మున్సిపల్ ఎన్నికలకు వ్యూహం సిద్ధం చేస్తున్న కేసీఆర్...
posted on Jan 3, 2020 @ 11:42AM
మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడులైనప్పటి నుంచి తెలంగాణ నేతల్లో జోరు పెరిగింది. ఎన్నికల కోసం టిఆర్ఎస్ పార్టీ కసరత్తును కూడా వేగవంతం చేసింది. సీఎం కేసీఆర్ అధ్యక్షతన శనివారం టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరగనుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, జడ్పీ చైర్మన్లు, కార్పొరేషన్ చైర్మన్లతో పాటు పలువురు నేతలను పార్టీ సమావేశాలకు ఆహ్వానించింది. ఇప్పటికే వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ప్రాథమికగా మున్సిపోల్స్ పై చర్చించారు. శనివారం నాలుగైదు గంటల పాటు జరిగే సమావేశంలో మున్సిపోల్స్ పై లోతుగా చర్చించి గెలుపు వ్యూహాలను కేసీఆర్ ఖరారు చేస్తారని టీఆర్ఎస్ వర్గాలు చర్చ నడుస్తొంది.మున్సిపల్ ఎన్నికలకు సిద్ధమయ్యే క్రమంలోనే పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా సీనియర్ నేతలను ఇన్ చార్జీలుగా నియమించింది టీఆర్ఎస్. 120 మున్సిపాలిటీలు, 10 కార్పొరేషన్లలో ఉన్న రాజకీయ పరిస్ధితులు బలాబలాలు సమస్యల పై నివేదిక సిద్ధం చేసిన ఇన్ చార్జిలు ఇప్పటికే పార్టీకి అందచేశారు.
విస్తృత స్థాయి సమావేశంలో ఈ నివేదికలపై చర్చిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మున్సిపాల్టీలు కార్పొరేషన్ల వారీగా సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహిస్తారని సమాచారం. ఎన్నికల ప్రచారంలో ప్రస్తావించాల్సిన అంశాలు, అభ్యర్థుల ఎంపికకు సంబంధించిన సూచనలు, సలహాలు రెబల్స్ తో వ్యవహరించాల్సిన తీరు ఇలాంటి అంశాల పై నేతలకు సీఎం కేసీఆర్ స్పష్టత ఇస్తారని సమాచారం.ఈ ఎన్నికల్లో పని చేసేందుకు కొంత మంది సీనియర్లకు కూడా బాధ్యత అప్పగించే అవకాశమున్నట్టు సమాచారం. జడ్పీ ఎన్నికల్లో గెలుపుతో ఉత్సాహంగా ఉన్న టీఆర్ఎస్ మున్సిపోల్స్ లో కూడా అదే స్థాయిలో ఫలితాలు రాబట్టుకోవాలనుకుంటున్నట్టు అంచనా. టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం అనంతరం టిఆర్ఎస్ వ్యూహాలపై స్పష్టత వచ్చే అవకాశముంది. మున్సిపల్ ఎన్నికల పై అన్ని పార్టీలు సీరియస్ గా తీసుకుంటున్నా నేపధ్యంలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికల విషయంలో కేసీఆర్ తీసుకుంటున్న శ్రద్దను చూస్తూ నేతల సైతం ఆశ్చర్య పోతున్నారు.