సీనియర్లంతా అవుట్.. ఉద్యమ వాసన తెలియని కొత్త తరంతో కేసీఆర్ 2023 మిషన్
posted on Sep 2, 2021 @ 4:37PM
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపున్న నాయకుడు. రాజకీయ వ్యూహ రచనలో దిట్ట. అందుకే తెరాస 20 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నోఅటుపోట్లు ఎదురైనా, ప్రత్యర్ధులను పడగొట్టి, అంతిమ విజేతగా నిలిచారు. రాష్ట్రాన్ని, రాష్ట్ర రాజకీయాలను గుప్పిట పెట్టుకున్నారు. వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి పీఠమెక్కి.ఏడేళ్ళుగా ఎదురులేకుండా చక్రం తిప్పుతున్నారు. ఇప్పటి వరకూ అయితే, నేనే రాజు నేనే మంత్రి, అన్నట్లుగా రాష్ట్ర రాజకీయాల్లో కేసీఆర్ తిరుగు లేని నాయకుడిగా నిలిచారు.
అయితే కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అందులోనూ రాజకీయలాలో బండ్లు ఓడలు, ఓడలు బండ్లు అయ్యేందుకు అట్టే కాలం పట్టదు. ఇప్పుడున్న పరిస్థితులలో, ప్రస్తుత రాజకీయ సమీకరణాలు ఇలాగే కొనసాగితే, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస మళ్ళీ గెలిచి హట్రిక్ కొట్టడం అయ్యే పని కాదు. సొంత ఇంటిని చక్కదిద్దుకోవడంతో పాటుగా, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వంటి ఉడుకు రక్తాన్ని తట్టుకుని నిలవడం అసలే అయ్యే పని కాదు. అదే విధంగా, ముఖ్యమంత్రి కుర్చీకోసం ముచ్చట పడుతున్న కొడుకు కేటీఆర్ ముచ్చటతీర్చడం కూడా ప్రెజెంట్ పొలిటికల్ ఈక్వేషన్స్’లో సాధ్యం కాదు. ఇది ఇప్పటికీ ఒకటికి రెందు సార్లు రుజువైన నిజం.
ముఖ్యమంత్రి కేసీఆర్, పరిస్థితులు అనుకూలిస్తే ఇప్పటికిప్పుడు కేటీఅర్ కు ముఖ్యమంత్రి పదవినీ ఇచ్చేందుకు, ఆయన్ని పట్టాభిషిక్తుని చేసందుకు సిద్దంగా ఉన్నారు. అందుకు కుటుంబ వత్తిళ్ళు కారణమా లేక ఇంకేదైనా కారణమా అనే విషయాన్ని పక్కన పెడితే, 2018లో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు పోవడం మొదలు ఈటల రాజేందర్ ను మంత్రి వర్గం నుంచి బర్తరాఫ్ చేసి సాగనంపడం వరకు కేసీఆర్ తీసుకున్న ప్రతి రాజకీయ నిర్ణయం వెనకా కేటీఆర్ ను సీఎం చేయడం అనే లక్ష్యం, వ్యూహం ఉందని అంటారు. అప్పటి నుంచి కేసీఆర్ అదుగులు అన్నీ ఆ దిశగానే పడుతున్నాయి. ఒక దశలో, కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అంటూ పార్టీ నాయకులు కొందరు బహిరంగ వేదికల నుంచే ప్రకటించారు.అదే సమయంలో కేటీఆర్’ పట్టాభిషేకానికి మీడియా ముహూర్తాలు కూడా పెట్టేసింది. అయితే, అంతర్గత కుమ్ములాటలు ఇతరత్రా కారణాల వలన ఆ కార్యం కాలేదనికోండి అది వేరే విషయం.
ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహత్మకంగా అవరోధాలను తొలగించుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగానే ఇప్పటికే, చాలా వరకు సీనియర్లను పక్కన పెట్టేశారు. ముఖ్యంగా ఉద్యమ నేపథ్యం ఉన్న నాయకులకు తెరాసలో స్థానం లేకుండా చేస్తున్నారు. అయితే ఎన్ని చేసినా, ఏమి చేసినా ఇప్పటికిప్పుడు కేటీఆర్ కు పట్టాభిషేకం చేస్తే, పార్టీలో సీనియర్ల నుంచి తిరుగుబాటు అనివార్యంగా కనిపిస్తోంది. అందుకే, 2023 ఎన్నికల నాటికి. పాత తరాన్ని పక్కన పెట్టి కొత్త తరాన్ని తెరమీదకు తెచ్చేందుకు ముఖ్యమంత్రి, కేసీఆర్ ఇప్పటినుంచే, పాచికలు సిద్దం చేస్తున్నారు. ఇదే విషయాన్ని ప్రైవేటు సంభాషణల్లో పార్టీ వర్గాలు సైతం దృవీకరిస్తున్నాయి. 2018 ఎన్నికల్లో సిట్టుంగులు అందరికీ తిరిగి టికెట్ ఇవ్వడంతో పాటుగా ఇతర పార్టీల నుంచి వచ్చిన సీనియర్లను అందలం ఎక్కించడం వల్లనే, కేటీఆర్ పట్టాభిషేకానికి ప్రతిబంధకాలు ఏర్పడ్డాయని కేసీఆర్ నిర్ణయానికి వచ్చారు, అందుకే ఈసారి, 2023 ఎన్నికల్లో మంత్రులతో సహా సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎవరికే టికెట్ ఇవ్వరాదని ముఖ్యమంత్రి నిర్ణయానికి వచ్చారని విశ్వసనీయంగా తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి నాయకత్వంలో పడిలేచిన కెరటంలా ఎగసి పడుతున్న కాంగ్రెస్ పార్టీకి చెక్ పెట్టేందుకుకు కూడా ముఖ్యమంత్రి పక్కా ప్రణాళికను సిద్ద చేసినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టడంతో పాటుగా, కాంగ్రెస్ ప్రధాన ఓటు బ్యాంక్ను తమ వైపుకు తిప్పుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా పావులు కడుపుతున్నారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఓ వంక దళిత బంధును ఎరగా వేయడంతో పాటుగా, జాతీయ స్థాయిలో కాంగ్రేస్సేతర, బీజేపీయేతర ఫ్రంట్ ఏర్పాటు ద్వారా, బీఎస్పీని దగ్గర చేసుకుని దళిత ఓటును గంప గుత్తగా తమ ఖాతాలో కలుపుకునేందుకు, అలాగే ఇతర సామాజిక వర్గాలను చేరదీసి, ఉద్యమ వాసనలు,సీనియారిటీ చిక్కులు లేని కొత్త రక్తంతో 2023 ఎన్నికలకు పోవాలని కేసీఆర్ పావులు కదుపుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. హుజూరాబాద్ గెలుపు ఓటములతో సంబంధం లేకుండా, మిషన్ 2023 ప్రణాళికను కేసీఆర్ సిద్దం చేశారని పార్టీ వర్గాలు ధవీకరిస్తున్నాయి.