో రెండు కత్తులు ఇముడుతాయలేదా అనేది ఆమె ఆలోచించినట్లు లేదు. ఆమె కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తే ఇక అప్పుడు 'నారీ నారీ నడుమ జగన్మోహనుడు' అని టైటిల్ వేసేసుకోవచ్చును. త్వరలో ఆమె చంచల్ గూడా జైలు నుండి తన రాజకీయ జీవితంలో మరో ప్రస్థానం జయప్రదంగా మొదలుపెట్టవచ్చునని సమాచారం.

జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా?: కేసిఆర్ ఫైర్

      జానారెడ్డికి బుద్ది ,జ్ఞానం ఉందా? తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు మీద కాంగ్రెస్ ప్రకటన కోసం ఇంకా వేచిచూద్దాం అంటాడా. కాంగ్రెస్ ప్రకటనలో ఇంకా నిజాయితీ ఉందన్న జానారెడ్డి మాటలను తెలంగాణ ప్రజలు విశ్వసించరు. ముఖ్యమంత్రి పదవికోసం జానారెడ్డి గోతికాడ నక్కలా ఎదురు చూస్తున్నాడు. చీము , నెత్తురు ఉన్న తెలంగాణ మంత్రులు , ఎమ్.పిలు , కిందిస్థాయి వరకు ఉన్న కాంగ్రెస్ వారంతా పార్టీని వదలాలని ” అని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ ఏర్పాటుకు మరిన్ని సంప్రతింపులు జరపాల్సి ఉందని  కేంద్ర మంత్రులు ఆజాద్, షిండేలు ప్రకటన చేయడాన్ని ఆయన ఎద్దేవా చేశారు. తెలంగాణపై చర్చలు ఒక నాటకం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నామనడం ఒక బూటకం అని అన్నారు. తెలంగాణపై మరిన్ని సంప్రదింపులు జరపాల్సిన అవసరం ఉందని కేంద్ర మంత్రులు ఆజాద్, షిండేలు ప్రకటించినా కేంద్రం అనుకుంటే తెలంగాణ ఇవ్వవచ్చని అన్నారు.

కోటి సంతకాల కధకి సంజాయిషీలు

    వైయస్సార్ కాంగ్రెస్ చేపట్టిన కోటి సంతకాల సేకరణపై తెలుగుదేశం పార్టీ తీవ్ర విమర్శలు గుప్పించిన ఆరు నెలలకి ఇప్పుడు తాపీగా ఆ పార్టీ నేతలు స్పందించడం చూస్తుంటే ఆ పార్టీ నాయకత్వలోపం మరోసారి బయట పడుతోంది. సాధారణంగా విమర్శలు ఎదుర్కొన్న ఏ రాజకీయపార్టీ అయినా తనను తానూ రక్షించుకొనే ప్రయత్నంలో వెంటనే ఆ విమర్శలను ఖండించడమో లేక తనను సమర్దించుకోవడమో లేక దానికి ప్రతి విమర్శలు చేసి ఎదుర్కోవడమో చేస్తుంది. అయితే, వైయస్సార్ కాంగ్రెస్ ఇదివరకు ఒకసారి కోటి సంతకాల సేకరణపై వచ్చిన విమర్శలకు స్పందించినప్పటికీ ఈ రోజు సాక్షి పత్రికలో వచ్చినట్లు సమర్ధంగా లేదు. పార్టీకి సరయిన దశ దిశానిర్దేశం చేసే నాయకుడు లేక పోవడం వల్లనే ఈ జాప్యం అని చెప్పక తప్పదు. ఎట్టకేలకు, ఆ పార్టీకి చెందిన లీగల్ సెల్ కన్వీనర్ ఈ విధంగా స్పందించారు.   “సీబీఐను అడ్డంపెట్టుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చేస్తున్న కక్షసాధింపు చర్యలకు నిరసనగా చేపట్టిన సంతకాల సేకరణ రాజ్యాంగ విరుద్ధం కాదు. ఈ విషయంపై టీడీపీ, కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు పూర్తిగా అర్థరహితమని ఆయన కొట్టిపారేశారు. తనకు జరిగే అన్యాయాన్ని, అక్రమాలను రాజ్యాంగ పదవిలో ఉన్న వారికి చెప్పుకునే హక్కు, అర్హత దేశంలోని ప్రతీ పౌరుడికి ఉన్నాయని.. ఈ విషయంలో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.”