ఎమ్మెల్యే రాపాక ఎన్నికపై విచారణకు సీఈవో ఆదేశం.. వాచాలతకు తగిన శాస్తి?
posted on May 5, 2023 @ 2:02PM
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఎన్నికపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీచేశారు.
ఆ ఉత్తర్వుల్లోని వివరాల ప్రకారం.. ఈ ఏడాది మార్చి 24న అంతర్వేదిలో జరిగిన వైకాపా ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే వరప్రసాద్ పూర్వం నుంచి తమ సొంత గ్రామం చింతలమోరికి కొందరు వ్యక్తులు దొంగ ఓట్లు వేయడానికే వచ్చేవారని, ఒక్కొక్కరు 5నుంచి పది ఓట్లు వేసేవారని, అవే తన విజయానికి దోహదపడేవని వ్యాఖ్యానించగా, పెద్ద దుమారం చెలరేగింది. దీనిపై సఖినేటిపల్లి మండలం కేశవదాసుపాలేనికి చెందిన ఎనుముల వెంకటపతిరాజా రాష్ట్ర ఎన్నికల సంఘానికి గత నెల 24న ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో వరప్రసాద్ ఎన్నికపై విచారణ నిర్వహించి, వారంరోజుల్లో నివేదిక ఇవ్వాలని కలెక్టర్ హిమాన్షు శుక్లాకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ఆదేశాలిచ్చారు.
ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ విచారణకు ఆదేశం నేపథ్యంలో ఫిర్యాదుదారు ఎనుముల వెంకటపతిరాజా మాట్లాడుతూ, దొంగ ఓట్లతో నెగ్గినట్లు రాపాక స్వయంగా ఒప్పుకొన్నారు కనుక ఆయన ఎన్నిక ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఉందన్నారు. కలెక్టర్ ఆధ్వర్యంలో నిష్పక్షపాతంగా విచారణ జరిపి చర్యలు చేపట్టాలని కోరారు.
జనసేన పార్టీ టికెట్ పై విజయం సాధించి, ఆ తర్వాత ప్లేటు ఫిరాయించి, వైసీపీ పంచన చేరిన రాపాక కు శాస్తి జరిగిందని జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.